కమల్ ఘోష్
From Wikipedia, the free encyclopedia
కమల్ ఘోష్ ప్రముఖ చలనచిత్ర ఛాయాగ్రాహకుడు. ఇతడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కాతాలో 1910లో జన్మించాడు. కలకత్తా న్యూ థియేటర్స్ సంస్థ అధినేత దేవకీబోస్ ఇతని మేనమామ. ఇతనికి చిన్నతనం నుండి ఫోటోగ్రఫీ పట్ల ఉత్సాహం, ఆసక్తి ఉండేది. ఇతని మేనమామ దేవకీబోస్ అది గమనించి ఇతడిని చలనచిత్ర యంత్ర సామాగ్రి తయారు చేస్తూ లాబొరేటరీని నిర్వహించే కృష్ణగోపాల్ వద్ద చేర్పించాడు. 1925 నుండి 32 వరకు లాబొరేటరిలోనే ఉంటూ సినిమా ఎడిటింగ్, ఫోటోగ్రఫీలలో శిక్షణ తీసుకున్నాడు. 1932లో ఈస్టిండియా ఫిలిం కంపెనీలో సహాయకుడిగా కృష్ణగోపాల్ వద్ద "సునేరే సంసార్" అనే వంగ సినిమాకి పనిచేశాడు. స్వతంత్రంగా చిత్రీకరించగల సామర్థ్యం సంపాదించుకున్న తర్వాత "రాత్ ఖానా" అనే బెంగాలీ హాస్య చిత్రానికి ఛాయా గ్రాహకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత ఏ.ఆర్.కర్దార్ తీసిన "భాగీ సిపాయి" చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు. ఈస్టిండియా ఫిలిం కంపెనీ వారు సి.పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించిన లవకుశ సినిమాకు ఇతడిని ఛాయాగ్రాహకుడిగా నియమించారు. ఇది ఇతని తొలి తెలుగు సినిమా. 1949లో తమిళంలో అపూర్వ సహోదరులు సినిమాతో ద్విపాత్రాభినయాన్ని తొలిసారి చిత్రించిన ఘనత ఇతనికే దక్కింది.
దక్షిణ భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమాభివృద్ధికి కారకులలో ఒకరైన కె.సుబ్రహ్మణ్యం మద్రాసులో ఒక సినిమా స్టూడియో నిర్మాణం చేయసంకల్పించి కలకత్తా వెళ్లి ఇతడిని మద్రాసుకు తీసుకువచ్చాడు. కె.సుబ్రహ్మణ్యం మోషన్ పిక్చర్ కంబైన్స్ పేరుతో (తరువాతి కాలంలో జెమినీ స్టూడియోస్) "బాలయోగి" అనే తమిళ సినిమా తీస్తూ ఇతడికి ఛాయాగ్రాహకుడిగా అవకాశం వచ్చింది. అప్పటి నుండి ఇతడు మద్రాసులో స్థిరపడ్డాడు. ఇతడు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో సుమారు 80కి పైగా సినిమాలకు పైగా సినిమాటోగ్రాఫర్గా పనిచేశాడు. ఇతడు జెమినీ, జూపిటర్, అంజలి పిక్చర్స్, భరణి, సారథీ స్టూడియోస్ వంటి సంస్థలలో పనిచేశాడు. ఇతని దగ్గర శిష్యులుగా పనిచేసిన వారిలో ఎ.విన్సెంట్, జె.సత్యనారాయణ, లక్ష్మణ్ గోరే, తంబు మొదలైన వారు ఛాయాగ్రాహకులుగా పేరు తెచ్చుకున్నారు.
ఇతడు చిత్ర నిర్మాణ రంగంలో కూడా ప్రవేశించి ఘంటసాలతో కలిసి పరోపకారం సినిమాను నిర్మించాడు. ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఆ తర్వాత మనోరమ చిత్రానికి కూడా ఇతడే దర్శకత్వం నిర్వహించాడు.[1]