మూగ మనసులు (1964 సినిమా)
1964 తెలుగు సినిమా / From Wikipedia, the free encyclopedia
మూగమనసులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రల్లో నిర్మించిన 1964 నాటి తెలుగు చిత్రం. అంతస్తుల కారణంగా విడిపోయిన జంట పునర్జన్మలో వివాహం చేసుకుని కలవడం కథాంశం. సినిమాని చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు బాబూ మూవీస్ పతాకంపై నిర్మించారు. ఆదుర్తి తాను చదివిన చిన్న కథను అనుసరించి తయారుచేసిన లైన్ కి, ఆదుర్తి కోరికపై ముళ్ళపూడి వెంకటరమణ మూగమనసులు పేరిట ఈ సినిమా స్క్రిప్ట్ రాశారు.[1]
సాధారణంగా అప్పటి సినిమాలు మద్రాసులోని వివిధ స్టూడియోల్లో చిత్రీకరణ జరుపుకునేవి, అయితే సినిమా మాత్రం చాలాభాగం భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరకూ ఉన్న గోదావరి పరిసరప్రాంతాల్లోనూ, గోదావరి మీదా అవుట్ డోర్ లో చిత్రీకరణ జరుపుకుంది. సినిమా పాటలు ఆత్రేయ, కొసరాజు, దాశరథి రాయగా, కె.వి.మహదేవన్ స్వరపరిచారు.
విడుదలకు ముందే సినిమా బాగోలేదన్న పుకార్లను, గోదావరిపై జరిగిన పడవ ప్రమాదాలను తట్టుకుని 1964లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం పొందింది. ప్రేక్షకాదరణ, విమర్శల ప్రశంసలు పొందిన ఈ సినిమా 175 రోజులు ఆడింది. ఈ సినిమాని తారాచంద్ బర్జాత్యా, ఎల్.వి.ప్రసాద్ ల నిర్మాణంలో ఆదుర్తి సుబ్బారావు దర్శకునిగా, నూతన్, సునీల్ దత్ ప్రధాన పాత్రలలో హిందీలో మిలన్గా తీశారు. అక్కడా సినిమా విజయవంతమైంది.
మూగ మనసులు (1964 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , సావిత్రి, జమున |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | బాబూ మూవీస్ |
భాష | తెలుగు |