కె.విశ్వనాథ్

దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం పొందిన తెలుగు సినిమా దర్శకుడు From Wikipedia, the free encyclopedia

కె.విశ్వనాథ్

కాశీనాధుని విశ్వనాధ్ (1930, ఫిబ్రవరి 19 - 2023, ఫిబ్రవరి 2) తెలుగు సినిమా దర్శకులు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్. సౌండ్ రికార్డిస్టుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొన్నాళ్ళు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అక్కినేని నటించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది. ఆయన సినీ జీవితంలో పేరెన్నికగన్న చిత్రం శంకరాభరణం. ఇది జాతీయ పురస్కారం గెలుచుకుంది. భారతీయ కళల నేపథ్యంలో ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ప్రధామైనవి. సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన తీసిన చిత్రాల్లో సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం ముఖ్యమైనవి. దర్శకుడిగా జోరు తగ్గాక సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు. శుభసంకల్పం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఠాగూర్, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్‌ఫెక్ట్, కలిసుందాం రా ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు. సినిమారంగంలో చేసిన కృషికిగాను, 2016 లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నాడు. 1992 లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నాడు. అదే సంవత్సరంలోనే పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నాడు. కళాతపస్వి ఆయన బిరుదు.[2]

త్వరిత వాస్తవాలు కాశీనాధుని విశ్వనాధ్, జననం ...
కాశీనాధుని విశ్వనాధ్
Thumb
కె .విశ్వనాథ్
జననం
కాశీనాధుని విశ్వనాధ్

1930 ఫిబ్రవరి 19
మరణంఫిబ్రవరి 2, 2023(2023-02-02) (aged 92)
హైదరాబాదు, తెలంగాణ
ఇతర పేర్లుకళాతపస్వి
వృత్తిదర్శకుడు, నటుడు, రచయిత, సౌండ్ రికార్డిస్టు
జీవిత భాగస్వామిజయలక్ష్మి (మ.2023 ఫిబ్రవరి 26)[1]
పిల్లలుపద్మావతి దేవి (కూతురు)
కాశీనాధుని నాగేంద్రనాథ్, కాశీనాధుని రవీంద్రనాథ్ (కొడుకులు)
తల్లిదండ్రులు
  • కాశీనాధుని సుబ్రహ్మణ్యం (తండ్రి)
  • సరస్వతమ్మ (తల్లి)
మూసివేయి
Thumb
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతిలో నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంటూ కె.విశ్వనాథ్

వ్యక్తిగత జీవితం

విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని పెద పులివర్రు అనే గ్రామం. బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊర్లో ఎక్కువ రోజులు నివసించలేదు. అక్కడి నుంచి వారి నివాసం విజయవాడకి మారింది. ఉన్నత పాఠశాల విద్య అంతా విజయవాడలోనూ, కాలేజీ విద్య గుంటూరు హిందూకాలేజీ, ఎ.సి కాలేజీల్లోనూ జరిగింది. బి.ఎస్సీ డిగ్రీ చేశాడు.[3][4][5]

సినీ ప్రస్థానం

విశ్వనాథ్ తన కెరీర్లో మద్రాస్ లోని వాహిని స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా రికార్డ్స్ గా ప్రారంభించాడు. అక్కడే విశ్వనాథ్ తండ్రి కూడా పనిచేసేవాడు. వాహినిలో సౌండ్ ఇంజనీర్ గా ఏ కృష్ణన్ మార్గదర్శకత్వంలో ముందుకుసాగాడు. తరువాత వీరు ఇద్దరూ సన్నిహితులుగా మారారు. తరువాత సినిమాలలో దర్శకత్వం చేయటం ప్రారంభించాడు. 1951 సంవత్సరంలో పాతాళ భైరవి సినిమాకు సహాయ దర్శకుడుగా దర్శకత్వం వహించాడు. 1965వ సంవత్సరంలో ఆత్మగౌరవం అనే సినిమాకు దర్శకత్వం వహించి దర్శకుడుగా మారాడు. ఈ సినిమాకు నంది అవార్డు లభించింది. తరువాత చెల్లెలు కాపురం, శారద, ఓ సీత కథ, జీవనజ్యోతి సినిమాలకు దర్శకత్వం వహించాడు. 1980లో తీసిన శంకరాభరణం ఘనవిజయం సాధించింది.

ఒక స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టాడు. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడికోడళ్ళు అనే సినిమాకు పనిచేస్తున్నపుడు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరాడు. ఆయనతో కలిసి అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అప్పటికే ఆయన ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు తర్వాత సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇస్తానని వాగ్దానం చేశాడు. అలా డాక్టర్ చక్రవర్తి తర్వాత అక్కినేని నాయకుడిగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. అప్పట్లో ఆకాశవాణి హైదరాబాదులో నిర్మాతగా ఉన్న గొల్లపూడి మారుతీరావు, రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి ఈ సినిమాకు కథను సమకూర్చగా, భమిడిపాటి రాధాకృష్ణ, గొల్లపూడి కలిసి మాటలు రాశారు. దుక్కిపాటి మధుసూదనరావు స్క్రీన్ ప్లే రాశాడు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది.[6] సిరిసిరిమువ్వ సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. కె విశ్వనాథ్ మొత్తం 60 సినిమాలకు దర్శకత్వం వహించారు ఆయన జేవీ సోమయాజులతో చేసిన శంకరాభరణం బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది ఈ సినిమాతోనే కె విశ్వనాథ్ దర్శకుడుగా పేరు సంపాదించాడు కే విశ్వనాథ్ దర్శకుడుగానే కాకుండా నటుడిగా నటించాడు లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో ఆయన కథానాయకుడు హరికృష్ణకు తండ్రిగా నటించాడు తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ లో హీరోయిన్ కాజల్ కు తాతగా నటించారు ఠాగూర్ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించారు బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ లో బాలకృష్ణకు తండ్రిగా నటించారు తరువాత వెంకటేష్ హీరోగా నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో త్రిష కు తాతగా నటించాడు ఈయన ఎల్వి ప్రసాద్ బి.యన్.రెడ్డి తరువాత దాదాసాహెబ్ ఫాల్కే పొందిన తెలుగు సినిమా దర్శకుడు ఈయన సినిమాల్లో శాస్త్రీయ సంగీతం అందరిని అలరించింది సిరివెన్నెల సిరివెన్నెల స్వర్ణకమలం స్వాతికిరణం లాంటి సినిమాల్లో శాస్త్రీయ సంగీతం కనిపిస్తుంది ఈయన దాదాసాహెబ్ ఫాల్కే 2016లో అందుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు దగ్గుబాటి రామానాయుడు ఎల్వి ప్రసాద్ బొమ్మిరెడ్డి నాగిరెడ్డి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి తరువాత ఈయన దాదాసాహెబ్ ఫాల్కే పొందారు కె విశ్వనాథ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు

విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది శంకరాభరణం. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి వంటిది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయం సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు. భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీసారు. వాటిలో కొన్ని సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం మొదలైనవి.

కుల వ్యవస్థ, వరకట్నం వంటి సామాజిక అంశాలను కూడా తీసుకుని విశ్వనాథ్ చిత్రాలు నిర్మించారు. సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి సినిమాలు ఈ కోవలోకి వస్తాయి.

శంకరాభరణానికి జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. స్వాతిముత్యం సినిమా 1986లో ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది. భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను విశ్వనాథ్ కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది.

విశ్వనాథ్ సినిమాల ప్రత్యేకత

విశ్వనాథ్ సినిమాలలో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తన సినిమాలకు ఎక్కువగా కె.వి.మహదేవన్ నుగానీ, ఇళయరాజాను గానీ సంగీత దర్శకులుగా ఎంచుకునేవారు. కొన్ని సినిమాలలో పండిత హరిప్రసాద్ చౌరాసియా, కేలూచరణ్ మహాపాత్ర, షరోన్ లోవెన్ వంటి ప్రముఖ కళాకారులతో కలిసి పనిచేసారు. కెరీర్ చివర్లో దర్శకత్వ బాధ్యతలను తగ్గించుకుని నటుడిగా ప్రేక్షకులను అలరించారు.

కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రాలు

కె.విశ్వనాథ్ నటించిన చిత్రాలు

పురస్కారాలు

  • జాతీయ చలనచిత్ర పురస్కారాలు
  • 1992 - రఘుపతి వెంకయ్య పురస్కారం
  • 1992 - పద్మశ్రీ పురస్కారం
  • 2016 - దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం.[9][10]
  • 2017 - జీవిత సాఫల్య పురస్కారం - రోటరీ క్లబ్
  • 2018 - జీవిత సాఫల్య పురస్కారం - వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌[11]
  • 2021 - సైమా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
  • 2022 - జీవిత సాఫల్య పురస్కారం - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

మరణం

92 ఏళ్ల కె. విశ్వనాథ్‌ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాదులోని అపోలో ఆస్పత్రితో చికిత్స పొందుతూ 2023 ఫిబ్రవరి 2న శివైక్యం చెందారు.[12][13][14]

ప్రముఖుల సంతాపం

  • ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు. సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీ లోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
  • తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కళాతపస్వి విశ్వనాథ్ మృతిపట్ల దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. ఆయన దర్శకత్వం వహించిన శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం వంటి చిత్రాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
  • సౌండ్ రికార్డిస్ట్‌గా సినీ ప్రస్థానం ప్రారంభించిన కె. విశ్వనాథ్‌ తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేశారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ఆయన తొలి చిత్రంతోనే నంది అవార్డు అందుకున్నారన్నారు.
  • పితృసమానులు, గురువు కళా తపస్వి విశ్వనాథ్ గురంచి ఎంత చెప్పిన తక్కువేనని నటుడు చిరంజీవి అన్నారు. శంకరాభరణం విడుదలైన రోజు(పిబ్రవరి 2)నే ఆయన శివైక్యం చెందారన్నారు.
  • జీవిత పరమార్థాన్ని, కళ సజీవమైనదని పూర్తి అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తి కళాతపస్వి కె.విశ్వనాథ్‌గారు. ఆయన చేసిన కళాసేవ ఎప్పటికీ అజరామరం అన్నారు నటుడు కమల్ హాసన్.
  • ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు కె. విశ్వనాథ్‌ గుర్తింపు తెచ్చారని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ కొనియాడారు. ఆయన విమర్శకుల ప్రశంసలను అందుకున్న దిగ్గజ దర్శకుడన్నారు.
  • అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో వెండి తెర దృశ్య కావ్యముగా మలిచిన అరుదైన దర్శకుడు కె.విశ్వనాథ్‌ అని అప్పటి తెలంగాణ రా!ష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు ఆయన పేరు నిలిచే ఉంటుందన్నారు.
  • ప్రముఖ సినీ దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ గారి మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
  • హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని కె. విశ్వనాథ్‌ స్వగృహంలో ఆయన భౌతికకాయాన్ని అప్పటి ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ అనిల్ కుర్మాచలం సందర్శించి నివాళులు అర్పించారు. కె. విశ్వనాథ్‌ గారి మృతి బాధాకరమని, ఆయన అరుదైన దర్శకులని, తెలుగు చిత్ర పరిశ్రమలో చిరకాలం గుర్తుండే సినిమాలు రూపొందించారని అన్నారు.[15]
  • ప్ర‌పంచంలో ఎవ్వ‌రైనా మీ తెలుగు సినిమా గొప్ప‌ద‌నం ఏంటి అని అడిగితే మాకు కె విశ్వ‌నాథ్ గారు ఉన్నారు అని రొమ్ము విరిచి గ‌ర్వంగా చెప్పుకుంటాం అన్న ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి ఆజ‌న్మాన్తం ఆయనకు రుణప‌డి ఉంటామన్నారు.
  • సిరిసిరిమువ్వ చిత్రంతో తన కెరీర్‌ను మలుపు తిప్పిన దిగ్గజ దర్శకుడు విశ్వనాథ్‌గారు అలా నిర్జీవంగా చూసి చంద్రమోహన్‌ చలించిపోయాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆయనను ఓదర్చాడం ఎవరి తరం కాలేదు. కె.విశ్వనాథ్‌, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చంద్రమోహన్ లది అన్నదమ్ముల అనుబంధం.[16]

చిత్రమాలిక

బయటి లింకులు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.