From Wikipedia, the free encyclopedia
బీడ్, మహారాష్ట్ర రాష్ట్రం, మరాఠ్వాడా ప్రాంతంలో ఉన్న ఒక పట్టణం. ఇది బీడ్ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం.[1]
బీడ్ | |
---|---|
— పట్టణం — | |
ఖండోబా ఆలయం | |
దేశం | India |
రాష్ట్రం | మహారాష్ట్ర |
ప్రాంతం | మరాఠ్వాడా |
జిల్లా | బీడ్ |
స్థాపన | సా.శ. 13 వ శతాబ్ది (సుమారు) |
జనాభా (2011) | |
- మొత్తం | 1,46,709 |
Population rank | 321 |
భాషలు | |
- అధికారిక | మరాఠీ |
Time zone | IST (UTC+5:30) |
PIN | 431122 |
Telephone code | +91-2442 |
Vehicle registration | MH-23 |
లింగనిష్పత్తి | 933 ♀/♂ |
Child sex ratio | 843 ♀/♂ |
అక్షరాస్యత | 88.56% |
Male literacy | 94.01% |
స్త్రీలు | 82.81% |
శీతోష్ణస్థితి | BSh (Köppen) |
అవపాతం | 666 మిల్లీమీటర్లు (26.2 అం.) |
సగటు వేసవి ఉష్ణోగ్రత | 40 °C (104 °F) |
సగటు శీతాకాల ఉష్ణోగ్రత | 15 °C (59 °F) |
బీడ్ బహుశా మధ్యయుగానికి చెందిన చారిత్రక నగరం. దీని ప్రారంభ చరిత్ర అస్పష్టంగా ఉంది. దేవగిరి ( దౌల్తాబాద్ ) యాదవ పాలకులు (1173–1317) ఈ నగరాన్ని స్థాపించి ఉండవచ్చని చరిత్రకారులు పురావస్తు అవశేషాల ఆధారంగా ఊహిస్తున్నారు. బ్రిటిష్ ఇండియా కాలంలో నిజాంల అధీనంలో ఉండేది. 1948 సెప్టెంబరులో జరిగిన సైనిక చర్యలో భారత సాయుధ దళాలు హైదరాబాద్ రాష్ట్రంపై దాడి చేసి దాని నిజాంను పడగొట్టి, రాష్ట్రాన్ని భారతదేశంలోకి చేర్చాయి. 1956లో బాంబే ప్రెసిడెన్సీలో చేర్చేవరకు బీడ్, హైదరాబాద్ రాష్ట్రంలోనే ఉండేది. 1960 మే 1 న భాషా ప్రాతిపదికన మహారాష్ట్ర రాష్ట్రం ఏర్పడినపుడు మరాఠీలు ముస్లింలు అధికంగా ఉండే బీడ్ జిల్లా మహారాష్ట్రలో భాగమైంది.[2][3]
తుగ్లక్ సామ్రాజ్యంలో భాగమయ్యే వరకు బీడ్ యొక్క ప్రారంభ చరిత్ర అస్పష్టంగా ఉంది. 1317లో చివరి ఖాల్జీ అయిన కుతుబ్-ఉద్-దిన్ ముబారక్ షా (1316-20) దేవగిరిని స్వాధీనం చేసుకున్నప్పుడు, యాదవ రాజవంశం అంతం అయినప్పుడు బీడ్ మొదటిసారిగా ముస్లిం పాలనలోకి వచ్చింది. ఘియాస్-ఉద్-దిన్ తుగ్లక్ (1320-25) 1320 లో దాన్ని స్వాధీనం చేసుకునేవరకు బీడ్, ఖాల్జీల పాలన లోనే ఉంది. 1327లో మహమ్మద్ బిన్ తుగ్లక్ (1325–51) దౌలతాబాద్ను తన రాజధానిగా చేసుకున్నాడు. తుగ్లక్ అతని సైన్యం 1341లో (AH 742 ఇస్లామిక్ క్యాలెండర్ ) వరంగల్ నుండి దౌల్తాబాద్కు తిరిగి వెళుతున్నప్పుడు బీడ్ నగరం సమీపంలో విడిది చేసినట్లు ఫిరిష్తా వివరించాడు. చక్రవర్తి పన్ను ఒకటి ఊడిపోయింది. దానిని చాలా వేడుకగా ఖననం చేయాలని ఆదేశించి, ఆ స్థలంలో ఒక సమాధిని నిర్మించాడు.[4] కర్జనీ గ్రామం సమీపంలోని కొండపై తుగ్లక్ పంటి సమాధి ఉంది. ప్రస్తుతం ఇది కూలిపోయే పరిస్థితిలో ఉంది. తుగ్లక్ సామ్రాజ్య గవర్నర్లలో ఒకరైన జునా ఖాన్ బీడ్లో కొంతకాలం నివసించాడు. అతను ప్రజాసంక్షేమం కోసం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాడు. నగరం చుట్టూ రక్షణ గోడను నిర్మించడం ద్వారా బెన్సురా నదిని పడమర నుండి తూర్పుకు మళ్లించాడు. అతని కాలానికి ముందు నగరానికి అలాంటి రక్షణ లేదు. ఇది నది యొక్క తూర్పు ఒడ్డున ఉంది. ఆ తర్వాత జనాభా ఎక్కువగా పశ్చిమ భాగానికి మారింది.[5]
1347లో బహమనీ సుల్తానేట్ స్థాపకుడు హసన్ గంగూ (1347-58) తుగ్లక్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అలా-ఉద్-దిన్ బహ్మాన్ షాగా దౌలతాబాద్ సింహాసనాన్ని అధిష్టించినప్పుడు బీడ్, బహమనీ పాలనలోకి వచ్చింది. మహమ్మద్ తుగ్లక్ తిరుగుబాటుదారులను అణచివేయడానికి దక్కన్కు వచ్చాడు. అతను దౌలతాబాద్ ప్రావిన్స్ను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. బీడ్ కూడా అందులో భాగం. హసన్ గంగూ, ఇతర తిరుగుబాటుదారులు బీడ్ మీదుగా బీదర్, గుల్బర్గాలకు పారిపోయారు. ఈ విషయం పూర్తిగా పరిష్కారం కాకముందే గుజరాత్లో ఒక తిరుగుబాటుదారుడు విరుచుకుపడ్డాడు. సుల్తాన్ ఇమాద్-ఉల్-ముల్క్ను దక్కన్లో గవర్నర్గా నియమించి తుగ్లక్, గుజరాత్కు చేరుకున్నాడు. ఇంతలో, హసన్ గంగు దౌల్తాబాద్పై దాడి చేసి బీడ్ను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత, నగరం బహ్మనీద్ పాలనలో ఉండేది. ఫిరూజ్ షా బహమనీ (1397–1422) పాలనలో ఇది అభివృద్ధి చెందింది. హుమాయున్ షా బహ్మనీ (1451–61) పాలనలో, జాలిమ్ (క్రూరత్వం)గా ప్రసిద్ధి చెందిన అతని సోదరుడు హసన్ షా తిరుగుబాటు చేసి బీడ్కు వచ్చాడు. బీడ్కు చెందిన జాగీర్దార్ (సామంతుడు) హబీబుల్లా షా అతనికి మద్దతుదారు. హుమాయున్ షా అతనిపై దాడికి సైన్యాన్ని పంపాడు. కంకళేశ్వర్ ఆలయ మైదానంలో భీకర పోరాటం తర్వాత, తిరుగుబాటు సైన్యాలు హుమాయున్ సైన్యాన్ని ఓడించాయి. హుమాయున్ కోపోద్రిక్తుడై, తిరుగుబాటుదారులను ఓడించడానికి మరొక సైన్యాన్ని పంపాడు. ఈసారి తిరుగుబాటుదారులు ఓడిపోయారు. హబీబుల్లా షా హతుడయ్యాడు. హసన్ షాను బంధించి రాజధానికి తీసుకువెళ్లారు .[6]
బహమనీ సుల్తానేట్ క్షీణత తరువాత, నగరం అహ్మద్నగర్ నిజాం షాహీ పాలకుల వశమైంది. బీడ్ను స్వాధీనం చేసుకోవడానికి బీజాపూర్లోని నిజాం షాహీ, ఆదిల్ షాహీ పాలకుల మధ్య బీడ్లో అనేక యుద్ధాలు జరిగాయి. 1598లో మొఘలులు అహ్మద్నగర్లోని చాంద్ బీబీ నుండి బీడ్ను స్వాధీనం చేసుకున్నారు. ఒక సంవత్సరం తర్వాత నిహాంగ్ ఖాన్ దానిని తిరిగి తీసుకున్నాడు. కానీ వెంటనే అది మళ్లీ మొఘల్ల చేతికి చిక్కింది. మొఘల్ సైన్యం ఇక్కడ కొంతకాలం విడిది చేసింది. జహంగీర్ (1569–1627) కాలంలో జన్ సిపార్ ఖాన్ బీడ్ నగరాన్ని పరిపాలించాడు. అతను 1036 AH (1627)లో బీడ్ జామా మసీదును నిర్మించాడు.
ఔరంగజేబ్ (1658–1707), హాజీ సదర్ షాను బీడ్^కు నైబ్-ఎ-సుబాదర్ (గవర్నర్ సహాయకుడు)గా నియమించారు. సదర్ షా నగరంలో కొన్ని మంచి మార్పులు, నిర్మాణాలు చేశాడు. అతను 1702లో ఈద్ గాహ్ (ఈద్ ప్రార్థన స్థలం), 1703లో ఘాజీ పురా (ప్రస్తుతం ఇస్లాం పురా)గా తూర్పు భాగంలో ఒక కొత్త నివాసాన్ని నిర్మించాడు. దాని అవశేషాలు ఇప్పటికీ కనిపిస్తాయి. అతను పాత కోట లోపల మరొక కోట (1703)ని కూడా నిర్మించాడు. ఇది తుగ్లక్ కాలం నుండి అనేక వందల సంవత్సరాల పాటు నిలిచిపోయింది. జామా మసీదు ప్రధాన ప్రవేశద్వారం వద్ద పర్షియన్ లిపిలో ఒక రాతి ఫలకం 1115 AH (1703)లో హాజీ సదర్ షా కోటను నిర్మించిన సంవత్సరాన్ని నిర్దేశిస్తుంది. అతని కాలంలో నగరం ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందింది. బీడులో తయారు చేసిన ఛగల్ (తోలుతో చేసిన నీటి పాత్ర), గుప్తి (చెక్క కర్రలో దాచిన కత్తి) మొదలైనవి ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందాయి.[5]
బహమనీలు, మొఘలుల కాలంలో బీడ్ చాలా అందమైన నగరం. తారీఖ్-ఎ-బీర్ ఈ కాలాల్లోని అనేక తోటలు, సౌకర్యాలను ప్రస్తావిస్తుంది. 1960ల వరకు నగరంలో రెండు చక్కటి తోటలు ఉండేవి. 1724లో నిజాం-ఉల్-ముల్క్ అసఫ్ జా అసఫ్ జాహీ రాజ్యాన్ని స్థాపించాడు. మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా (1719-48) పాలనకు వ్యతిరేకంగా దక్కన్ను స్వాధీనం చేసుకున్నాడు. నిజాంల కాలంలో కోటను పెద్దగా విస్తరించడం గాని, నిర్మాణం గానీ జరగలేదు. గ్వాలియర్ మరాఠా పాలకుడు, మహద్జీ సింధియా (1761-94) 1761లో మూడవ పానిపట్ యుద్ధంలో ఓటమి తర్వాత కనబడకుండా పోయాడు. బీడ్కు చెందిన అతని భార్య, బీడ్ మన్సూర్ షా లోని సూఫీ వద్దకు వెళ్లి, మహద్జీ తిరిగి రావాలని కోరింది. మహద్జీ గ్వాలియర్కు తిరిగి వచ్చినప్పుడు, అతను సూఫీని గ్వాలియర్కు పిలిపించాడు. కానీ అతను నిరాకరించి, బదులుగా తన కుమారుడు హబీబ్ షాను పంపాడు. మహద్జీ తన జీవితాంతం మన్సూర్ షాకు కృతజ్ఞతలు తెలుపుతూనే ఉన్నాడు. అతని సమాధి సింధియాస్ నిర్మించిన తూర్పు బీడ్లో ఉంది. ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ (1869-1911) పాలన బీడ్ చరిత్రలో సంఘటనాత్మకమైనది. అతని పాలనలో తిరుగుబాట్లు, గొప్ప కరువు, వరదలు సంభవించాయి. జాగీర్దార్ల స్థానంలో కలెక్టర్లు ( అవ్వల్ తాలూక్దార్లు ) అతని తండ్రి పాలనలోనే నియమించబడ్డారు. జీవన్జీ రతన్జీ 1865లో బీడ్కు మొదటి కలెక్టర్గా వచ్చాడు. జిల్లాలను సృష్టించాడు. బీడ్ జిల్లా అధికారికంగా 1883 లో[7] ఏర్పడింది. అతను బెన్సురా నదికి తూర్పు ఒడ్డున ఒక నివాసం, మహబూబ్ గంజ్ మార్కెట్ (ప్రస్తుతం హీరాలాల్ చౌక్) నిర్మించాడు. దాని అవశేషాలు ఇప్పటికీ చూడవచ్చు. 1897-99 మధ్య వరుసగా మూడు సంవత్సరాలు చాలా తక్కువ వర్షపాతం తర్వాత, 1900లో బీడ్లో గొప్ప కరువు ఏర్పడింది. వేలాది పశువులు, వందలాది మానవులు ఆకలితో చనిపోయారు. వేలాది మంది దేశంలోని పొరుగు ప్రాంతాలకు వలస వెళ్లారు. 1901 జనాభా లెక్కల ప్రకారం బీడ్ జిల్లా జనాభాలో 1,50,464 తగ్గుదల కనిపించింది.[7]
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (1911-48) మహబూబ్ అలీ ఖాన్ మరణానంతరం హైదరాబాద్ రాష్ట్రానికి ఏడవ, చివరి నిజాం అయ్యాడు. అతని కాలంలో ప్రభుత్వ వ్యవస్థ, విద్య, వైద్యంలో సంస్కరణలు చేసాడూ. కొత్వాలీలు, పోలీస్ స్టేషన్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, డిస్పెన్సరీలు అతని కాలంలో నిర్మించారు. అతను రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలు, పెద్ద గ్రంథాలయాలను స్థాపించాడు.[8] నిజాంలు భారతదేశంలోని బ్రిటిష్ సామ్రాజ్యానికి మిత్రులు. స్వాతంత్ర్యం కోసం దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో, 19, 20 వ శతాబ్దాలలో వారు స్వాతంత్ర్య సమరయోధుల దేశవ్యాప్త ప్రయత్నాల కారణంగా వ్యాప్తి చెందుతున్న జాతీయవాద భావాలను అణిచివేసేందుకు ప్రయత్నించారు. బ్రిటీష్ సామ్రాజ్యంతో నిజాం స్నేహం హైదరాబాద్ రాష్ట్రంలోని జాతీయవాదులకు నచ్చలేదు. 1818 [9] స్వాతంత్ర్య పోరాటం మొదటగా ప్రారంభమైన మరఠ్వాడా ప్రాంతంలో బీడ్యే. 1818లో నిజాం సికందర్ జా (1803–29) పాలనలో ధర్మాజీ ప్రతాప్రావు నాయకత్వంలో బీడ్లో మొదటి తిరుగుబాటు విరుచుకుపడింది. నిజాం బ్రిటిష్ లెఫ్టినెంట్ జాన్ సదర్లాండ్ ఆధ్వర్యంలో నవాబ్ ముర్తజా యార్ జంగ్, రిసాలాను పంపాడు. తిరుగుబాటు నాయకుడు, అతని సోదరుడు పట్టుబడ్డారు. బీడ్లో సుదీర్ఘ తిరుగుబాటు ఉద్యమం ముగిసింది.[9][10]
1858లో మరో తిరుగుబాటు జరిగింది కానీ తిరుగుబాటుదారులందరూ పట్టుబడ్డారు. దీని తరువాత బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా అనేక చిన్న చిన్న ధిక్కార సంఘటనలు జరిగాయి కానీ అన్నింటినీ అణచివేసారు. 1898లో బాబా సాహబ్ అలియాస్ రావు సాహబ్ దేశ్ పాండే నాయకత్వంలో ఒక పెద్ద తిరుగుబాటు తలెత్తింది. ఈ ఉద్యమం యొక్క ముఖ్య నాయకులు బీడ్ బ్రాహ్మణులు. పోలీసు, న్యాయవ్యవస్థలోని దేశస్థ బ్రాహ్మణ అధికారులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. కానీ ఒక చిన్న పోరాటం తర్వాత తిరుగుబాటుదారులు పట్టుబడడంతో ఉద్యమం ముగిసింది. కానీ ధిక్కార భావాలను అణచివేయలేకపోయారు. స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో మరాఠ్వాడాలోను, రాష్ట్రంలోనూ వివిధ ఉద్యమాలు కొనసాగాయి. స్వాతంత్ర్యం తరువాత, ఆపరేషన్ పోలో జరిపి ఆరు రోజుల్లోనే రాష్ట్రాన్ని సులభంగా స్వాధీనం చేసుకుంది. ఆపరేషన్ పోలో తరువాత జరిగిన మతపరమైన మారణహోమంలో రాష్ట్రంలో అత్యధికంగా దెబ్బతిన్న ఎనిమిది జిల్లాల్లో బీడు ఒకటి.
1949లో నగరానికి, సమీప గ్రామాలకూ తాగునీరు, సాగునీటి సరఫరా కోసం బెంసూరా ప్రాజెక్టును నిర్మించారు. 1952లో, అవిభక్త హైదరాబాద్ రాష్ట్రంలో బీడ్ నగర్ పాలిక (మునిసిపల్ కౌన్సిల్)ను స్థాపించారు. 1962లో, మహారాష్ట్ర రాష్ట్రం ఏర్పడిన ఒక సంవత్సరం తర్వాత, అన్ని స్థానిక సంస్థలను రద్దు చేసిన తర్వాత బీడ్ జిల్లా కౌన్సిల్ ఉనికిలోకి వచ్చింది.[2]
బీడ్ దక్కన్ పీఠభూమిలో, బెన్సురా నది ఒడ్డున ఉంది. బెన్సురా అనేది గోదావరి నదికి ఉపనది, ఇది బాలాఘాట్ శ్రేణిలోని కొండలలో సుమారు వాఘిరా గ్రామం సమీపంలో బీడ్కు నైరుతి దిశలో 30 కి.మీ. దూరంలో ఉద్భవించింది. నది నగరాన్ని తూర్పు, పశ్చిమ భాగాలుగా విభజిస్తుంది. బాలాఘాట్ శ్రేణి చాలా దగ్గరగా, నగరానికి దక్షిణంగా 10 కి.మీ. దూరంలో ఉంది. బెన్సురా నదికి వచ్చే వరదలు నగర చరిత్రలో పదే పదే ఆస్తి, ప్రాణనష్టాన్ని కలిగించాయి, ఇటీవల 1989 జూలై 23 న నగరంలో మూడు ఆవాసాలను భారీ వరదలు ముంచెత్తడంతో అనేక మంది మరణించారు. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది.[6] బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ద్వారా 2000లో నవీకరించబడిన కొత్త భూకంప ప్రమాద మ్యాప్ ప్రకారం బీడ్ భారతదేశంలోని సీస్మిక్ హజార్డ్ జోన్-III కిందకు వస్తుంది. ఈ అప్డేట్కు ముందు నగరం జోన్-I కింద ఉంది.[11] బీడ్ ముంబై నుండి 400 కి.మీ. దూరంలో ఉంది.
నగరంలో సెమీ-శుష్క, వేడి, పొడి వాతావరణం ప్రధానంగా మూడు సీజన్లలో ఉంటుంది. వేసవి కాలం ఫిబ్రవరి మధ్య నుండి జూన్ వరకు దాదాపు ఐదు నెలల వరకు ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 31 °C – 40 °C మధ్య ఉంటాయి. సగటున ఇది 40 °Cకంటే ఎక్కువగా ఉండవచ్చు. మే నెల సగటు పగటి ఉష్ణోగ్రత 42 °C తో సంవత్సరంలో అత్యంత వేడిగా ఉండే నెల. చలికాలం ఉష్ణోగ్రతలు 12 °C - 20 °C మధ్య ఉంటాయి. డిసెంబరు, సంవత్సరంలో అత్యంత శీతలమైన నెల. అప్పుడప్పుడు, ఉష్ణోగ్రత 3 °C కంటే దిగువకు పడిపోవచ్చు.
బీడ్ వర్షచ్ఛాయా ప్రాంతంలో ఉన్నందున వర్షపాతం తక్కువగా ఉంటుంది. వార్షిక సగటు వర్షపాతం 66.6 సెం.మీ (26.22 అంగుళాలు).[3] సంవత్సరంలో సగటు వర్షపు రోజుల సంఖ్య 41.
శీతోష్ణస్థితి డేటా - Beed (1981–2010, extremes 1960–1996) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 35.0 (95.0) |
38.4 (101.1) |
43.6 (110.5) |
44.6 (112.3) |
47.0 (116.6) |
44.3 (111.7) |
38.9 (102.0) |
38.8 (101.8) |
37.8 (100.0) |
37.7 (99.9) |
34.6 (94.3) |
34.0 (93.2) |
47.0 (116.6) |
సగటు అధిక °C (°F) | 30.0 (86.0) |
32.4 (90.3) |
36.3 (97.3) |
39.0 (102.2) |
40.7 (105.3) |
35.1 (95.2) |
30.6 (87.1) |
30.0 (86.0) |
30.5 (86.9) |
31.2 (88.2) |
29.8 (85.6) |
28.9 (84.0) |
32.8 (91.0) |
సగటు అల్ప °C (°F) | 13.8 (56.8) |
15.0 (59.0) |
19.0 (66.2) |
22.7 (72.9) |
25.2 (77.4) |
24.4 (75.9) |
23.3 (73.9) |
22.6 (72.7) |
22.0 (71.6) |
19.7 (67.5) |
15.5 (59.9) |
13.0 (55.4) |
19.7 (67.5) |
అత్యల్ప రికార్డు °C (°F) | 4.0 (39.2) |
4.6 (40.3) |
9.4 (48.9) |
13.0 (55.4) |
16.5 (61.7) |
20.2 (68.4) |
19.8 (67.6) |
18.0 (64.4) |
15.7 (60.3) |
10.5 (50.9) |
5.0 (41.0) |
5.0 (41.0) |
4.0 (39.2) |
సగటు వర్షపాతం mm (inches) | 6.1 (0.24) |
2.5 (0.10) |
7.1 (0.28) |
9.7 (0.38) |
24.8 (0.98) |
119.0 (4.69) |
109.2 (4.30) |
124.8 (4.91) |
212.4 (8.36) |
83.2 (3.28) |
10.4 (0.41) |
10.3 (0.41) |
719.7 (28.33) |
సగటు వర్షపాతపు రోజులు | 0.3 | 0.2 | 0.7 | 0.9 | 1.9 | 6.5 | 7.4 | 7.2 | 9.9 | 4.3 | 1.0 | 0.4 | 40.6 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) | 38 | 31 | 29 | 29 | 28 | 51 | 64 | 66 | 65 | 53 | 46 | 44 | 45 |
Source: India Meteorological Department[12][13] |
2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[14] బీడ్ పట్టణ జనాభా 1,38,091. ఇందులో పురుషుల జనాభా 71,790, స్త్రీలు 66,301. పట్టణంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 923.54 మంది మహిళలు ఉన్నారు. జనన రేటు 15.9, ఇది జాతీయ సగటు 22 కంటే తక్కువ. మరణాల రేటు 3, ఇది జాతీయ సగటు 8.2 కంటే తక్కువ. శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి సజీవ జననాలకు 71, ఇది జాతీయ సగటు వెయ్యి జననాలకు 54.6 మరణాల కంటే చాలా ఎక్కువ. అయితే ప్రసూతి మరణాల రేటు 1, ఇది జాతీయ సగటు 540 కంటే చాలా తక్కువ [15]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.