From Wikipedia, the free encyclopedia
మూస:జిష్ణుకుండినులు '''విష్ణుకుండినులు''' సామాన్య శకం 4వ శతాబ్దం నుంచి సామాన్య శకం 7వ శతాబ్దం వరకు దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని, కోస్తాంధ్ర జిల్లాలను పాలించారు. వంశస్థాపకుడు మహారాజేంద్రవర్మ (ఇంద్రవర్మ).[1] ఇతను తెలంగాణలోని ఇంద్రపాలనగరం (ఇంద్రపురి) రాజధానిగా పాలన ప్రారంభించాడు. మొదట దక్షిణ తెలంగాణ జిల్లాలలో పాలన ప్రారంభించి క్రమక్రమంగా తూర్పువైపు కృష్ణా-గోదావరి మధ్యప్రాంతాలను ఆక్రమించారు. శాతవాహనుల అనంతరము ఆంధ్రదేశమున అత్యధిక ప్రాంతమును పాలించిన రాజవంశమిదియే. విష్ణుకుండినుల వంశావళిని విశేషముగా శోధించిన శంకరనారాయణ ప్రకారము సా.శ.. 375 నుండి వంశస్థాపకుడు ఇంద్రవర్మ 25 సంవత్సరాలు పాలించాడు. తరువాత క్రమముగ మొదటి మాధవవర్మ, (సా.శ..400-422), మొదటి గోవిందవర్మ (సా.శ..422-462), రెండవ మాధవవర్మ (సా.శ..462-502), మొదటి విక్రమేంద్రవర్మ (సా.శ..502-570), ఇంద్రభట్టారకవర్మ (సా.శ..571-605), రెండవ విక్రమేంద్రభట్టారక (6005-672) పాలించారు. చివరగా మొదటి విక్రమేంద్రవర్మ రెండవ పుత్రుడగు నాలుగవ మాధవవర్మ సా.శ.. 713 వరకు పాలించాడు[2] 4వ మాధవవర్మ "జనాశ్రయఛందోవిచ్ఛితి" రచించాడు. ఇది తెలంగాణ నుంచి వచ్చిన మొదటి సంస్కృత లక్షణ గ్రంథం.
విష్ణుకుండినులలో పదునొకండు అశ్వమేధములను, క్రతుసహస్రములను, ఇతర యాగములనెన్నింటినో ఆచరించిన రెండవ మాధవవర్మ చాలా గొప్పవాడు. ఇతడు వాకాటకులతో సంబంధ బాంధవ్యములు నెరిపి రాజ్యాన్ని దృఢపర్చుకున్నాడు. ఇతన్ని త్రికూట మలయాధిపతి అంటారు. గుంటూరు జిల్లాలోని కోటప్ప కొండయే త్రికూట మలయం. ఇంద్రవర్మ పూర్వదేశాధిపతులతో పెక్కు యుద్ధాలు చేసి దక్షిణ కళింగాన్ని నిలుపుకున్నాడు.
రెండవ మాధవవర్మ తన వేల్పూరి శిలాశాసనములో అతని తండ్రి మొదటి గోవిందవర్మ "విష్ణుకుణ్ణి గోత్రోత్ప్రభవస్య" అని పేర్కొనినాడు. రెండవ విక్రమేంద్రవర్మ తుండి శాసనములో అతని తాత అయిన మొదటి విక్రమేంద్ర " విష్ణుకొండి హకాటక వంశద్వయాలంకృత ..." గాను "శ్రీవిష్ణుకుంణ్డ్యాంవయ మకుటచూడామణి" గాను వర్ణింపబడ్డాడు.దీనిని బట్టి నేలటూరి వెంకటరమణయ్య వంటి పరిశోధకులు ఇది "విష్ణుకుండిన్" వారి గోత్రానికి, వంశానికి సంబంధించినదిగా పేర్కొన్నారు. కొందరి అభిప్రాయములో వీరు ఎక్కడనుంచో ఆంధ్రదేశానికి వచ్చి స్థిరపడి కాలక్రమేణ పరిపాలకులయినారు.మరికొందరు, వీరు తెలుగుగడ్డపై పుట్టి, స్వశక్తిమీద అధికారంలోకి వచ్చినారని భావించారు. మొదటి వాదాన్ని ప్రప్రంచించిన వారిలో ఫ్రెంచి పండితుడు డూబ్రియల్. వాకటక వంశానికి, విష్ణుకుండినులకును గల బంధుత్వము, శ్రీశైల మాహత్యములో పేర్కొనబడిన ఒక గాథ ఇందుకు ఆధారముగా తీసుకున్నాడు.కాని ఈవాదాన్ని నేలటూరి పండితులు ఒక కాల్పనిక చారిత్రిక గాథగా త్రోసిపుచ్చారు. విష్ణుకుండినుల శాసనాలలో కనుపించు "శ్రీ పర్వతస్వామి ప్రాధాన్యత" అను మాటలను బట్టి వీరు వినుకొండ ప్రాంతమువారని భావరాజు వెంకటకృష్ణారావుగారు అభిప్రాయపడ్డారు. విష్ణుకుండిన్ అనునది వినుకొండకు సంస్కృతీ కరణమని భావరాజువారి భావన. శంకరనారాయణన్ అను ప్రఖ్యాత పరిశోధకుల అభిప్రాయము ప్రకారము శ్రీపర్వతములు అనగా- శ్రీ పర్వతమునకు చెందిన గొప్పరాజులని అర్ధము. ఈ శ్రీపర్వతమే విష్ణుకుండినులు ఇష్టదైవముగా అరాధించిన శ్రీశైలము. వీరికి చతుశాతకర్ణులకు సంబందం కలదని వీరి అభిప్రాయము. విష్ణుకుండినుల పుట్టుకను గురుంచి తెలిపే ఆధారాలు, శాతవాహనుల పతనాంతరం మధ్య డక్కను ప్రాంతాన్ని పరిపాలించిన వాకటక వంశ చరిత్రను పరిశీలించగా కనబడతాయి.మొదటి గోవిందవర్మ, విక్రమేంద్రవర్మ భట్టారక మినహా విష్ణుకుండినులందరూ శైవులే. మొదటివారు బుద్ధుని ఆరాధించారు.
విష్ణుకుండినుల రాజ్యము తూర్పున విశాఖపట్టణము మొదలుగ పశ్చిమాన తెలంగాణలోని కొల్లాపూర్ వరకును, నైరుతిన కీసర వరకు విస్తరించిఉన్నది. కీసరలో ఉన్న కేసరి రామలింగేశ్వరాలయం ఈ కాలంనాటిదే. విష్ణుకుండినులు శ్రీపర్వతస్వామి భక్తులు. వీరు బహువిధములైన క్రతువులు ఆచరించారు. సంస్కృత భాషను ఆదరించారు. వైదిక సంస్కృతికి పట్టుకొమ్మలై వేదవిద్యలు పోషించారు. 'ఘటిక' అను విద్యాస్థానాలు స్థాపించారు. విష్ణుకుండినులు మతసహనము గలవారు. ప్రజలలో అప్పటికి ఆదరణపొందుచుండిన బౌద్ధమతాన్ని ఆదరించారు. బౌద్ధవిహారాలు నిర్మించి వాటికి దానాలు చేశారు. గుహాలయములు నిర్మించి గుహాలయ వాస్తువుకు ప్రోత్సాహమిచ్చారు. మొగల్రాజపురము, ఉండవల్లి గుహాలయాలు వీరు నిర్మించినవే. ఈ గుహాలయ స్తంభముల మీద పంజా ఎత్తిపెట్టిన సింహప్రతిమ ఉండుటచేత వీరు సింహలాంఛనులని పరిశోధకుల అభిప్రాయము. పలు శాసముల ప్రకారము వీరి రాజధాని శక్రాభిధానపురి నల్లగొండ మండలం తుమ్మలగూడెం వద్ద శిథిలముల రూపమున నుండి, స్థానికులచే ఇంద్రపాలగుట్ట అని పేర్కొనబడునదే శక్రాభిధానపురి అని చెప్పవచ్చును.
మొదటి గోవింద వర్మ మహారాజు అనే బిరుదు నామం స్వీకరించినా, ఇంద్రపాలగుట్ట, శ్ర్రీ పర్వత (నాగార్జునకొండ) శాసనల వల్ల ఇతని కుమరుడు మొదటి మాధవ వర్మ సామ్రాజ్య స్థాపన చేసాడని తెలుస్తూంది.
ఇతను రాజ్యాన్ని విస్తరించడానికి ప్రధాన కారకుడు.
5వ శతాబ్ది మధ్య కాలం నాటికి రాజ్య విస్తరణ జరిపిన రాజు. 50 సంవత్సరాల ఇతని పరిపాలనను చరిత్రకారులు స్వర్ణయుగంగా అభివర్ణించారు. ఇతని కాలం లోనే ఒక చిన్న రాజ్యాన్ని పెద్ద రాజ్యంగా మార్చారు. ఆనాటి శక్తివంతమైన రాజ్యాల్లో ఒకటి అయిన వాకాటక రాకుమారిని ఇతని కుమారుడైన విక్రమేంద్రవర్మ వివాహమాడాడు.
ఈ వివాహ సంబందంతో మరింత శక్తిమంతులైన విష్ణుకుండినులు తమ రాజ్యాన్ని మరింతగా విస్తరించారు. ఆనాటి పొరుగు రాజ్యాల్లో ఒకటయిన ఆనందగోత్రికులని (బహుశా కాంచీపురం పల్లవుల సామంతులు) ఓడించి గుంటూరు, తెనాలి, ఒంగోలు ప్రాంతాలను ఆక్రమించారు. ఈ ప్రాంతాలను ఆక్రమించిన తరువాత విష్ణుకుండినులు తమ రాజధానిని అమరపురి (అమరావతి) కి మార్చారు. ఆక్రమించిన ప్రాంతాలను పల్లవుల నించి కాపాడటానికి మాధవ వర్మ ఆ ప్రాంతాలకు పాలకుడిగా తన కుమారుడు దేవ వర్మని, ఆతని తరువాత మనమడు మాధవవర్మ-3 ని నియోగించాడు.
తరువాత మాధవ వర్మ తన చూపు శాలంకాయనుల అధీనంలో ఉన్న వేంగి పైన మరల్చాడు. వేంగిని స్వాధీనం చేసుకోవడంతో గోదావరి డెల్టా రాజ్య సరిహద్దుగా మారింది. తరువాత రాజధానిని మరింత మధ్యగా ఉన్న బెజవాడ (నేటి విజయవాడ) మార్చాడు. ఈ విజయాలు ఇతనికి దక్షిణాధిపతి అనే బిరుదుని సాధించి పెట్టాయి. ఈ విజయాల తరువాత మాధవ వర్మ అనేక అశ్వమేధ, రాజసూయ, వేదిక క్రతువులు చేసాడు.
విష్ణుకుండినుల వారసులలో మొదటి విక్రమేంద్రవర్మ (సా.శ..515-525), ఇంద్రభట్టారకవర్మ (సా.శ..525-555) పెద్దగా పేరు పొందలేదు. పైగా రాజ్యం క్షీణించింది. ఇంద్రభట్టారకవర్మ తన సామంతుడైన కళింగ పాలకుడితో పోరాడుతూ మరణించాడు. గోదావరికి ఎగువన ఉన్న కళింగ రాజ్యాన్ని విష్ణుకుండినులు కోల్పోయారు.
రెండవ విక్రమేంద్రవర్మ (555-570) విష్ణుకుండినుల ప్రాభవాన్ని తిరిగి సాధించాడు. కళింగ ప్రాంతాన్ని కనిపెట్టి ఉంచడానికి తన రాజధానిని బెజవాడ నుండి లెందులూరుకు (ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నదెందులూరు) మార్చాడు. పల్లవ రాజు సింహవర్మన్ చేసిన దాడిని తిప్పికొట్టడమే కాక, కళింగలో తిరిగి అధికారం నెలకొల్పాడు. ఇతని కుమారుడు రెండవ గోవింద వర్మ కొద్దికాలమే పరిపాలించాడు (569-573)
రెండవ గోవింద వర్మ కుమారుడైన జనాశ్రయ మాధవ వర్మ విష్ణుకుండినులలో చివరి గొప్ప రాజు (573-621). ఇతని పరిపాలన మొదట్లో తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. కాని తరువాత అంతా దాడులూ ఆక్రమణలే. తన పరిపాలన 37వ సంవత్సరంలో తన సామంతుడైన గుడ్డవిషయ (నేటి రామచంద్రపురం) పరిపాలకుడు దుర్జయ పృథ్వీమహరాజు తిరుగుబాటును అణిచాడు.
మాధవ వర్మకు సవాలు చాళుక్యులతో ఎదురైంది. 616 లో చాళుక్య రాజైన రెండవ పులకేశి అతని సోదరుడు కుబ్జ విష్ణువర్ధనుడు విష్ణుకుండినుల పై దాడి చేశారు. విష్ణుకుండినుల నుంచి వేంగిని వారి సామంతులైన దుర్జయల నుంచి పిఠాపురాన్ని ఆక్రమించారు. తన 48 వ పారిపాలనా సంవత్సరాన బహుశా చాళుక్యులను తరిమికొట్టడానికి మాధవ వర్మ గోదావరి దాటాడు. కానీ యుద్ధరంగాన ప్రాణాలు కోల్పోయాడు. అతని కుమారుడైన మంచన భట్టారకుడు కుడా బహుశా ఇదే యుద్ధంలో మరణించి ఉండవచ్చు.
దీనితో విష్ణుకుండినుల రాజ్యం అంతమయింది.
(ఆ.రి.నెం. 581 1925వ సంవత్సరము): గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా, వేల్పూరు లోని రామలింగస్వామి దేవాలయము ప్రవేశము దగ్గర ఉన్న ఒక తెల్లని పాలరాతి స్తంభము మీద ఈ శాసనాన్ని లిఖించారు. తేదీ నిర్ధారితము కాలేదు. ఇది ఇప్పడి వరకు కనుగొనిన ఈ వంశము యొక్క ఏకైక శిలాశాసనము. ఇది ధ్వంసమైనది, అసంపూర్ణమైనది. కేవలము వంశము యొక్క పేరు విష్ణుకుండి, ప్రభువు మాధవవర్మ యొక్క పేరు కనిపించుచున్నవి. అంతేకాక ఈ గ్రామ చరిత్ర కలిగినది,వేల్పూరులో పెద్దదెవుని దేవాలయము చాలా గొప్పది, ఇది క్రిస్తు .పూ రెండవ శతాబ్దములో నిర్మితమైనది.ఈ గ్రామములోని చరిత్ర మొత్తము రామలింగస్వామి దేవాలయముతొ ముడిపడి ఉంది.దిని వలన ఈదేవాలయ చరిత్ర్ర తెలుసుకొనిన గ్రామ చరిత్ర తెలుసుకొనవచ్చు.
విష్ణుకుండినులు రాగిమలాము చేసిన ఇనుప నాణెములు వాడారు. నాణెముల మీద సూర్యగోళపు మధ్యనున్న ఏకతల దేవాయతన రూపం ముద్రించారు. భారతదేశములో ఇట్టి నాణెములు తొలుతగా ప్రవేశపెట్టినవారు విష్ణుకుండినులు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.