ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా లోని నగరం From Wikipedia, the free encyclopedia
విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ పెద్ద నగరం. ఇది ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా నది ఒడ్డున ఉంది, దీనికి పడమర సరిహద్దుగా ఇంద్రకీలాద్రి పర్వతం, ఉత్తర సరిహద్దుగా బుడమేరు నది కలిగి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక, రాజకీయ, రవాణా, సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తోంది. మద్రాసు-హౌరా, మద్రాసు-ఢిల్లీ రైలు మార్గాలకు విజయవాడ కూడలి. విజయవాడకు ప్రస్తుత నామం, ఇక్కడి అధిష్టాన దేవత కనక దుర్గ ఆమ్మవారి మరో పేరు విజయ (విజయవాటిక) నుండి వచ్చింది. ఎండాకాలంలో మండిపోయే ఇక్కడి ఎండలను చూసి కట్టమంచి రామలింగారెడ్డి ఇది బెజవాడ కాదు, బ్లేజువాడ అన్నాడట. [ఆధారం చూపాలి]
విజయవాడ | |
---|---|
Nickname: విక్టరీ ప్లేస్ - విజయ వాటిక | |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో విజయవాడ ప్రాంతం | |
Coordinates: 16.5193°N 80.6305°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా(లు) | ఎన్టీఆర్ |
Named for | విజయం |
Government | |
• Type | స్థానిక స్వపరిపాలన |
• Body | విజయవాడ నగర పాలక సంస్థ |
విస్తీర్ణం | |
• నగరం | 61.88 కి.మీ2 (23.89 చ. మై) |
• Metro | 8,603.32_km2 కి.మీ2 (Formatting error: invalid input when rounding చ. మై) |
• Rank | 2వ <large>(in state) |
Elevation | 23 మీ (75 అ.) |
జనాభా (2011)[3] | |
• నగరం | 10,48,240 |
• Rank | భారతదేశంలో 27వ ఆంధ్రప్రదేశ్ లో 2వ |
• జనసాంద్రత | 16,939/కి.మీ2 (43,870/చ. మై.) |
• Metro | 58,73,588 |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+05:30 (IST) |
PIN | 520 XXX |
టెలిఫోన్ కోడ్ | +91–866 |
Vehicle registration | AP–16 (AP 17, AP 18 and AP 19 reserved) |
మహాభారతంలో పాండవులు వనవాసానికి దారుకావనానికి వచ్చినప్పుడు వేదవ్యాసుని సలహా మేరకు శివుని గూర్చి తపస్సు చేసి, పాశుపతాస్త్రాన్ని సంపాదించడానికి అర్జునుడిని ఎన్నుకుంటారు. ఇంద్రకీలాద్రిపై ఘోరమైన తపస్సుచేయగా, శివుడు పరీక్షించడానికి నిర్ణయించాడు. ఆ పరీక్ష మేరకు, మాయా మృగాన్ని ఒకదాన్ని సృష్టించి అర్జునుడు, తాను ఒకేసారి దాన్ని బాణాలతో కొట్టేలా చేస్తాడు. ఆ వేట నాదంటే నాథని తగవు ప్రారంభమై అది యుద్ధంలోకి దిగుతుంది. చివరకు శివుడు తనతో సమానంగా యుద్ధం చేసిన అర్జునుడి వీరత్వానికి, ఘోరమైన తపస్సుకు మెచ్చి పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు.[4]
అర్జునుడు తపస్సుచేసిన ఇంద్రకీలాద్రి పర్వతం విజయవాడలో నేడు కనకదుర్గ ఆలయం కొలువైన చోటనే స్థలపురాణం ప్రాచుర్యంలో ఉంది. 11వ శతాబ్దిలోనూ, బహుశా 12వ శతాబ్దిలోనూ వేసిన రెండు శాసనాలు విజయవాడకు ఈ స్థలపురాణాన్ని ఆపాదిస్తున్నాయి. కవిత్రయం వారు తమ ఆంధ్ర మహా భారత ప్రస్తావనలో ఇదేమీ చెప్పకపోవడంతో పాటు ఇతర పురాణాధారాల్లోనూ దీనికి మూలాలు లభించవు. ఇలా సాహిత్యాధారాలు లోపించి కేవలం రెండు శాసనాల ఆధారంగా చలామణి అవుతున్న ఈ కథ ప్రజల నమ్మకాల్లో మాత్రం స్థానం బాగా సంపాదించుకుంది.[5]
విజయవాడ అన్న పేరు ఇటీవల ప్రాచుర్యం చెందగా పూర్వం నుంచీ బెజవాడ అన్న పేరు ఉంది. ఇక్కడి శాసనాల్లో ప్రాచీనమైన యుద్ధమల్లుని శాసనం, కొండవీడులోని మరో శాసనం ఈ ప్రాంతాన్ని బెజవాడగానే పేర్కొన్నాయి.[6] ఈ రెండు పేర్లలో ఏది ఎలా వచ్చిందన్నదానిపై పలు కథలు, సిద్ధాంతాలు ఉన్నాయి.
అర్జునుడు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శివునికై తపస్సుచేసి, కిరాతరూపంలోని శివునితో పోరాడాడని చెప్పే స్థలపురాణం ఉంది. దీనితో విజయుడన్న అర్జునుడి పేరుమీదుగానే విజయవాడ వచ్చిందని చెప్తారు.[5] అర్జునుడి పాశుపతాస్త్ర సంపాదన ఇక్కడే జరిగిందనే స్థలపురాణం వివరించే ఓ శాసనంలో ఈ ప్రాంతాన్ని వెచ్చవాడ అని వ్యవహరించారు. జల మార్గంలోనూ, భూమార్గంలోనూ కూడా కీలకమైన కూడలిగా నిలిచిన విజయవాడ ప్రాచీన కాలం నుంచీ వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఈ కారణంగా వెచ్చాలు అధికంగా లభించే ప్రాంతం కావడంతో వెచ్చవాడ అయిందని జాన్సన్ చోరగుడి అభిప్రాయపడ్డాడు.[7]
బెజవాడ అన్న పేరు బ్లేజ్ వాడ నుంచి వచ్చిందనీ, విపరీతమైన ఎండలు ఉండడంతో దీన్ని బ్రిటీష్ వారు బ్లేజ్ వాడ అని పిలవగా, పిలవగా జనవ్యవహారంలో బెజవాడ అయిందనీ కొందరు చెబుతారు. అయితే ఇది జన నిరుక్తే. బ్రిటీష్ వారి రాకకు వేల సంవత్సరాల క్రితమే దీనికి బెజవాడ అన్న పేరు శాసనాల్లో కనిపిస్తూ ఉంది. నిజానికి విద్యావేత్త, రాజకీయవేత్త కట్టమంచి రామలింగారెడ్డి ఒకమారు బెజవాడను బ్లేజ్ వాడ అని మార్చి చమత్కరించగా, ఆ చమత్కారం జన నోళ్ళలో నాని ఈ కథగా తయారైంది.
విజయవాడ విష్ణుకుండినుల్లో కొందరి రాజధానిగా ఉండేది. సా.శ.565 ప్రాంతంలో విష్ణుకుండిన వంశ రాజైన మాధవ వర్మ విజయవాడ కేంద్రంగా పరిపాలించాడు. అతని కుమారుడు నగరంలో రథం నడుపుతూ బాటపక్కన చింతచిగురు అమ్మే ముసలమ్మ కుమారుడిపై రథాన్ని ఎక్కించాడు. ఆ పిల్లాడు చనిపోయాడు. మహారాజు పుత్రవాత్సల్యాన్ని పక్కనపెట్టి శిక్షగా అదే రథం మీద ఎక్కించి రాకుమారుడిని చంపాలని ఆజ్ఞాపించాడు. మల్లీశ్వరాలయంలో బయటపడ్డ విష్ణువర్ధనుని శాసనం, మరోచోట లభించిన కల్యమబోయ శాసనం, విజయనగరం జమీందారుల వంశ చరిత్ర, మరికొన్ని చాటువులు ఈ సంఘటనను పేర్కొంటున్నాయి.[8][9]
అక్కన్న, మాదన్న గుహలు, మొగల్రాజపురం గుహలు 3, 4 శతాబ్దాలకు చెందినవి. ఇవి బౌద్ధారామాలనీ, తర్వాతి కాలంలో శైవులకు ఆలవాలమై శైవ దేవతా ప్రతిమలు అక్కడ ఏర్పడ్డాయని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. మరికొందరు ఆ వాదాన్ని తిరస్కరిస్తూ ఇవి హిందూ సంబంధ ఆరాధనా స్థలాలేనని వాదిస్తున్నారు. వీటిని విజయవాడను పరిపాలించిన శాలంకాయనులు కానీ, కృష్ణకు దక్షిణాన పాలించిన పల్లవులు కానీ నిర్మించారని భావిస్తున్నారు.[10] సా.శ. 739లో చైనీస్ యాత్రికుడు యుఁఆన్ చ్వాంగ్ బెజవాడను సందర్శించాడు. ఈ నగరం తెనకచక రాజ్యంలో భాగంగా ఉండేదని రాసుకున్నాడు. ఈ తెనకచక అంటే ధాన్యకటకానికి రూపాంతరం. యుఁఆన్ చ్వాంగ్ ఇక్కడ బెజవాడ, సీతానగరం, ఉండవల్లి కొండల మీద గుహల్లో ఎందరో బౌద్ధ భిక్షువులు ఉండేవారని, సాయంత్రం అయితే అక్కడ వెలిగించిన దీపాల వెలుగులో బెజవాడ ప్రాంతమంతా కన్నుల పండువగా ఉండేదని రాసుకున్నాడు. ఇంద్రకీలాద్రి కొండమీద బౌద్ధ భిక్షువులు నివసించేందుకు కొండను తొలిపించి పలు చావడులు, వసారాలు నిర్మించి ఉన్నాయని రాశాడు.[11] ఇక్కడి బౌద్ధ తంత్రజ్ఞుల నుంచి మాయలు, మహత్తులు ప్రసాదిస్తాయని నమ్మే ధారణ మంత్రాలను అతను నేర్చుకున్నాడు.[12] నదీతీరాన సకల వ్యాధులను హరింపజేసే వనౌషధాల పర్వతం ఉండేదనీ, దానిని వైద్యులు వినియోగించుకునేవారనీ, ఇక్కడ పర్వత సానువుల్లో సంచరించే సాధువులకు బంగారం తయారుచేసే హేమవిద్య ఉండేదనీ రాశాడు.[13]
వేంగి చాళుక్యుల కాలంలో విజయవాడ రాజకీయంగానూ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇదే సమయంలో విజయవాడ మీద రాష్ట్రకూటులు పలు దండయాత్రలు చేశారు. నగరం యుద్ధాల్లో చిక్కుబడిపోయి ఉండేది. పలుమార్లు చేతులు మారింది. సా.శ.927లో వేంగి చాళుక్య రాజు రెండవ యుద్ధమల్లుడు రాష్ట్రకూటులతో ఒప్పందం చేసుకుని వారి సహాయంతో విజయవాడను తిరిగి ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత చోళులకు, చాళుక్యులకు మధ్య యుద్ధాలతో విజయవాడ రణరంగంగా మారింది. 70 సంవత్సరాల పాటు సాగిన పోరాటాలు, యుద్ధాల్లో విజయవాడ అరాచకంగా ఉండేది. పౌరులకు శాంతి భద్రతలు కరువై జీవితం దుర్భరమైంది. సా.శ.999లో చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు చాళుక్యులతో జరిగిన యుద్ధంలో నిర్ణయాత్మకంగా జయించి, విజయవాడను ఆక్రమించాడు. రాజరాజ చోళుడు మొదటి శక్తివర్మను విజయవాడలో తనకు సామంత రాజుగా నియమించాకా ఈ రాజకీయ అనిశ్చితి, అరాచక పరిస్థితులు తొలగిపోయాయి. వేంగి చాళుక్యులు ఆ ఓటమితో తమ రాజధానిని రాజమహేంద్రవరానికి మార్చారు.[10]
11వ శతాబ్ది నుంచి విజయవాడ రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోయింది. అయితే వాణిజ్య కేంద్రంగా మాత్రం అభివృద్ధి చెందింది. పురాతత్వ శాస్త్రవేత్త సీవెన్ ప్రకారం విజయవాడ ప్రాంతంలో క్రీ.పూ.11 శతాబ్ది నాటివే 47 శాసనాలు లభించాయి. ఇవి కాక పరిసర ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల ప్రకారం చూసినా వెయ్యేళ్ళ క్రితమే ఇక్కడ విశాలమైన నగరం ఉండేదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. మొదటి నుంచీ కృష్ణా నది మీదుగా సముద్ర మార్గంలోకి సాగే జలమార్గంలోనూ, కళింగం (ఒడిశా), మధ్యదేశం (మధ్యప్రదేశ్), మహారాష్ట్ర, కర్ణాటక, దక్షిణ ప్రాంతాల నుంచి వచ్చే భూమార్గాల్లోనూ కూడలిగా ఉండేది. ఈ కారణంగా బెజవాడ కీలకమైన వ్యాపార కూడలిగా అభివృద్ధి చెందింది.[7] ఆంధ్రదేశంలోని ప్రధానమైన నగరాలు, రేవు పట్టణాలను కలుపుతూ ఉండే రాచబాటలను కలుపుతూ, కీలకమైన వాణిజ్య కేంద్రాలుగా వెలిగిన పట్టణాల్లో బెజవాడ కూడా ఉండేది.[14]
వ్యాపారపరంగా విజయవాడకు ఎంత ప్రఖ్యాతి ఉన్నా 11 శతాబ్ది నుంచి ఏ సామ్రాజ్యానికీ రాజధానిగా ఉండేది కాదు. కాకతీయులు, రెడ్డి రాజులు, గజపతులు వంటి పలువురు శక్తిమంతులైన రాజ్యాలు, సామ్రాజ్యాలు విజయవాడను ఒక వ్యాపార కేంద్రంగానే పరిగణించేవారు. రాజకీయంగా ప్రాముఖ్యత ఉండేది కాదు.[10] పలువురు సామంత రాజుల పరిపాలనలో నగరం ఉండేది. 15వ శతాబ్దిలో ఆంధ్ర క్షత్రియులులో వశిష్ట గోత్రానికి చెందిన పూసపాటి రాజ వంశస్థులు విజయవాడ నగరాన్ని పాలించారు.[15]
గజపతులపై తీరాంధ్ర ప్రాంతం మీదుగా దండయాత్రకు తరలివెళ్లినప్పుడు శ్రీ కృష్ణదేవ రాయలు విజయవాడలో విడిది చేశాడు. సమీపంలోని శ్రీకాకుళ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువును సందర్శించి, ఆంధ్ర విష్ణువు ఆనతి మేరకు ఆముక్తమాల్యద కావ్యాన్ని ప్రారంభించినట్టుగా అవతారికలో రాసుకున్నాడు.[16]
విజయవాడ 16వ శతాబ్ది తర్వాత పూర్తిగా తన ప్రాధాన్యత కోల్పోయింది. 2 శతాబ్దాల పాటు తన పూర్వ వైభవం పోగొట్టుకుని కొద్దిపాటి ప్రాంతానికి పరిమితమైపోయింది. ఈస్టిండియా కంపెనీ పాలనా కాలంలో 1832లో సంభవించిన తీవ్రమైన కరువు తర్వాత ఆర్థర్ కాటన్ 1839లో కృష్ణా నదిపై ఆనకట్ట నిర్మించి నదీ జలాలతో సేద్యాన్ని అభివృద్ధి చేయాలని నివేదిక తయారుచేశాడు. ఈ నివేదిక 1850లో లండన్లోని కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ల ఆమోదంతో పాటుగా అనువైన స్థలాన్ని ఎంపికచేయమన్న ఆదేశం వెలువడింది. కాటన్ నేటి పలనాటి ప్రాంతంలోని గనికొండ ప్రాంతంలో, ముక్త్యాలలో, ఇబ్రహీంపట్నంలోనూ పరిశీలించి, వాటన్నిటినీ పక్కనపెట్టి తుదకు విజయవాడను బ్యారేజికి అనువైన స్థలంగా ఎంపిక చేశాడు. 19వ దశకం మధ్యలో జరిగిన ఈ పరిణామం తిరిగి విజయవాడకు ప్రాధాన్యత తెచ్చిపెట్టడానికి ఒక ముఖ్యకారణమైంది.[17]
1940ల వరకూ విజయవాడ వన్ టౌన్ ప్రాంతమంతా చిన్న చిన్న అడవులు, వాగులు, కొండలతో జనావాసాలకు వీల్లేకుండా ఉండేది.1949 తర్వాత వన్ టౌన్ జనసాంద్రత హఠాత్తుగా పెరిగిపోయింది. 1947 తర్వాత తెలంగాణలో జరుగుతున్న సాయుధ పోరాటం, రజాకార్ల అకృత్యాల నేపథ్యంలో ఎందరో తెలంగాణ ప్రాంతం నుంచి తరలివచ్చి విజయవాడలో స్థిరపడ్డారు. ఆ దశలో కమ్యూనిస్టు నాయకుల ప్రాబల్యంలో కొండలు తొలచి, అడవులు కొట్టి మరీ వన్ టౌన్లో జనావాసాలు ఏర్పాటుచేసుకున్నారు.[18]
1953లో మద్రాసు నుంచి ఆంధ్ర ప్రాంతాలు విడదీసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసేప్పుడు తాత్కాలిక రాజధానిగా విజయవాడను నిర్ణయించాలని ప్రతిపాదన వచ్చింది. ప్రధానంగా విజయవాడపై రాజకీయంగా పట్టుసాధిస్తున్న కమ్యూనిస్టులు విజయవాడను కానీ, విజయవాడ-గుంటూరు కానీ రాజధాని చేయాలని ప్రతిపాదించగా ఒక్క ఓటు తేడాతో ప్రతిపాదన వీగిపోయింది.[19] ఆంధ్ర రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిగా కర్నూలు మూడేళ్ళు, ఆపైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాదు 1956 నుంచి 58 ఏళ్ళు కొనసాగాయి. 19, 20వ శతాబ్దాల్లో కృష్ణా జిల్లా కేంద్రంగా కూడా వందల ఏళ్ళుగా ఓడ రేవు పట్టణంగా కీలక స్థానంలో ఉన్న మచిలీపట్నమే ఉండేది కానీ విజయవాడ కాలేదు. విజయవాడ మాత్రం రాజధానిగానో, జిల్లా కేంద్రంగానో లేకున్నా వ్యాపార, సాంస్కృతి, రాజకీయ, మీడియా కేంద్రంగా అభివృద్ధి చెందింది.
2000 నాటికే కోస్తాలో పలు రంగాలకు కేంద్రంగా ఉంది. 2014లో తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి కోస్తా-రాయలసీమ ప్రాంతాలతో ఆంధ్రప్రదేశ్ మిగలడంతో విజయవాడ గుంటూరులకు దగ్గరగావున్న అమరావతి రాజధాని అయింది.
భౌగోళికంగా విజయవాడ నగరం కృష్ణానది తీరాన, చిన్న చిన్న కొండల నడుమ విస్తరించి ఉంది. ఈ కొండలు తూర్పు కనుమలలో భాగాలు. కృష్ణానదిపై కట్టిన ప్రకాశం బ్యారేజి నుండి ఏలూరు కాలువ, బందరు కాలువ, రైవిస్ కాలువ నగరం మధ్యనుండి వెళతాయి. నగరానికి మరో దిశలో బుడమేరు ఉంది. ప్రకాశం బ్యారేజి వల్ల ఏర్పడిన సరస్సు దక్షిణాన బకింగ్హాం కాలువ మొదలవుతుంది. నగరంలోను, చుట్టు ప్రక్కల నేల అధికంగా సారవంతమైన మెతకనేల.
నగరంలో వేసవి తీవ్రంగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 22° - 49.7°సెం. మధ్య ఉంటాయి. చలికాలం ఉష్ణోగ్రత 15°- 30°మధ్య ఉంటుంది. ఈ ప్రాంతంలో వర్షపాతం అధికంగా నైఋతి, ఈశాన్య ఋతుపవనాలవల్ల కలుగుతుంది.
విజయవాడ నగర పశ్చిమ సరిహద్దులలో 11 కి.మీ. దూరన కొండపల్లి రిజర్వు అడవులు, 121.5 చ.కి.మీ. (30,000 ఎకరములు) విస్తీర్ణములో గలవు. ఈ అడవులు విజయవాడకు 'పచ్చని ఊపిరి' లాంటివి. ఈ అడవులలో చిరుతపులులు, అడవి కుక్కలు, నక్కలు, అడవి పందులు, తోడేళ్ళు మొదలగునవి ఉన్నాయి.[20]
సంవత్సరం | జనాభా | ±% |
---|---|---|
1871 | 8,206 | — |
1881 | 9,366 | +14.1% |
1891 | 20,224 | +115.9% |
1901 | 24,224 | +19.8% |
1911 | 32,867 | +35.7% |
1921 | 44,159 | +34.4% |
1931 | 60,427 | +36.8% |
1941 | 86,184 | +42.6% |
1951 | 1,61,198 | +87.0% |
1961 | 2,34,360 | +45.4% |
1971 | 3,44,607 | +47.0% |
1981 | 5,43,008 | +57.6% |
1991 | 8,45,756 | +55.8% |
2001 | 10,39,518 | +22.9% |
2011 | 14,91,202 | +43.5% |
1871 నుంచి, విజయవాడ పట్టణ పరిధికి చెందిన జనాభా వివరాలు ఈ విధముగా ఉంది
Sources: Rao, Kondapalli Ranga; 1. Rao, M. S. A. (1984). Cities and Slums: A study of a Squatters' Settlement in the City of Vijayawada. Concept Publishing Company. p. 12. |
జనాభాపరంగా ఆంధ్ర ప్రదేశ్లో విజయవాడ రెండవ పెద్ద నగరం. చదరపు కిలో మీటరుకు 31,200 జనసాంద్రతతో ప్రపంచంలో ఎక్కువ జనసాంద్రత గల నగరాలలో మూడవది.[21] 2011 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ పట్టణ జనాభా 1,021,806. దీనిలో పురుషుల సంఖ్య 524,918 స్త్రీల సంఖ్య 523,322, లింగనిష్పత్తి 997స్త్రీలు 1000 పురుషులకు ఇది జాతీయ సగటు 940 కంటే ఎక్కువ.[3][22] సగటు అక్షరాస్యత 82.59% (పురుషులు 86.25%; స్త్రీలు 78.94%) తో మొత్తం 789,038 అక్షరాస్యులున్నారు. ఇది జాతియ సగటు 73.00% కంటే ఎక్కువ.[3][23]
విజయవాడ లో మతం (2011) | ||||
---|---|---|---|---|
హిందువులు | 85.16% | |||
ముస్లింలు | 9.12% | |||
కైస్తవులు | 3.64% | |||
ఇతరులు | 1.59% |
నగరంలో వాడబడే ప్రధాన భాష తెలుగు.[24]
2011 జనగణన ప్రకారం నగరం (పరిసరాలలో నగరం పెరిగిన ప్రాంతాలతో కలిపి) జనాభా 11,43,232 కాగా, తెలుగు భాషీయులు 10,22,376, ఉర్దూ భాషీయులు 90,876. అత్యల్పంగా హిందీ, తమిళ, ఒడిషా, గుజరాతీ, మరాఠీ భాషీయులు కూడా ఉన్నారు.[25]
అదే జనగణన ప్రకారం హిందువులు 9,73,612 (85.16%), ముస్లింలు 1,04,206 (9.12%), క్రైస్తవులు41,557 (3.64%), జైనులు 5,722 (0.50%), మతం వివరాలు తెలపని వారు 18,135 (1.59%).[26]
కీలకమైన భౌగోళిక స్థానంలో నెలకొనివుండడంతో విజయవాడ పలు వ్యాపారాలకు కేంద్రమైంది. నీటి పారుదల సౌకర్యాలు పెరిగి వ్యవసాయ ప్రధాన జిల్లాలుగా రూపుదిద్దుకున్న కోస్తాంధ్ర జిల్లాలకు రవాణాపరంగా కేంద్రమైన విజయవాడ సహజంగానే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ అయింది.
చెరకు, వరి, మామిడి పంటల ఉత్పత్తులకు ఇది చాలా పెద్ద వాణిజ్యకేంద్రం. ఇందుకు తోడు వినియోగదారుల అవసరాలను తీర్చే వర్తకం, రవాణా, ప్రయాణ, విద్య, వైద్య సదుపాయాలు నగరం వ్యాపారానికి పట్టుకొమ్మలు. ఇంకా మోటారు వాహనాల విడిభాగాలు (ఆటోనగర్), ఇనుప సామాను, గృహనిర్మాణ సామగ్రి, దుస్తులు తయారీ, మరకొన్ని చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. అధికంగా వ్యాపారం పాత నగర భాగం (వన్ టౌన్), కాళేశ్వరరావు మార్కెట్ లలో జరుగుతుంది. గవర్నర్ పేట, బీసెంట్రోడ్లు దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర గృహ వినియోగ వస్తువుల వ్యాపారానికి కేంద్రాలు. లబ్బీపేట, ఎమ్.జి.రోడ్లలోను, మరికొన్ని చోట్ల పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సులు వెలిశాయి
తెలుగు సినిమా నిర్మాణం మొదట మద్రాసులో, తర్వాత హైదరాబాద్ లో కేంద్రీకృతమై ఉన్నా, తొలి నుంచీ పంపిణీ వ్యవస్థకు విజయవాడ కేంద్రంగా నిలిచింది. రెండు దశాబ్దాల పాటు ఇబ్బడిముబ్బడిగా తెలుగు సినిమా పంపిణీ వ్యాపారం జరిగింది. నవయుగ పిక్చర్స్, పూర్ణా పిక్చర్స్, అన్నపూర్ణా ఫిలింస్, లక్ష్మీ ఫిలింస్, లక్ష్మీ చిత్ర, రాజశ్రీ, విజయా వంటి పంపిణీ సంస్థలన్నీ ఇక్కడ నెలకొన్నాయి.
విజయవాడ నగరం తెలుగు ముద్రణ, ప్రచురణ రంగాలకు ముఖ్యకేంద్రం. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో (ముఖ్యంగా నాలుగు జిల్లాలకు) హోల్సేల్ వ్యాపారం విజయవాడనుండి పెద్దయెత్తున జరుగుతుంది. వస్త్రాలు, ఇనుప సామానులు, పప్పుధాన్యాలు, ఎరువులు, మందులు వంటివి ఇక్కడినుండి సరఫరా చేయబడుతాయి.
విజయవాడ నగర పౌర పరిపానా బాధ్యతలు విజయవాడ నగర పాలక సంస్థవి. భారతదేశంలోకెల్లా ఐఎస్ఓ 9001 సర్టిఫికేషన్ సాధించిన స్థానిక సంస్థల్లో ఇది మొట్టమొదటిది.[27] 1888 ఏప్రిల్ 1న పురపాలక సంఘం ఏర్పడగా, 1960లో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ హోదా లభించింది. 1981లో నగర పాలక సంస్థ ఏర్పడింది. 2012 నాటికి నగరపాలక సంస్థ 61.8 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది.[28] 2017లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకుని గ్రేటర్ విజయవాడ (మెట్రో) ఏర్పాటుచేసింది.[29] దాని పరిధి 160 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది.[30]
మెట్రోనగరంలో విజయవాడ నగరపాలకసంస్థతో పాటు కలిసిపోయిన అంబాపురం, బుద్దవరం, దోనేటికూరు, ఎనికేపాడు, గంగూరు, గన్నవరం, గొల్లపూడి గ్రామాలు, మెట్రోపాలిటన్ ప్రాంతంలో గూడవల్లి, జక్కంపూడి, కానూరు, కీసరపల్లి, నిడమానూరు, నున్న, పాతపాడు, పెనమలూరు, ఫిర్యాదీనైనవరం, పోరంకి, ప్రసాదంపాడు, రామవరప్పాడు, తాడిగడప, యనమలకుదురు వుంటాయి.[31]
విజయవాడ నగరం ఎన్టీఆర్ జిల్లా పరిపాలనా కేంద్రం. విజయవాడ నగరం పరిపాలనా బాధ్యతలు విజయవాడ నగరపాలక సంస్థ (మునిసిపల్ కార్పొరేషన్)చే నిర్వహించబడుతాయి.[32]. నగరంలోని 63 వార్డులనుండి ఒక్కో కార్పొరేటర్ ఎన్నికోబడుతారు. నగరానికి ఒక మేయర్ను ఎన్నుకొంటారు. ప్రభుత్వం ఒక మునిపల్ కమిషనర్ను నియమిస్తుంది. విజయవాడ నగరంలో ఒక సబ్-కలెక్టర్ ఉంటారు. నగరపాలక సంస్థ కార్యనిర్వహణ బాధ్యతలు మున్సిపల్ కమీషనర్ వి. కమీషనర్ కింద రెవెన్యూ, ఇంజనీరింగ్, మంచినీటి సరఫరా, క్రీడలు మొదలైన 13 విభాగాల అధికారులు పనిచేస్తారు.[33] వి.జి.టి.ఎం.వుడా విజయవాడ ద్వారా నగరంలో పచ్చదనం పార్కులు రహదారులు ఫ్లై ఓవర్లు నిర్మించబడ్డాయి.
నగరంలో నాలుగు (ఎస్టీపీ) సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. వీటితో పాటు శివారు ప్రాంతాల్లో మరికొన్ని సీవేజి ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన సంప్లకు వివిధ ప్రాంతాల్లోని మురుగునీరు వచ్చి చేరుతుంది. సంప్ల నుంచి ఎస్టీపీలకు మురుగునీరు చేరుతుంది.అక్కడ మురుగునీరు శుద్ధి అవుతోంది. నగరంలో సాగునీటిని విడుదల చేసే కాలువలు ప్రధానంగా మూడు ఉన్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల నుంచి డ్రెయినేజి నీరు ఈ కాలువలలోకి పోతోంది. డ్రెయినేజి కాలవలలోకి కలిసే విధానాన్ని రూపుమాపి, మురుగునీరంతా ప్రాజెక్టుకు మళ్ళిస్తారు.నగరంలోని మురుగునీటినంతటిని సంగ్రహించి పలు దశ ల్లో గ్రేడింగ్, ప్యూరిఫయింగ్ చేస్తారు. ముగుగునీరంతా పూర్తిగా శుద్ధి అయి రిజర్వాయర్లోకి వెళుతుంది. ఇక్కడ మళ్ళీ మంచినీటిని వివిధ దశల్లో శుభ్ర పరిచిన తర్వాత ముడి నీరుగా మరొక రిజర్వాయర్లోకి మళ్ళిస్తారు. చివరకు స్వచ్ఛమైన నీటి దశకు తీసుకొస్తారు.ఆ నీటిని గార్డెన్ల పెంపకానికి, పంట పొలాలకు, ఇండస్ట్రీలకు ఉపయోగిస్తారు.[34]
విజయవాడ 1940ల నుంచీ కొన్ని దశాబ్దాలు కమ్యూనిస్టుల కంచుకోటగా కొనసాగింది.[35]
విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్.
నగరంలో 1,264.24 కి.మీ. (785.56 మై.) రహదారులున్నాయి.[36] వీటికి తోడు వందలాది ప్రైవేటు బస్సులు హైదరాబాదుకు, ఇతర ప్రధాన నగరాలకు నడుస్తుంటాయి. నగర ప్రయాణంలో, బందర్, ఏలూరు మరియూ రైవేస్ కాలవలపై ఉన్న 16 వంతెనలు కీలకం.[37] నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఉడా చేపట్టిన ఇన్నర్రింగ్రోడ్డు నైనవరం గేటు (వైవీరావు ఎస్టేట్స్) నుంచి పైపులరోడ్డు సెంటర్ వరకు ప్రారంభించిన తొలి విడత పనులు]హైదరాబాద్, కోల్కతా జాతీయ రహదారికి అనుసంధానంగా చేపట్టిన ఇన్నర్రింగ్రోడ్డు రెండవ విడత కూడా పూర్తయి తే నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు శివారు ప్రాంతాలకు మహర్దశ వరించినట్లే. పాయకాపురం నుంచి రామవరప్పాడు రింగ్రోడ్డు పూర్తి చేయాల్సిఉంది.. హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్ళే వాహనాలు గొల్లపూడి, నైనవరం ఫ్లై ఓవర్ మీదుగా ఇన్నర్ రింగ్రోడ్డుకు చేరి నగరంతో సంబంధం లేకుండా రామవరప్పాడు రింగురోడ్డుకు చేరుకుంటాయి. కోల్కతా నుంచి హైదరాబాద్కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి. నగరానికి బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు ప్రధాన రహదారులు.[38]
జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 65, నగరాన్ని ఇతర రాష్ట్రాలతో కలుపుతుంది.[39][40] జాతీయ రహదారి 30, చత్తీస్గఢ్లొని జగదల్పుర్ని నగర సమీపంలోని ఇబ్రహీంపట్నం వరకు కలుపుతుంది.[40] నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు, ఇన్నర్ రింగు రోడ్డు, జాతీయ రహదారి 16, 65కు అనుసంధానంగా అయ్యి ఉంది. హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్ళే వాహనాలు గొల్లపూడి, నైనవరం ఫ్లై ఓవర్ మీదుగా ఇన్నర్ రింగ్రోడ్డుకు చేరి నగరంతో సంబంధం లేకుండా రామవరప్పాడు రింగురోడ్డుకు చేరుకుంటాయి. కోల్కతా నుంచి హైదరాబాద్కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి.[41]
గతంలో తాడేపల్లి మీదుగా కృష్ణానది కరకట్ట మీదుగా బైపాస్ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి బదులుగా ప్రతిపాదిస్తున్న బైపాస్ రోడ్డు మంగళగిరి ఎన్.ఆర్.ఐ. కళాశాల నుంచి ప్రారంభమై పెదవడ్లపూడి, నూతక్కి గ్రామాల మీదుగా కృష్ణానది దాటి విజయవాడ, మచిలీపట్నం (ఎన్.హెచ్-9) దాటి ఎన్.హెచ్-5లో నిడమానూరు వద్ద కలుస్తుంది.
సిటీ బస్సులు, ఆటోలు ప్రాథమికంగా నగర అంతర్గత ప్రజా రవాణా సేవలు.[42] ఇవి కాకుండా మోటారు బైకులు, రిక్షాలు, సైకిళ్ళు కూడా రవాణా వ్యవస్థలో భాగం.[42]: 37, 44 పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను రోడ్డు, రైలు రవాణాకు సంబంధించిన మౌలిక సదుపయాలు.[43] ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన విజయవాడ సిటీ డివిజణ్, రొజూ 400 వరకు బస్సులను నడుపుతూ, 300,000 మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంది.[44] విజయవాడ బీ.ఆర్.టి.ఎస్ మార్గాలు వేగవంతమైన సిటీబస్సు ప్రయాణానికి సహకరిస్తాయి.[45] పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లొ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ప్రదాన కార్యాలయం ఉంది.[46] పండిట్ నెహ్రూ బస్ స్టేషను, దేశంలోనే నాలుగవ అతి పెద్ద బస్సు టెర్మినల్.[47]
678,004 నాన్-ట్రాంస్పోర్ట్, 94,937 ట్రాంస్పోర్ట్ వాహనాలు ఉన్నాయి.[48] లారీలు వంటి భారీ వాహనాలు సరుకు రవాణాకు వాడుతారు, ఇది దేశంలో 18% వాటా కలిగి ఉంది.[49] 27,296 ఆటోలు, తక్కువ దూరం ప్రయాణం కోసం, ప్రతీ రోజు నగర రోడ్డ్ల పైన సేవలు అందిస్తున్నాయి.[48]
సబర్బన్ రైళ్ళు విజయవాడ నుండి గుంటూరు, తెనాలి వరకు సేవలు అందిస్తునాయి.[50][51] కొత్త సర్కులర్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించారు, ఇది రాజధాని అమరావతి వరకు ఉంటుంది.[52][53] విజయవాడ మెట్రో ప్రాజెక్టు రెండు కారిడార్లలో కడుతున్నారు.[54] విజయవాడ రైల్వే స్టేషన్ A1గా గుర్తింపు పొందింది,,[55] భారతీయ రైల్వేల్లో అత్యంత రద్ది జంక్షను.[56] విజయవాడ రైల్వే డివిజను ప్రదాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది.[57]
విజయవాడకు 19 కి.మీ. దూరంలో ఉన్న గన్నవరం దేశీయ విమానాశ్రయం నుండి హైదరాబాద్, బెంగుళూర్, చెన్నై, ముంబై, జైపూర్, వైజాగ్, తిరుపతి, ఢిల్లీ నగరములకు విమాన సౌకర్యము ఉంది.[58] 2017 మే 3న, విమానాశ్రయాన్ని ఆధునీకరించారు, అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు.[58] 2016-17 ఆర్థిక సంవత్సరంలో, 622,354 మంది దేశీయ ప్రయాణీకులు ప్రయానించారు, ఇది గత సంవత్సరంతొ పోలిస్తే 56.1% ఎక్కువ.[59] అదే ఆర్థిక సంవత్సరంలో, 10,333 విమానాలతో, 54.8% వృద్ధి నమోదు చేసింది.[60]
ఇక్కడ ఉన్న ఒకే ఒక విశ్వవిద్యాలయం ఎన్.టి.ఆర్.యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ దేశంలోనే మొదటి ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయంగా పేరొందింది. ఇంటర్మీడియట్ స్థాయిలో విజయవాడ రాష్ట్రంలో పెద్ద విద్యా కేంద్రంగా స్థానం సాధించింది. ఇబ్బడి ముబ్బడిగా స్థాపించబడిన ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీలు, ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ఇందుకు దోహదం చేశాయి.
సిద్ధార్థ పబ్లిక్ పాఠశాల విజయవాడ మొగల్రాజపురములో ఉంది. సిద్ధార్థ ఎకాడెమీ వారిచే 1977లో స్థాపించబడింది. వీరమాచినేని పద్దయ్య దానమిచ్చిన భూమిలో ప్రారంభమైంది.
సాధారణ ప్రభుత్వ వైద్యశాలని మరిన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలతో అత్యాధునిక ఆసుపత్రిగా తీర్చిదిద్దే ప్రతిపాదన కార్యరూపం దాల్చనుంది.[61] ప్రైవేట్ రంగంలో అత్యాధునిక ఆసుపత్రులున్నాయి.
ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేడియో శ్రోతలకు తెలుగు ప్రసారాలను అందించడంతో పాటు అందులో పనిచేసిన పలువురు సాహిత్యకారులు, కళాకారులకు విజయవాడను స్థిరనివాసం చేసింది. ఇది 1948 డిసెంబరు 1 న ప్రారంభించబడింది.[62] దీని భవనం జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరుబెట్టారు.[63][63] ఆకాశవాణి ప్రసారాలు విజయవాడ,[64] వివిధభారతి (రెయిన్ బౌ కృష్ణవేణి ఎఫ్ ఎమ్102.2MHz) .[65]
ఇవి కాక ప్రైవేట్ రంగంలో, రేడియో మిర్చి ఎఫ్ఎమ్ (98.3MHz), రెడ్.ఎఫ్.ఎమ్. (RED FM) (93.5MHz) ప్రసార కేంద్రాలున్నాయి.
దూరదర్శన్ సప్తగిరి విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్నది.
విజయవాడ నగర సంస్కృతిలో సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1921లోనే నగరంలో ప్రారంభమైన మారుతీ హాలుతో సినిమాల ప్రదర్శన ప్రారంభమైంది. దుర్గా కళామందిరం (1923), రామా టాకీసు (1929) వంటి సినిమా హాళ్ళు తెలుగు సినిమా టాకీలు ప్రారంభం కావడానికి ముందే విజయవాడలో వెలిశాయి. తెలుగు సినిమా రంగం ప్రారంభమయ్యాకా నిర్మాణ కేంద్రం కాలేకపోయినా పంపిణీ కేంద్రంగా విజయవాడ అభివృద్ధి చెందింది. దానితో పాటుగా తెలుగు సినిమా రంగంపై చర్చాగోష్టులు, సమావేశాలు, అభిమాన సంఘాలు, సినిమా పత్రికలు వంటివాటన్నిటికీ కూడా స్థానంగా నిలిచింది. తెలుగు సినిమాల్లో విజయవాడతోనూ, పరిసర ప్రాంతాలతో అనుబంధం ఉన్న ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి వంటి నటీనటులు మంచి పేరు సంపాదించారు. నగరంలో విజయవాడ ఫిలిం సొసైటీ ఏర్పడి ఉత్తమ చిత్రాలను ఆదరించేలా ప్రేక్షకుల్లో అభిరుచి పెంపొందించాలన్న లక్ష్యంతో చాలాకాలం పనిచేసింది. ఈ పరిణామాలన్నీ నగర జన జీవితంలో సినిమా ప్రభావం చూపడానికి దోహదపడ్డాయి.[66][67]
విశాలాంధ్ర విజయవాడ నుండి ప్రారంభమైన తొలి తెలుగు వార్తాపత్రిక.[68] 2013–14 వార్షిక ప్రెస్ నివేదిక ప్రకారం, విజయవాడనుండి వెలువడే పెద్ద, మధ్యమ వార్తాపత్రికలలో ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, సూర్య, ఆంధ్రప్రభ, వార్త, ప్రజాశక్తి, ఉదయ భారతం ఉన్నాయి. టీవీ ఛానెళ్ళు అభివృద్ధి చెంది వాటి స్థానాన్ని తీసుకునేవరకూ విజయవాడ నగరంలో పలు పత్రికల సాయంకాలం ఎడిషన్లు, కొన్ని ప్రత్యేకమైన సాయంకాలం పత్రికలు తాజా వార్తలు అందించేవి.[69]
విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచురితమయ్యే అనేక ప్రచురణల కేంద్రం. ఓ అంచనా ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచురితమయ్యే పుస్తకాలలో 90% పుస్తకాలు ఇక్కడినుండే ముద్రితం, ప్రచురితమౌతున్నాయి. విజయవాడ పుస్తక ఉత్సవం, ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. ఈ ఉత్సవం దేశంలోనే కోల్కతా తరువాత, రెండవ అతిపెద్ద ఉత్సవం. విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ, జయంతి,అరుణ ప్రచురణ సంస్థలు ఉన్నాయి.
విజయవాడలో పుస్తక ప్రచురణ సంస్థలు, పుస్తకాల షాపులు, గ్రంథాలయాలు సాహిత్య వాతావరణాన్ని కల్పించాయి. 1903లో ఇ.సుబ్బుకృష్ణయ్య ఆస్తిక పుస్తక భాండాగారం పేరిట గ్రంథాలయాన్ని స్థాపించాడు. 1916లో దీనిని బకింగ్ హాం పేటలోని శాశ్వత భవనంలోకి మార్చి, శ్రీ రామ్మోహన ధర్మ పుస్తక భాండాగారంగా పేరు మార్చారు. దీన్నే సాధారణంగా శ్రీ రామ్మోహన గ్రంథాలయంగా వ్యవహరిస్తారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని, జైల్లో మరణించిన వెలిదండ్ల హనుమంతరావు పేరుమీదుగా హనుమంతరాయ గ్రంథాలయం 1934 డిసెంబరు 2న ప్రారంభమైంది. చిరకాలం నుంచి ఈ గ్రంథాలయాలు నగరంలో సాంస్కృతిక కేంద్రాలుగా విలసిల్లాయి. హనుమంతరాయ గ్రంథాలయానికి అధ్యక్షులుగు నగరంలో పలువురు రాజకీయవేత్తలు, విద్యావేత్తలు వ్యవహరించి అభివృద్ధి చేశారు.[70]
విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాజకీయ కేంద్రంగా పేరొందింది.
ఈనగరంలో దాదాపు 20 ఐ.టీ. సంస్థలున్నాయి, 2006-07 ఆర్థిక సంవత్సరంలో ఇవి 42 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టాయి. ఆం.ప్ర.ఐ.ఐ.సి. సంస్థ గన్నవరంలో ఐ.టీ. పార్కు, ఎస్.ఇ.జెడ్. (స్పెషల్ ఎకనామిక్ జోన్) ఏర్పాటు చేసింది. వీటి నిర్మాణాలకోసం ఎల్.& టి. కంపెనీ కాంట్రాక్టు తీసుకుంది, దీని బడ్జెట్ 300 కోట్ల రూపాయలు. ఈ ఐ.టీ. పార్కులు దాదాపు 10,000 మంది ఐ.టీ. ప్రొఫెషనల్స్ కు ఉద్యోగావకాశాలు కలుగజేస్తుంది. ఇంకో ఐ.టీ.పార్కు, మంగళగిరిలో ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నవి.
విజయవాడ నగరంలో ప్రాచీన కాలం నుంచి బౌద్ధం, జైనం, తర్వాత శైవం వృద్ధిచెందాయి. విజయనగర సామ్రాజ్య పరిపాలన అనంతరం 16వ శతాబ్దం నాటికి కొంతమేరకు వైష్ణవాలయాలు కూడా ఉండేవి. రామ, రాఘవ, కృష్ణ ఆలయాలు, వాటి మాన్యాలు కూడా శాసనాల్లో కనిపిస్తాయి. ఏ సంక్షోభం కారణంగా ఆ వైష్ణవాలయాలు రూపుమాశాయన్న చరిత్ర కూడా లేకుండా అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. వైశ్యులు వైష్ణవాన్ని పుచ్చుకుని, దాని అభివృద్ధికి దానధర్మాలు చేయడం ప్రారంభించడంతో నగరంలో 19వ శతాబ్ది నుంచి తిరిగి వైష్ణవాలయాలు ఏర్పడడం కనిపిస్తుంది.[71] విజయవాడ జనాభాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ముస్లింలు ఉన్నారు. దాదాపు 15 శాతం అని 2000 నాటి ఒక అంచనా. 19వ శతాబ్దిలో విజయవాడ వన్ టౌన్లో సంఖ్యాధిక్యతే కాక సాంస్కృతిక ఆధిపత్యం కూడా ముస్లింలదే. షియా ముస్లింలకు సంబంధించిన పంజాలు, సూఫీలకు సంబంధించిన దర్గాలు విజయవాడ వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో కనిపిస్తాయి. ఆనాడు విజయవాడలో కీలకమైన ప్రాంతాల్లో ఆస్తుల్లో ఎక్కవ భాగం వీరివి. మొదట్లో బంగారు, వెండి దుకాణాలన్నీ వీరి చేతిలోనే ఉండేవి. కాలక్రమేణా ఆస్తులు చేతులు మారి, ముస్లింలు ప్రస్తుతం పాత ఇనుము, టైర్లు తిరిగి అమ్మకం, టైలరింగ్ వంటి వ్యాపారాల్లో ఎక్కువగా స్థిరపడ్డారు. ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉన్నా విజయవాడ ముస్లింల ఒకప్పటి సిరిసంపదలు వారిచేతిలో లేదని లంక వెంకటరమణ వ్యాఖ్యానించాడు. వీరు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్న విజయవాడ పశ్చిమ శాసన సభ నియోజక వర్గంలో రాజకీయంగానూ ప్రభావం చూపుతున్నారు.[72][73] సిక్ఖులూ నగరంలో నివసిస్తున్నారు. ఆటోనగర్ సమీపంలో ఒక కాలనీకి గురునానక్ కాలనీ అని పేరుపెట్టుకున్నారు. 2000 ప్రాంతంలో ఖల్సా 300 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నగరంలో వైభవోపేతంగా ఉత్సవాలు నిర్వహించారు.[74]
కనకదుర్గ అలయం, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు. రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమవి ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి.
ఇది ఆధునిక యుగంలో అపురూపమైన శిల్పకళతో తయారైన గొప్ప దేవస్ధానం. అమ్మవారి మూర్తి అపురూపమైన మరకత శిలతో (పచ్చ) చెక్కబడింది. అంతేకాక, ఆలయవు గోడలన్నీ రాతితో చెక్కబడి శ్రీచక్రం లోని వివిధ చక్రాలు, వాటిలోని దేవతలను అద్భుతంగా దర్శింపజేస్తూ ఉంటాయి. ఆలయ శిఖరం సుమేరు శ్రీచక్ర అకారంలో ఉంటుంది. అమ్మ వారి ముందు కూర్మం (తాబేలు) పై మాణిక్యం (కెంపు) తో చేసిన శ్రీచక్రం అలరారుతూ ఉంటుంది. 2002 లో గణపతి సచ్చిదానంద చే ఈ గుడి కుంభాభిషేకం, ప్రతిష్ఠ జరుపబడింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.