From Wikipedia, the free encyclopedia
ఆఫ్ఘనిస్తాన్లో విద్య కే -12 విధానాన్ని, ఉన్నత విద్య విధానాన్ని అనుసరిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ లోని విద్యా మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తాయి.[1] ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం ఆమూలాగ్రం పునర్నిర్మాణ ప్రక్రియలో ఉంది, ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా పలు విద్యా సంస్థలను ప్రభుత్వం స్థాపించింది. 2013 నాటికి ఆఫ్ఘనిస్తాన్లో మూడున్నర కోట్ల మొత్తం జనాభాకు గానూ 1 కోటి 5 లక్షల మంది విద్యార్థులుగా నమోదు అయి, తరగతులకు హాజరయ్యారు.[2][3]
ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ లో ఉన్న హబీబియా హై స్కూల్ అస్తిత్వంలో ఉన్న పాఠశాలలలో అన్నిటికన్నా పాతది, దీనిని దేశంలోని ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తుల పిల్లలకు విద్యనందించడానికి 1903 లో కింగ్ హబీబుల్లా ఖాన్ నిర్మించారు. 1920 లలో, జర్మన్ నిధులతో అమానీ హైస్కూల్ కాబూల్లో ప్రారంభమైంది, దాదాపు ఒక దశాబ్దం తరువాత రెండు ఫ్రెంచ్ లైసీలు (మాధ్యమిక పాఠశాలలు) ప్రారంభమయ్యాయి, AEFE, లైసీ ఎస్టెక్లాల్ . కాబూల్ విశ్వవిద్యాలయం 1932 లో స్థాపించబడింది.
1933, 1973 సంవత్సరాల మధ్య జహీర్ షా రాజు పాలనలో విద్య మెరుగుపడింది.[4] ప్రాథమిక పాఠశాలలు, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న జనాభాలో సగం మందికి, అందుబాటులోకి వచ్చాయి. మాధ్యమిక పాఠశాల వ్యవస్థ మరింత విస్తృతమయింది. కాబూల్ విశ్వవిద్యాలయ స్థాపన, అభివృద్ధి కూడా జరిగాయి.
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ గా దేశం వ్యవహరిస్తున్న రోజుల్లో, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ (పిడిపిఎ) ప్రభుత్వం విద్యా వ్యవస్థను సంస్కరించింది; విద్యను బాలురు-బాలికలకు సమానంగా అందాలన్న వాదన బలపడింది. విస్తృతమైన అక్షరాస్యత కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి.[5] 1978 నాటికి, వైద్యుల్లో 40 శాతం, కాబూల్ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులలో 60 శాతం మహిళలు ఉన్నారు. 440,000 మంది బాలికలు విద్యా సంస్థలలో, 80,000 మంది వయోజన మహిళలు అక్షరాస్యత కార్యక్రమాలలో చేరారు.[6] అభివృద్ధి, విద్యలో సంస్కరణలు ఉన్నప్పటికీ, జనాభాలో ఎక్కువ శాతం నిరక్షరాస్యులుగానే ఉన్నారు.[4] 1979 లో సోవియట్ ఆఫ్ఘనిస్తాన్ దాడితో ప్రారంభమైన యుద్ధాలు దేశ విద్యావ్యవస్థను తెరవెనుక నుండి నాశనం చేశాయి. చాలా మంది ఉపాధ్యాయులు యుద్ధ సమయంలో పొరుగు దేశాలకు పారిపోయారు. 1990ల మధ్యలో, సుమారు 650 పాఠశాలలు నాశనం చేయబడ్డాయి లేదా బంకర్లుగా ఉపయోగించబడ్డాయి. 1996 లో తాలిబాన్ పాలన ఆడవారికి విద్యను రద్దు చేసింది. మదర్సా (మొహమ్మదీయ పాఠశాల) ప్రాథమిక, మాధ్యమిక విద్యకు ప్రధాన వనరుగా మారింది. తాలిబాన్ పాలనలో సుమారు 1.2 మిలియన్ల మంది విద్యార్థులు పాఠశాలల్లో చేరారు, వారిలో 50,000 కంటే తక్కువ మంది బాలికలు ఉన్నారు.[7]
2001 చివరలో తాలిబాన్ల నియంత్రణను పడగొట్టిన తరువాత, విద్యావ్యవస్థను పునరుద్ధరించడానికి కర్జాయ్ పరిపాలన గణనీయమైన అంతర్జాతీయ సహాయాన్ని పొందింది. 2003 చివరి నాటికి మొత్తం 32 ప్రావిన్సులకు గానూ 20 ప్రావిన్సులలో 7,000 పాఠశాలలు పనిచేస్తున్నాయి. వీటిలో 27,000 మంది ఉపాధ్యాయులు 42 లక్షల పిల్లలకు (12 లక్షల బాలికలతో సహా) బోధించారు.[4] ఆ సంఖ్యలో, 39 లక్షల విద్యార్థులు ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్నారు. తాజా గణాంకాలలో 57 శాతం మంది పురుషులు, 86 శాతం మంది మహిళలు నిరక్షరాస్యులుగా ఉన్నట్లు అంచనా వేయబడింది. నైపుణ్యం, అక్షరాస్యత కలిగిన శ్రమజీవుల కొరత పెద్ద ఆర్థిక ప్రతికూలతగా అఫ్ఘనిస్తాన్ లో నెలకొంది. 2002 లో కాబూల్ విశ్వవిద్యాలయం తిరిగి తెరిచినపుడు, సుమారు 24,000 మంది స్త్రీ, పురుష విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేరారు. ఈలోగా మరో ఐదు విశ్వవిద్యాలయాలు పునరుద్ధరణ పొందుతున్నాయి. ప్రభుత్వ పాఠశాల పాఠ్యాంశాల్లో మతపరమైన విషయాలు ఉన్నాయి. కానీ మతపరమైన ఉపాధ్యాయులకు వివరణాత్మక బోధన చేసే సామర్థ్యం లేదు.
2006 నాటికి, ఆఫ్ఘనిస్తాన్ అంతటా 40 లక్షలకు పైగా బాలబాలికలు పాఠశాలల్లో చేరారు. అదే సమయంలో పాఠశాల సౌకర్యాలు లేదా సంస్థలు కూడా పునరుద్ధరించబడ్డాయి లేదా మెరుగుపరచబడ్డాయి, ప్రతి సంవత్సరం మరింత ఆధునిక తరహా పాఠశాలలు నిర్మించబడుతున్నాయి. కాబూల్లోని అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ (AUAF) 2006 లో స్థాపించబడింది. దక్షిణాన కందహార్ విశ్వవిద్యాలయం, నంగర్హార్ విశ్వవిద్యాలయం, తూర్పున ఖోస్ట్ విశ్వవిద్యాలయం, పశ్చిమాన హెరాత్ విశ్వవిద్యాలయం, ఉత్తరాన బాల్ఖ్ విశ్వవిద్యాలయం లాంటి ఇతర విశ్వవిద్యాలయాలు పునరుద్ధరించబడ్డాయి లేదా పునర్నిర్మించబడ్డాయి. ఈ చిన్నపాటి విజయాలు ఉన్నప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్లో విద్యకు ఇప్పటికీ ఎన్నో అవరోధాలు ఉన్నాయి. అన్నిటికన్నా ప్రధాన సమస్య చాలా వరకు నిధుల కొరతే. విద్యా మంత్రిత్వ శాఖకు పాఠ్యాంశాలు, పాఠశాల కార్యక్రమాలను ప్రణాళిక వేయడం చాలా కష్టంగా తయారయింది. ఎందుకంటే విద్య కోసం బడ్జెట్లో పెద్ద మొత్తం బయట దేశాల దాతల నుండి వస్తుంది. వారు ఎప్పుడు ఎంత ఇస్తారో తెలీదు. అందువలన వార్షిక బడ్జెట్ను అంచనా వేయడం కష్టమవుతుంది.[8]
చదువుకోవడానికి అఫ్ఘనిస్తాన్ లో అబ్బాయిలకన్నా, అమ్మాయిలకు అడ్డంకులు ఎక్కువ. ఆఫ్ఘనిస్తాన్ అప్పటి విద్యా మంత్రి మొహమ్మద్ హనీఫ్ ఆత్మర్ 2007 లో మాట్లాడుతూ 60% మంది విద్యార్థులు గుడారాలు లేదా ఇతర అసురక్షిత నిర్మాణాలలో చదువుతున్నారని, కొంతమంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను ఇటువంటి పరిస్థితుల్లో పాఠశాలలకు అనుమతించటానికి నిరాకరించారు.[8] మహిళా ఉపాధ్యాయుల కొరత కొంతమంది తల్లిదండ్రులకు, ముఖ్యంగా సాంప్రదాయిక ప్రాంతాలలో వారికి ఒక పెద్ద సమస్య. అక్కడి తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను పురుష ఉపాధ్యాయులు బోధించడాన్ని అనుమతించరు. అంతర్జాతీయ సహాయ సంస్థ ఆక్స్ఫామ్ 2007 లో ఆఫ్ఘన్ ఉపాధ్యాయులలో నాలుగింట ఒక వంతు మహిళలు అని నివేదించింది. అందువలన అమ్మాయిలు కూడా అదే స్థాయిలో పాఠశాలకు వస్తున్నారని అంచనా. 2009 లో, మరొకసారి తాలిబన్ వారు మొదలుపెట్టిన విధ్వంసంలో పాఠశాలలను నాశనం చేయడం, ముఖ్యంగా ఆడవారి పాఠశాలలను నాశనం చేయడం ప్రధాన లక్ష్యంగా ఉంచుకున్నారు. ఆ సంవత్సరంలో 150 కి పైగా పాఠశాలలు ధ్వంసమైన తరువాత, చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలలకు పంపలేదు. పాఠశాలలో విద్యార్థులకు రక్షణను అందించడంలో ప్రభుత్వం విఫలమైంది.[9]
2000 ల మొదటి దశాబ్దంలో ఈ క్రింది విజయాలు సాధించబడ్డాయి:[10]
నమోదు తక్కువగా ఉంది: సగటున ఒక విద్యాలయానికి 1,983 మంది విద్యార్థులు; మూడు సంస్థలలో 200 కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. ఇంకా, అర్హత కలిగిన అధ్యాపకుల లోపం ఉంది: బోధనా సిబ్బందిలో కేవలం 4.7% (మొత్తం 3,522 లో 166) మాత్రమే పిహెచ్.డి. పొందిన వారున్నారు. "సరిపోని వనరుల సమస్య, అర్హతగల బోధనా సిబ్బంది లేకపోవడం మాత్రమే కాక విద్యా వ్యవస్థలో అవినీతి సమస్యలు కూడా చొచ్చుకు వచ్చాయి."
2010 లో, అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో లింకన్ లెర్నింగ్ సెంటర్లను (లింకన్ అధ్యయన కేంద్రాలు) స్థాపించడం ప్రారంభించింది. ఇవి ఆంగ్ల భాషా తరగతులు, గ్రంథాలయ సౌకర్యాలు, కార్యక్రమ వేదికలు, అంతర్జాల అనుసంధానం, విద్య, ఇతర సంప్రదింపు సేవలను అందించే కార్యక్రమ వేదికలుగా పనిచేస్తాయి. ఒక్కో కేంద్రానికి నెలకు కనీసం 4,000 మంది ఆఫ్ఘన్ పౌరులను చేర్చుకోవడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం.[11][12][13]
మానవ అభివృద్ధి సూచిక ప్రకారం, 2011 లో, ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చివరి నుండి 15 వ దేశంగా ఉంది .
పాఠశాలలపై హింస జరిగిన దేశాలలో ఆఫ్ఘనిస్తాన్ ఎక్కువగా ప్రభావితమైంది, 2008 లో విద్యాలయాలపై 770 సంఘటనలు జరిగాయి. విద్యార్థులపై హింస కారణంగా 2010 లో దాదాపు 50 లక్షల మంది ఆఫ్ఘన్ పిల్లలు పాఠశాలకు రాకుండా ఉండిపోయారు. మరణాల సంఖ్యను గమనిస్తే, ఆఫ్ఘనిస్తాన్లో 439 మంది మొత్తం ఉపాధ్యాయులు, విద్యా సిబ్బంది, విద్యార్థులు 2006-09లో చంపబడ్డారు, ఇది ప్రపంచంలోనే అత్యధికం.[14]
2001 లో తాలిబాన్ పాలన కూల్చివేయబడినప్పటి నుండి, 60 లక్షల మంది బాలికలు, బాలురు పాఠశాలకు హాజరుకావడం ప్రారంభించారు. 2012 లో విద్యార్థుల సంఖ్య అర్హతగల ఉపాధ్యాయుల తగు నిష్పత్తిని మించిపోయింది.[15] విద్యా మంత్రిత్వ శాఖ అందించిన గణాంకాల ప్రకారం, దేశంలోని 165,000 మంది ఉపాధ్యాయులలో 80 శాతం మంది ఉన్నత పాఠశాల విద్యతో సమాన విద్యను మాత్రమే పొంది ఉన్నారు, అనగా వారు ఉన్నత విద్యను (కనీఆం ఇంటర్ స్థాయి విద్య) పూర్తి చేయలేదు.
తాలిబాన్ పాలనను కూల్చివేసినప్పటి నుండి, ఆఫ్ఘన్, అంతర్జాతీయ నిపుణుల సంయుక్త ప్రయత్నాల ప్రకారం, పాఠ్యాంశాలు ఇస్లామిక్ బోధనల నుండి మార్చబడ్డాయి; కొత్త పుస్తకాలు, మంచి శిక్షణ అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ, మాధ్యమిక పాఠశాల పాఠ్యపుస్తకాలకు ప్రామాణిక పాఠ్యాంశాలు లేవు. ఉన్నత పాఠశాల పాఠ్యపుస్తకాలు సంఖ్య, విషయవస్తువు ఆశాజనకంగా లేవు.
2012 లో, తగినన్ని పాఠశాలలు లేవు. ఇటీవలి ప్రభుత్వ నివేదిక ప్రకారం సుమారు 4,500 కొత్త పాఠశాలలను నిర్మిస్తున్నారు. 40 శాతం పాఠశాలలు శాశ్వత భవనాలలో జరిగాయి. మిగిలినవి యునిసెఫ్ ఆశ్రయాలలో లేదా "ఎడారి పాఠశాలలు" (గుడారాలలో) జరిగాయి. ఇందుకోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒక గ్రామానికి సమీపంలో ఎడారిలో గుమిగూడేవారు.[15]
2007 లో, ఆఫ్ఘనిస్తాన్ జనాభాలో సగానికి పైగా 18 ఏళ్లలోపువారు.[16] ఏడు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసున్న ఆఫ్ఘన్ పిల్లలలో నాలుగింట ఒక వంతు మంది బాలకార్మికులుగా పనిచేస్తున్నారని యునిసెఫ్ అంచనా వేసింది.[17] గ్రామీణ ప్రాంతాల్లో, సమస్య దారుణంగా ఉంది,, అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలు పనిచేస్తున్నారు. ఇది పిల్లల విద్యకు అంతరాయం కలిగిస్తోంది. వారిని పాఠశాల విద్య నుండి పూర్తిగా నిరోధిస్తోంది.[18]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.