1981 సినిమా From Wikipedia, the free encyclopedia
సప్తపది, 1981లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇది నృత్యం ప్రధానాంశంగా వచ్చిన సినిమా. అంతకుముందు విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం అనే సంగీతప్రధాన చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమా మంచి అంచనాలతో విడుదలయ్యింది. ఒకమాదిరిగా విజయవంతమైంది.
సప్తపది (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.విశ్వనాధ్ |
---|---|
నిర్మాణం | భీమవరపు బుచ్చిరెడ్డి |
కథ | కె. విశ్వనాధ్ |
చిత్రానువాదం | కె. విశ్వనాధ్ |
తారాగణం | జె.వి. సోమయాజులు, భమిడిపాటి సవిత, గిరీష్, అల్లు రామలింగయ్య, జె.వి. రమణమూర్తి, సాక్షి రంగారావు, డబ్బింగ్ జానకి, రవికాంత్ |
సంగీతం | కె.వి.మహదేవన్ పుహళేంది (సహాయం) |
నేపథ్య గానం | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, పి. సుశీల |
నృత్యాలు | శేషు |
గీతరచన | వేటూరి సుందరరామమూర్తి |
సంభాషణలు | జంధ్యాల |
ఛాయాగ్రహణం | కస్తూరి |
కూర్పు | జి.జి.కృష్ణారావు |
నిర్మాణ సంస్థ | జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కృష్ణా నది వొడ్డున ఓ పల్లెటూరు. ఆ ఊరి దేవీ ఆలయం పూజారి యాజులు గారు. (జె.వి. సోమయాజులు). ఆయన కొడుకు అవధాని (జె.వి. రమణమూర్తి), మనవడు గౌరీనాధం కూడా అర్చకత్వం చేస్తూ ఉంటారు. ఆ ఊరి పెద్దమనిషి, యాజులు గారి స్నేహితుడు రాజుగారు (అల్లు రామలింగయ్య). ఊరందరికీ వీళ్ళిద్దరూ అంటే భయమూ భక్తీ. వీళ్ళిద్దరూ ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ ఉంటారు. ఇంట్లో యాజులు మాటకి కొడుకు, కోడలు అన్నపూర్ణమ్మ (డబ్బింగ్ జానకి) మనవడు ఎదురు చెప్పారు.
ఓ పక్క టైటిల్స్ పడుతుండగానే కథ తాలూకు మూడ్ ని క్రియేట్ చేసి, పాత్రలని ప్రవేశ పెడతారు. టైటిల్స్ అయ్యాక వచ్చే రెండో సన్నివేశంలో కథానాయిక 'హేమ' పరిచయం ఉంటుంది. అమ్మవారి ఉత్సవాల్లో ఆమె నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తారు రాజుగారు. హేమ ఎవరో కాదు, యాజులు గారి కూతురు జానకి కూతురు. కూతురు ఒక నాట్యాచార్యుడిని పెళ్ళి చేసుకుందని ఆమె అంటే కోపం యాజులు గారికి. కూతురు మరణించాక కూడా అల్లుడితోటీ, మనవరాలితోటీ కూడా మాట్లాడడు ఆయన. మరోపక్క ఆయన కొడుకు, కోడలికి హేమని గౌరీనాధానికి ఇచ్చి పెళ్ళి చేయాలని ఉంటుంది.
విడిపోయిన రెండు కుటుంబాలనూ కలపాలని రాజుగారు ఈ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. హేమ పై వచ్చే తొలి సన్నివేశంలోనే ఆమె తన డాన్స్ ట్రూపులో వేణువు ఊదే హరిబాబుతో సన్నిహితంగా ఉండడాన్ని చూపిస్తారు. తన నృత్య ప్రదర్శనతో యాజులు గారిని మెప్పిస్తుంది హేమ. తరువాతి సన్నివేశంలో హేమ, హరిబాబు పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నట్టు, మూఢాచారాలు, వింత నమ్మకాలు వాళ్లకి అడ్డుపడుతున్నట్టు చూపిస్తారు. వాళ్ళిద్దరూ కలిసి గుళ్ళో ఓ వుయ్యాల కడతారు.
హేమ ప్రదర్శనని మెచ్చుకున్న రాజుగారు, ఆమెని గౌరీనాధానికి ఇచ్చి పెళ్ళి చేయమని యాజులుకి సలహా ఇస్తారు. "నాట్యం చేసే పిల్ల" అని యాజులు అభ్యంతరం చెబితే, నాట్యం వేదాల నుంచి పుట్టిందే కదా అని ఒప్పిస్తారు. హేమని ఆలయానికి పిలిచి, వేదగానానికి నాట్యం చేయమని ఆమెకి పరీక్ష పెట్టి, గౌరీనాధానికి, ఆమెకి పెళ్ళి జరిపిస్తానని ప్రకటిస్తారు యాజులు. పడవలో తన ఊరికి తిరుగు ప్రయాణమైన హేమకి గతం గుర్తొస్తుంది.
ఒక నాట్య ప్రదర్శనలో హరిబాబుతో పరిచయం, అతని చొరవతో అది ప్రేమగా మారడం. ఆమె తన ప్రేమని వ్యక్త పరిచాక. అతను తాను 'హరిజనుణ్ణి' అని చెప్పడం.. హేమ తనని పెళ్ళి చేసుకోడం కుదరని పక్షంలో ఆమె మరెవ్వరి సొత్తూ కాకూడదన్న 'వింత కోరిక' కోరడం జరుగుతాయి. హరిబాబు తన వివరాలు చెప్పకుండా మోసం చేసినందుకు హేమ అతన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తుందేమో అనిపిస్తుంది.. కానీ హేమ అతనిపై ప్రేమని పోగొట్టుకోదు.
గౌరీనాధంతో హేమ పెళ్ళి జరిగాక, ఆమె అతనికి తను నిత్యం పూజించే దేవతలా కనిపించడంతో వాళ్ళిద్దరూ 'పరాయి' వాళ్ళుగానే ఉంటారు. హేమకి పిల్లలు కలగపోవడంతో, ఆమెచేత గుళ్ళో చెట్టుకి వుయ్యాల కట్టించే ప్రయత్నం చేస్తారు. గతం గుర్తొచ్చి కళ్ళు తిరిగి పడిపోతుంది హేమ. గుళ్ళో పూలమ్ముకునే అమ్మాయి నుంచి విషయం తెలుసుకున్న గౌరీనాధం, హేమ ద్వారా హరిబాబుని గురించి తెలుసుకుని అతన్ని తీసుకురాడానికి బయలుదేరతాడు. మనవరాలిని ఓ హరిజనుడికి ఎలా ఇవ్వాలన్న యాజులు సంశయాన్ని పోగొడతారు రాజుగారు. ఊరివారందరినీ సమాధాన పరిచి, హేమని హరిబాబుతో పంపడం సినిమా ముగింపు.
ముందుగా చెప్పినట్టుగా చిత్రానువాదం ఈ సినిమాకి బలం అనిపిస్తుంది. రాజుగారి భార్య, కూతురు ఒకేసారి పురిటికి సిద్ధపడడం ఒక్కటే అనవసరపు సన్నివేశం అనిపిస్తుంది. నిజానికి ఈ సన్నివేశం లేకపోయినా కథకేమీ నష్టం లేదు. విశ్వనాథ్ చాలా సినిమాల్లో లాగే ఇందులోనూ నటులు కనిపించరు..ఆయా పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. చిత్రానువాదం తర్వాత చెప్పుకోవలసింది పాటల గురించి. మహదేవన్ సంగీతంలో పాటలన్నీ ఆపాత మధురాలే. సత్యభామచేత వడియాలు పెట్టించడం విశ్వనాధ్ కే చెల్లింది. 'అచ్చెరువున అ-చ్చెరువున విచ్చిన కన్నుల జూడ' 'ఆ రాధ ఆరాధనాగీతి వినిపించ' లాంటి చమక్కులు చూపారు వేటూరి. 'గోవుల్లు తెల్లన' పాటలో జానకి గళ విన్యాసాన్ని తలచుకోకుండా ఉండగలమా? జంధ్యాల పదునైన సంభాషణలు రాశారు.. ముఖ్యంగా కత్తిమీద సాము లాంటి ముగింపు సన్నివేశాల్లో వచ్చే సంభాషణలు గుర్తుండిపోతాయి. ఈ సినిమాలో వర్ణ వ్యవస్థను చిత్రించిన తీరు గురించి చాలా చర్చలే జరిగాయి..[1]
జ్యోతి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై భీమవరపు బుచ్చి రెడ్డి నిర్మించిన ఈ సినిమా 1981 లో విడుదలై అవార్డులని గెలుచుకుంది. వర్ణ వ్యవస్థ గురించి సంభాషణలోను, పాటలలోను అనేక తత్వచింతనలు జొప్పించారు. అల్లు రామలింగయ్యకు, సోమయాజులుకు జరిగిన సంభాషణలలో వృత్తి ధర్మం, మనో ధర్మం గురించిన అభిప్రాయాలున్నాయి.
సృష్టి ఆదిలో లేకున్నా మధ్యలో పుట్టుకొచ్చిన వర్ణవ్యవస్థ గురించి వేటూరి పాటలలో చక్కని ప్రశ్నలున్నాయి -
ఆదినుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
నడిమంత్రపు మనుషులకే ఈ మాటలు, ఇన్ని మాటలు
.....
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మావాడేలెమ్మంది
....
ఏడు వర్ణాలు కలిసి ఇంద్ర ధనుసౌతాది
అన్ని వర్ణాలకూ ఒకటే ఇహము పరముంటాయి
....
తెల్లావు కడుపున కర్రావులుండవా
కర్రావయ కడుపున ఎర్రావు పుట్టదా
సం. | పాట | పాట రచయిత | గానం | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం" | వేటూరి సుందరరామమూర్తి | పి.సుశీల | |
2. | "అయిగిరి నందిని" (మహిషాసుర మర్ధిని స్తోత్రం) | ఆది శంకరాచార్యుడు | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
3. | "ఏ కులము నీదంటే గోకులము నవ్వింది" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | |
4. | "ఓం జాతవేదసేసు మరాతి" (శ్రీ దుర్గా సూక్తం) | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి | ||
5. | "గోవుల్లు తెల్లన గోపన్న నల్లన గోధూళి ఎర్రన ఎందువలన" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి | |
6. | "నెమలికి నేర్పిన నడకలివీ, మురళికి అందని పలుకులివీ" (నెమలి నాట్యం) | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.జానకి | |
7. | "భామనే సత్యభామనే వయ్యరి ముద్దుల సత్యభామనే" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.జానకి | |
8. | "మరుగేలర ఓ రాఘవ" | త్యాగరాజు | ఎస్.జానకి | |
9. | "వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి నవరసమురళి ఆనందన మురళి ఇదేనా" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: కె.వి.మహదేవన్.
కులమతభేదాలను రంగులతో కవి వేటూరి పోల్చిన విధానం ఈ పాటను కాలంతో సంబంధం లేకుండా నిలబెట్టింది.[2]
సంవత్సరం | ప్రతిపాదించిన విభాగం | పురస్కారం | ఫలితం |
---|---|---|---|
1981 | కాశీనాధుని విశ్వనాధ్ | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సమైక్యత సినిమా | గెలుపు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.