దక్షిణ ఆసియాలో గణతంత్రం From Wikipedia, the free encyclopedia
ఆఫ్ఘనిస్తాన్ లేదా అఫ్ఘనిస్తాన్ (Afġānistān) దక్షిణ మధ్య ఆసియాలోని, సముద్రతీరం లేని దేశం. ఈ దేశం ఆధికారిక నామం ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామీయ గణతంత్రం. భౌగోళికంగా ఈ దేశాన్ని వివిధ సందర్భాలలో మధ్య ఆసియా దేశంగాను,[4] మధ్యప్రాచ్య దేశంగాను,[5] లేదా దక్షిణ ఆసియా దేశంగాను[6] వ్యవహరించడం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్కు దాని సరిహద్దు దేశాలతో జాతి, భాషా, భౌగోళిక సంబంధాలున్నాయి. దక్షిణాన, తూర్పున పాకిస్తాన్,[7] పశ్చిమంలో ఇరాన్, ఉత్తర దిశలో తుర్కమేనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, సుదూర ఈశాన్యంలో కొద్దిభాగం చైనా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులుగా ఉన్నాయి.
د افغانستان اسلامي جمهوریت ( Da Afġānistān Islāmī Jomhoriyat ) جمهوری اسلامی افغانستان ( జమ్హూరి-యె ఇస్లామి-యె ఆప్ఘనిస్తాన్ ) ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామీయ గణతంత్రం |
||||
---|---|---|---|---|
జాతీయగీతం మిల్లి తరానా(సురూద్-ఎ- మిల్లీ) |
||||
రాజధాని అతి పెద్ద నగరం | కాబూల్ 34°31′N 69°08′E | |||
అధికార భాషలు | పష్టూ, దారి (పర్షియన్) | |||
ప్రజానామము | అఫ్ఘన్[1][2][3] | |||
ప్రభుత్వం | ఇస్లామిక్ రిపబ్లిక్ | |||
- | ప్రెసిడెంట్ | హమీద్ కర్జాయి | ||
- | వైస్ ప్రెసిడెంట్ | అహమద్ జియా మసూద్ | ||
- | వైస్ ప్రెసిడెంట్ | కరీమ్ ఖలీలీ | ||
స్వాతంత్ర్యం | యునైటెడ్ కింగ్డమ్ నుండి | |||
- | ప్రకటించబడినది | ఆగస్టు 8, 1919 | ||
- | గుర్తించబడినది | ఆగస్టు 19, 1919 | ||
విస్తీర్ణం | ||||
- | మొత్తం | 652,090 కి.మీ² (41వది) 251,772 చ.మై |
||
- | జలాలు (%) | n/a | ||
జనాభా | ||||
- | 2007 అంచనా | 31,889,923 (37వది) | ||
- | 1979 జన గణన | 13,051,358 | ||
- | జన సాంద్రత | 46 /కి.మీ² (150వది) 119 /చ.మై |
||
జీడీపీ (PPP) | 2006 అంచనా | |||
- | మొత్తం | $32.4 బిలియన్ (92వది) | ||
- | తలసరి | $1,490 (158వది) | ||
మా.సూ (హెచ్.డి.ఐ) (1993) | 0.229 (n/a) (unranked) | |||
కరెన్సీ | అఫ్ఘని (AFN ) |
|||
కాలాంశం | (UTC+4:30) | |||
- | వేసవి (DST) | (UTC+4:30) | ||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .af | |||
కాలింగ్ కోడ్ | +93 |
ఆఫ్ఘనిస్తాన్లో మానవ నివాసం ప్రాచీన శిలా యుగం నాటి నుంచి ఉంది. దక్షిణ ఆసియా, మధ్య ఆసియా, నైరుతి ఆసియాలను కలిపే ఆఫ్ఘనిస్తాన్ చారిత్రకంగా సిల్క్ రోడ్డులో ఒక ముఖ్యమైన స్థానం. వివిధ సంస్కృతుల మేళనానికీ, జాతుల వలసకూ ముఖ్యమైన మజిలీగా ఉంది. పరిసర రాజ్యాల దండయాత్రలకు దేశం తరచు గురయ్యేది. అలెగ్జాండర్, మౌర్యులు, అరబ్బులు, మంగోలులు, బ్రిటీష్ వారు, అలాగే ఇక్కడి రాజులు కూడా పరాయి రాజ్యాలను ఆక్రమించి సామ్రాజ్యాలు స్థాపించారు. 18వ శతాబ్దం మధ్యకాలంలో కాందహార్ కేంద్రంగా అహమ్మద్ షా దుర్రానీ విశాలమైన రాజ్యాన్ని స్థాపించాడు.[8] కాని 19వ శతాబ్దంలో ఇది బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమయింది. ఆగస్టు 19, 1919 న మళ్ళీ స్వతంత్ర దేశము అయింది.
1970 దశకం నుండి ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైన అంతర్యుద్ధాలతోనూ, తీవ్రవాద కార్యకలాపాలతోనూ, విదేశీ దాడులతోనూ దారుణంగా నష్టపోయింది. దేశప్రజలు దారుణమైన ఇబ్బందులకు గురయ్యారు. 2001 తరువాత నాటో జోక్యంతో జరిగిన యుద్ధం తరువాత ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వం అమెరికా సహకారంతో నడుస్తున్నది. అంతర్జాతీయ సహకారంతో పెద్దపెట్టున పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు.
ఆఫ్ఘనిస్తాన్ అంటే 'ఆఫ్ఘనుల ప్రదేశం' - ఇక్కడి పర్షియన్లు తమను 'ఆఫ్ఘనులు' అని (కనీసం ఇస్లామిక్ యుగకాలం నుండి) చెప్పుకొన్నారు.[9] [10] ప్రత్యేకించి పుష్తో భాష మాట్లాడేవారికి 'ఆఫ్ఘన్' పదాన్ని వర్తింపజేయడం జరుగుతున్నది. భారతీయ జ్యోతిశ్శాస్త్రవేత్త వరాహమిహిరుడు సా.శ. 6వ శతాబ్దంలో ఈ ప్రాంతం వారిని అవగాన అని తన బృహత్సంహితలో ప్రస్తావించాడు.[11] మహాభారతం లాంటి మరికొన్ని గ్రంథాలు ఈ ప్రాంతాన్ని గాంధారం అని వ్యవహరిస్తాయి.
16వ శతాబ్దంలో మొఘలు రాజు బాబరు తన బాబర్నామాలో కాబూలు దక్షిణ ప్రాంతాన్ని ఆఫ్ఘనిస్తాను అని వ్రాశాడు.[12] 19వ శతాబ్దం వరకూ 'పుస్తూను' జాతి వారిని సూచించడానికి మాత్రమే ఆఫ్ఘనులు అనే పదాన్ని వాడారు. మొత్తం రాజ్యాన్ని సూచించడానికి కాబూలు రాజ్యం అనే పదాన్ని బ్రిటిషు చరిత్ర కారుడు ఎల్ఫిన్స్టోన్ వాడాడు.[13] క్రమంగా దేశం ఏకమై అధికారం కేంద్రీకృతమైన తరువాత ఆఫ్ఘను భూమి అన్న పదాన్ని వివిధ ఒడంబడికలలో వాడారు.[14] 1857 లో ఫ్రెడరిక్ ఎంగెల్స్ మొత్తం దేశాన్ని 'ఆఫ్ఘనిస్తాను' అనే పేరుతో ప్రస్తావించాడు.[15] 1919 లో దేశానికి పూర్తి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆధికారికంగా 'ఆఫ్ఘనిస్తాను' అనే పదాన్ని ప్రామాణికం చేశారు.[16] అదే పదాన్ని 1923 రాజ్యాంగంలో నిర్ధారించారు.[17]
ఆఫ్ఘనిస్తాను ఒక భూబంధిత దేశం. ఇందులో ఎక్కువ భాగం పర్వతమయంగా ఉంటుంది. ఉత్తర, నైరుతి సరిహద్దులలో మైదాన ప్రాంతం ఉంటుంది. దేశంలో అత్యంత ఎత్తైన స్థలం నౌషాకు (సముద్ర మట్టం నుండి 7,485 మీటర్లు లేదా 24,557 అడుగులు ఎత్తు). దేశంలో వర్షపాతం బాగా తక్కువగా ఉంటుంది. దేశంలో ఎక్కువ భూభాగం పొడి ప్రదేశంగా ఉంటుంది. ఎండోర్హిక్ సిస్టాన్ బేసిన్ ప్రపంచంలోనే అత్యంత పొడిగా ఉన్న ప్రాంతాలలో ఒకటి.[18]
ఆఫ్ఘనిస్తాను వాతావరణం ఖండాంతర్గతం (ఖండాంతర వాతావరణం). వేసవి కాలం చాలా వేడిగానూ, చలికాలం చాలా చల్లగానూ ఉంటుంది. చిన్న చిన్న భూకంపాలు సంభవిస్తుంటాయి. ముఖ్యంగా ఈశాన్యానంలోని హిందూకుషు పర్వత ప్రాంతంలో తరచు సంభవిస్తుంటాయి. 1998 మే 30న వచ్చిన భూకంపంలో సుమారు 125 గ్రామాలు నాశనమయ్యాయి. ఇందులో 4000 మంది మరణించారు.
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తానులో తీవ్రమైన పర్యావరణ మార్పులు సంభవిస్తున్నాయి. గడచిన రెండు దశాబ్దాలలో 70% అడవులు నశించాయి. 80% భూమిలో భూక్షయం తీవ్రమైన సమస్యగా ఉంది. భూసారం చాలా త్వరగా క్షీణిస్తున్నది. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.[19]
ఆఫ్ఘనిస్తానులో గణనీయమైన ఖనిజ నిక్షేపాలు, చమురు నిల్వలు, విలువైన రత్నాల గనులు ఉన్నాయి. కాని దేశంలోని రాజకీయ కల్లోలాల కారణంగా ఇతర అభివృద్ధి కొరతల వలనా వీటిని వినియోగించుకోవడంలేదు [20] [21][22] [23][24]
కనీసం 50,000 సంవత్సరాల పూర్వమే ఈ ప్రాంతంలో జనావాసాలున్నాయనీ, ఇక్కడి వ్యవసాయ జీవనం ప్రపంచం లోనే అత్యంత పురాతనమైన వాటిలో ఒకటి అనీ చెప్పడానికి ఆధారాలున్నాయి. కాని 1747 లో అహమ్మద్షా దుర్రానీ స్థాపించిన రాజ్యం ఇప్పటి ఆఫ్ఘనిస్తాను రాజకీయ స్వరూపానికి మూలంగా ఉంది.[8][25]
అనేక సంస్కృతుల, జాతుల ఆవాసాలకు, సమ్మేళనానికీ, పోరాటాలకూ నిలయంగా ఆఫ్ఘనిస్తాను ప్రాంతం చారిత్రక విశిష్టత కలిగి ఉంది. ఆర్యులు (ఇండో-ఇరానియనులు అనగా కాంభోజ, బాక్ట్రియా, పర్షియా జాతులు ), మీడియన్ సామ్రాజ్యం, పర్షియా సామ్రాజ్యం, అలెగ్జాండరు, కుషానులు, హెప్తాలీట్లు, అరబ్బులు, తురుష్కులు, మంగోలులు - ఇంకా ఇటీవలి చరిత్రలో బ్రిటిషు వారు, సోవియట్లు, ఆ తరువాత అమెరికన్లు - ఇలా ఎన్నో దేశాలు, జాతుల వారి యుద్ధాలకు ఆఫ్ఘనిస్తాను భూభాగం యుద్ధరంగమయింది. అలాగే స్థానికులు కూడా పరిసర ప్రాంతాల మీద దండెత్తి తమ రాజ్యాలను స్థాపించిన సందర్భాలు ఉన్నాయి.
క్రీ.పూ. 2000-1200 మధ్య ఆఫ్ఘనిస్తాను ఉత్తర ప్రాంతంలో ఆర్యులు నివసించినట్లు భావిస్తున్నారు. అయితే వారి స్వస్థలాన్ని గురించి వైవిధ్యమైన పలు అభిప్రాయాలున్నాయి. క్రీ.పూ. 1700-1100 మధ్యకాలములో ఆర్యులు స్వాత్ లోయ, గాంధార, కుభ (కాబూల్) ప్రాంతములో ఋగ్వేదమును తొలిసారిగా ఉచ్చరించారు.[26][27] క్రీ.పూ. 1800-800 మధ్య జోరాస్ట్రియన్ మతం ఇప్పటి ఆఫ్ఘనిస్తాను ప్రాంతంలో ఆవిర్భవించి ఉండవచ్చునని చరిత్రకారులు ఊహిస్తున్నారు.[28] ఋగ్వేద సంస్కృతానికి అవెస్త పారశీకభాషకు చాల సామీప్యమున్నది. రాజేశు కొచ్చరు అభిప్రాయం ఆధారంగా రామాయణ, భారతంలోని మూల సంఘటనలు ఆఫ్ఘనిస్తానులో జరిగాయి.[26]
క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి ఈ ప్రాంతంలో పర్షియా సామ్రాజ్యం నెలకొన్నది. క్రీ.పూ. 330లో అలెగ్జాండరు దండెత్తి ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడు. సెల్యూకసు అధీనంలో సాగిన వారి రాజ్యం కొద్దికాలమే ఉంది. మౌర్యులు దక్షిణ, ఆగ్నేయ భాగాన్ని ఆక్రమించి బౌద్ధమతం వ్యాప్తికి కారకులయ్యారు. en:Anno Domini నాయకత్వంలో సా.శ.1వ శతాబ్దంలో కుషానులు ఇప్పటి ఆఫ్ఘనిస్తాను కేంద్రంగా పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. వారి కాలంలో బౌద్ధమతం, సంస్కృతి బాగా వర్ధిల్లాయి. కుషానులను ఓడించి సస్సనిదులు సా.శ. 3 శతాబ్దంలో తమ రాజ్యాన్ని స్థాపించారు.[29] తరువాత కిదరైటు హూణుల పాలన ప్రారంభమైంది.[30] వారిని ఓడించిన హెఫ్తాలైట్ల పాలన కొద్దికాలమే సాగింది. కాని వారి రాజ్యం సా.శ. 5వ శతాబ్ది నాటికి చాలా బలమైనదిగా ఉండేది.[31] సా.శ. 557 లో హెఫ్తాలైట్లను ఓడించి ససానియా రాజు 1వ ఖుస్రో మరల పర్షియాలో ససానియా బలం పునస్థాపించాడు. కాని కుషానుల, హెఫ్తాలైట్ల అనంతర రాజులు కాబూలిస్తానులో ఒక చిన్న రాజ్యం నిలుపుకొన్నారు. వారిలో చివరివాడైన 'కాబూలి షా'ను జయించి అరబ్బు సైన్యాలు ఇస్లామికు పాలన ఆరంభం చేశారు.
మధ్య యుగంలో, 19వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని ఖొరాసాను అనేవారు[32][33][34] ఈ కాలంలోనే పలు నగరాలు అభివృద్ధి చెందాయి. ఇస్లాం మతం ఇక్కడ వ్యాప్తి చెందింది. తరువాత ఆఫ్ఘనిస్తాను ప్రాంతం వివిధ సామ్రాజ్యాలకు కేంద్రంగా వర్ధిల్లింది. వారిలో సస్సానిదులు (875–999), ఘజనివిదులు (977–1187), సెల్జుకిదులు (1037–1194), ఘురిదులు (1149–1212), తైమూరిదులు (1370–1506)ఉన్నారు. ఘజని, తైమూరు కాలాలు ఆఫ్ఘనిస్తాను చరిత్రలో ప్రముఖమైనవిగా పరిగణించబడుతున్నాయి[35][36]
1219 లో చెంగీజ్ ఖాన్ నాయకత్వంలో మంగోలులు ఆఫ్ఘనిస్తానును, తామర్లేన్ (తైమోర్ లాంగ్)ను జయించి విశాలమైన రాజ్యాన్ని ఏలారు. 1504 లో బాబర్ (చెంగిజ్ ఖాన్, తైమూర్ లంగ్, వీరిద్దరి వంశానికీ చెందివాడు) కాబూలు కేంద్రంగా ముఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 1700 నాటికి ఆఫ్ఘనిస్తానులోని వివిధ భూభాగాలు వివిధ రాజుల అధీనంలో ఉన్నాయి. ఉత్తరాన ఉజ్బెక్లు, పశ్చిమాన సఫావిదులు, మిగిలిన (అధిక) భాగం ముఘల్ లేదా స్థానిక తెగల పాలనలో ఉన్నాయి.
1709 లో మీర్ వాయిస్ హోతాక్ అనే స్థానిక (పష్టూన్)నాయకుడు గుర్గిన్ ఖాన్ అనే కాందహార్ పర్షియా రాజప్రతినిధిని ఓడించి, చంపి 1715 వరకు పాలించాడు (పర్షియనులు స్థానికులను సున్నీ మార్గం నుండి షియా మార్గానికి మారుస్తున్నారు). 1715 లో ఆయన కొడుకు మీర్ మహ్మూదు హొతాకీ రాజయ్యాడు. ఆయన 1722 లో తన సైన్యంతో ఇరాను మీద దండెత్తి ఇస్ఫహాను నగరాన్ని కొల్లగొట్టి తానే పర్షియా రాజునని ప్రకటించుకొన్నాడు. ఆ సమయంలో వేలాది ఇస్ఫహాను వాసులు (3 వేలమంది పైగా మతగురువులు, పండితులు, రాజ వంశీకులు) సంహరించబడ్డారు. తరువాత పర్షియాకు చెందిన నాదిర్ షా హొతాకీ వంశాన్ని అంతం చేసి తిరిగి పర్షియా పాలన చేజిక్కించుకొన్నాడు.[37][38]
1738 లో నాదిర్ షా తన సైన్యంతో (ఇందులో పష్టూను జాతి అబ్దాలీ తెగకు చెందిన 4వేల మంది సైనికులు కూడా ఉన్నారు) దండెత్తి కాందహారును, ఆ తరువాత ఘజని, కాబూలు, లాహోరులను ఆక్రమించాడు.[39] 1747 జూన్ 19న నాదిర్షా (బహుశా అతని మేనల్లుడు ఆదిల్ షా చేతిలో) చంపబడ్డాడు. అబ్దాలీ తెగకు చెందిన నాదిర్షా అనుచరుడు అహమద్షా అబ్దాలీ కాందహారులో నిర్వహించిన నాయకత్వ ఎన్నికలో అహమ్మద్షా అబ్దాలీని వారి రాజుగా ఎన్నుకున్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తానుగా పిలువబడే దేశాన్ని అహమద్షా అబ్దాలీ స్థాపించిందని భావిస్తున్నారు.[20][40] [41] పట్టాభిషేకం తరువాత ఆయన తన వంశం పేరు 'దుర్రానీ' (పర్షియా భాషలో 'దర్' అనగా ముత్యం)గా మార్చుకొన్నాడు.[39] 1751 నాటికి అహమద్షా దుర్రానీ ఆయన ఆఫ్ఘను సైన్యం ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాను అనబడే భూభాగాన్ని అంతటినీ జయించారు. ఇంకా పాకిస్తానును, ఇరాన్ లోని ఖొరాసాను, కోహిస్తానులను, భారతదేశంలోని ఢిల్లీని కూడా జయించారు.[15] 1772 అక్టోబరులో అహమ్మద్షా రాజదర్బారు నుండి విరమించి తన శేషజీవితాన్ని విశ్రాంతిగా కాందహారులో గడిపాడు. తైమూర్షా దుర్రానీ రాజధానిని కాందహారు నుండి కాబూలుకు మార్చాడు. 1793 లో తైమూరు మరణానంతరం ఆయన కొడుకు జమాన్షా దుర్రానీ రాజయ్యాడు.
19వ శతాబ్దంలో జరిగిన ఆంగ్లో ఆప్ఘను యుద్ధాల (1839–42, 1878–80, 1919లలో జరిగినవి) బారక్జాయి వంశం అధికారంలోకి వచ్చింది. తరువాత ఆఫ్ఘనిస్తాను వ్యవహారాలలో బ్రిటిషు వారి పెత్తనం కొంతకాలం సాగింది. 1919 లో అమానుల్లా ఖాన్ అధికారంలోకి వచ్చిన తరువాతనే తన విదేశీ వ్యవహారాలలో ఆఫ్ఘనిస్తాను తిరిగి స్వతంత్రత సాధించుకొంది. (గ్రేట్ గేం వ్యాసం చూడండి). బ్రిటిషు జోక్యం ఉన్న సమయయంలో డురాండు రేఖ వెంబడి పష్టూను తెగల అధికారం విభజింపబడింది. దీని వలన బ్రిటిషు, ఆఫ్ఘను వ్యవహారాలలో చాలా సమస్యలు తలెత్తాయి. 1933, 1973 మధ్యకాలంలో జాహిర్షా రాజ్యం కాలంలో ఆఫ్ఘనిస్తానులో పరిస్థితులు నిలకడగా ఉన్నాయి.
1973 లో జాహిర్షా బావమరిది సర్దారు దావూదు ఖాన్ రాజ్యాన్ని చేజిక్కించుకొన్నాడు. అనంతరం 1978లో దావూద్ ఖానును, ఆయన పూర్తి పరివారాన్ని హతం చేసి ఆఫ్ఘను కమ్యూనిస్టులు అధికారాన్ని తమ హస్తగతం చేసుకొన్నారు. ఈ తిరుగుబాటును 'ఖల్క్' లేదా 'మహా సౌర్ విప్లవం' అంటారు.
అమెరికా, రష్యాల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం (శీతల యుద్ధం) సమీకరణాలలో భాగంగా ఆఫ్ఘను ప్రభుత్వ వ్యతిరేక ముజాహిదీన్ బలగాలకు పాకిస్తాను గూఢచారి సంస్థ ఐ.ఎస్.ఐ ద్వారా అమెరికా సహకారాన్ని అందించడం ప్రారంభించింది. దానితో స్థానిక కమ్యూనిస్టు ప్రభుత్వానికీ-తమకూ 1978 లో కుదిరిన ఒప్పందాన్ని పురస్కరించుకొని డిసెంబరు 24, 1979న దాదాపు లక్ష మంది సోవియట్ యూనియన్ సేనలు ఆఫ్ఘనిస్తాను భూభాగంలో (స్థానిక ప్రభుత్వ రక్షణ కొరకు) ప్రవేశించాయి. వీరికి ఆఫ్ఘనిస్తాను కమ్యూనిస్టు అనుకూల ప్రభుత్వం సేనలు మరో లక్షమంది తోడైయ్యారు. ఫలితంగా 10 సంవత్సరాలు సాగిన (అంతర్)యుద్ధంలో 6 లక్షలు - 20 లక్షల మధ్య ఆఫ్ఘన్ వాసులు మరణించారని అంచనా. 50 లక్షలు పైగా ఆఫ్ఘను వాసులు పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళ్ళారు. దీనికి ప్రపంచదేశాల నుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అమెరికా, పాకిస్తాను ద్వారా, పెద్దపెట్టున ముజాహిద్దీనుకు అనేక విధాలుగా సహకారం అందించింది. 1989 లో సోవియటు సేనలు వెనుకకు మళ్ళాయి. ఇది తమ నైతిక విజయంగా అమెరికా భావిస్తుంది. తరువాత ఆఫ్ఘనిస్తాను అవసరాలను అమెరికా దాదాపు పట్టించుకోలేదు. 1992 దాకా రష్యా మద్దతుతో నజీబుల్లా ప్రభుత్వం ఆఫ్ఘనిస్తానులో కొనసాగి [42] తరువాత పతనమయ్యింది.
అప్పటికి ఆఫ్ఘనిస్తాను సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితి కకావికలమయ్యింది. విద్యావంతులు, మేధావులు చాలామంది వలస పోయారు. నాయకత్వం కొరవడింది. తెగల నాయకత్వాలు తమలో తాము కలహించుకొంటూ దేశానికి నాయకత్వం కూడా వారే వహించారు. 1994 లోని ఘర్షణలో కాబూలులో 10,000 మంది పైగా మరణించారు. నాయకత్వం కొరవడి రోజువారీ యుద్ధాలు, దోపిడీలు, లంచగొండితనం పెరిగిన సమయాన్ని అవకాశంగా తీసుకుని, తాలిబాను బలమైన శక్తిగా పరిణమించి క్రమంగా వ్యాప్తి చెంది 1996 లో కాబూలును తన వశంలోకి తీసుకుని వచ్చింది. 2000నాటికి దేశంలో 95% భాగం వారి అధీనంలోకి వచ్చింది. దేశం ఉత్తర భాగంలో మాత్రం ఉత్తర ఆఫ్ఘన్ సంకీర్ణం 'బదక్షాన్' ప్రాంతంగా ఉంది. తాలిబాను ఇస్లామిక్ న్యాయ చట్టాన్ని చాలా తీవ్రంగా అమలు చేసింది. ఈ కాలంలో ప్రజల జీవనం, స్వేచ్ఛ బాగా దెబ్బతిన్నాయి. స్త్రీలకు, బాలికలకు ఉద్యోగాలు, చదువు నిషేధించారు. నియమాలను ఉల్లంఘించినవారికి దారుణమైన శిక్షలు విధింపబడ్డాయి. కమ్యూనిస్టులు దాదాపు తుడిచివేయబడ్డారు. అయితే 2001 నాటికి గంజాయి ఉత్పాదన అధిక భాగం నిలిపివేయడంలో వారు కృతకృత్యులయ్యారు.[43]
2001 సెప్టెంబరు 11 లో అమెరికా నగరాలపై జరిగిన ఉగ్రవాదుల దాడుల అనంతరం అమెరికా ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లోని అల్-కైదా ఉగ్రవాదుల శిక్షణా కేంద్రాలను అంతం చేయడానికి ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ అనే మిలిటరీ చర్యను పెద్దయెత్తున మొదలుపెట్టింది. ఒసామా బిన్-లాడెన్ను తమకు అప్పగించకపోతే తాలిబాన్ల ప్రభుత్వాన్ని అంతం చేస్తామని బెదరించింది. ఇదివరకటి ఆఫ్ఘన్ ముజా్ిదీన్ నాయకులు, అమెరికా సైన్యం కలిపి నిర్వహించిన యుద్ధం ఫలితంగా హమీద్ కర్జాయి నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాడింది.
2002 లో దేశవ్యాప్తంగా నిర్వహించిన లోయా జిర్గా ద్వారా హమీదు కర్జాయి తాత్కాలిక అధ్యక్షుడుగా ఎన్నుకొనబడ్డాడు. 2003లో రాజ్యాంగం ఆమోదించబడింది. 2004 ఎన్నికలలో హమీదు కర్జాయియే 'ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్' అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 2005 లో (1973 తరువాత జరిగిన మొదటి ఎన్నికలు) సార్వత్రిక ఎన్నికల ద్వారా నేషనల్ అసెంబ్లీ ఏర్పరచబడింది.
దేశం పునర్నిర్మాణం జరుగుతున్నది కాని అనేక సమస్యలతో ఆఫ్ఘనిస్తాను సతమతమవుతున్నది. పేదరికం, మౌలిక సదుపాయాల కొరత, దేశమంతటా ఉన్న మందు పాతరలు, పేలుడు పదార్థాలు, ఆయుధాలు, చట్టవ్యతిరేకంగా సాగుతున్న గంజాయి పెంపకం, రాజకీయ అంతర్యుద్ధాలు, తాలిబాన్ల దాడులు, మిగిలి ఉన్న అల్-కైదా ప్రభావం, (ప్రత్యేకించి ఉత్తరభాగంలో ఉన్న) అనిశ్చితి - ఇవి కొన్ని సమస్యలుగా ఉన్నాయి.
ఆంగ్ల వికీపీడియాలో చూడదగిన వ్యాసాలు - ఆఫ్ఘన్ చరిత్ర కాలరేఖ, ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమణలు
చారిత్రికంగా ఆఫ్ఘను రాజకీయాలలో అధికారంకోసం తగవులు, గూడుపుఠాణీలు, తిరుగుబాట్లు అంతర్భాగాలుగా ఉన్నాయి. రాజరికం, మతవాదపాలన, కమ్యూనిజం, ప్రజా ప్రభుత్వం - ఇలా ఎన్నో విధానాలు మారాయి. 2003 లో జరిగిన లోయా జిర్గా ఆధారంగా ఆఫ్ఘనిస్తాను ఇస్లామిక్ గణతంత్రంగా ప్రకటించబడింది.
ప్రస్తుత ఆఫ్ఘనిస్తాను అధ్యక్షుడు హమీదు కర్జాయి 2004 అక్టోబరులో ఎన్నికయ్యాడు. 2005 ఎన్నికల తరువాత ప్రస్తుత పార్లమెంటు ఏర్పడింది. వివిధ వర్గాలనుండి ఎన్నికైనవారిలో 28% స్త్రీలు (రాజ్యాంగం ప్రకారం కనీసం 25% స్రీలకు కేటాయించబడింది) ఉన్నారు. ప్రస్తుత అత్యున్నత న్యాయస్థానం యొక్క ప్రధాన న్యాయాధికారి అబ్దుల్ సలాం అజీమీ ఇంతకుముందు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా పనిచేసాడు.[44]
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తానులో 60,000 మంది పోలీసు అధికారులు ఉన్నారు. ఈ సంఖ్యను 80,000 వరకు పెంచే ప్రయత్నం జరుగుతున్నది. దేశంలో ఉన్న ఉగ్రవాద కార్యకలాపాలు, సైనికుల విస్తృతమైన పాత్ర, విదేశీ సేనల ఉనికి, సామాజిక అస్తవ్యస్తాల కారణంగా చట్టం అమలు చాలా క్లిష్టతరమౌతున్నది. [45]
పరిపాలనా నిమిత్తం ఆఫ్ఘనిస్తాను 34 విలాయతులుగా విభజింపబడింది. ఒక్కొక విలాయతులోను చిన్న చిన్న జిల్లాలు ఉన్నాయి. 'అంతర్గత వ్యవహారాల మంత్రి' ఆధ్వర్యంలో ప్రతి విలాయతుకు ఒక రాజప్రతినిధి నిమించబడుతాడు. ఈ రాజప్రతినిధి కేంద్రానికి ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. అయితే కాబూలు 'మేయరు'ని మాత్రం అధ్యక్షుడు నియమిస్తాడు.
ప్రపంచంలో బాగా వెనుకబడిన దేశాలలో ఆఫ్ఘనిస్తాను ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రజలలో మూడింట రెండు వంతులమంది తలసరి రోజువారీ ఆదాయం 2 అమెరికా డాలర్లకంటే తక్కువగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను అంతర్గత యుద్ధాలూ, విదేశీ ఆక్రమణలూ, రాజకీయ అనిశ్చితీ తీవ్రంగా దెబ్బ తీశాయి. 1998-2001 మధ్య కలిగిన వర్షాభావం దేశాన్ని మరింత కష్టాలలోకి నెట్టింది.[46][47] 2005 నాటికి నిరుద్యోగులు 40% వరకు ఉన్నారు.[48] 2002 తరువాత దేశం చెప్పుకోదగిన అభివృద్ధి సాధించింది. మాదక ద్రవ్యాలు మినహాయిస్తే స్థూల దేశీయోత్పత్తి 2002 లో 29%, 2003 లో 16%, 2004 లో 8%, 2005 లో 14% వృద్ధి చెందింది.[49] అయితే ప్రస్తుతానికి స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు మూడవవంతులు మాదక ద్రవ్యాల పెంపకం, ఉత్పత్తుల మూలంగా సమకూరుతున్నది (గంజాయి, మార్ఫీన్, హెరాయిన్, హషీష్ వంటివి) [20] [50] దేశంలో సుమారు 33 లక్షలమంది గంజాయి పెంపకంలో పాలుపంచుకొంటున్నారు.[51]
ఆఫ్ఘనిస్తాను అభివృద్ధికి ప్రపంచ దేశాల సహకార కార్యకలాపాలు ఆశాజనకంగా ఉన్నాయి. 2001 డిసెంబరు 'బాన్ ఒడంబడిక' తరువాత 2002లో టోక్యో సమావేశంలో వివిధ దేశాల హామీల ప్రకారం ఆఫ్ఘనిస్తాను అభివృద్ధికి అధికమొత్తంలో అంతర్జాతీయ సహకారం లభిస్తున్నది[52] ప్రధానంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, పాలనా సంస్కరణలలో ఈ సహకారం వినియోగమవుతున్నది. ఆసియా అభివృద్ధి బ్యాంకు నివేదిక ప్రకారం ప్రస్తుత పునర్నిర్మాణ కార్యక్రమం రెండు దిశలలో పురోగమిస్తున్నాది (1) కీలకమైన మౌలిక సదుపాయాలు, వనరులు సమీకరించడం (2) సోవియటు ప్రణాలికా విధానంలో ఆరంభించిన ప్రభుత్వరంగ సంస్థల మార్కెట్ ను వాణిజ్యపరంగా సమాయుత్తం చేయడం[53]
యుద్ధకాలంలో వలస వెళ్ళిన 40 లక్షలపైగా ఆఫ్ఘన్ శరణార్థులు పొరుగు దేశాలనుండి తిరిగి రావడం దేశ పునర్నిర్మాణ కార్యక్రమంలో కీలకమైన ఆంశంగా పరిణమించింది. వారు తమతో పాటు ఉత్సాహంగా క్రొత్త నైపుణ్యాలను వెంటబెట్టుకొస్తున్నారు. దీనికి ప్రతియేటా అంతర్జాతీయ సహాయంగా లభిస్తున్న 2-3 బిలియన్ల డాలర్ల పెట్టుబడి తోడవుతున్నది. ఫలితంగా వాణిజ్యరంగం అభివృద్ధిపథంలో సాగింది.[54]
మొత్తానికి దేశం పేదరికం నుండి బయటపడి, ఆర్థికంగా నిలకడైన స్థితిని సాధిస్తుందన్న ఆశ చిగురించింది. దేశంలో గణనీయమైన, విలువైన ఖనిజ సంపద నిక్షేపాలు (సహజ వాయువు, పెట్రోలియమ్ వంటివి) ఉన్నాయన్న వార్తలు ఈ అంచనాలకు దోహదం చేస్తున్నాయి. తగినంత మౌలిక సదుపాయాలు సిద్ధం చేస్తే ఈ భూగర్భ వనరులను సద్వినియోగం చేసికోవచ్చునని పాలకుల అంచనా.[23] బంగారము, రాగి, ఇనుము,బొగ్గు వంటి విలువైన ఖనిజాలు కూడా పెద్దమొత్తాలలో ఉన్నాయని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.[21][24]
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాను దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సంఘం (SAARC)లోనూ, ఆర్ధిక సహకార సంస్థ (ECO)లోనూ, ఇతర ప్రాంతీయ సంస్థలలోనూ, ఇస్లామిక్ కాన్ఫరెన్స్లోనూ సభ్యత్వం కలిగి ఉంది.
ఆఫ్ఘనిస్తాను ఆర్థిక వ్యవస్థలో గంజాయి పెంపకం, ఉత్పత్తులు కీలకమైన స్థానం కలిగి ఉన్నాయి. దేశ ఆదాయంలో సుమారు మూడవ వంతు వీటిద్వారానే అభిస్తున్నది. కనుక గ్రామీణ రాజకీయాలలో మాదక ద్రవ్యాల నిషేధచర్యలు బలమైన పరిణామాలకు కారణమౌతాయి. దేశంలో 33 లక్షలమంది దీని మీదనే ఆధారపడి ఉన్నారు. ఒక ప్రక్క నిషేధం చర్యలు అమలులో ఉన్నాగాని రెండు సంవత్సరాలలో గంజాయి ఉత్పత్తి రెట్టింపు అయ్యింది. ఎక్కువ మందికి జీవనాధారమైన గంజాయిని నిషేధిస్తే అసలు దేశ పునర్నిర్మాణమే కుంటుపడే అవకాశం ఉన్నదని, తాలీబాను తీవ్రవాదులకు ఇది ఉపయోగకరంగా మారే అవకాశమున్నదనీ విశ్లేషకులు భావిస్తున్నారు.[55]
ఆఫ్ఘనిస్తాను ప్రజలలో వివిధ స్థానిక జాతుల వారున్నారు. శాస్త్రీయమైన జనగణన జరుగని కారణంగా ఆయా జాతుల సంఖ్య, విస్తరణ వంటి వివరాలు అంత నిర్దిష్టంగా లభించడంలేదు.[56] కనుక ఎక్కువ భాగం వివరాలు కేవలం అంచనాలే.
ఆఫ్ఘనిస్తానులో మాట్లాడే భాషలగురించిన వివరాలు ప్రక్కనున్న బొమ్మలో చూపబడినాయి. ఇవి సి.ఐ.ఎ. ఫాక్ట్ బుక్నుండి తీసుకొనబడినవి. పర్షియన్ భాష ('దారి' యాసలలో) 50%, పష్టూ భాష 35% మంది మాట్లాడుతారు. ఇవి రెండూ ఇండో-యూరోపియన్ భాషలలో ఇరానియన్ భాషల శాఖలకు చెందినవి. పష్టూ, పర్షియా భాషలు రెండూ దేశంలో అధికారిక భాషలుగా ఉన్నాయి. 'హజరా' జాతికి చెందిన వారు మాట్లాడే హజరాగీ భాష కూడా పర్షియా భాషకు దగ్గరగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తానులో మాట్లాడే ఇతర భాషలు టర్కిక్ (ముఖ్యంగా ఉజ్బెక్, టర్క్మెన్ యాసలు) 9%, ఇంకా షుమారు 30 ఇతర భాషలు 4% (వాటిలో ముఖ్యమైనవి బలూచీ, నూరిస్తానీ, పషాయి, బ్రహయీ, పామీరీ, హింద్కో, హిందీ/ఉర్దూ). రెండు మూడు భాషలు తెలిసి ఉండడం జనంలో చాలా సామాన్యం. |
1960-1980 మధ్యకాలంలో జరిగిన జన గణన ఫలితాలను ఆధారంగా ఇతర అధ్యయన నివేదికలను ఆధారంగా[57] ఎన్సైక్లోపిడియా ఇరానికాలో ఇవ్వబడిన అంచనాలు:[57]
దేశంలో అత్యధికంగా, 99% ముస్లిములు: వీరిలో సుమారు 74–89% సున్నీలు, 9–25% షియాలు[20][58] (అంచనాలలో వ్యత్యాసాలు ఉన్నాయి). 1980 దశకం మధ్యవరకూ సుమారు 30,000 నుండి 150,000 హిందువులు, సిక్కులు ముఖ్యంగా నగరాలలో - జలాలాబాదు, కాబూలు, కాందహారు వంటి నగరాలలో ఉండేవారు.[59][60]
దేశంలో కొద్దిపాటి యూదు మతస్తులు ఉండేవారు. (బుఖారన్ యూదులు) కాని వారు 1979 సోవియటు ఆక్రమణ తరువాత దేశాన్ని వదలి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఒక్క వ్యక్తి, జబ్లోన్ సిమిన్టోవ్ మాత్రమే ఆఫ్ఘనిస్తానులో ఉంటున్నాడు.[61]
ఆఫ్ఘనిస్తాన్లో పది లక్షలు పైన జనాభా కల ఒకే ఒక నగరం రాజధాని నగరమైన కాబూలు. ఇతర ముఖ్య నగరాలు కాందహారు, హేరాతు, మజారి షరీఫు, జలాలాబాదు, ఘజని, కుందుజు.
1979 లో జరిగిన సోవియట్ ఆక్రమణ మొదలు 1992 వరకు జరిగిన వివిధ యుద్ధాల కారణంగా 60 లక్షలు (6,000,000) పైగా ఆఫ్ఘనులు శరణార్థులై పాకిస్తాను, ఇరాన్ వంటి పొరుగు దేశాలకు వలస పోయారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శరణార్థులు ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్ళినవారే. 1996 లో తాలిబాను అధికారం చేజిక్కించుకొన్న తరువాత కూడా వేలలో జనులు తరలిపోయారు.[62] 2002 తరువాత 40 లక్షలు పైగా శరణార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు.[63]
2007 ఏప్రిల్ తరువాత ఇరాన్ ప్రభుత్వం తమ దేశంలోని లక్షకంటే అధికమైన శరణార్థులను బలవంతంగా వెనుకకు పంపించింది. పాకిస్తాను కూడా ఈ దిశలో చర్యలు చేపట్టి, తమ దేశంలో ఉన్న 24 లక్షలమంది శరణార్థులు 2009 కల్లా తిరిగి వెళ్ళాలని చెప్పింది.[64] అలా జరిగితే ఆఫ్ఘనిస్తాను వ్యవస్థ బాగా దెబ్బ తింటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.[65]
ఆఫ్ఘనులకు వారి మతం, దేశం, చరిత్ర - అన్నింటి కంటే స్వేచ్ఛల పట్ల సగర్వమైన అభిమానం ఉంది. వ్యక్తిగత గౌరవమూ, సంఘ గౌరవమూ వారికి ప్రాణం కంటే మిన్న. తమ కర్తవ్యం నెగ్గించుకోవడానికి ఆయుధాలు ధరించేందుకు వారు సదా సన్నద్ధులు.[66] అనాదిగా తరచు వివిధ జాతుల (ముఠాల) మధ్య జరిగే పోరాటాల కారణంగా యుద్ధం వారికి సామాన్యమైపోయింది. కనుక విదేశీ ఆక్రమణదారులెవ్వరూ ఈ భూమిని తమ అధీనంలో ఉంచుకోలేకపోయారు.
పోరాటాల మయమైన వారి చరిత్రలో సంస్కృతి, భాష నిలిచి ఉన్నప్పటికీ పురాతన కట్టడాలు చాలావరకు నాశనమయ్యాయి. విగ్రహారాధనను వ్యతిరేకించే తాలిబాను చేతులలో బమియాన్లోని చరిత్రాత్మక బుద్ధ విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఆఫ్ఘనిస్తానులోని మరికొన్ని చారిత్రిక స్థలాలు - కాందహారు, హేరాతు, ఘజని, బాల్. హరిరుదు లోయలోని 'జాం మినారెటు' ఒక యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించబడింది. మొహమ్మద్ ధరించిన అంగీ కాందహారులోని ప్రసిద్ధ 'ఖల్కా షరీఫా'లో భద్రపరుచబడింది.
బుజ్కషి ఆఫ్ఘనుల జాతీయ క్రీడ. ఇది పోలో వంటి ఆట. రెండు జట్టులు ఆటగాళ్ళు గుర్రాల మీద ఆడుతారు. పోలో బంతి బదులు ఒక మేక మృతదేహాన్ని వాడుతారు. ఆఫ్ఘనిస్తానులో అక్షరాస్యత బాగా తక్కువగా ఉన్నప్పటికీ వారి సంస్కృతిలో సంప్రదాయ పర్షియా కవిత్వం చాలా ముఖ్యమైన భాగం. అలాగే (తాలెబాను కాలానికి ముందు) కాబూలు ముఖ్యమైన సంగీతకారుల స్థావరంగా ఉంది.
ఆఫ్ఘనిస్తాను జనజీవనంలోనూ, రాజకీయాలలోనూ స్థానిక తెగలు చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నాయి. తమ తెగ ఔన్నత్యం కొరకు ఆయుధాలు ధరించడానికీ, ప్రాణాలివ్వడానికీ ఆ తెగవారు ముందుకొస్తారు. ఆఫ్ఘనిస్తాను వంటి భౌగోళిక, సామాజిక వ్యవస్థలో ఈ తెగల విధానమే పప్రజలను సమీకరించడానికి సరైన విధానమని 'హాత్కోటె' అనే సామాజిక శాస్త్రజ్ఞుని ఆభిప్రాయం. [66]
ఈ సదుపాయాలు ఆఫ్ఘనిస్తానులో త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నాయి. వైర్లెస్ కంపెనీలు, ఇంటర్నెట్,రేడియో, టెలివిజన్, సెల్ఫోనులు వంటి సదుపాయాలు క్రమంగా వ్యాపిస్తున్నాయి. 2006 లో ఆఫ్ఘన్ ప్రభుత్వం ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ వ్వస్థాపనకు అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకొన్నది. దీనివలన ప్రసార, సమాచార సౌకర్యాలు మరింత మెరుగు కాగలవని ఆశిస్తున్నారు.[67]
ఆఫ్ఘనిస్తాను వాణిజ్య విమానయాన సంస్థ "అరియానా ఆఫ్ఘన్ ఎయిర్లైన్స్" ఇప్పుడు కాబూల్, హేరాతునుండి ఫ్రాంక్ఫర్ట్, దుబాయి, ఇస్తాంబుల్ వంటి అంతర్జాతీయ విమానాశ్రయాలకు సేవలు నిర్వహిస్తున్నది. వివిధ రకాల కారులు, ముఖ్యంగా యు.ఎ.ఇ. నుండి దిగుమతి అయ్యే సెకండ్ హాండ్ కారులు విరివిగా వాడుతున్నారు.
2003 నాటికి అంతర్యుద్ధం వలన ఆఫ్ఘనిస్తానులోని 7,000 పాఠశాలలలో సుమారు 30% పాఠశాలలు తీవ్రంగా నాశనమయ్యాయని అంచనా. ఉన్న పాఠశాలలలో సదుపాయాలు కూడా చాలా కొరతగా ఉన్నాయి. 2006 నాటికి 40 లక్షల మంది విద్యార్థులు దేశంలో విద్యాలయాలలో చదువుతున్నారు. ప్రాథమిక విద్య అందరికీ ఉచితం. 1999 నాటికి అక్షరాస్యత 36% (మగవారిలో 51%, ఆడువారిలో 21%). దేశంలో 9,500 విద్యాలయాలున్నాయి.
ఉన్నత విద్య అవకాశాలు కూడా త్వరిత గతిన అందుబాటులోకి వస్తున్నాయి. తాలిబాను పతనం తరువాత కాబూలు విశ్వ విద్యాలయం ఆడువారికీ, మగవారికీ కూడా పునఃప్రారంభింపబడింది. మజారె షరీఫు వద్ద బాల్ఖ్ విశ్వవిద్యాలయం నిర్మాణం త్వరలో మొదలుకానుంది. ఇది 600 ఎకరాల విస్తీర్ణంలో 250 మిలియన్ల డాలర్ల వ్యయంతో నిర్మింపబడనుంది.[68]
అఫ్గాన్లో లక్ష కోట్ల డాలర్ల విలువైన ఇనుము, రాగి, కోబాల్ట్, బంగారం,నియోబియం,లీథియం,మోలిబ్డినం, లాంటి అపార ఖనిజ నిక్షేపాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికా సైనికాధికారులు, భూగర్భ శాస్త్రవేత్తలు కలిసి అఫ్గానిస్థాన్లో జరిపిన పరిశోధనలో రూ.50 లక్షల కోట్ల విలువైన ఖనిజ నిల్వలున్నాయని తేలిందని పెంటగాన్ ప్రకటించింది. అఫ్గాన్లో ఖనిజాల విలువ అమెరికా వార్షిక బడ్జెట్లో ఆరో వంతు విలువకు సమానం. మన దేశ బడ్జెట్ సుమారు రూ.11 లక్షల కోట్లు. అంటే మన నాలుగున్నరేళ్ల బడ్జెట్తో అఫ్గాన్ ఖనిజాల విలువ సమానం. ఆ దేశానికి ఏటా ప్రపంచ దేశాల నుంచి రూ.15 వేల కోట్లదాకా సాయం అందుతోంది.
ఆంగ్ల వికీలో సంబంధిత విషయాలపై ఉన్న ముఖ్య వ్యాసాలు
స్టాంపులు
ఆంగ్ల వికీ వ్యాసంలో కొన్ని ఆంగ్ల పుస్తకాల జాబితా ఇవ్వబడింది. చూడండి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.