From Wikipedia, the free encyclopedia
భారతదేశంలో హిందూ జాతీయవాదానికి ప్రధాన రూపం, హిందుత్వ.[1] ఈ పదాన్ని చంద్రనాథ్ బసు కాయించాడు. 1923 లో వినాయక్ దామోదర్ సావర్కర్ దీన్ని రాజకీయ భావజాలంగా రూపొందించాడు.[2] దీనిని సంఘ్ పరివార్ లోని సంస్థలైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS), విశ్వ హిందూ పరిషత్ (VHP), భారతీయ జనతా పార్టీ (BJP) లు ఉపయోగిస్తాయి.[3] [4]
హిందుత్వ ఉద్యమాన్ని మితవాద తీవ్రవాదానికి రూపాంతరంగా వర్ణిస్తారు.[5] సజాతీయ మెజారిటీకి, సాంస్కృతిక ఆధిపత్య భావనకూ కట్టుబడిన "దాదాపు ఫాసిస్టు" గానూ వర్ణించారు.[6][7] కొంతమంది విశ్లేషకులు హిందుత్వ గుర్తింపును ఫాసిజం అనడాన్ని వ్యతిరేకించారు. హిందుత్వ అనేది సంప్రదాయవాదం లేదా "జాతి నిరంకుశవాదం" యొక్క తీవ్ర రూపం మాత్రమే అని సూచించారు.[8]
ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ (OED) ప్రకారం, హిందుత్వం అనేది "ఒరిజినల్గా: హిందువుగా ఉండే స్థితి లేదా హిందువుగా ఉండడం లోని నాణ్యత; ఇప్పుడు: భారతదేశంలో హిందువుల, హిందూమతపు ఆధిపత్యాన్ని స్థాపించాలని కోరుకునే భావజాలం లేదా ఉద్యమం; హిందూ జాతీయవాదం." [9] OED ప్రకారం దాని వ్యుత్పత్తి: "ఆధునిక సంస్కృత హిందుత్వ (హిందూ లక్షణాలు, హిందూ గుర్తింపు) నుండి హిందూ + శాస్త్రీయ సంస్కృతం లోని త్వ, ప్రత్యయంతో ఏర్పడింది. హిందీలో హిందూపన్ అంటారు.[9] OED ప్రకారం హిందూ అనేది: "పాక్షికంగా హిందీ, ఉర్దూల నుండి, పాక్షికంగా పర్షియన్ నుండి అరువు తీసుకున్న పదం ఇది. శబ్దవ్యుత్పత్తి: ఉర్దూ హిందు, పర్షియన్ హిందు. (i) హిందీ హిందు, ఉర్దూ హిందు ఒరిజినల్గా భారతదేశానికి చెందిన వ్యక్తిని సూచిస్తాయి, ఇప్పుడు ప్రత్యేకంగా హిందూమతస్థుడు అని సూచిస్తుంది. (ii) మధ్య పర్షియన్లో హిందూగ్ - అంటే భారతదేశానికి చెందిన వ్యక్తి. పాత పర్షియన్లో ... హిందూ అంటే అచెమెనిడ్ సామ్రాజ్యం యొక్క తూర్పు ప్రావిన్స్ అని అర్థం ఉంది." [10]
మెరియం-వెబ్స్టర్స్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్ ప్రకారం, హిందుత్వ అనేది "భారతీయ సాంస్కృతిక, జాతీయ, మతపరమైన గుర్తింపు" యొక్క భావన.[11] ఈ పదం "భౌగోళికంగా మతపరమైన, సాంస్కృతిక, జాతీయ గుర్తింపును కలుపుతుంది: ఈ ' హిందూ- త్వం'లో పాలుపంచుకునేవాడే నిజమైన 'భారతీయుడు'. అయితే, కొంతమంది భారతీయులు హిందుత్వ అనేది ప్రాథమికంగా భారతీయ జాతీయ సంప్రదాయ, దేశీయ వారసత్వాన్ని సూచించే ఒక సాంస్కృతిక పదం మాత్రమే అని నొక్కి చెప్పారు. వారు హిందుత్వ, భారతదేశం ల మధ్య ఉన్న సంబంధాన్ని జియోనిజం, ఇజ్రాయెల్లతో పోల్చారు." [11] మెరియం-వెబ్స్టర్స్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ వరల్డ్ రిలిజియన్స్ ఈ అభిప్రాయపు సారాంశాన్ని రాస్తూ, "మతపరంగా హిందువులు కాని, భారతదేశం లోనే ఉద్భవించిన మతాలకు చెందినవారు - జైనులు, బౌద్ధులు, సిక్కులు తదితరులు - ఈ చారిత్రక, సాంస్కృతిక, జాతీయ కలగలుపులో భాగమే. భారతదేశం లోకి దిగుమతి అయిన మతాలు, అంటే ప్రధానంగా దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు మెజారిటీ సంస్కృతిలోకి తమను తాము ఇముడ్చుకుంటేనే హిందుత్వ పరిధి లోకి వస్తారు" [11] .
కాన్సైస్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రకారం, "హిందుత్వం హిందూ జాతీయవాదుల భావజాలాన్ని సూచిస్తుంది, ఇది భారత ఉపఖండంలోని నివాసుల ఉమ్మడి సంస్కృతిని నొక్కి చెబుతుంది. . . . ఆధునిక రాజకీయ నాయకులు హిందుత్వం లోని జాతి పరమైన, ముస్లింలకు వ్యతిరేకమైన అంశాలను తగ్గించి చూపడానికి ప్రయత్నిస్తూ, భారతీయ గుర్తింపు లోని సర్వసమగ్రతను నొక్కిచెప్పారు; కానీ ఈ పదానికి అంతర్లీనంగా ఫాసిస్ట్ ధోరణులున్నాయి." [12] ది డిక్షనరీ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ ప్రకారం, "హిందూ జాతీయవాదపు సాంస్కృతిక సమర్థనను హిందుత్వ ప్రతిబింబిస్తుంది." [13] ఎ పొలిటికల్ అండ్ ఎకనామిక్ డిక్షనరీ ఆఫ్ సౌత్ ఏషియా ప్రకారం, "హిందుత్వ భావన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాలలో ఒకటి 'హిందూ-ఐక్యత' అనే అంశానికి మద్దతు పలకడం, చాలా సంకుచితమైన నిర్వచనాన్ని నివారించడం. దీనికి పర్యవసానంగా ఇది బౌద్ధులు, సిక్కులు జైనులను హిందూ సమాజం నుండి మినహాయించబడ్డారు. తరువాత, హిందూ-జాతీయవాద సిద్ధాంతకర్తలు వారి సామాజిక పునాదిని విస్తృతం చేయడానికి, రాజకీయ సమీకరణ కోసం హిందువులు కానివారిని కూడా చేర్చుకునే వ్యూహంలో భాగంగా ఈ భావనను మార్చారు.[14]
ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో హిందూ, భారతీయ జాతీయవాది అయిన వినాయక్ దామోదర్ సావర్కర్పై ఉన్న వ్యాసం ప్రకారం, " హిందుత్వ ... భారతీయ సంస్కృతిని హిందూ విలువల యొక్క అభివ్యక్తిగా నిర్వచించడానికి ప్రయత్నించింది; హిందూ జాతీయవాద భావజాల సిద్ధాంతానికి ఈ భావన ప్రధానమైనదిగా మారింది." ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం ప్రకారం, హిందుత్వం అనేది "హిందూ జాతి యొక్క సంస్కృతి" అని దాని భావజాలం యొక్క ప్రామాణిక ప్రకటనలో నిర్వచించబడింది, ఇక్కడ హిందూమతం ఒక మూలకం మాత్రమే, "హిందూ ధర్మం అనేది హిందువుల లాగే సిక్కులు, బౌద్ధులు ఆచరించే మతం". ఆ వ్యాసంలో ఇంకా ఇలా ఉంది, "హిందుత్వ ప్రతిపాదకులు హిందువుల మతపరమైన, విస్తృత సాంస్కృతిక వారసత్వంతో జాతీయ గుర్తింపును ప్రోత్సహించడానికి ప్రయత్నించారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి తీసుకున్న చర్యలలో - 'బయటి' మతాలను స్వీకరించినట్లు నిర్ధారించబడిన వ్యక్తులను 'వెనక్కి రప్పించే' ప్రయత్నాలు, హిందువులకు సంబంధించిన అవగాహనను బలోపేతం చేయడానికి రూపొందించిన సామాజిక, సాంస్కృతిక, దాతృత్వ కార్యకలాపాలు, భారతీయ జనతా పార్టీ (BJP) వంటి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, వివిధ సంస్థల ద్వారా ప్రత్యక్ష రాజకీయ చర్యలూ భాగంగా ఉన్నాయి." [15]
హిందుత్వం: ఎవరు హిందువు? లో సావర్కర్, హిందుత్వ అనేది "భారతీయ"మైన ప్రతిదానికీ సంబంధించిన పదం. సావర్కర్ నిర్వచనంలో హిందుత్వ యొక్క మూడు ముఖ్యమైన అంశాలు - ఉమ్మడి దేశం (రాష్ట్ర), ఉమ్మడి జాతి (జాతి), ఉమ్మడి సంస్కృతి (సంస్కృతి).[16] సావర్కర్ "హిందూ", "సింధు" పదాలను ఒకే అర్థంలో వాడతాడు.[16][17] అతని హిందుత్వ పునాదిలో భౌగోళిక, సాంస్కృతిక, జాతి భావనల లాగానే ఆ పదాలు కూడా ఉన్నాయి "అతని భావనల్లో మతం లేదు" అని శర్మ పేర్కొన్నాడు.[16][18] హిందుత్వ యొక్క అతని వివరణలో అన్ని భారతీయ మతాలు ఉన్నాయి, అనగా హిందూమతం, బౌద్ధమతం, జైనమతం, సిక్కుమతం. సావర్కర్ "హిందూ జాతీయతను" "భారతీయ మతాలకే" పరిమితం చేసాడు. వారు తమ భూమిపై ఉమ్మడి సంస్కృతిని, అభిమానాన్నీ పంచుకుంటారు.[16][17]
దక్షిణాసియాపై ప్రత్యేక దృష్టి ఉన్న కలిగిన రాజకీయ శాస్త్రవేత్త, క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ ప్రకారం, సావర్కర్ తనను తాను నాస్తికుడిగా ప్రకటించుకుంటూ "హిందూ నిర్వచనంలో మతం ప్రాముఖ్యతను తగ్గించాడు". బదులుగా ఒకే సంస్కృతి, ప్రతిష్ఠాత్మకమైన భౌగోళిక ఉనికి కలిగిన జాతి సమూహాన్ని నొక్కి చెప్పాడు.[17][18] సావర్కర్ ప్రకారం, హిందువు "మొట్టమొదటగా హిమాలయాలు, హిందూ మహాసముద్రం మధ్య సింధు నదికి ఆవల ఉన్న ప్రాంతంలో నివసించే వ్యక్తి" అని జాఫ్రెలాట్ పేర్కొన్నాడు.[17] " ఖిలాఫత్ ఉద్యమం యొక్క పాన్-ఇస్లామిక్ సమీకరణ"కు ప్రతిస్పందనగా సావర్కర్ తన భావజాలాన్ని రూపొందించాడు. ఆ ఉద్యమంలో భాగంగా భారతీయ ముస్లింలు, ఇస్తాంబుల్-ఆధారిత ఒట్టోమన్ సామ్రాజ్యం యొక్క ఖలీఫాకు, ఇస్లామిక్ చిహ్నాలకూ మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. అతని ఆలోచనలు ప్రధానంగా ఇస్లాం పట్ల ముస్లిముల పట్ల తీవ్ర వ్యతిరేక వైఖరిని ప్రతిబింబిస్తాయి. జాఫ్రెలాట్ ఇలా పేర్కొన్నాడు, సావర్కర్కు, "ముస్లింలు నిజమైన శత్రువులు, బ్రిటిష్ వారు కాదు", ఎందుకంటే అతని దృష్టిలో వారి ఇస్లామిక్ భావజాలం "వాస్తవమైన దేశానికి అంటే హిందూ రాష్ట్రానికి ముప్పు"గా ఉంది.[17] ఈ చారిత్రిక "సాధారణ సంస్కృతి"ని తిరస్కరించిన వారందరినీ సావర్కర్ మినహాయించాడు. క్రైస్తవ మతం లేదా ఇస్లాం మతంలోకి మారిన వారిని - కానీ భాగస్వామ్య ఇండిక్ సంస్కృతిని అంగీకరించి, ఆదరించిన వారిని మాత్రమే - కూడా కలుపుకున్నాడు. వారిని వెనక్కు తీసుకురావచ్చని అతడు పరిగణించాడు.[17]
మానవ హక్కులు, భారత జాతీయవాదంలో నైపుణ్యం కలిగిన సామాజిక శాస్త్రవేత్త చేతన్ భట్ ప్రకారం, సావర్కర్ "హిందూ, హిందుత్వ ఆలోచనను హిందూమతం నుండి దూరం చేసాడు".[19] [note 1] భట్ ప్రకారం, సావర్కర్ హిందుత్వాన్ని ఇలా వర్ణించాడు, "మానవ భాషకు తెలిసిన అత్యంత సమగ్రమైన, దిగ్భ్రాంతికరమైన సింథటిక్ భావనలలో ఒకటి", "హిందుత్వ అనేది ఒక పదం కాదు, చరిత్ర; మన ప్రజల ఆధ్యాత్మిక లేదా మతపరమైన చరిత్ర మాత్రమే కాదు, - అలాంటిదే అయిన "హిందూమతం" అనే పదంతో తికమక పడరాదు, - కానీ సంపూర్ణమైన చరిత్ర." [19]
సావర్కర్ యొక్క హిందుత్వ భావన అతని హిందూ జాతీయవాదానికి పునాది వేసింది.[16] క్లిఫోర్డ్ గీర్ట్జ్, లాయిడ్ ఫాలర్స్, ఆంథోనీ డి. స్మిత్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఇది జాతిపరమైన జాతీయవాదానికి ఒక రూపం. [21] [17]
హిందుత్వ నిర్వచనం, ఉపయోగం, హిందూమతంతో దాని సంబంధం వంటివి భారతదేశంలో అనేక కోర్టు కేసులలో భాగంగా ఉన్నాయి. 1966లో, ప్రధాన న్యాయమూర్తి గజేంద్రగడ్కర్ యజ్ఞపురుషదాస్జీ (AIR 1966 SC 1127)లో భారతదేశ సర్వోన్నత న్యాయస్థానానికి "హిందూ మతాన్ని నిర్వచించడం అసాధ్యం" అని రాశాడు.[22] [note 2] హిందూ మతం సంక్లిష్టమైనది, "ఆస్తికుడు, నాస్తికుడు, సంశయవాది, అజ్ఞేయవాది, వారు హిందూ సంస్కృతి, జీవన విధానాన్ని అంగీకరిస్తే అందరూ హిందువులే కావచ్చు" అని రాధాకృష్ణన్ చెప్పినదాన్ని కోర్టు స్వీకరించింది.[22] హిందూ మతం చారిత్రికంగా "సమిష్టి స్వభావాన్ని" కలిగి ఉందనీ, దానిని "విస్తృతంగా జీవన విధానంగా వర్ణించవచ్చు. దానికి మించి మరేమీ లేదు" అని కోర్టు తీర్పు చెప్పింది.[22]
1966 నాటి నిర్ణయం ఆ తరువాతి కాలంలో హిందుత్వ పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ప్రభావితం చేసింది, ప్రత్యేకించి 1990లలో సుప్రీం కోర్టు వెలువరించిన ఏడు తీర్పులను ఇప్పుడు "హిందుత్వ తీర్పులు" అని పిలుస్తారు.[22][24] సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రామ్ జెఠ్మలానీ ప్రకారం, 1995లో భారత అత్యున్నత న్యాయస్థానం "సాధారణంగా, హిందుత్వ అనేది ఒక జీవన విధానంగా లేదా మానసిక స్థితిగా భావించబడుతుంది, దానిని మతపరమైన హిందూ ఛాందసవాదంతో సమానంగా పరిగణించకూడదు, అలా అర్థం చేసుకోనూ కూడదు... హిందుత్వ లేదా హిందూమతం అనే పదాలను ఉపయోగిస్తే, ఇతర మతాలను ఆచరించే వ్యక్తులందరికీ వ్యతిరేక వైఖరిని సూచిస్తుంది అని అనుకోవడం తప్పు, న్యాయం (చట్టం) పొరపాటు. ఈ పదాలు లౌకికవాదాన్ని ప్రోత్సహించడానికో లేదా భారతీయ ప్రజల జీవన విధానాన్ని భారతీయ సంస్కృతిని లేదా నీతిని నొక్కి చెప్పడానికో లేదా ఏదైనా రాజకీయ పార్టీ అవలంబిస్తున్న వివక్షతను లేదా అసహనాన్ని విమర్శించే ప్రసంగంలో ఉపయోగించో ఉండవచ్చు." [25] జెఠ్మలానీ ప్రకారం, సుప్రీం కోర్ట్ ఈ పదం యొక్క "నిజమైన అర్థాన్ని" సరిగ్గా వివరించింది "హిందుత్వ అనేది ఏ వ్యవస్థీకృత మతానికి శత్రుత్వం కాదు లేదా మరొక మతానికి దాని గొప్పతనాన్ని ప్రకటించదు". అతని ప్రకారం, "మతోన్మాద ప్రచార యంత్రాంగం "హిందుత్వ"ను మతపరమైన పదంగా నిర్దాక్షిణ్యంగా ప్రచారం చేయడం దురదృష్టకరం, ఇది రాజకీయ నాయకులు, మీడియా, పౌర సమాజం మేధావులతో సహా అభిప్రాయ నాయకుల మనస్సులలో, భాషలో కూడా చేరిపోయింది.[25] భారతీయ న్యాయవాది అబ్దుల్ నూరానీ దీనితో ఏకీభవించలేదు. సుప్రీం కోర్ట్ తన 1995 తీర్పులో "హిందుత్వకు నిరపాయమైన అర్థాన్ని ఇచ్చిందని, హిందుత్వను భారతీయీకరణ అని పిలుస్తుంది, మొదలైనవి" అని పేర్కొంది. ఇవి కేసు యొక్క వాస్తవాల నుండి అనవసరమైన మళ్లింపులు అలా చేయడం ద్వారా, కోర్టు మతం రాజకీయాలను వేరుచేసే గోడను పడగొట్టి ఉండవచ్చు" [26] .
హిందుత్వ అనే పదాన్ని 1892 లో చంద్రనాథ్ బసు,[27][27][28] ఆ తరువాత బాల గంగాధర్ తిలక్ ఉపయోగించారు. వినాయక్ దామోదర్ సావర్కర్ సూచించిన రాజకీయ భావజాలానికి విరుద్ధంగా, సాంప్రదాయ హిందూ సాంస్కృతిక దృక్పథాన్ని చిత్రీకరించడం మాత్రమే బసు ఈ పదాన్ని ఉపయోగించడం లోని ఉద్దేశం. ఈ పదాన్ని మితవాద జాతీయవాది, భారత స్వాతంత్ర్య ఉద్యమ కార్యకర్త సావర్కర్ 1923లో స్వీకరించాడు. అతను బ్రిటిష్ రాజ్కు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రేరేపించినందుకు జైలు పాలయ్యాడు.[29] అతను తన భావజాలాన్ని, "సార్వత్రికమైన, ఆవశ్యకమైన హిందూ గుర్తింపు యొక్క ఆలోచననూ" వివరించడానికి ఈ పదాన్ని ఉపయోగించాడు. ఇక్కడ "హిందూ గుర్తింపు" అనే పదబంధం "ఇతరుల జీవన విధానాలు, విలువల" నుండి వేరు చేసి చూపిస్తుంది, అని హిందూ మతంపై దృష్టి సారించిన పండితుడు WJ జాన్సన్ పేర్కొన్నాడు. 1980ల తర్వాతి జాతీయవాదం, భారతదేశంలోని సామూహిక రాజకీయ కార్యకలాపాల లాగానే, హిందుత్వ యొక్క సమకాలీన అర్ధం, ఉపయోగం చాలావరకు సావర్కర్ ఆలోచనల నుండి ఉద్భవించిందేనని చేతన్ భట్ పేర్కొన్నాడు.[30] సావర్కర్ రచనలలో వివరించిన హిందుత్వం "ఇతరులను బెదిరించడం, ఇతరులపై ముద్ర వేయడం" ద్వారా గుర్తింపును ఏర్పరచుకునే ప్రయత్నాన్ని "పరిపూర్ణంగా వివరిస్తుంది" అని జాఫ్రెలాట్ అన్నాడు. ప్రత్యేకించి, పాన్-ఇస్లామిజం వంటి "పాన్-ఇజమ్లు" హిందువులను బలహీనపరిచాయని సావర్కర్ భావించాడు, అతను ఇలా వ్రాసాడు:
ఓ హిందువులారా, హిందూ జాతీయతను ఏకీకృతం చేయండి, బలోపేతం చేయండి; మన జాతిని, మన భూమినీ రక్షించుకోవాల్సిన న్యాయమైన అత్యవసరమైన సందర్భాల్లో తప్ప మన హిందూయేతర స్వదేశీయులెవరికీ, నిజానికి ప్రపంచంలోని ఎవరికైనా కానీ హాని చేయకూడదు; ఆమెకు ద్రోహం చేయడం గానీ, ఖండాంతరాల నుండి పోరాడుతున్న ఏ "పాన్-ఇజం" కైనా సరే.. ఆమెపై దాడి చేయడం గానీ అసాధ్యం అనిపించాలి.
—వినాయక్ దామోదర్ సావర్కర్, క్రిస్టోఫీ జెఫ్రెలోట్ మాటల్లో[31]
సావర్కర్ హిందుత్వ భావజాలం 1925లో నాగ్పూర్ (మహారాష్ట్ర)లోని కేశవ్ బలిరామ్ హెడ్గేవార్కు అందుకున్నాడు. అతనికి సావర్కర్ హిందుత్వ స్ఫూర్తిదాయకంగా అనిపించింది. [32] అతను కొంతకాలం తర్వాత రత్నగిరిలో సావర్కర్ను కలిసాడు. 'హిందూ దేశం'ని నిర్వహించే పద్ధతుల గురించి ఆయనతో చర్చించాడు.[33] సావర్కర్, హెడ్గేవార్ ల మధ్య జరిగిన చర్చలు ఆ సంవత్సరం సెప్టెంబరులో హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించడానికి దారితీసాయి. ఈ సంస్థ వేగంగా అతి పెద్ద హిందూ జాతీయవాద ఉద్యమంగా అభివృద్ధి చెందింది.[34] అయితే, కొత్త సంస్థ యొక్క భావజాలాన్ని వివరించడానికి హిందుత్వ అనే పదాన్ని ఉపయోగించలేదు; అది హిందూ రాష్ట్ర (హిందూ దేశం) అనే పదాన్ని వాడింది. ఒక RSS ప్రచురణలో, " భారత్లో హిందువులే దేశమని, హిందుత్వయే రాష్ట్రీయత [జాతీయవాదం] అని స్పష్టమైంది." అని రాసింది.[35]
RSS హిందుత్వ భావజాలాన్ని ప్రచారం చేయడమే కాదు, హిందూ సమాజాన్ని సంస్కరించడానికి అట్టడుగు సంస్థాగత నిర్మాణాన్ని (శాఖలు) అభివృద్ధి చేసింది. ఉదయం, సాయంత్రం శారీరిక శిక్షణ, మార్షల్ విద్యల్లో శిక్షణ, హిందుత్వ భావజాల పాఠాల కోసం గ్రామ స్థాయి సమూహాలు ఏర్పాటయ్యాయి. హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను సైద్ధాంతికంగా క్రియాశీలకంగానే ఉంచాడు గానీ దాన్ని "రాజకీయేతర" సంస్థగా ఉంచాడు. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలకు దూరంగా ఉండే ఈ పద్ధతిని అతని వారసుడు MS గోల్వాల్కర్ 1940ల వరకు కొనసాగించాడు.[34] తత్వవేత్త జాసన్ స్టాన్లీ "RSS స్పష్టంగా యూరోపియన్ ఫాసిస్ట్ ఉద్యమాలచే ప్రభావితమైంది, దాని ప్రముఖ రాజకీయ నాయకులు 1930ల చివర్లో, 1940లలో హిట్లర్, ముస్సోలినీలను క్రమం తప్పకుండా ప్రశంసించేవారు." 1931లో, BS మూంజే ముస్సోలినితో సమావేశమై, భారతదేశంలో ఫాసిస్ట్ యువజన ఉద్యమాన్ని పునరావృతం చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. సాలి అగస్టిన్ ప్రకారం, హిందుత్వకు మూలస్తంభ్హం లాంటి సంస్థ RSS. హిందుత్వ హిందూమతానికి భిన్నమైనదని ఆర్ఎస్ఎస్ చెబుతుండగా, దానిని మతంతో ముడిపెట్టారు. అందువల్ల "సాంస్కృతిక జాతీయవాదం" అనేది పైకి చెప్పే మాట మాత్రమే నని అగస్టిన్ పేర్కొన్నాడు. ఇది "హిందూ మత గుర్తింపు"తో ఒక రాజ్యాన్ని సృష్టించడానికి వేసిన ముసుగు మాత్రమేనని అతను అన్నాడు. [36] జాఫ్రెలాట్ ప్రకారం, RSS యొక్క ప్రాంతీయ అధిపతులు హిందువులుగా ఉన్న భారతీయులతో పాటు జైనమతం వంటి ఇతర భారతీయ మతాలకు చెందిన వారిని కూడా కలుపుకున్నారు.
ఆర్ఎస్ఎస్కు సమాంతరంగా, వలసరాజ్యాల జైలు నుంచి విడుదలైన తర్వాత సావర్కర్ 1937లో అఖిల భారతీయ హిందూ మహాసభ లో చేరి దానికి అధ్యక్షుడయ్యాడు. అక్కడ, అతను హిందుత్వ, హిందూ రాష్ట్ర పదాలను ఉదారంగా ఉపయోగించాడు. [37] శ్యామ ప్రసాద్ ముఖర్జీ, 1944లో దాని అధ్యక్షుడిగా పనిచేశాడు. స్వాతంత్ర్యం తర్వాత అతను జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో చేరాడు. హిందూ సంప్రదాయవాద రాజకీయ నాయకుడైన అతను, హిందూ విలువలను కాపాడాలని కోరుకున్నాడు. అంతమాత్రాన ఇతర వర్గాలను మినహాయించాల్సిన అవసరం లేదని భావించాడు. హిందూ మహాసభ సభ్యత్వాన్ని అన్ని వర్గాలకు అందించాలని కోరాడు. దీనికి ఆమోదం లభించకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి ఆర్ఎస్ఎస్తో కలిసి కొత్త రాజకీయ పార్టీని స్థాపించాడు. అతను హిందూ మతాన్ని ఒక మతంగా కాక ఒక జాతీయతగానే అర్థం చేసుకున్నాడు గానీ, ఇది హిందూ అనే పదానికి సాధారణంగా ఉన్న అవగాహన అలా లేదని గ్రహించి, తన కొత్త పార్టీ పేరులో "హిందూ" అనే పదానికి బదులుగా "భారతీయ"ను ఎంచుకుని దానికి భారతీయ జనసంఘ్ అని పేరు పెట్టాడు. [37]
ఆర్ఎస్ఎస్ మాజీ వాలంటీర్ అయిన నాథూరామ్ వినాయక్ గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేసిన తర్వాత, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్ హిందుత్వ భావజాల ఆధారిత ఆర్ఎస్ఎస్ను నిషేధించింది. 2,00,000 మందికి పైగా ఆర్ఎస్ఎస్ వాలంటీర్లను అరెస్టు చేసింది. [38] హత్యను, సంబంధిత పరిస్థితులనూ పరిశోధించడానికి ప్రభుత్వ కమిషన్లను కూడా నియమించాడు. ఈ ప్రభుత్వ కమిషన్ల దర్యాప్తులలో, ఆ హత్యలో RSS నాయకత్వంతో పాటు "RSS కూడా నిర్దోషి" అని చెప్పాయని రాజకీయ శాస్త్ర పండితుడు నందిని దేవ్ అన్నాడు. సామూహిక అరెస్టు చేసిన ఆర్ఎస్ఎస్ వాలంటీర్లను భారత న్యాయస్థానాలు విడుదల చేశాయి. అప్పటి నుండి ఆర్ఎస్ఎస్ దీనిని "తప్పుడు ఆరోపణలు చేసి బంధించారు" అనే దానికి సాక్ష్యంగా ఉపయోగించుకుంది.[39]
దక్షిణాసియా అధ్యయనాలలో ప్రత్యేకత కలిగిన చరిత్రకారుడు రాబర్ట్ ఫ్రైకెన్బర్గ్ ప్రకారం, స్వతంత్ర భారతదేశంలో RSS సభ్యత్వం విపరీతంగా విస్తరించింది. ఈ కాలంలో, RSS "రాజకీయాలకు దూరంగా" ఉండగా, మరొక హిందుత్వ-సిద్ధాంత ఆధారిత సంస్థ జన్ సంఘ్, రాజకీయ రంగంలోకి ప్రవేశించింది. 1952, 1971 మధ్య జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలలో జన్ సంఘ్ సాధించిన విజయాలు పరిమితమైనవే.[40] దీనికి కొంతవరకు, జన్ సంఘ్ యొక్క పేలవమైన నాయకత్వం కారణం కాగా, హిందుత్వ సెంటిమెంట్పై దాని భావజాలం ఓటర్లను ఆకర్షించలేదు. దాని ప్రచారానికి తగిన సామాజిక, ఆర్థిక అంశాలు లేవు.[41] వాటితో పాటు, ఇందిరా గాంధీ వంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని కీలకమైన హిందుత్వ భావజాల అంశాలకు సహకరించి, దానిని సోషలిస్ట్ విధానాలతోటి, జవహర్లాల్ నెహ్రూ సోవియట్ తరహా కేంద్ర నియంత్రణలో ఉన్న ఆర్థిక నమూనాతోటీ కలిపేయడం కూడా మరొక కారణం. [38] హిందుత్వ-ప్రేరేపిత RSS 1947, 1970ల ప్రారంభంలో దాని అట్టడుగు కార్యకలాపాలను కొనసాగించింది. దాని వాలంటీర్లు భారత విభజన నుండి హిందూ సిక్కు శరణార్థులకు, బాధితులకూ మానవతా సహాయం అందించారు. ప్రకృతి విపత్తుల్లో బాధితులకు ఆర్థికంగా పునరావాసం కల్పించారు. [38]
1975 - 1977 మధ్య, ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ప్రకటించి, పత్రికా సెన్సార్షిప్, ప్రతిపక్ష నాయకుల అరెస్టులు, అనేక ప్రాథమిక మానవ హక్కులను సస్పెండ్ చేయడం అమలు చేసింది. ఎమర్జెన్సీ దుర్వినియోగం ఒక సామూహిక ప్రతిఘటనను ప్రేరేపించింది. హిందుత్వ భావజాలానికి రాజకీయ మద్దతును, వాలంటీర్ల వేగవంతమైన పెరుగుదలనూ ప్రేరేపించింది. [38] ఇందిరా గాంధీ, ఆమె పార్టీ 1977లో అధికారానికి దూరమయ్యారు. అటల్ బిహారీ వాజ్పేయి, బ్రిజ్ లాల్ వర్మ, లాల్ కృష్ణ అద్వానీ వంటి హిందుత్వ సిద్ధాంత ఆధారిత జన్ సంఘ్ సభ్యులు జాతీయ ప్రాముఖ్యతను పొందారు. హిందుత్వ భావజాల సానుభూతిపరుడు మొరార్జీ దేశాయ్ సంకీర్ణ కాంగ్రెసేతర ప్రభుత్వానికి ప్రధాన మంత్రి అయ్యాడు. [38] ఈ సంకీర్ణం 1980లో అధికారాన్ని కోల్పోయింది. 1980 ఏప్రిల్లో భారతీయ జనతా పార్టీ స్థాపించబడింది. ఈ కొత్త జాతీయ రాజకీయ పార్టీ 1970ల మధ్య నుండి భారతదేశం అంతటా వేగంగా అభివృద్ధి చెందిన హిందుత్వ భావజాల ఆధారిత గ్రామీణ, పట్టణ అట్టడుగు సంస్థలపై ఆధారపడింది. [38]
2014 భారత సార్వత్రిక ఎన్నికల్లో (BJP) భారతీయ జనతా పార్టీ విజయం సాధించినప్పటి నుండి, నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రాల్లో BJP ప్రభుత్వాలు హిందుత్వ ఎజెండాను ముందుకు తెచ్చాయి.
2019 ఆగస్టు 5 న, జమ్మూ కాశ్మీర్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 కింద ఇచ్చిన ప్రత్యేక హోదా లేదా పరిమిత స్వయంప్రతిపత్తిని మోడీ ప్రభుత్వం రద్దు చేసింది.[42][43]
2019 నవంబరు 9న, అయోధ్యలోని వివాదాస్పద భూమిలో రామమందిర నిర్మాణంపై భారత అత్యున్నత న్యాయస్థానం తీర్మానం చేసింది.[44][45][46][47] మసీదు ఏర్పాటు కోసం5 ఎకరాలు (20,000 మీ2) ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. ఆ భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు అప్పగించారు.[48] 2019 ఆగస్టు 5న అయోధ్యలో నరేంద్ర మోదీ భూమిపూజను నిర్వహించాడు. రామజన్మభూమి, హనుమాన్ గర్హిలను సందర్శించిన మొదటి ప్రధానమంత్రి అయ్యాడు.[49]
ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, కర్ణాటక వంటి అనేక బిజెపి పాలిత రాష్ట్రాలు, వివాహం ద్వారా హిందూ మతం నుండి ఇస్లాంలోకి బలవంతంగా మారడాన్ని నిరోధించడానికి చట్టాలు చేసాయి. హిందుత్వ వాదులు దీనిని " లవ్ జిహాద్ " అని పిలుస్తారు. దీన్ని ఇస్లామోఫోబిక్ కుట్ర సిద్ధాంతంగా విస్తృతంగా పరిగణిస్తారు.[50][51] 2020 సెప్టెంబరులో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ "ప్రేమ పేరుతో మత మార్పిడులను" నిరోధించడానికి ఒక వ్యూహాన్ని రూపొందించాలని భావించాడు.[52][53] అక్టోబరు 31న, "లవ్ జిహాద్" [lower-alpha 1]ను అరికట్టడానికి తన ప్రభుత్వం ఒక చట్టం చేస్తుందని అతను ప్రకటించాడు. ఉత్తరప్రదేశ్ చట్టంలో, "చట్టవిరుద్ధమైన మత మార్పిడి"కి వ్యతిరేకంగా నిబంధనలను కూడా ఉన్నాయి. "ఒక అమ్మాయి మతం మార్చడమే" పెళ్ళికి ఏకైక ఉద్దేశం అయితే ఆ పెళ్ళి చెల్లదని ప్రకటించింది.[55] ఈ ఆర్డినెన్స్ 2020 నవంబరు 28 [56][57] నుండి చట్టవిరుద్ధమైన మత మార్పిడిని నిషేధించే ఆర్డినెన్స్గా అమలులోకి వచ్చింది. 2020 డిసెంబరులో ఉత్తరప్రదేశ్ మాదిరిగానే మధ్యప్రదేశ్ కూడా మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఆమోదించింది.[58][59][60][61][62][63] ఈ చట్టాల ప్రకారం వాటిని ఉల్లంఘించిన వారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు.[64] 2020 నవంబరు 25 నాటికి, హర్యానా, కర్నాటక ఇంకా ఇలాంటి చట్టాలపై చర్చలు జరుపుతున్నాయి.[50][51] 2021 ఏప్రిల్లో, గుజరాత్ అసెంబ్లీ "లవ్ జిహాద్"ని లక్ష్యంగా చేసుకునే ఉద్దేశ్యంతో, వివాహం లేదా ఆకర్షణ ద్వారా బలవంతంగా మత మార్పిడికి వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలను తీసుకువస్తూ మత స్వేచ్ఛ చట్టం, 2003ని సవరించింది.[65][66] కర్నాటక రాష్ట్ర మంత్రివర్గం కూడా మతమార్పిడి నిరోధక బిల్లును ఆమోదించి, 2021 డిసెంబరులో దీనిని చట్టంగా మార్చింది [67][68]
2014లో భారత పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ (బిజెపి) మెజారిటీతో ఎన్నికైనప్పటి నుండి గో సంరక్షణ సంఘటనల సంఖ్య పెరిగింది. గోసంరక్షకుల హింసా ఘటనలు, తీవ్రత "అంతకు ముందు లేనంతగా" ఉన్నట్లు వర్ణించబడింది. 2015 నుండి గోసంరక్షకుల హింస పెరిగిందని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదించింది [69] . భారతదేశంలో ఇటీవల హిందూ జాతీయవాదం పెరగడం ఈ పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు.[70][71] 2014 ఎన్నికలలో హిందూ జాతీయవాద బిజెపి విజయంతో తమకు "సాధికారత" లభించిందని చాలా వర్గాలు చెబుతున్నాయి.[72][73]
రాయిటర్స్ నివేదిక ప్రకారం, 2010 - 2017 మధ్యకాలంలో భారతదేశంలో మొత్తం 63 గోరక్షకుల దాడులు జరిగాయి. 2014 లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే చాలా వరకు జరిగాయి. 2010 - 2017 జూన్ మధ్య జరిగిన ఈ దాడుల్లో, "28 మంది భారతీయులు - వారిలో 24 మంది ముస్లింలు - మరణించారు, 124 మంది గాయపడ్డారు" అని రాయిటర్ నివేదిక పేర్కొంది.[74]
గుజరాత్,[75][76][77][78] వంటి అనేక బిజెపి రాష్ట్రాలు గోహత్యకు వ్యతిరేకంగా చట్టాలను ఆమోదించాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జాతీయ భద్రతా చట్టం, గ్యాంగ్స్టర్ చట్టం కింద పశువుల అక్రమ రవాణా, గోవధపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించాడు.[79] అస్సాం శాసనసభ, ఏ దేవాలయానికీ 5-కిమీ పరిధిలో గోవులను వధించడం లేదా గొడ్డు మాంసం అమ్మడాన్ని నిషేధించే బిల్లును ఆమోదించింది. హిందువులు, జైనులు, సిక్కులు, ఇతర గోమాంస భక్షకులు ఎక్కువగా నివసించే ప్రాంతాలు లేదా దేవాలయం, సత్రం వంటి ఇతర సంస్థలకు 5-కిమీ పరిధిలో వధకు ఈ చట్టం అనుమతి ఇవ్వదు. అయితే, కొన్ని మతపరమైన సందర్భాలలో మినహాయింపులు మంజూరు చేయవచ్చు.[80][81]
హిందుత్వ భావజాలం కింది అంశాలపై దృష్టి పెట్టింది:
హిందుత్వ నాయకులు భారతదేశ పౌరులందరికీ ఒకే విధమైన పౌర స్మృతి ఉండాలను కోరుతున్నారు. మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ ఒకే చట్టం వర్తించాలనేది దీని లోని మౌలిక సూత్రం.[98][99] మతంపై ఆధారపడిన భేదాత్మక చట్టాలు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయని, ఈ భేదాత్మక చట్టాలు వివిధ మత వర్గాల మధ్య విభజనకు బీజాలు వేశాయని వారు పేర్కొన్నారు.[98][99][100] 1955-56లో అమలులోకి వచ్చిన ప్రస్తుత చట్టాల ప్రకారం, ఏకరూప పౌర స్మృతి యొక్క రాజ్యాంగ నిర్దేశక సూత్రం ముస్లిమేతరులకు మాత్రమే వర్తిస్తుంది అని జాన్ హచిన్సన్, ఆంథోనీ స్మిత్ అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ను ముస్లిం నాయకులు వ్యతిరేకిస్తున్నారు.[98] భారతదేశంలోని ముస్లింలకు సమానంగా వర్తించే యూనిఫాం సివిల్ కోడ్ను భారత జాతీయ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ వంటి రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.[101]
కాశ్మీరీ ముస్లిం వేర్పాటువాదులు, 1998 వంధామా ఊచకోతతో కాశ్మీరీ హిందువుల జాతి ప్రక్షాళనకు సంబంధించి భారత ప్రభుత్వం చాలా నిష్క్రియాత్మకంగా వ్యవహరిస్తోందని హిందుత్వ అనుచరులు విమర్శిస్తూ ఉంటారు. హిందుత్వ వాదులు జమ్మూ కాశ్మీర్లో కఠినమైన వైఖరిని కోరుకుంటున్నారు.[102][103]
హిందుత్వ మద్దతుదారులు స్థానిక హిందూ సంస్కృతి, సంప్రదాయాలను ముఖ్యంగా హిందూ సంస్కృతికి ప్రతీకగా ఉన్న వాటిని రక్షించడానికి ప్రయత్నించారు. భారతీయ సంస్కృతి హిందూ సంస్కృతితో సమానంగా ఉంటుందని వారు నమ్ముతారు.[104] వీటిలో జంతువులు, భాష, పవిత్ర నిర్మాణాలు, నదులు, ఔషధాలు భాగమే.[105]
ముస్లింలతో ముడిపడి ఉన్న ఉర్దూను స్థానిక భాషగా ఉపయోగించడాన్ని వారు వ్యతిరేకించారు. ఉర్దూ విదేశీ సంస్కృతికి ప్రతీక అని వారు భావించారు. వారి ఉద్దేశంలో దేశంలోని విభిన్న శక్తులన్నింటినీ ఏకం చేసే అంశం హిందీ మాత్రమే. హిందీని భారతదేశ అధికారిక భాషగా చేయాలని వారు కోరుకుంటారు. ఆంగ్లం, ఇతర ప్రాంతీయ భాషల స్థానంలో హిందీని ప్రచారం చేయాలని భావించింది. అయితే, దీని వల్ల హిందీయేతర ప్రాంతాల్లో ఉద్రిక్తత, ఆందోళన నెలకొంది. హిందీయేతర ప్రాంతాలు దేశంలోని మిగిలిన ప్రాంతాలపై ఆధిపత్యం కోసం ఉత్తరాది చేసిన ప్రయత్నంగా భావించాయి. చివరికి, దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా ఈ డిమాండును పక్కన పెట్టారు.
స్వదేశీ వైద్యాన్ని, ప్రత్యేకించి ఆయుర్వేదాన్ని పునరుజ్జీవింపజేయడానికి ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరిగాయి. వైద్యరంగంలో ఈ పునరుజ్జీవన ఉద్యమ1890 మేలలో హిందూ జాతీయవాద ఆవిర్భావానికి ప్రధాన కారణం.[106]
హిందుత్వ అనేది హిందూ జాతీయవాద రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు (RSS), సంఘ్ పరివార్కూ మార్గదర్శక భావజాలం.[107] సాధారణంగా, హిందుత్వవాదులు వారు హిందూమతం, సిక్కుమతం, బౌద్ధమతం, జైనమతం, భారతదేశంలోని ప్రముఖమైన అన్ని ఇతర మతాల శ్రేయస్సునూ కోరేవారని నమ్ముతారు.
చాలా మంది జాతీయవాదులు హిందుత్వ భావనను రాజకీయ సాధనంగా ఉపయోగించి రాజకీయ, సాంస్కృతిక, సామాజిక సంస్థలుగా రూపొందారు. 1925లో స్థాపించబడిన మొదటి హిందుత్వ సంస్థ ఆర్ఎస్ఎస్. ప్రముఖ భారతీయ రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ (BJP)కి, హిందుత్వను సమర్థించే సంస్థల సమూహంతో సన్నిహిత సంబంధం ఉంది. వారు సమష్టిగా తమను తాము "సంఘ్ పరివార్" లేదా సంఘాల కుటుంబంగా పేర్కొంటారు. RSS, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్లు ఇందులో సభ్యులు. ఇతర సంస్థలు:
హిందూ మహాసభ, ప్రఫుల్ గోరాడియాకు చెందిన అఖిల భారతీయ జనసంఘ్,[108] సుబ్రమణ్యస్వామి జనతా పార్టీ,[109] మరాఠీ జాతీయవాద శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన వంటి రాజకీయ పార్టీలు సంఘ్ పరివార్ ప్రభావంలో కాక స్వతంత్రంగా ఉంటూ హిందుత్వ భావజాలాన్ని సమర్థిస్తాయి.[110] శిరోమణి అకాలీ దళ్ (SAD) అనేది ఒక సిక్కు మత పార్టీ. ఇది హిందుత్వ సంస్థలు రాజకీయ పార్టీలతో సంబంధాలను కొనసాగించిస్తుంది. ఎందుకంటే వారు కూడా సిక్కు మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.[111]
RSS వంటి సంస్థల హిందుత్వ భావజాలాన్ని చాలా కాలంగా ఫాసిజం, నాజీయిజాలతో పోల్చుతూ ఉన్నారు. ఉదాహరణకు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పత్రిక అయిన నేషనల్ హెరాల్డ్లో 1948 ఫిబ్రవరి 4 న ప్రచురించిన సంపాదకీయంలో "ఇది [RSS] హిందూమతాన్ని నాజీ రూపంలో కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది" అంటూ, దానిని అంతమొందించాలని కోరింది. అదేవిధంగా, 1956లో మరో కాంగ్రెస్ పార్టీ నాయకుడు హిందుత్వ భావజాల ఆధారిత జనసంఘ్ను జర్మనీలోని నాజీలతో పోల్చాడు. [note 3] 1940లు, 1950ల తర్వాత, అనేకమంది మేధావులు హిందుత్వను ఫాసిజంతో పోల్చారు. మార్జియా కాసోలారి, హిందుత్వ భావజాలపు ప్రారంభ నాయకులు రెండవ ప్రపంచ యుద్ధానికి ముందరి యూరోపియన్ జాతీయవాద ఆలోచనలను అరువుగా తీసుకున్నారు అని రాసింది. కాన్సైస్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రకారం, హిందుత్వ అనే పదంలో "ఫాసిస్టు ధోరణులున్నాయి".[12] 20వ శతాబ్దపు ప్రారంభంలో ఇటలీ, జర్మనీలలోని ఫాసిస్ట్ ఉద్యమాల నుండి ప్రారంభ హిందుత్వ సిద్ధాంతకర్తలు ప్రేరణ పొందారని చాలా మంది పండితులు ఎత్తి చూపారు.[113]
భారతీయ మార్క్సిస్ట్ ఆర్థికవేత్త, రాజకీయ వ్యాఖ్యాత అయిన ప్రభాత్ పట్నాయక్ హిందుత్వను "క్లాసికల్ కోణంలో దాదాపుగా ఫాసిస్టు" అని అన్నాడు. హిందుత్వ ఉద్యమం "వర్గ మద్దతు, వారి పద్ధతులు కార్యక్రమాల"పై ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నాడు.[6] పట్నాయక్ ప్రకారం, హిందుత్వలో కింది ఫాసిస్ట్ అంశాలున్నాయి: "హిందువులు" అనే భావనతో ఏకీకృత సజాతీయ మెజారిటీని సృష్టించే ప్రయత్నం; గత అన్యాయానికి వ్యతిరేకంగా మనోవేదన; సాంస్కృతిక ఆధిపత్య భావం; ఈ మనోవేదన ఆధిపత్యాల నేపథ్యంలో చరిత్ర వివరణ; ఈ వివరణకు వ్యతిరేకంగా ఉన్న హేతుబద్ధమైన వాదనల తిరస్కరణ; జాతి ఆధారంగా పురుషత్వం ఆధారంగా మెజారిటీ కోసం ఆరాటం".[6]
జాఫ్రెలాట్ ప్రకారం, గోల్వాల్కర్ వంటి ప్రారంభ హిందుత్వ ప్రతిపాదకులు దీనిని "జాతి ఆధారిత జాతీయవాదం" యొక్క తీవ్ర రూపంగా భావించారు. అయితే ఈ భావజాలం మూడు అంశాలలో ఫాసిజం నాజీయిజం ల కంటే భిన్నంగా ఉంది.[114] మొదటిది, ఫాసిజం, నాజీయిజం ల లాగా కాకుండా, హిందుత్వను దాని నాయకుడితో సన్నిహితంగా అనుబంధించలేదు. రెండవది, ఫాసిజం రాజ్యం యొక్క ప్రాధాన్యతను నొక్కిచెప్పగా, హిందుత్వ రాజ్యాన్ని ద్వితీయమైనదిగా పరిగణించింది. మూడవది, నాజీయిజం జాతి యొక్క ప్రాధాన్యతను నొక్కిచెప్పగా, హిందుత్వ భావజాలం జాతి కంటే సమాజానికి ప్రాధాన్యతనిచ్చింది.[114] [note 4] అచిన్ వనాయక్ ప్రకారం, అనేక మంది రచయితలు హిందుత్వకు ఫాసిస్టు అని ముద్ర వేసారు, అయితే అలాంటి ముద్ర రావాలంటే "కనీస స్థాయిలో నైనా ఫాసిజం ఉండడం" అవసరం. "హిందూ జాతీయవాదం, [జాతీయవాదం] అనే సాధారణ దృగ్విషయం యొక్క నిర్దిష్ట భారతీయ అభివ్యక్తి మాత్రమే గానీ, ఫాసిజం జాతికి చెందినది కాదు" అని వనాయక్ పేర్కొన్నాడు.[117]
మార్క్ జుర్జెన్స్మేయర్ ప్రకారం, భారతదేశం లోను, వెలుపలానూ ఉన్న అనేకమంది రచయితలు హిందుత్వను "ఫండమెంటలిస్ట్", "స్వదేశీ ఫాసిజంతో భారతదేశం సరసాలాడుట" అని అనేక రకాలుగా అభివర్ణించారు. కానీ దానితో ఇతరులు ఏకీభవించలేదు.[118] హిందుత్వంపై చర్చ దృక్పథానికి సంబంధించింది. భారతీయులు తమ సొంత వలస పాలన గతం, వారి సమకాలీన సమస్యల దృక్కోణం నుండి దీనిని చర్చిస్తారు. అయితే యూరో-అమెరికన్ దృక్కోణం దీనిని ప్రపంచ సమస్యల నుండి, క్లాసిక్ ఉదారవాద, సాపేక్షవాద స్థానాల వెలుగులో ఫండమెంటలిజంతో వారి స్వంత అనుభవాల నుండి పరిగణిస్తుంది, అని జుర్జెన్స్మేయర్ పేర్కొన్నాడు.[118]
హిందుత్వం జాతి ఆధారిత జాతీయవాదం కంటే సాంస్కృతికంగా ఆలింగనం చేసుకోవడంపై ఆధారపడీ ఉంటుంది కాబట్టి, సామాజిక శాస్త్రవేత్తలు చేతన్ భట్, పరిటా ముక్తాలు హిందుత్వాన్ని ఫాసిజంగానో నాజీయిజంగానీ గుర్తించడంలో ఇబ్బంది ఉందని వివరించారు. సాంస్కృతిక జాతీయ వాదం దాని "విలక్షణమైన భారతీయ" లక్షణం. "రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకోవడం కంటే పౌర సమాజంలో దీర్ఘకాలంగా ఉన్న సాంస్కృతిక శ్రమ ముఖ్యమైనద"ని ఆరెస్సెస్ భావిస్తుంది. వారు హిందుత్వను "విప్లవాత్మక సంప్రదాయవాదం" లేదా "జాతి నిరంకుశవాదం"గా అభివర్ణించారు.[8] థామస్ హాన్సెన్ ప్రకారం, హిందుత్వ అనేది వలస పాలనానంతర భారతదేశంలో "సంప్రదాయవాద విప్లవా"న్ని సూచిస్తుంది. దాని ప్రతిపాదకులు "కోరికలు, ఆందోళనలు, విభిన్న ఆత్మాశ్రయతల" పై ఆధారపడిన "హక్కులు, అర్హతల గురించిన ప్రజాస్వామిక చర్చ"కు "పితృస్వామ్య, జెనోఫోబిక్ ప్రసంగాలను" కలిపేస్తారు.[119]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.