శ్రీకాళహస్తి
ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండల పట్టణం From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండల పట్టణం From Wikipedia, the free encyclopedia
శ్రీకాళహస్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లాలో ఒక పట్టణం, శ్రీకాళహస్తి మండల కేంద్రం. ఈ పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇక్కడ గల శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం వలన ప్రముఖ శైవ పుణ్యక్షేత్రంగా పేరుపొందింది. కళంకారీ కళకు పుట్టినిల్లు.
శ్రీకాళహస్తి | |
---|---|
పట్టణం | |
![]() భక్త కన్నప్ప కొండ నుండి శ్రీకాళహస్తి దృశ్యము | |
Coordinates: 13.76°N 79.70°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి |
మండలం | శ్రీకాళహస్తి |
Government | |
• Type | పురపాలకసంఘం |
• Body | శ్రీకాళహస్తి పురపాలక సంఘం |
• శాసనసభ్యుడు | బియ్యపు మధుసూధనరెడ్డి |
విస్తీర్ణం | |
• Total | 24.50 కి.మీ2 (9.46 చ. మై) |
జనాభా (2011)[2] | |
• Total | 80,056 |
• జనసాంద్రత | 3,300/కి.మీ2 (8,500/చ. మై.) |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు ఇక్కడ శివలింగాన్ని పూజించినందున, వాటి పేరుతో శ్రీకాళహస్తి ఏర్పడింది.
సా.శ.పూ. మూడవ శతాబ్దంలో తమిళ సంగం వంశానికి చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రంను గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్తావన ఉంది. ఇంకా తమిళ కవులైన సంబందర్, అప్పర్, మాణిక్యవాసగర్, సుందరమూర్తి, పట్టినత్తార్, వడలూర్ కు చెందిన శ్రీరామలింగ స్వామి మొదలగు వారు కూడా ఈ క్షేత్రమును సందర్శించారు.[3]
ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ రాళ్ళపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరువాత చోళులు పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగు పరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించాడు. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను, నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. క్రీస్తుశకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన వంద స్తంభాలు కలిగిన మంటపం, అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గోపురాన్ని 1516 వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది. ఈ గోపురం 2010 మే 26 న కూలిపోయింది. పది సంవత్సరాలుగా గోపురంలో అక్కడక్కడా పగుళ్ళు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయ అధికారులు మరమ్మత్తులు చేస్తూ వస్తున్నారు అయితే కూలిపోక ముందు కొద్ది రోజుల క్రితం సంభవించిన లైలా తుఫాను కారణంగా ఒక వైపు బాగా బీటలు వారింది. మరో రెండు రోజులకు పూర్తిగా కూలిపోయింది. ఆలయ అధికారులు ముందుగా అప్రమత్తమై ముందుగా చుట్టుపక్కల కుటుంబాలను దూరంగా తరలించడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు కానీ రెండు రోజుల తర్వాత శిథిలాల క్రింద ఒక వ్యక్తి మృతదేహం లభ్యమయింది.[4] ఈ కూలిపోవడానికి గల కారణాలు అన్వేషించడానికి ప్రభుత్వం సాంకేతిక నిపుణలతో కూడిన ఒక కమిటీని నియమించింది.[5]
సాశ. 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపుకొన్నాడు. 1912లో దేవకోట్టైకి చెందిన నాటుకోట్టై చెట్టియార్లు తొమ్మిది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుదిరూపునిచ్చారు.[6]
పట్టణ విస్తీర్ణం: 24.50 చ.కి.మీ. [1] శ్రీకాళహస్తి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైన తిరుపతికి 38 కి.మీ.ల దూరంలో, నెల్లూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది.
2011 జనగణన ప్రకారం, పట్టణ జనాభా 80,056.[2]
మదనపల్లె - నాయుడుపేట పట్టణాలను కలిపే జాతీయ రహదారి 71 పై ఈ పట్టణం వుంది. సమీప నగరమైన తిరుపతి నుండి బస్సు సౌకర్యముంది.గూడూరు-తిరుపతి దక్షిణ రైలు మార్గంలో ఈ పట్టణం వుంది. సమీప విమానాశ్రయం తిరుపతి విమానాశ్రయం.
శ్రీకాళహస్తీశ్వర స్వామి సాంకేతిక కళాశాల శ్రీకాళస్తీశ్వర స్వామి దేవస్థానం నిర్వహిస్తున్నది. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల , మునిసిపల్ ప్రాథమికోన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, సంక్షేమ పాఠశాలలు కూడా ఉన్నాయి.
బస్ స్టాండుకు సమీపంలోనున్న అయ్యలనాయుడు చెరువులో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.
ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ మార్గాలు వ్యవసాయం, వ్యాపారం , పర్యాటకం. ప్రధాన పంటలు వరి, వేరుశనగ, , చెరకు. వందల కొద్దీ కలంకారీ కళాకారులు కూడా ఆదాయాన్ని చేకూరుస్తున్నారు. ఇంకా చేనేత కళాకారులు కూడా చెప్పుకోదగిన సంఖ్యలోనే ఉన్నారు. వీరు ప్రధానంగా పట్టణంలోగల "సాలిపేట" అనే ప్రాంతమందు కేంద్రీకృతమై ఉన్నారు. పట్టణంలో జరిగే నిర్మాణాల పనులకు, ఇతర కూలిపనులకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తారు. బీడీ కార్మికులు కూడా ఎక్కువే.
శ్రీకాళహస్తి పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
ఇక్కడి ప్రజలు ప్రధానం తెలుగు మాట్లాడుతారు. కానీ తమిళనాడుకు దగ్గరలో ఉండటం వలన చాలామంది తమిళం కూడా మాట్లాడుతారు. విద్యా రంగంలో మంచి అభివృద్ధిని సాధించడం వలన చాలామంది ఆంగ్లమును కూడా అర్థం చేసుకోగలరు. వస్త్రధారణలో పంచె, చీరలు, లుంగీలు, ధోతీలే కాకుండా ఆధునిక వస్త్రధారణలైన ప్యాంటు, చొక్కా, చుడీదార్ వంటివి కూడా సాధారణమే.
ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ పట్టణం యొక్క సంస్కృతిని ప్రతిబింబజేస్తుంది. కర్ణాటక సంగీత మొట్టమొదటి స్వరకర్తలలో ఒకడైన ముత్తుస్వామి దీక్షితార్ "శ్రీకాళహస్తీశ" అనే భజనల్లో ఈ ఆలయాన్ని కీర్తించాడు.
క్రికెట్ ఇక్కడి ప్రజలు బాగా ఆడే, అభిమానించే క్రీడ. అంతేకాక కొన్ని ప్రాంతీయ క్లబ్బులు టెన్నిస్ ను కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనది 1916లో స్థాపించబడిన రిపబ్లిక్ క్లబ్. ఈ క్లబ్ 2004లో 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంటును కూడా నిర్వహించింది. ఇంకా గ్రామీణ క్రీడలైన కబడ్డీ, ఖోఖో మొదలైనవి కూడా ఒక మాదిరి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.
తెలుగులో ప్రధాన పత్రికలైన తమ కార్యాలయాలను కలిగి ఉన్నాయి. ఇంతేకాక ప్రాంతీయంగా వెలువడే చైతన్య, ఆదర్శిని వంటి కొన్ని చిన్న వార్తాపత్రికలు కూడా ఉన్నాయి.
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు: వారం రోజులపాటు అంగరంగ వైభోగంగా జరుగుతాయి. ఈ రోజులలో ఆలయం లోపలనే కాకుండా నాలుగు ప్రధాన వీధులైన నెహ్రూ వీధి, కుంకాల వీధి, తేరు వీధి, నగరి వీధులు జనంతో కిటకిటలాడుతుంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. శివుడు కళాప్రియుడు కాబట్టి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన గాయకులు, హరికథకులు, నాట్య కళాకారులు, నర్తకీమణులు, భజన కళాకారులు, మిమిక్రీ కళాకారులు, సంగీత వాయిద్య కారులు, భక్తులను తమ కౌశలంతో రంజింప జేస్తారు.
మహాశివరాత్రి పర్వదినాన జరిగే నందిపై ఊరేగింపు కన్నుల పండుగగా ఉంటుంది. నంది వాహనమెక్కి ఊరేగు శివుని ముందు అనేక జానపద కళా బృందాలు ప్రదర్శించే కళలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మహాశివరాత్రి తరువాతి రోజు జరిగే రథ యాత్రలో కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇంకా నారద పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా ఉత్సవాల్లో ప్రధాన వేడుక. అందంగా అలంకరించిన తెప్పలపై స్వామి వారిని, అమ్మవారిని కోనేటిలో విహారం చేయిస్తారు. పట్టణం నడిబొడ్డులోగల పెళ్ళి మంటపంలో జరిగే కళ్యాణోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు. పెద్ద ఖర్చులు భరించి పెళ్ళి చేసుకోలేని పేదలు స్వామి, అమ్మవారి కళ్యాణంతో పాటుగా పెళ్ళి చేసుకోవడం ఇక్కడ తరతరాలుగా ఇక్కడ వస్తున్న ఆనవాయితీ.
నవరాత్రి ఉత్సవాలు: ఇంకా ఆలయానికి సమీపంలో ఉన్న దుర్గాంబ కొండపై వెలసిన కనక దుర్గమ్మ అమ్మవారికి ఏటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ తొమ్మిది రోజులపాటు కూడా భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంతకు మునుపు చిన్నదిగా ఉన్న ఆలయాన్ని 2006లో విస్తరించడం జరిగింది. మరి కొంత దూరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కొండపై కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
ధర్మరాజుల స్వామి తిరునాళ్ళు: ఇవి ఐదు రోజులపాటు విశేషంగా జరుగుతాయి. ద్రౌపదీ అమ్మవారు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఈ ఉత్సవాల సమయంలో ప్రతిరోజు భారత పారాయణం జరుగుతుంది. విరాటపర్వం చదివిన రోజున పట్టణంలో కచ్చితంగా వర్షం కురవడం ప్రజలు విశేషంగా చెప్పుకుంటారు. ఉత్సవాలలో ప్రధాన భాగంగా ఐదవరోజున సుమారు 2000 మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు.
ఏడు గంగల జాతర: ఇంకా ప్రతీ సంవత్సరం డిసెంబరు నెలలో జరిగే ఏడు గంగల జాతర కూడా చెప్పుకోదగ్గ ఉత్సవమే. ఈ ఉత్సవాలలో భాగంగా పట్టణం లోని ఏడు వీధులలో ఏడు రూపాలలో ఏర్పాటు చేసిన గంగమ్మలను ప్రతిష్ఠిస్తారు. ముత్యాలమ్మ గుడి వీధిలో గల గంగమ్మ దేవాలయం నుంచి ఈ ఏడు విగ్రహాలు ఊరేగింపుగా బయలుదేరి ఆయా వీధులలో ప్రతిష్ఠిస్తారు. ఆ గంగమ్మ విగ్రహాలు జీవం ఉట్టి పడేలా తయారు చేయడం ఆ కళాకారుల నైపుణ్యానికి నిదర్శనం.
శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు) గాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. (కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగము, చిదంబరంలో ఆకాశలింగము). స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు.
విజయలక్షి సినిమా హాలు అన్నింటికన్నా ప్రాచీనమైనది.దీనిని సుమారు 80 సంవత్సరాలకు మునుపు నిర్మించి ఉన్నారు.
ధూర్జటి, శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి, మాజీ శాసన సభ్యులు ఎస్సీవీ నాయుడు, శాంతారాం పవార్, మాజీ శాసన సభ్యులు తాటిపర్తి చెంచురెడ్డి, ప్రముఖ విద్వాంసులు పూడి వెంకటరామయ్య గారు. ప్రముఖ కళాకారులు మోహన్ భార్గవ్, గురప్ప చెట్టి (పద్మశ్రీ). ప్రముఖ నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఒక సంవత్సరం పాటు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో చదవడం విశేషం.
Seamless Wikipedia browsing. On steroids.