ఆంధ్రప్రదేశ్ చరిత్ర
From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్ లిఖితమైన చరిత్ర వేద కాలంనాటినుండి ప్రారంభమవుతుంది. సా.శ..పూ. 8 వ శతాబ్దపు ఋగ్వేద కృతి ఐతరేయ బ్రాహ్మణ లో ఆంధ్రస్ అనే వ్యక్తుల సమూహం ప్రస్తావించబడింది. ఆంధ్రులు ఉత్తర భారతదేశంలో యమునా నది ఒడ్డున నుండి దక్షిణ భారతదేశానికి వలస వచ్చినట్లుగా తెలియవస్తుంది.[1][2][3][4] ఈ ప్రాంతంలోని ప్రజలు విశ్వామిత్ర సంతతి వారని, అస్సాక మహాజనపదం (సా.శ..పూ.700-300) ఆగ్నేయ భారతదేశంలోని గోదావరి, కృష్ణ నదుల మధ్య ఉన్న ఆంధ్రుల పురాతన రాజ్యమని రామాయణ, మహాభారత ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది.[5]
అంధ్రప్రదేశ్ చరిత్రను తొలుత చరిత్ర పూర్వయుగము, చారిత్రకయుగము అను రెండు భాగములుగా విభజింపవచ్చును. ఇందు చరిత్ర పూర్వయుగకథనానికి లిఖిత ఆధారాలు లభింపలేదు. ఇది సామాన్య శక పూర్వం మూడవ శతాబ్ది ఆరంభము వరకు కొనసాగిన ప్రాచీన కాలము. సామాన్య శక పూర్వం మూడవ శతాబ్దినుండి ఆధునికకాలము వరకు నడచినది చారిత్రక యుగము. ఈ యుగమును మరల సౌకర్యార్ధమై పూర్వయుగము, మధ్యయుగము, ఆధునికయుగము అని మూడు భాగములుగా విభజింపవచ్చును. మధ్య యుగాన్ని మళ్ళీ పూర్వ మధ్య యుగం (కాకతీయుల కాలం), ఉత్తర మధ్య యుగం (విజయ నగర రాజ్య కాలం) గా విభజిస్తారు.