మాలపిల్ల
1938 తెలుగు సినిమా / From Wikipedia, the free encyclopedia
మాలపల్లి గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో "సారధి ఫిలిమ్స్ " నిర్మాణంలో గోవిందరాజులు సుబ్బారావు, కాంచనమాల, గాలి వెంకటేశ్వరరావు ప్రధానపాత్రల్లో నటించిన 1938 నాటి తెలుగు సాంఘిక చలనచిత్రం[1]. గుడిపాటి వెంకటచలం రాసిన అముద్రిత నవల మాలపిల్ల సినిమాకు ఆధారం. మాటలు, కొన్ని పాటలు తాపీ ధర్మారావు నాయుడు రాయగా, మిగిలిన పాటలు అప్పటికే ప్రచారంలో ఉన్న బసవరాజు అప్పారావు గేయాలు, జయదేవుని అష్టపదుల నుంచి తీసుకున్నారు. భీమవరపు నరసింహారావు సంగీతాన్ని అందించారు. చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామకృష్ణ ప్రసాద్ ప్రోత్సాహం, ఆర్థిక సహకారంతో గూడవల్లి రామబ్రహ్మం ఎండీగా ప్రారంభమైన సారధి ఫిలిమ్స్ తొలి చిత్రంగా మాలపిల్ల నిర్మించారు. రంగస్థలంలో ప్రఖ్యాతుడైన గోవిందరాజులు సుబ్బారావుకూ, సినిమా రంగంలో ప్రయత్నాలు చేస్తున్న గూడవల్లి రామబ్రహ్మానికి కూడా ఇదే తొలి చిత్రం.
మాలపిల్ల (1938 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గూడవల్లి రామబ్రహ్మం |
---|---|
కథ | గుడిపాటి వెంకటచలం |
తారాగణం | గోవిందరాజులు సుబ్బారావు, కాంచనమాల, భానుమతి, సుందరమ్మ, పి.సూరిబాబు, గాలి వెంకటేశ్వరరావు, వెంకటసుబ్బయ్య, రాఘవన్, గంగారత్నం, లక్ష్మీకాంతమ్మ, టేకు అనసూయ, పువ్వుల అనసూయ |
సంగీతం | భీమవరపు నరసింహారావు |
సంభాషణలు | గుడిపాటి వెంకటచలం, తాపీ ధర్మారావు |
నిర్మాణ సంస్థ | సారధి ఫిలిమ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కళ్యాణపురం అన్న గ్రామంలో హరిజన యువతి, బ్రాహ్మణ యువకుడు ప్రేమించుకుని సాంఘిక స్థితిగతులను ఎదిరించి ప్రేమ సఫలం చేసుకోవడమూ, హరిజనులు పోరాటం ద్వారానూ, తమ సహృదయత ద్వారానూ ఛాందస బ్రాహ్మణుడైన ధర్మకర్త సుందరరామశాస్త్రి మనసు మార్చి దేవాలయ ప్రవేశం పొందడం సినిమా కథాంశం[2]. అంటరానితనం నిర్మూలన, హరిజనుల దేవాలయ ప్రవేశం, కులాంతర వివాహం, సంస్కరణోద్యమం వంటి సాంఘిక అంశాలను ప్రధానంగా స్వీకరించి సినిమా తీశారు[1].[3] ఐతే కులవివక్ష సమాజం అంతా ఉండగా కేవలం బ్రాహ్మణులనే లక్ష్యంగా చేసుకుని, సంస్కరణాభిలాష మొత్తానికి చౌదరి అనే పాత్రనే ప్రతినిధిగా చేసి సినిమా తీయడం వివక్షాపూరితంగా ఉందంటూ సమకాలీన బ్రాహ్మణుల నుంచి విమర్శలు, నిరసనలు వచ్చాయి.
సినిమాను 1938 మే 1న ప్రారంభించి మద్రాసు (నేటి చెన్నై)లోని మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ కంబైన్స్ స్టూడియోలోనూ, నగరం చుట్టుపక్కల గ్రామాల్లోనూ చిత్రీకరణ చేశారు. పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు బొంబాయి (నేటి ముంబై)లో పూర్తిచేసుకున్నారు. సినిమా నిర్మాణానికి రూపాయలు లక్షా పదివేలు ఖర్చు అయ్యింది. సినిమా ముగింపులో హరిజనులకు దేవాలయ ప్రవేశాన్ని కల్పిస్తూ శాసనం చేసిన తిరువాన్కూరు మహారాజును ప్రశంసిస్తూ కొన్ని ప్లేబాక్ డైలాగులు చేర్చారు. మాలపిల్ల సినిమాను సంస్కరణవాది, ప్రముఖ దాత కాశీనాథుని నాగేశ్వరరావుకు అంకితం ఇచ్చారు. నిర్మాణానికి కొన్ని రోజుల ముందు మరణించిన నాగేశ్వరరావు పంతులు అంతిమయాత్రను సినిమా చివరిలో అనుబంధంగా చేర్చారు.
మాలపిల్ల సినిమా తెలుగు సినిమా రంగంలో తొలి వివాదాస్పదమైన సినిమా. సినిమాను నిషేధించాలని, కొన్ని భాగాలు పునర్నిర్మించాలని కాకినాడ, విజయవాడ వంటి ప్రాంతాల్లో సభల్లో తీర్మానాలు జరిగాయి. సినిమా సమాజంలోని వాస్తవాలకు బదులు పక్షపాతధోరణులతో చిత్రీకరిస్తోందంటూ పత్రికల్లో విమర్శలు, సమాజంలోని దుర్లక్షణాలను వ్యతిరేకించిందే తప్ప వర్గాన్ని లక్ష్యం చేసుకోలేదని సమర్థనలు వచ్చాయి. సినిమా కారణంగా కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణులకు మంచినీరు ఇవ్వకపోవడం, పారిశుధ్య కార్మికులు తిరుగుబాటు చేయడం వంటివి చోటుచేసుకున్నాయి. బ్రాహ్మణుల అభ్యంతరాలకు ఆజ్యం పోస్తూ పిలక బ్రాహ్మణులకు ఉచిత పాసులు అంటూ ప్రచారం చేశారు. ఐతే వాదోపవాదాలు, వివాదాల కారణంగా మరింత ప్రాచుర్యం లభించి సినిమా విజయవంతం అయింది. సినిమా దశాబ్దాలు గడిచేకొద్దీ సాహసోపేతమైన చిత్రంగా, సందేశాత్మక చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుని తెలుగు సినిమా రంగంలో క్లాసిక్ గా పేరుపొందింది.