భారతదేశంలో కంపెనీ పాలన
భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ పాలన / From Wikipedia, the free encyclopedia
భారతదేశంలో కంపెనీ పాలన (కొన్నిసార్లు, కంపెనీ రాజ్ లేక కుంఫిణీ పాలన,[1] "రాజ్", అంటే హిందీలో పాలన[2]) అన్నది భారత ఉపఖండంలోని భాగాలపై బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ పరిపాలన లేక ఆధిపత్యం గురించినది. ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా కంపెనీకి తన అధీనంలోని ప్రాంతాన్ని లొంగుబాటు చేసిన తర్వాత 1757లో ప్రారంభమైందని కొందరు చరిత్రకారులు,[3] 1765లో బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో దివానీ అని పేర్కొనే పన్ను వసూలు చేసుకునే అవకాశం కంపెనీకి దక్కాక ప్రారంభమైందని మరికొందరు,[4] 1773లో కంపెనీ కలకత్తాలో రాజధానిని ఏర్పరిచి వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్ గా పరిపాలన ప్రారంభించాకా మొదలైందిన ఇంకొందరు,[5] 1818లో మరాఠాలు ఓడిపోయి పీష్వాకు పింఛను ప్రారంభించి, అతని భూభాగాలను బ్రిటీష్ అధీనంలోకి తీసుకున్నాకా పూర్తి బ్రిటీష్ ఆధిపత్యం ప్రారంభమయ్యాకా మొదలైందని మరికొందరు లెక్కిస్తారు.[6]
ఈస్టిండియా కంపెనీ అన్నది వాటాదారులు యాజమాన్యంలోని ప్రైవేటు కంపెనీ, లండనులోని డైరెక్టర్ల బోర్డుకు నివేదిస్తూండేవారు. అసలు మొదట్లో వాణిజ్యంపై గుత్తాధిపత్యం లక్ష్యంగా ఏర్పడింది, క్రమక్రమంగా స్వంత సైన్యం, న్యాయవ్యవస్థలతో ప్రభుత్వాధికారాలు అదుపులోకి తీసుకుంది. కంపెనీ సొమ్మును ఉద్యోగులు తమ జేబుల్లో వేసుకుంటూ ఉండడంతో కంపెనీ లాభాల్లోకి వెళ్ళిన సందర్భాలు అరుదు. ఆ దశలో, బ్రిటీష్ ప్రభుత్వానికి ఈస్టిండియా కంపెనీ మీద చాలా తక్కువ అదుపు ఉండేది, కంపెనీ అధికారులు లేదా నబోబ్స్ అనేవారు విపరీతమైన అవినీతి, బాధ్యతారాహిత్యంతో కొద్దికాలంలో ఊహించలేనంత సంపద పోగేసుకోవడంతో జనంలో ఆగ్రహం పెరుగుతూ వచ్చింది.[7] 1784లోని పిట్ ఇండియా చట్టం మొట్టమొదటిసారిగా బ్రిటీష్ ప్రభుత్వానికి ప్రైవేటు కంపెనీ వ్యవహారాలపై అదుపుని ఇచ్చింది. చక్కని సివిల్ సర్వీసు కెరీర్ ను కంపెనీ ఉద్యోగాల్లో రూపకల్పన చేసేలా పాలసీలు రావడంతో అవినీతికి పాల్పడాలన్న దురాశ తగ్గుముఖం పట్టింది.[8] కంపెనీ అధికారులు బ్రిటీష్ ప్రమాణాలకు అనుగుణమైన ప్రత్యేక గృహాలు నిర్మించుకుని జీవించడం పెరిగింది. 1857 భారత తిరుగుబాటు వరకూ కొనసాగిన కంపెనీ పాలన, ఆ తర్వాత 1858లో రద్దు అయింది. 1858లో భారత ప్రభుత్వ చట్టం 1858 ్ప్రకారం బ్రిటీష్ ప్రభుత్వం కొత్త బ్రిటీష్ రాజ్ కింద భారతదేశాన్ని నేరుగా పరిపాలించడం ప్రారంభించింది.