మొఘల్ సామ్రాజ్యం
From Wikipedia, the free encyclopedia
మొఘలాయిలు కీ.శ. 1526 నుండి 1707 వరకు భారత ఉపఖండాన్ని (ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్) పరిపాలించిన రాజవంశీయులు. 1526లో తైమూరు వంశానికి చెందిన బాబరు ఒకటవ పానిపట్టు యుద్ధంలో ఇబ్రాహీమ్ లోడీను ఓడించి మొఘల్ సామ్రాజ్యం స్థాపించాడు. ముఘల్ అంటే మంగోల్ అనే పదానికి పెర్షియా భాషలో సమానమైన పదం. మంగోల్ అంటే మధ్య ఆసియాలోని చెంఘీజ్ ఖాన్ వంశీయులైన సంచార యుద్దవీరులు అని అర్థం. మొఘల్ వంశీయులంతా ఇస్లాం మతాన్ని కచ్చితంగా పాటించారు. బాబరు తరువాత పరిపాలనా బాధ్యతల్ని చేపట్టిన హుమాయూన్ను పఠాన్ వీరుడైన షేర్ షా సూరి జయించి సుర్ సామ్రాజ్యం స్థాపించాడు. పదహారేళ్ళ తరువాత పోగట్టుకున్న కోటలన్నింటినీ హుమాయూన్ మళ్ళీ జయించాడు. హుమాయూన్ తరువాత అతని కుమారుడైన అక్బర్ మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించి 1556 నుండి 1605 వరకు పాలించాడు. అక్బర్ తరువాత విశాలమైన మొఘల్ సామ్రాజ్యం అతని కుమారుడైన జహాంగీర్కు సంక్రమించింది. జహాంగీర్ తర్వాత ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన షాజహాన్ కాలంలో మొఘల్ సామ్రాజ్యం ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యంగా కీర్తింపబడింది. ఇతను పరిపాలించిన కాలాన్నే చరిత్రకారులు మొఘల్ సామ్రాజ్య స్వర్ణ యుగంగా వర్ణిస్తారు.
షాజహాను కీ.శ.1630, 1653 మధ్య, తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధంగా, ప్రసిద్ధిగాంచిన తాజ్ మహల్ కట్టించాలని సంకల్పంచాడు. ముంతాజ్ తన 14వ బిడ్ద ప్రసవ సమయంలో మరణించింది. 1700 నాటికి సామ్రాజ్యం 40లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉథ్థాన స్థితికి చేరుకొన్నది.[1]