శాసనమండలి
భారతదేశ రాష్ట్రాల శాసన వ్యవస్థ సభలలోని ఎగువసభ / From Wikipedia, the free encyclopedia
భారతదేశ రాష్ట్రాల శాసన వ్యవస్థలోని సభలలో ఎగువ సభను శాసనమండలి (విధాన పరిషత్) అంటారు.అధికరణ 169 ప్రకారం రాష్ట్రంలలో శాసనమండలి ఏర్పాటు చేయవచ్చు, రద్దు చేయవచ్చు. శాసనమండలి కావాలి అని కోరుకుంటున్న రాష్ట్రంలోని శాసనసభలో 2/3 మెజారిటీతో ఆమోదించాలి. రాజ్యాంగంలోని 171 అధికరణం ద్వారా ఈ విధాన సభను ప్రారంభించవచ్చు. ప్రస్తుత భారతదేశం లోని 28 రాష్ట్రాలలో కేవలం 6 రాష్ట్రాలలో మాత్రమే శాసనమండలి ఉంది.[1] అవి ఉత్తరప్రదేశ్ (100), బీహార్ (75), కర్ణాటక (75), మహారాష్ట్ర (78), ఆంధ్రప్రదేశ్ (58), తెలంగాణ (40). రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో ఇది ఎగువ సభ. శాసన మండలి సభ్యులు ప్రజలచే పరోక్షముగా ఎన్నికౌతారు. ఈ సభలోని సభ్యులను ఎన్నికైన స్థానిక సంస్థలు, అసెంబ్లీ సభ్యులు, గవర్నర్, గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు మొదలైనవారు ఎన్నుకుంటారు. ఈ సభ్యులను ఎం.ఎల్.సి అని పిలుస్తారు. ఇది శాశ్వతసభ. అనగా శాసనసభ వలె దీన్ని రద్దు చేయలేం. కాని శాసనమండలి పూర్తిగా లేకుండా చేయవచ్చు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడొంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. శాసన మండలి సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు. ఇది కేంద్ర ప్రభుత్వం లోని రాజ్యసభ వలె ఉంటుంది. శాసనమండలిని మొదటి సారిగా నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు తొలగించారు. కారణం అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సభ్యులు అధికంగా శాసనమండలిలో ఉండడం వల్ల ప్రభుత్వం బిల్లును శాసన మండలి ఆమోదించేది కాదు, దానితో నందమూరి తారక రామారావు అసహనానికి గురై శాసనమండలిని తొలిసారిగా తొలగించారు. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు తిరిగి మళ్ళీ శాసనమండలిని ప్రవేశపెట్టాలని శాసనసభలో బిల్లు చేశారు, కానీ అది పట్టాలెక్కలేదు. కానీ 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు తిరిగి శాసనమండలిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినా, రెండు తెలుగు రాష్ట్రాలలో శాసనమండలి కొనసాగుతోంది. అసలు మండలి రద్దు అంత తేలిక వ్యవహారం కాదు. ముందుగా శాసనసభలో బిల్లు చేసి దానిని కేంద్రానికి పంపాలి. కేంద్రంలో లోక్సభ రాజ్యసభ ఆమోదించిన రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళిన తర్వాత దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే శాసన మండలి రద్దు అవుతుంది. అదేవిధంగా శాసన మండలి ఏర్పాటు చేయాలన్న ఇదే పద్ధతి పాటించాలి. శాసనమండలిని రాజ్యాంగ కర్తలు మేధావులు కోసం ఏర్పాటు చేశారు, కానీ ప్రస్తుతం రాజకీయ నాయకులు దీన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా వాడుకుంటున్నారు.
భారతదేశం |
ఈ వ్యాసం భారతదేశ రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం. |
|
|
|