గణతంత్ర భారతదేశ చరిత్ర
భారతదేశపు ఇటీవలి చరిత్ర / From Wikipedia, the free encyclopedia
భారత దేశ గణతంత్ర చరిత్ర 1950 జనవరి 26 తో మొదలైంది. భారతదేశం బ్రిటిషు పాలన నుండి 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం సాధించింది. ముస్లింలు అధికంగా కలిగిన బ్రిటిషు పాలిత భారతదేశపు వాయవ్య, తూర్పు ప్రాంతాలు పాకిస్తాన్ దేశంగా భారతదేశం నుంచి విభజించారు. విభజన కారణంగా కోటి మంది జనాభా ఇరు దేశాల మధ్య వలస పోయారు. పది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ నాయకుడు జవాహర్లాల్ నెహ్రూ భారతదేశ మొదటి ప్రధాన మంత్రి అయ్యాడు. సర్ధార్ వల్లభాయి పటేల్ ఉప ప్రధాన మంత్రితో పాటు, హోం శాఖ మంత్రిగా కూడా సేవలు అందించాడు. కానీ అత్యంత శక్తివంతమైన నాయకుడు మహాత్మా గాంధీ ఏ పదవినీ స్వీకరించలేదు. 1950 లో భారత రాజ్యాంగం భారత దేశాన్ని సర్వసత్తాక, ప్రజాస్వామ్య దేశంగా ధ్రువీకరించింది. భారత్ హిందువులు, ముస్లిం, సిక్కులు, ఇలా అనేకానేక మతాలను అవలంబించే ప్రజలు కలిగిన దేశం. భారతదేశం ఎన్నో మత కలహాలు, కులతత్వం, నక్సలెట్లు, ఉగ్రవాదం, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, ఈశాన్యంలో ప్రాంతీయవాద అల్లర్ల వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. ఇప్పటికీ పరిష్కారం కాని సరిహద్దు వివాదాలు చైనాతో ఉన్నాయి. ఫలితంగా 1962 లో భారత చైనా యుద్ధం జరిగింది. 1947, 1965, 1971 & 1999 సంవత్సరాల్లో పాకిస్తాన్తో యుద్ధాలు జరిగాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో భారతదేశం తటస్థంగా ఉన్నప్పటికీ తన సైనిక బలగాలకు అవసరమైన ఆయుధాలను సోవియెట్ యూనియన్ నుండి కొనుగోలు చేసింది. తన శత్రువైన పాకిస్తాన్ మాత్రం అమెరికాతో మంచి సంబంధాలు కలిగి ఉంది.
భారతదేశ చరిత్ర |
సరస్వతీ, సింధూ నదీ నాగరికత |
వైదిక నాగరికత |
మహా జనపదాలు |
మగధ సామ్రాజ్యం |
శాతవాహనులు |
తొలి మధ్య యుగపు రాజ్యాలు |
చివరి మధ్య యుగపు రాజ్యాలు |
ముస్లిం దండయాత్రలు |
విజయనగర రాజ్యం |
మొఘల్ పరిపాలన |
ఈష్టిండియా కంపెనీ పాలన |
బ్రిటీషు పాలన |
భారత స్వాతంత్ర్యోద్యమం |
భారతదేశ గణతంత్ర చరిత్ర |
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/67/The_first_Cabinet_of_independent_India.jpg/640px-The_first_Cabinet_of_independent_India.jpg)
భారతదేశానికి అణ్వస్త్రాలు ఉన్నాయి. మొదటి అణుపరీక్ష 1974 లో నిర్వహించింది. తర్వాత 1998 లో మరో 5 ప్రయోగాలు నిర్వహించింది. 1950 నుండి 1980 మధ్య సామ్యవాద విధానాలను అవలంబించింది. భారతదేశపు ఆర్థిక పురోగతికి మితిమీరిన ఆంక్షల వల్ల అడ్డంకులు ఎదురయ్యాయి. సంరక్షణవాదం సర్వవ్యాప్త అవినీతికి, ఆర్థిక వ్యవస్థ మందగమనానికీ దారి తీసాయి. 1991 లో మొదలైన ఆర్థిక సంస్కరణలు భారత దేశాన్ని ప్రపంచపు మూడవ అతి పెద్దదైన, అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దాయి. ఈ రోజు భారతదేశం ఓ పెద్ద శక్తివంతమైన దేశం. అంతర్జాతీయ వ్యవహారాల్లో తన గళాన్ని ప్రముఖంగా వినిపిస్తోంది. ఐక్యరాజ్యసమితికి చెందిన భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని ఆశిస్తోంది.