భారతదేశం
దక్షిణ ఆసియా లోని దేశం From Wikipedia, the free encyclopedia
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది. దక్షణాసియాలో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండములో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారులను కలిగి ఉంది. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం ఎల్లలుగా ఉన్నాయి. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, ఆఫ్ఘానిస్తాన్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. శ్రీలంక, మాల్దీవులు, ఇండోనేసియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. ఇది సింధు లోయ నాగరికతకు పుట్టిల్లు. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతములకు జన్మనిచ్చింది. ఇది బహుభాషా, బహుళ జాతి సంఘము. ఇది వివిధ వన్యప్రాణుల వైవిధ్యం గల దేశం. జనాభాలో భారతదేశం 2023 ఏప్రిల్ లో చైనాను దాటేసింది.
భారత గణతంత్ర రాజ్యం Bhārata Gaṇatantra Rājyam (see other local names) | |
---|---|
![]() భారతదేశం ఆధీనంలో గల ప్రాంతం ముదురు ఆకుపచ్చ, దావాచేయబడిన కాని ఆధీనంలో లో లేని ప్రాంతం లేత ఆకుపచ్చ | |
రాజధాని | కొత్త ఢిల్లీ 28°36′50″N 77°12′30″E |
అతిపెద్ద నగరం | |
అధికార భాషలు | |
గుర్తించిన జాతీయ భాషలు | లేవు[8][9][10] |
గుర్తించిన ప్రాంతీయ భాషలు | |
స్థానిక భాషలు | 447 భాషలు[c] |
మతం (2011) |
|
పిలుచువిధం | భారతీయులు |
సభ్యత్వం |
|
ప్రభుత్వం | సమాఖ్య పార్లమెంటరీ గణతంత్ర రాజ్యం |
ద్రౌపది ముర్ము | |
జగదీప్ ధన్కర్ | |
నరేంద్ర మోడీ | |
ఓం బిర్లా | |
శాసనవ్యవస్థ | పార్లమెంట్ |
• ఎగువ సభ | రాజ్యసభ |
• దిగువ సభ | లోక్సభ |
స్వతంత్ర యునైటెడ్ కింగ్డమ్ నుండి | |
• ఉపరాజ్యం | 15 ఆగష్టు1947 |
26 జనవరి 1950 | |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,287,263[2] కి.మీ2 (1,269,219 చ. మై.)[d] (7వ) |
• నీరు (%) | 9.6 |
జనాభా | |
• 2016 estimate | 1,324,171,354[15] (2వ) |
• 2011 census | 1,210,854,977[16][17] (2వ) |
• జనసాంద్రత | [convert: invalid number] (19వ) |
GDP (PPP) | 2021 estimate |
• Total | $10.207 trillion[18] (3వ) |
• Per capita | $7,333[18] (122వ) |
GDP (nominal) | 2021 estimate |
• Total | $3.050 trillion[18] (6వ) |
• Per capita | $2,191[18] (138వ) |
జినీ (2013) | 33.9[19] medium · 79వ |
హెచ్డిఐ (2019) | 0.645[20] medium · 131st |
ద్రవ్యం | భారత రూపాయి (₹) (INR) |
కాల విభాగం | UTC+05:30 (IST) |
DST is not observed | |
తేదీ తీరు |
|
వ్యిద్యుచ్ఛక్తి | 230 V–50 Hz |
వాహనాలు నడుపు వైపు | ఎడమ వైపు[21] |
ఫోన్ కోడ్ | +91 |
Internet TLD | .in (others) |
మౌర్య సామ్రాజ్య కాలంలో ప్రస్తుత సరిహద్దులలో కొద్దిభాగం మినహాయించి, సరిహద్దులు దాటిన ప్రాంతాలతో పాటు ఒకే చక్రవర్తి పాలనలో వున్నా, తదుపరి పలు చిన్న రాజ్యాలుగా విడిపోయింది. 18 వ శతాబ్దం నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమంగా ఈ రాజ్యాలను స్వాధీనం చేసుకోవడంతో బ్రిటీష్ కంపెనీ పరిపాలన కిందకు వచ్చింది. 19 వ శతాబ్దం మధ్య నుండి నేరుగా యునైటెడ్ కింగ్డమ్ పాలనలోకి వచ్చింది. మహాత్మా గాంధీ నాయకత్వాన స్వాతంత్ర్యం కోసం జరిగిన అహింసాయుత పోరాటం తర్వాత 1947 లో ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.
1991 లో మార్కెట్ ఆధారిత ఆర్థిక సంస్కరణలు అనుసరిస్తూ, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక దేశాలలో ఒకటి అయింది. అయితే, పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, పోషకాహార లోపం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నది.[22]
పేరు పుట్టుపూర్వోత్తరాలు
ముఖ్య వ్యాసము: భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు
భారతదేశానికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు. వీటిలో మొదటిది జంబూ ద్వీపం. ఇది వేదాలలో భారతదేశానికి ఇవ్వబడిన పేరు, ఇప్పటికీ హిందూ మత ప్రార్థనలలో ఈ పేరు ఉపయోగిస్తారు (ఉదా: జంబూ ద్వీపే, మేరోః దక్షిణదిగ్భాగే, శ్రీశైలస్య ఉత్తర ప్రదేశే, కృష్ణా గోదావరీ మధ్య స్థానే...). జంబూ అంటే "నేరేడు" పండు లేదా "గిన్నె కాయ", ఈ దేశంలో ఎక్కువగా నేరేడు పండ్లు ఉంటాయి కనుక దీనికి ఈ పేరు వచ్చింది. ఆ తరువాత వచ్చిన పేరు "భారతదేశం" లేదా "భరతవర్షం", ఈ పేరు నాటి రాజు పేరు మీదగా వచ్చినది, ఈ రాజు పేరు "భరతుడు". ఇతను విశ్వామిత్ర, మేనకల కుమార్తె అయిన శకుంతల కుమారుడు.
తరువాతి పేరు హిందూదేశం, ఇది సింధూనది పేరు మీదగా వచ్చింది. పూర్వపు పర్షియనులు, గ్రీకులు సింధూనదికి ఆవల ఉన్న దేశం కనుక ఈ పేరుతో పిలిచారు.
తరువాత హిందూదేశం రూపాంతరం చెంది ఇండియా అనే పేరు, బ్రిటీషు (ఆంగ్లేయులు) వారి వలన ప్రాముఖ్యతను పొందినది. ప్రస్తుతము భారతదేశానికి రెండు ప్రభుత్వ గుర్తింపు పొందిన పేర్లు ఉన్నాయి. అవి ఇండియా, భారతదేశం. ఇంకా హిందూస్తాన్ అనునది కూడా హిందూదేశం రూపాంతరమే.
చరిత్ర

ప్రధాన వ్యాసం: భారతదేశ చరిత్ర
మధ్య ప్రదేశ్ లోని భింబెట్కా వద్ద లభ్యమైన రాతియుగపు శిలాగృహాలు, కుడ్యచిత్రాలు భారతదేశంలో మానవుని అతి ప్రాచీన ఉనికికి ఆధారాలు. మొట్టమొదటి శాశ్వత నివాసాలు 9,000 సంవత్సారాల కిందట ఏర్పడ్డాయి. క్రి.పూ. 7000 సమయంలో, మొట్టమొదటి నియోలిథిక్ స్థావరాలు పశ్చిమ పాకిస్తాన్ లో మెహర్గర్, ఇతర ఉపఖండపు ప్రాంతాల్లో కనిపించింది. ఈ విధంగా సింధుాలోయ నాగరికత అభివృద్ధి, దక్షిణ ఆసియాలో మొదటి పట్టణ సంస్కృతి అభివృద్ధి చెందాయి. ఇదే క్రీ. పూ. 26 వ శతాబ్దం, క్రీ.పూ.20 వ శతాబ్దం మధ్య కాలంలో వర్ధిల్లిన సింధులోయ నాగరికత. క్రీ.పూ.5 వ శతాబ్దం నుండి, ఎన్నో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. ఉత్తర భారతంలో, మౌర్య సామ్రాజ్యం, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి విలువైన సేవ చేసింది. అశోకుడు ఈ వంశంలోని ప్రముఖ రాజు. తరువాతి వచ్చిన గుప్తులకాలం స్వర్ణ యుగం గా వర్ణించబడింది. దక్షిణాన, వివిధ కాలాల్లో చాళుక్యులు, చేర, చోళులు, పల్లవులు, పాండ్యులు మొదలగువారు పాలించారు. విజ్ఞాన శాస్త్రం, కళలు, సారస్వతం, భారతీయ గణితం, భారతీయ ఖగోళ శాస్త్రం, సాంకేతిక శాస్త్రం, భారతీయ మతములు, భారతీయ తత్వ శాస్త్రం మొదలైనవి ఈ కాలంలో పరిఢవిల్లాయి. రెండవ సహస్రాబ్దిలో తురుష్కుల దండయాత్రలతో, భారతదేశంలో ఎక్కువ భాగాన్ని ఢిల్లీ సుల్తానులు, తరువాత మొగలులు పాలించారు. అయినా, ముఖ్యంగా దక్షిణాన స్థానిక సామ్రాజ్యాలు అధికారాన్ని నిలబెట్టుకున్నాయి.
రెండవ సహస్రాబ్ది మధ్యల, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇంగ్లండు వంటి ఐరోపా రాజ్యాలు వ్యాపారం చేసే తలంపుతో భారతదేశం వచ్చి, చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న ఇక్కడి పరిస్థితి గమనించి, ఆక్రమించుకున్నారు. బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీపై 1857లో జరిగిన విఫల తిరుగుబాటు (ఇదే, ప్రఖ్యాతి గాంచిన ప్రథమ స్వాతంత్ర్య సమరం) తరువాత, భారతదేశంలోని అధిక భాగం బ్రిటిషు సామ్రాజ్యం కిందకు వచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన సుదీర్ఘ స్వాతంత్ర్య సమరం ఫలితంగా 1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వతంత్రం సిద్ధించింది. 1950 జనవరి 26న సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది.
విభిన్న జాతులు, విభిన్న మతాలతో కూడిన దేశంగా భారతదేశం – జాతి, మత పరమైన సంఘర్షణలను చవిచూసింది. అయినా, తన లౌకిక, ప్రాజాస్వామ్య లక్షణాన్ని కాపాడుకుంటూనే వచ్చింది. 1975, 1977 మధ్యకాలంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో మాత్రమే పౌర హక్కులకు భంగం వాటిల్లింది. భారత దేశానికి చైనాతో ఉన్న సరిహద్దు వివాదం కారణంగా 1962లో యుద్ధం జరిగింది. పాకిస్తాన్తో 1947, 1965, 1971లోను యుద్ధాలు జరిగాయి. అలీనోద్యమంలో భారతదేశం స్థాపక సభ్యురాలు. 1974లో, భారత్ తన మొదటి అణు పరీక్షను నిర్వహించింది. 1998లో మరో ఐదు పరీక్షలు నిర్వహించింది. 1991లో జరిగిన ఆర్ధిక సంస్కరణలతో ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా మారింది.
ప్రభుత్వం, రాజకీయాలు

- (భారత రాజకీయ వ్యవస్థ)
భారతదేశం ఒక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా 1950 జనవరి 26న అవతరించింది. భారత రాజ్యాంగం ప్రకారం అధికారం లెజిస్లేచర్, న్యాయవ్యవస్థ, నిర్వహణ వ్యవస్థల ద్వారా అమలవుతుంది.
ఇది పలు రాష్ట్రాల సమాఖ్య. దేశాధినేత అయిన రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైనది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు పరోక్ష పద్ధతిలో ఎలక్టోరల్ కాలేజి ద్వారా 5 సంవత్సరాల కాలపరిమితికి ఎన్నుకోబడతారు.
ప్రధానమంత్రి కార్యనిర్వాహక అధికారాలు గల పదవి. లోక్సభలో అత్యధిక సంఖ్యాక రాజకీయ పార్టీ, లేదా సంకీర్ణం సభ్యులు ప్రధానమంత్రిని ఎన్నుకుంటుంది. ప్రధానమంత్రి సలహా మేరకు, రాష్ట్రపతిచే నియమించబడ్డ మంత్రివర్గం ప్రధానమంత్రికి తన విధి నిర్వహణలో సహాయకారిగా ఉంటుంది. మంత్రులచే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
భారతదేశపు శాసన వ్యవస్థలో ద్విసభా పద్ధతి ఉంది. ఎగువ సభను రాజ్య సభ అని, దిగువ సభను లోక్ సభ అని అంటారు. లోక్ సభ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. రాజ్య సభ సభ్యులు ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకోబడతారు.
న్యాయవ్యవస్థలో పరమోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు, అప్పిలేట్ కోర్టులు, హైకోర్టులు ఉంటాయి. కోర్టులకు సూచనలు, ఆదేశాలు, రిట్లు ఇచ్చే అధికారం ఉంది. రిట్లలో హెబియస్ కార్పస్, మాండమస్, నిషేధం, కోవారంటో, సెర్టియోరారి అనే వివిధ రకాలుగా ఉన్నాయి. భారతీయ కోర్టులు రాజ్యాంగ శక్తులు; ఇవి రాజకీయ జోక్యం లేనివి. న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు అరుదుగా ఏర్పడే ఘర్షణను రాష్ట్రపతి మధ్యవర్తిత్వం వహించి నివారిస్తారు.
స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక భాగం, కేంద్ర ప్రభుత్వంలో భారత జాతీయ కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉంటూ వచ్చింది. స్వాతంత్ర్యానికి పూర్వం అతిపెద్ద రాజకీయ పక్షం కావడం చేత, స్వాతంత్ర్యం తరువాత దాదాపు 40 ఏళ్ళపాటు దేశరాజకీయాల్లో కాంగ్రెసు గుత్తాధిపత్యం వహించింది. 1977లో జనతా పార్టీగా ఏర్పడ్డ ఐక్య ప్రతిపక్షం కాంగ్రెసును ఓడించి, మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచింది. ఇటీవలి కాలంలో, భారత ఓటర్లపై గల పట్టును కాంగ్రెసు పార్టీ కోల్పోతూ వచ్చింది. 2004 సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెసు పార్టీ, వివిధ చిన్న పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిందూ వాద పార్టీ అయిన భాజపా ప్రధాన ప్రతిపక్షమైంది. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కారణంగా 1996 తరువాత ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణాలేకాగా 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలయింది .ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పదిశాతం లోక్సభ స్థానాలను గెలుచుకోవడం కూడా కష్టంకాగా భారతీయ జనతా పార్టీ మాత్రం మొదటిసారిగా అత్యధిక స్థానాలను గెలుచుకోవడం విశేషం.
భౌగోళిక స్వరూపం, వాతావరణం


భారతదేశం విశిష్ట లక్షణాలు గల ఒక ఉపఖండం అని పేర్కొనవచ్చు. భారతదేశంలో అనేక భౌతిక, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక తారతమ్యాలున్నాయి. భారతదేశంలో ఆనాది నుంచి అనేక మతాలు, జాతులు, కులాలు,భాషలు, కులాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఉండుటచే దీన్ని భౌగోళిక బిన్నత్వంలో ఏకత్వంగల దేశంగా గుర్తించవచ్చు.
భారతదేశపు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలు హిమాలయ పర్వతాలతో కూడుకుని ఉన్నాయి. మిగిలిన ఉత్తర భారతం, మధ్య, ఈశాన్య ప్రాంతాలు సారవంతమైన గంగా మైదానంతో కూడి ఉన్నాయి. పశ్చిమాన, పాకిస్థాన్కు ఆగ్నేయ సరిహద్దున థార్ ఎడారి ఉంది. దక్షిణ భారత ద్వీపకల్పం దాదాపు పూర్తిగా దక్కను పీఠభూమితో కూడుకుని ఉంది. ఈ పీఠభూమికి రెండువైపులా తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు ఉన్నాయి.
భారతదేశంలో ఎన్నో ప్రముఖ నదులు ఉన్నాయి. వాటిలో కొన్ని: గంగ, యమున, బ్రహ్మపుత్ర, కృష్ణ, గోదావరి.
దేశపు దక్షిణాన ఉష్ణ వాతావరణం ఉండగా, ఉత్తరాన సమశీతోష్ణ వాతావరణం నెలకొని ఉంది. హిమాలయ ప్రాంతాల్లో అతిశీతల వాతావరణం (టండ్రా) ఉంది. భారతదేశంలో వర్షాలు ఋతుపవనాలు వలన కలుగుతాయి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

భారతదేశం 29 రాష్ట్రాలుగా, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. సాధారణంగా కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వంచే నియమించబడిన ప్రతినిధిచే పరిపాలించ బడతాయి. ఢిల్లీ,పాండిచ్చేరి, జమ్మూ కాశ్మీర్ లకు ప్రజలచే ఎన్నుకొనబడిన ప్రభుత్వం వుంటుంది.
రాష్ట్రాలు: సంఖ్య పటంలో చూపబడింది
కేంద్రపాలిత ప్రాంతాలు:ప్రక్కన గల పటంలో ఆంగ్ల అక్షరంతో సూచించబడినవి |
భారతదేశం అంటార్క్టికాలో ప్రాదేశిక వాదన చేయలేదు కానీ దక్షిణ గంగోత్రి, మైత్రి అను రెండు శాస్త్రీయ స్థావరాలు ఉన్నాయి.
చూడండి: జనాభా వారిగా భారతదేశ రాష్ట్రాల జాబితా
ఆర్ధిక వ్యవస్థ

చారిత్రకంగా భారత ఆర్ధిక వ్యవస్థ ఆధారపడిన వ్యవసాయం పాత్ర ప్రస్తుతం తగ్గిపోయింది. ప్రస్తుతం ఇది దేశ స్థూలాదాయంలో 25% కంటే తక్కువే. ముఖ్యమైన పరిశ్రమలు గనులు, పెట్రోలియం, వజ్రాలు, సినిమాలు, జౌళి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హస్త కళలు. భారత్ దేశపు పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా ప్రధాన పట్టణాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలలో సాఫ్ట్వేర్, బిజినెస్ ప్రాసెస్ ఔట్సొర్సింగ్ రంగాల్లో ప్రపంచంలోని పెద్ద కేంద్రాల్లో ఒకటిగా రూపొందింది. 2003–2004 లో ఈ రంగాల ఆదాయం 1250 కోట్ల డాలర్లు. చిన్న పట్టణాలు, పల్లెల్లోని ప్రజలకు స్థిరమైన ఉపాధి కల్పించే ఎన్నో లఘు పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఏటా దేశాన్ని సందర్శించే విదేశీ యాత్రికులు 30 లక్షల మంది మాత్రమే అయినప్పటికీ, జాతీయాదాయంలో ఈ రంగం పాత్ర ప్రముఖమైనదే. అమెరికా, చైనా, యు.ఏ.ఇ, ఐరోపా సమాఖ్యలు భారతదేశపు ముఖ్య వ్యాపార భాగస్వాములు.
జనాభా వివరాలు
భారతదేశం ప్రపంచదేశాలలో నూటనలబైరెండుకోట్లకు పైగా జనాభాతో చైనాను అధిగమించి ఒకటో స్థానంలో నిలిచింది. ఎన్నో భిన్నత్వాలు గల జనాభా సామాజిక, రాజకీయ వర్గీకరణలో భాష, మతం, కులం అనే మూడు ప్రముఖ పాత్ర వహిస్తాయి. దేశంలోని అతిపెద్ద నగరాలు - ముంబై (వెనుకటి బాంబే), ఢిల్లీ, కోల్కాతా (వెనుకటి కలకత్తా), చెన్నై (వెనుకటి మద్రాసు), హైదరాబాద్,
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం భారతదేశ జనాభా మొత్తం 121,01,93,422.[23] భారతదేశం ఆక్షరాస్యత 83,04%, ఇందులో పురుషుల అక్షరాస్యత 82,14%, మహిళల అక్షరాస్యత 75,7%. ప్రతి 1000 మంది పురుషులకు 1010 మంది స్త్రీలు ఉన్నారు.
2022 జనగణన ప్రకారం, దేశంలోని 83.80% ప్రజలు హిందువులైనప్పటికీ, ప్రపంచంలోని రెండో అత్యధిక ముస్లిం జనాభా ఇక్కడ ఉన్నారు (17.23%). ఇతర మతాలు: క్రైస్తవులు (5.30%), సిక్కులు (3.72%), బౌద్ధులు (8.70%), జైనులు (0.36%), ఇతరులు (0.9%) (యూదులు, పార్సీలు, అహ్మదీయులు, బహాయీలు మొదలగునవి).[14] అధిక ముస్లిం మతస్తులు గల ప్రపంచ దేశాల జాబితాలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది.[24][25] దేశంలో ఎన్నో మత సంబంధ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా, బహిరంగంగా జరుపుకుంటారు. అనేక మతాల కలగలుపు అయిన భారతదేశంలో పండుగలు అందరూ కలిసి జరుపుకుంటారు. వీటిలో బాగా విస్తృతంగా జరుపుకునే హిందూ పండుగలు శ్రీరామనవమి, వినాయక చవితి, సంక్రాంతి, దీపావళి, హొలీ, దసరా.
భారతదేశం రెండు ప్రముఖ భాషా కుటుంబాలకు జన్మస్థానం. అవి, ఇండో-ఆర్యన్, ద్రావిడ భాషలు. భారత రాజ్యాంగం 22 భాషలను అధికారికంగా గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం అధికార కార్యక్రమాలలో హిందీ, ఇంగ్లీషు భాషలను ఉపయోగిస్తుంది. దేశంలోని నాలుగు ప్రాచీన భాషలు సంస్కృతం, తెలుగు, కన్నడం, తమిళం. దేశంలో మొత్తం 1652 మాతృ భాషలు ఉన్నాయి.
భారతదేశంలోని 10 పెద్ద నగరాలు
ప్రాచీన భారతంలో రవాణా వ్యవస్థ
రవాణా సౌకర్యాలు
దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర వహించే రవాణా సౌకర్యాలలో భారతదేశం మంచి ప్రగతిని సాధించింది. మొత్తం 4 రకాల రవాణా సౌకర్యాలు భారతదేశంలో ఉన్నాయి.
రైలు మార్గాలు
దేశంలో రైలు మార్గాలు అతిముఖ్యమైన రవాణా సౌకర్యము. 1853 లో ముంబాయి నుండి థానే మధ్య ప్రారంభమైన రైలు మార్గము ప్రస్తుతం 62 వేల కిలోమీటర్లకు పైగా నిడివిని కల్గి ఉంది. భారతీయ రైల్వే 17 జోన్లుగా విభజితమై ఉంది.
అఖండ భారత్ రైలు
ఢాకా-ఢిల్లీ-లాహోర్ రైలు. ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ల మధ్య తిరిగే రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. దక్షిణాసియా దేశాల మధ్య రైలు సర్వీసులు ప్రారంభించాలనే భారత ప్రతిపాదనకు పాకిస్థాన్ పచ్చజెండా వూపింది. మూడు దేశాలను కలుపుతూ రైళ్లను నడిపిస్తామని భారత రైల్వేశాఖ పంపిన ప్రతిపాదనకు పాక్ రైల్వే మంత్రిత్వ శాఖ సాంకేతిక అనుమతిని మంజూరు చేసింది.ఢాకా-ఢిల్లీ-లాహోర్ల మధ్య రైలు నడిపించటం లాభదాయకమేననీ, అవసరమైతే కరాచీ, ఇస్లామాబాద్ వరకూ పొడిగించుకోవచ్చని నిపుణులు సూచించినట్లు పాక్ రైల్వే అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముందుగా కంటైనెర్ రైళ్లను నడిపించి, తర్వాతి దశలో ప్రయాణికుల బండ్లను నడిపించాలనే యోచనలో ఉన్నారు. ఇటీవల ఇస్లామాబాద్-టెహ్రాన్-ఇస్తాంబుల్ రైలు సర్వీసును ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేయటంతో భారత రైల్వేశాఖకు ఈ కొత్త ఆలోచన వచ్చింది. దక్షిణాసియా రైళ్ల వల్ల పాకిస్థాన్, ఇతర సార్క్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ప్రయోజనాలు నెరవేరతాయని మనదేశం ప్రతిపాదనల్లో వెల్లడించింది. దీనివల్ల నేపాల్, భూటాన్ వంటి దేశాలకూ రైలు సర్వీసులు నడిపించవచ్చని సూచించినట్లు తెలిసింది. దక్షిణాసియా రైలు సర్వీసులు వాణిజ్యపరంగా ప్రయోజనకరమేనని నిపుణులు సైతం కితాబునిస్తున్నారు. ఈ మార్గంలో రైళ్లను నడిపించటమూ తేలికేననీ పేర్కొంటున్నారు. భారత్, పాక్, బంగ్లాదేశ్లలో బ్రిటిష్ పాలకులు రైలు మార్గాలను నిర్మించినందువల్ల మూడు దేశాల్లోనూ బ్రాడ్గేజి రైలు పట్టాలు ఉండటం, నిర్వహణ శైలీ ఒకేమాదిరిగా ఉండటం కలిసివస్తుందని అభిప్రాయపడుతున్నారు.
రోడ్డు మార్గాలు
మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించిన రవాణా మార్గాలు రోడ్డు మార్గాలే. రోడ్డు మార్గాలలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, గ్రామ పంచాయతి రహదారులు అని 4 రకాలు. దేశంలోని మొత్తం రోడ్ల నిడివిలో కేవలం 2% ఆక్రమించిన జాతీయ రహదారులు, ట్రాఫిక్ లో మాత్రం సుమారు 40% ఆక్రమిస్తున్నాయి.
వాయు మార్గాలు
ఆతి వేగంగా జరిగే రవాణా వ్యవస్థగా వాయు మార్గాలు పస్రిద్ధి చెందాయి. మనదేశంలో రాష్ట్ర రాజధానులు, ప్రధాన పట్టణాలను కల్పుతూ విమాన మార్గాలు ఉన్నాయి. ఇది అధిక వ్యయంతో కూడుకొనినప్పటికినీ సౌకర్యవంతంగా, అతి వేగంగా ఉంటుంది. కేవలం దేశంలోని పట్టణాలు, నగరాలనే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలనుండి ఇతరదేశాలను కూడా కల్పే అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి.
జల మార్గాలు
జల మార్గాలు రవాణా సౌకర్యాలలో ఆలస్యం అయినప్పటికినీ తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి ముడి చమురు, ఇతర ఖనిజాలు తెప్పించుకోవడానికి, మనదేశం నుంచి ఇతరదేశాలకు ముడి ఇనుము, ఇతర ఖనిజాలు ఎగుమతి చేయడానికి ఈ రవాణా మార్గం చాలా అనువైనది.
భారతదేశం – కొన్ని ముఖ్య విషయాలు
- విస్తీర్ణం పరంగా ప్రపంచములో 7 వ పెద్ద దేశం
- జనాభా పరంగా ప్రపంచములో 1 వ పెద్ద దేశము
- ఒక దేశం పేరుమీదుగా మహాసముద్రం ఉన్న ఏకైక దేశం
- అత్యధిక ప్రధాన మతాలకు పుట్టినిల్లయిన దేశం
- 7,517 కిమీ సముద్రతీరం కలదు
సంస్కృతి


భారతదేశం తన ఉత్కృష్టమైన, ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వాన్ని, తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చింది. ఆక్రమణదారులు, వలస వచ్చినవారి సంప్రదాయాలను కూడా తనలో ఇముడ్చుకుంది. తాజ్మహల్ వంటి కట్టడాలు, మరెన్నో సంస్కృతీ, సంప్రదాయాలు మొగలు పాలకులనుండి వారసత్వంగా స్వీకరించింది.
భారతీయ సమాజము భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో కూడిన బహుళ సమాజం. వివిధ మత కార్యక్రమాలు సంఘ దైనందిన జీవితంలో ఒక భాగం. అన్ని సామాజిక, ఆర్ధిక వర్గాలలోను విద్యను ఉన్నతంగా భావిస్తారు. సాంప్రదాయికమైన సమష్టి కుటుంబ వ్యవస్థలోని ఆర్ధిక అవరోధాల దృష్ట్యా చిరు కుటుంబాలు ఎక్కువైపోతున్నప్పటికీ, సాంప్రదాయిక కుటుంబ విలువలను పవిత్రంగా భావిస్తారు, గౌరవిస్తారు.
భారతీయ సంగీతం వివిధ రకాల పద్ధతులతో కూడినది. శాస్త్రీయ సంగీతంలో రెండు ప్రధాన పద్ధతులున్నాయి. దక్షిణాదికి చెందిన కర్ణాటక సంగీతం ఒకటి కాగా, ఉత్తరాదిన చెందిన హిందూస్తానీ సంగీతము రెండోది. ప్రజాదరణ పొందిన మరో సంగీతం సినిమా సంగీతం. ఇవికాక ఎన్నో రకాల జానపద సంగీత సంప్రదాయాలు కూడా ఉన్నాయి. శాస్త్రీయ నృత్య రీతులు కూడా ఎన్నో ఉన్నాయి – భరతనాట్యం, ఒడిస్సీ, కూచిపూడి, కథక్, కథకళి మొదలైనవి. ఇవి ఇతిహాసాలపై ఆధారపడిన కథనాలతో కూడి ఉంటాయి. ఇవి ఎక్కువగా భక్తి, ఆధ్యాత్మికత మేళవింపబడి ఉంటాయి.
ప్రాచీన సారస్వతం ఎక్కువగా మౌఖికమైనది. తరువాతి కాలంలో అది అక్షరబద్ధం చేయబడింది. దాదాపుగా ఇవన్నీ కూడా హిందూ సంస్కృతిలో నుండి ఉద్భవించినవే. పవిత్ర శ్లోకాలతో కూడిన వేదాలు, మహాభారతం, రామాయణం వీటిలో ఉన్నాయి. తమిళనాడుకు చెందిన సంగమ సాహిత్యం భార్తదేశపు ప్రాచీన సాంప్రదాయిక లౌకిక తత్వానికి అద్దం పడుతుంది. ఆధునిక కాలంలో, భారతీయ భాషలలోను, ఇంగ్లీషు లోను కూడా రాసిన ప్రసిద్ధి చెందిన రచయితలెందరో ఉన్నారు. నోబెల్ బహుమతి సాధించిన ఒకేఒక భారతీయుడైన రవీంద్రనాథ్ టాగోర్ బెంగాలీ రచయిత.
ప్రపంచంలోనే అత్యధికంగా సినిమాలు నిర్మించేది భారతదేశమే. దేశంలో అన్నిటికంటే ప్రముఖమైనది ముంబైలో నెలకొన్న హిందీ సినిమా పరిశ్రమ. అధిక సంఖ్యలో సినిమాలు నిర్మిస్తున్న ఇతర భాషా పరిశ్రమలు – తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ. బెంగాలీ సినిమా దర్శకుడైన సత్యజిత్ రే ప్రపంచ సినిమా రంగానికి భారత్ అందించిన ఆణిముత్యం.
వరి అన్నం, గోధుమ (బ్రెడ్, రొట్టెల రూపంలో) లు ప్రజల ముఖ్య ఆహారం. విభిన్న రుచులు, మసాలాలు, పదార్థాలు, వంట విధానాలతో కూడిన భారతీయ వంటలు ఎంతో వైవిధ్యమైనవి. ఎన్నో రకాల శాకాహార వంటలకు దేశం ప్రసిద్ధి చెందింది. భారతీయ ఆహార్యం కూడా ఆహారం వలెనే బహు వైవిధ్యమైనది. చీర, సల్వార్ కమీజ్ స్త్రీలు ఎక్కువగా ధరించే దుస్తులు. పురుషులు పంచె, కుర్తా ధరిస్తారు
క్రీడలు
జనాభా పరంగా అతి పెద్ద దేశం భారతదేశం. ప్రపంచ క్రీడా రంగంలో భారతదేశానికి సముచిత స్థానం ఉంది. ఒలంపిక్ క్రీడలలో 8 పర్యాయాలు హాకీలో బంగారు పతకాలు సాధించిన భారత దేశానికి ప్రస్తుతం ఘనత దేశానికి ఉంది.
చదరంగంలో విశ్వనాథన్ ఆనంద్ రెండు పర్యాయాలు ప్రపంచ టైటిల్ సాధించగా, టెన్నిస్లో లియాండర్ పేస్,మహేష్ భూపతి, సానియా మీర్జాలు డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిళ్ళు సాధించిపెట్టారు.ప్రస్తుతము ఆడుతున్నవార్లలో సైనా నెహ్వాల్ చెప్పుకోదగినది. భారతదేశము ఒలింపిక్ క్రీడలు లాంటి అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలలో పెద్దగా రాణించలేదు. గత మూడు ఒలంపిక్ క్రీడలలో కేవలం ఒక్కొక్కటే పతకం సాధించగలిగినది. ఆసియా క్రీడల లో కూడా చిన్న చిన్న దేశాల కంటే మన పతకాలు చాలా తక్కువ. కబడ్డీలో మాత్రం వరుసగా బంగారు పతకాలు మనమే సాధించాము.
కొన్ని సాంప్రదాయ ఆటలు అయిన కబడ్డీ, ఖో-ఖో, గోడుంబిళ్ళ (గిల్లీ-దండా) లకు దేశమంతటా బహుళ ప్రాచుర్యము ఉంది. చదరంగము, క్యారమ్, పోలో, బ్యాడ్మింటన్ మొదలైనటువంటి అనేక క్రీడలు భారతదేశంలో పుట్టాయి. ఫుట్బాల్ (సాకర్) కు కూడా యావత్ భారతదేశంలో చాలా ప్రజాదరణ ఉంది.
జాతీయ చిహ్నాలు
- జాతీయ పతాకం: త్రివర్ణ పతాకము.
- జాతీయ ముద్ర: నాలుగు తలల సింహపు బొమ్మ.
- జాతీయ గీతం: జనగణమన.
- జాతీయ గేయం: వందేమాతరం....
- జాతీయ పక్షి: నెమలిపావో క్రిస్టాటస్.
- జాతీయ జంతువు: పెద్దపులి (రాయల్ బెంగాల్ టైగర్).
- జాతీయ వృక్షం: మర్రిచెట్టు.
- జాతీయ క్రీడ: హాకీ
- జాతీయ పుష్పం: కమలము (తామర)
- జాతీయ క్యాలెండర్: శక క్యాలెండర్ (శక సం. పు క్యాలెండర్)
- జాతీయ ఫలం: మామిడి పండు
శెలవు దినాలు
భారతదేశంలో జాతీయ శెలవుదినాలు మూడే. పండుగలు, పర్వదినాలు, నాయకుల జన్మదినాలకు సంబంధించిన ఇతర శెలవుదినాలు ఆయా రాష్ట్రాల పరిధిలో ఉంటాయి.
తేదీ | శెలవుదినము | విశేషము |
---|---|---|
జనవరి 26 | గణతంత్ర దినోత్సవం | 1950లో ఈ రోజున భారతదేశం గణతంత్ర దేశమైనది. |
ఆగష్టు 15 | స్వాతంత్ర్య దినోత్సవం | 1947లో ఈ రోజున భారతదేశానికి బ్రిటీష్ పరిపాలన నుండి స్వాతంత్ర్యం లభించింది. |
అక్టోబర్ 2 | గాంధీ జయంతి | మహాత్మా గాంధీ జన్మ దినోత్సవం. |
అల్ప విషయాలు
- వాహనాలు రోడ్డుకు ఎడమ పక్కన నడుస్తాయి. డ్రైవరు స్థానం వాహనంలో కుడి పక్కన ఉంటుంది.
- భారతీయులు మాట్లాడే: హిందీ; బెంగాలీ; మరాఠీ; తెలుగు; తమిళం; ఉర్దూ; కన్నడ; మలయాళం; ఒరియా; పంజాబీ; అస్సామీ; మైథిలి; కాశ్మీరీ; నేపాలీ; సింధ్; కొంకణి; మణిపురి.
- తేది పద్ధతి:
- సంఖ్యా మానం: 10,000,000 = 1 కోటి. 100,000 = 1 లక్ష.
- పోస్టలు కోడు (PIN): 6 అంకెలు.
- అధికారిక కొలమానం: SI
- విద్యుత్ సరఫరా 230 V; 50 HZ
- విద్యుత్ ప్లగ్గులు: Type C, D & M (CEE 7/16; CEE 7/17; BS 546)
- టెలివిజన్ సిగ్నలు: PAL B/G
- ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 న మొదలవుతుంది.
ఇవికూడా చూడండి
- భారతదేశ బడ్జెట్
- భారతదేశ వాతావరణం
- భారత జాతీయ వనాలు
- భారతదేశపు రాజకీయ పార్టీలు
- భారతీయ నగరాలు, పట్టణాలు
- భారతదేశంలో మతాలు
- భారత్లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా
- భారతీయుల ఇంటిపేర్లు
- భారతీయ వంటకాలు
- భారతదేశ చరిత్ర
- భారతీయ సంస్కృతి
- భారతీయ చిత్రకళ
- భారతీయ మహిళా వ్యాపారవేత్తల జాబితా
- భారత అమెరికా సంబంధాలు
- ఇండియాలో ఇ- పరిపాలన
- భారతదేశంలోని మెట్రోపాలిటన్ ప్రాంతాల జాబితా
- భారతీయ భాషలు – మాట్లాడే ప్రజల సంఖ్య
- భారతీయ శిల్పకళ
- భారతదేశ ఆర్ధిక వ్యవస్థ
- కరంతై తమిళ సంఘం
- రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956
- వలస భారతదేశం
- భారత జాతీయవాదం
- వెల్లూరు తిరుగుబాటు
- శరద్ అరవింద్ బాబ్డే
- భారతదేశంలోని ప్రాచ్య పరిశోధనా సంస్థలు
- భారతదేశ చరిత్ర – ముఖ్యమైన ఘట్టాలు
- భారతదేశ సైనిక చరిత్ర
చిత్రమాలిక
గమనికలు
- "[...] జనగణమన జాతీయగీతం తో పాటు దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన వందేమాతరం సమాన స్థాయి కలిగివుంది. "(Constituent Assembly of India 1950) .
- According to Part XVII of the Constitution of India, Hindi in the Devanagari script is the official language of the Union, along with English as an additional official language.[5][1][6] States and union territories can have a different official language of their own other than Hindi or English.
- Different sources give widely differing figures, primarily based on how the terms "language" and "dialect" are defined and grouped. Ethnologue, produced by the Christian evangelist organisation SIL International, lists 461 tongues for India (out of 6,912 worldwide), 447 of which are living, while 14 are extinct.[12][13]
- "The country's exact size is subject to debate because some borders are disputed. The Indian government lists the total area as 3,287,260 కి.మీ2 (1,269,220 చ. మై.) and the total land area as 3,060,500 కి.మీ2 (1,181,700 చ. మై.); the United Nations lists the total area as 3,287,263 కి.మీ2 (1,269,219 చ. మై.) and total land area as 2,973,190 కి.మీ2 (1,147,960 చ. మై.)."(Library of Congress 2004) .
మూలాలు
ఉపయుక్త గ్రంథాలు
వెలుపలి లంకెలు
పాద పీఠిక
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.