తూర్పు చాళుక్యులు
ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్ని 7 - 12 శతాబ్దాల్లో పరిపాలించిన వంశం / From Wikipedia, the free encyclopedia
తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు సా.శ 7 - 12 శతాబ్దాల మధ్య దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించిన రాజవంశం. వీరు దక్కన్ ప్రాంతంలోని బాదామి చాళుక్యుల సామంతులుగా తమ పాలన మొదలుపెట్టారు. తదనంతరం సార్వభౌమ శక్తిగా మారారు. వీరు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో పెదవేగి అనే పేరుతో పిలవబడుతున్న వేంగి పట్టణాన్ని రాజధానిగా చేసుకుని సుమారు సా.శ. 1001 వరకూ పాలించారు. తర్వాత సా.శ 1189 వరకు వారు ఈ ప్రాంతాన్ని చోళుల సామంతులుగా పాలించారు.
వీరి మొదటి రాజధాని పిష్టపురం (ఆధునిక పిఠాపురం).[1][2][3][4] ఇది తర్వాత వేంగి (ప్రస్తుతం ఏలూరు దగ్గరలోని పెదవేగి) నగరానికీ, తరువాత రాజమహేంద్రవరానికి (ఆధునిక రాజమండ్రి) తరలించారు. వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత ఉన్న వేంగీ దేశంపై నియంత్రణ కోసం బలవంతులైన చోళులకు, పశ్చిమ చాళుక్యులకూ మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. వేంగిలో ఐదు శతాబ్దాల పాటు సాగిన తూర్పు చాళుక్య పాలన వలన ఈ ప్రాంతం మొత్తాన్నీ ఏకీకృతం చేయడమే కాకుండా, వారి పాలన యొక్క తరువాతి భాగంలో తెలుగు సంస్కృతి, సాహిత్యం, కవిత్వం, కళలు అభివృద్ధి చెందాయి. తూర్పు చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్న నన్నయ భట్టారకుడు శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రచించాడు. వీరు చోళులతో వివాహ బంధాల్ని ఏర్పరుచుకున్నారు.[5]