విష్ణుకుండినులు
From Wikipedia, the free encyclopedia
మూస:జిష్ణుకుండినులు '''విష్ణుకుండినులు''' సామాన్య శకం 4వ శతాబ్దం నుంచి సామాన్య శకం 7వ శతాబ్దం వరకు దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని, కోస్తాంధ్ర జిల్లాలను పాలించారు. వంశస్థాపకుడు మహారాజేంద్రవర్మ (ఇంద్రవర్మ).[1] ఇతను తెలంగాణలోని ఇంద్రపాలనగరం (ఇంద్రపురి) రాజధానిగా పాలన ప్రారంభించాడు. మొదట దక్షిణ తెలంగాణ జిల్లాలలో పాలన ప్రారంభించి క్రమక్రమంగా తూర్పువైపు కృష్ణా-గోదావరి మధ్యప్రాంతాలను ఆక్రమించారు. శాతవాహనుల అనంతరము ఆంధ్రదేశమున అత్యధిక ప్రాంతమును పాలించిన రాజవంశమిదియే. విష్ణుకుండినుల వంశావళిని విశేషముగా శోధించిన శంకరనారాయణ ప్రకారము సా.శ.. 375 నుండి వంశస్థాపకుడు ఇంద్రవర్మ 25 సంవత్సరాలు పాలించాడు. తరువాత క్రమముగ మొదటి మాధవవర్మ, (సా.శ..400-422), మొదటి గోవిందవర్మ (సా.శ..422-462), రెండవ మాధవవర్మ (సా.శ..462-502), మొదటి విక్రమేంద్రవర్మ (సా.శ..502-570), ఇంద్రభట్టారకవర్మ (సా.శ..571-605), రెండవ విక్రమేంద్రభట్టారక (6005-672) పాలించారు. చివరగా మొదటి విక్రమేంద్రవర్మ రెండవ పుత్రుడగు నాలుగవ మాధవవర్మ సా.శ.. 713 వరకు పాలించాడు[2] 4వ మాధవవర్మ "జనాశ్రయఛందోవిచ్ఛితి" రచించాడు. ఇది తెలంగాణ నుంచి వచ్చిన మొదటి సంస్కృత లక్షణ గ్రంథం.
విష్ణుకుండినులలో పదునొకండు అశ్వమేధములను, క్రతుసహస్రములను, ఇతర యాగములనెన్నింటినో ఆచరించిన రెండవ మాధవవర్మ చాలా గొప్పవాడు. ఇతడు వాకాటకులతో సంబంధ బాంధవ్యములు నెరిపి రాజ్యాన్ని దృఢపర్చుకున్నాడు. ఇతన్ని త్రికూట మలయాధిపతి అంటారు. గుంటూరు జిల్లాలోని కోటప్ప కొండయే త్రికూట మలయం. ఇంద్రవర్మ పూర్వదేశాధిపతులతో పెక్కు యుద్ధాలు చేసి దక్షిణ కళింగాన్ని నిలుపుకున్నాడు.
రెండవ మాధవవర్మ తన వేల్పూరి శిలాశాసనములో అతని తండ్రి మొదటి గోవిందవర్మ "విష్ణుకుణ్ణి గోత్రోత్ప్రభవస్య" అని పేర్కొనినాడు. రెండవ విక్రమేంద్రవర్మ తుండి శాసనములో అతని తాత అయిన మొదటి విక్రమేంద్ర " విష్ణుకొండి హకాటక వంశద్వయాలంకృత ..." గాను "శ్రీవిష్ణుకుంణ్డ్యాంవయ మకుటచూడామణి" గాను వర్ణింపబడ్డాడు.దీనిని బట్టి నేలటూరి వెంకటరమణయ్య వంటి పరిశోధకులు ఇది "విష్ణుకుండిన్" వారి గోత్రానికి, వంశానికి సంబంధించినదిగా పేర్కొన్నారు. కొందరి అభిప్రాయములో వీరు ఎక్కడనుంచో ఆంధ్రదేశానికి వచ్చి స్థిరపడి కాలక్రమేణ పరిపాలకులయినారు.మరికొందరు, వీరు తెలుగుగడ్డపై పుట్టి, స్వశక్తిమీద అధికారంలోకి వచ్చినారని భావించారు. మొదటి వాదాన్ని ప్రప్రంచించిన వారిలో ఫ్రెంచి పండితుడు డూబ్రియల్. వాకటక వంశానికి, విష్ణుకుండినులకును గల బంధుత్వము, శ్రీశైల మాహత్యములో పేర్కొనబడిన ఒక గాథ ఇందుకు ఆధారముగా తీసుకున్నాడు.కాని ఈవాదాన్ని నేలటూరి పండితులు ఒక కాల్పనిక చారిత్రిక గాథగా త్రోసిపుచ్చారు. విష్ణుకుండినుల శాసనాలలో కనుపించు "శ్రీ పర్వతస్వామి ప్రాధాన్యత" అను మాటలను బట్టి వీరు వినుకొండ ప్రాంతమువారని భావరాజు వెంకటకృష్ణారావుగారు అభిప్రాయపడ్డారు. విష్ణుకుండిన్ అనునది వినుకొండకు సంస్కృతీ కరణమని భావరాజువారి భావన. శంకరనారాయణన్ అను ప్రఖ్యాత పరిశోధకుల అభిప్రాయము ప్రకారము శ్రీపర్వతములు అనగా- శ్రీ పర్వతమునకు చెందిన గొప్పరాజులని అర్ధము. ఈ శ్రీపర్వతమే విష్ణుకుండినులు ఇష్టదైవముగా అరాధించిన శ్రీశైలము. వీరికి చతుశాతకర్ణులకు సంబందం కలదని వీరి అభిప్రాయము. విష్ణుకుండినుల పుట్టుకను గురుంచి తెలిపే ఆధారాలు, శాతవాహనుల పతనాంతరం మధ్య డక్కను ప్రాంతాన్ని పరిపాలించిన వాకటక వంశ చరిత్రను పరిశీలించగా కనబడతాయి.మొదటి గోవిందవర్మ, విక్రమేంద్రవర్మ భట్టారక మినహా విష్ణుకుండినులందరూ శైవులే. మొదటివారు బుద్ధుని ఆరాధించారు.
విష్ణుకుండినుల రాజ్యము తూర్పున విశాఖపట్టణము మొదలుగ పశ్చిమాన తెలంగాణలోని కొల్లాపూర్ వరకును, నైరుతిన కీసర వరకు విస్తరించిఉన్నది. కీసరలో ఉన్న కేసరి రామలింగేశ్వరాలయం ఈ కాలంనాటిదే. విష్ణుకుండినులు శ్రీపర్వతస్వామి భక్తులు. వీరు బహువిధములైన క్రతువులు ఆచరించారు. సంస్కృత భాషను ఆదరించారు. వైదిక సంస్కృతికి పట్టుకొమ్మలై వేదవిద్యలు పోషించారు. 'ఘటిక' అను విద్యాస్థానాలు స్థాపించారు. విష్ణుకుండినులు మతసహనము గలవారు. ప్రజలలో అప్పటికి ఆదరణపొందుచుండిన బౌద్ధమతాన్ని ఆదరించారు. బౌద్ధవిహారాలు నిర్మించి వాటికి దానాలు చేశారు. గుహాలయములు నిర్మించి గుహాలయ వాస్తువుకు ప్రోత్సాహమిచ్చారు. మొగల్రాజపురము, ఉండవల్లి గుహాలయాలు వీరు నిర్మించినవే. ఈ గుహాలయ స్తంభముల మీద పంజా ఎత్తిపెట్టిన సింహప్రతిమ ఉండుటచేత వీరు సింహలాంఛనులని పరిశోధకుల అభిప్రాయము. పలు శాసముల ప్రకారము వీరి రాజధాని శక్రాభిధానపురి నల్లగొండ మండలం తుమ్మలగూడెం వద్ద శిథిలముల రూపమున నుండి, స్థానికులచే ఇంద్రపాలగుట్ట అని పేర్కొనబడునదే శక్రాభిధానపురి అని చెప్పవచ్చును.