![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/51/Kashmir_Region_November_2019.jpg/640px-Kashmir_Region_November_2019.jpg&w=640&q=50)
ఆర్టికల్ 370 రద్దు
From Wikipedia, the free encyclopedia
2019 ఆగస్టు 5 న, భారత రాజ్యాంగంలోని 370 అధికరణం ప్రకారం జమ్మూ కాశ్మీర్కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా లేదా పరిమిత స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో పాటు, జమ్మూ కాశ్మీరు రాష్ట్ర హోదాను రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీరు, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూ కాశ్మీరును శాసనసభ కలిగి ఉండే కేంద్రపాలిత ప్రాంతం గాను (డిల్లీ లాగా), లడఖ్ ను సభ లేని కేంద్రపాలిత ప్రాంతం గానూ ఏర్పాటు చేసింది.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/51/Kashmir_Region_November_2019.jpg/640px-Kashmir_Region_November_2019.jpg)
ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూనే, భారత ప్రభుత్వం కాశ్మీర్ లోయలో కమ్యూనికేషన్ మార్గాలను కత్తిరించింది. [1] మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో సహా పలువురు ప్రముఖ కాశ్మీరీ రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మెహబూబా 'ఇది భారతదేశ ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి రోజు' అని పేర్కొంది. [2] [1] హింసను నివారించడానికే ఈ ఆంక్షలను విధించామని ప్రభుత్వ అధికారులు చెప్పారు. [3] రిజర్వేషన్లు, విద్య హక్కు, సమాచార హక్కు వంటి ప్రభుత్వ కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు అందేలా వీలు కల్పించడం కోసమే ఈ రద్దు అని వారు తమ చర్యను సమర్థించుకున్నారు. [4]
ఉపసంహరణ తీర్మానాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఖండించాయి. [2] కమ్యూనికేషన్ల కత్తిరింపు కారణంగా కాశ్మీర్ లోయలో స్పందన తెలియ రాలేదు. [2] [1] చాలా మంది హిందూ జాతీయవాదులు సంబరాలు జరుపుకున్నారు. కాశ్మీర్లో శాంతికి, ప్రజా శ్రేయస్సుకూ దారితీసే చర్యగా దీన్ని వర్ణించారు. [2] భారతదేశం లోని రాజకీయ పార్టీలలో, అధికార భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎఐఎడిఎంకె, తెలుగు దేశం, శివసేనలు ఉపసంహరణకు మద్దతు ఇచ్చాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), డిఎంకెలు వ్యతిరేకించాయి. [5] [6] లడఖ్ లోని కార్గిల్ ప్రాంతంలోని షియా ముస్లిం ప్రజలు (లడఖ్ జనాభా బహుళత్వంలో వీరు భాగం) దీని పట్ల నిరసన వ్యక్తం చేశారు; [7] [8] లడఖ్ బౌద్ధ సమాజం ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చింది. [9] [10]
ప్రస్తుతం అమల్లో ఉన్న 1954 అధ్యక్ష ఉత్తర్వులను అధిగమిస్తూ, రాజ్యాంగపు 370 వ అధికరణపు అధికారం కింద ఒక ఉత్తర్వు జారీ చేస్తూ, రాష్ట్రానికి మంజూరు చేసిన స్వయంప్రతిపత్తికి సంబంధించిన అన్ని నిబంధనలనూ భారత రాష్ట్రపతి రద్దు చేశారు. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని కోరుతూ హోంమంత్రి భారత పార్లమెంటులో పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ రెండు ప్రాంతాలకు విడివిడిగా ఒక లెఫ్టినెంట్ గవర్నరు ఉంటారు. జమ్మూ కశ్మీరుకు ఒకే సభ గల శాసనసభ ఉండగా, లడఖ్కు శాసనసభ ఉండదు. 370 అధికరణం కింద ప్రత్యేక హోదాను రద్దు చేయాలనే తీర్మానాన్ని, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన బిల్లునూ రాజ్యసభ 2019 ఆగస్టు 5 న చర్చించి ఆమోదించింది. [11] ఆగస్టు 6 న, లోక్సభ పునర్వ్యవస్థీకరణ బిల్లును, ఉపసంహరణకు సిఫార్సు చేసిన తీర్మానాన్నీ ఆమోదించింది. [12] [13] ఉపసంహరణ చట్టబద్ధంగానే ఉందా అనే దానిపై రాజ్యాంగ నిపుణులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. [1]