భారతదేశం యొక్క రాజకీయ పార్టీ From Wikipedia, the free encyclopedia
భారత్ రాష్ట్ర సమితి (ఆంగ్లం: Bharat Rashtra Samithi), అనేది జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏర్పాటుచేసిన రాజకీయ పార్టీ.[8] తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం 2001లో ఏర్పాటుచేయబడిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు 2022 అక్టోబరు 5న భారత్ రాష్ట్ర సమితిగా మార్చబడింది.[9] 2022 డిసెంబరు 9న తెలంగాణ భవన్లో జరిగిన భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మధ్యాహ్నం 1.20 నిమిషాలకు బీఆర్ఎస్ పత్రాలపై సంతకం చేసిన కేసీఆర్, పార్టీ జెండాను ఆవిష్కరించాడు.
భారత్ రాష్ట్ర సమితి | |
---|---|
Chairperson | కె.చంద్రశేఖరరావు |
రాజ్యసభ నాయకుడు | కేతిరెడ్డి సురేష్రెడ్డి |
స్థాపకులు | కె.చంద్రశేఖరరావు |
స్థాపన తేదీ | 5 అక్టోబరు 2022 |
ప్రధాన కార్యాలయం | వసంత్ విహార్, న్యూఢిల్లీ |
విద్యార్థి విభాగం | భారత్ రాష్ట్ర సమితి విద్యార్థి (బీఆర్ఎస్వీ)[1] |
మహిళా విభాగం | భారత్ రాష్ట్ర సమితి మహిళ (బీఆర్ఎస్ఎం) |
రాజకీయ విధానం | |
రాజకీయ వర్ణపటం | సెంట్రిజం |
రంగు(లు) | గులాబి |
ఈసిఐ హోదా | ప్రాంతీయ పార్టీ[7] |
కూటమి |
|
లోక్సభలో సీట్లు | 9 / 543
|
రాజ్యసభలో సీట్లు | 6 / 245
|
శాసనసభలో సీట్లు | 38 / 119
|
Party flag | |
Website | |
https://brsonline.in/ |
2022 అక్టోబరు 4న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో పార్టీ నేతలతో తెరాస సర్వసభ్య సమావేశం జరిగింది. దాదాపు వందకు పైగా పేర్లను పరిశీలించిన కేసీఆర్, జాతీయ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా కేసీఆర్ ఖరారు చేశాడు. ఇప్పటికే భారత్ రాష్ట్ర సమితి అనే పేరు దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్ళడం, హిందీలో భారతదేశ సమితి అనే అర్థం వస్తుందనే ఉద్దేశంతో ఈ పేరును ఎంపిక చేశాడు. ఈ సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రులు టి. హరీశ్ రావు, మహమూద్ అలీ, వి.శ్రీనివాస్ గౌడ్, పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ సభాపతి సిరికొండ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.[10]
2022 అక్టోబరు 5న దసరా రోజున తెలంగాణ భవన్ లో జరిగే సర్వసభ్య సమావేశంలో పేరు మార్పుపై 6 ఎమ్మెల్యేలు తీర్మానాన్ని ప్రతిపాదించగా, 283 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మధ్యాహ్నం 1.19 గంటలకు తీర్మానంపై సంతకం చేసిన అనంతరం సభ్యులు ఆమోదించిన తీర్మానంపై కేసీఆర్ ప్రకటన చేశాడు. సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్. డి. కుమారస్వామి, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తిరుమవలవన్ తదితరులు హాజరయ్యారు.[10][11]
తెరాస స్థానంలో భారత్ రాష్ట్ర సమితిగా పార్టీ పేరు మార్పు నిర్ణయంపై చేసిన తీర్మానం ప్రతితో 2022 అక్టోబరు 6న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఈసీ డిప్యూటీ కమిషనర్ ధర్మేంద్ర శర్మను కలిసి పార్టీ పేరు మార్పుపై చేసిన తీర్మానానికి ఆమోదం కోరుతూ అఫిడవిట్ సమర్పించారు.[12] టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పాలంటూ నవంబరు 7న పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. డిసెంబరు 7న ఆ గడువు ముగియడంతో పార్టీ పేరు మార్పుకు సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ డిసెంబరు 8న పార్టీ నాయకత్వానికి లేఖ పంపించింది.[13]
2022 డిసెంబరు 9న తెలంగాణ భవన్లో జరిగిన భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీను గుర్తిస్తూ కేంత్ర ఎన్నికల సంఘం పంపిన లేఖపై రిప్లైగా మధ్యాహ్నం 1.20 నిమిషాలకు సంతకం కేసీఆర్ చేశాడు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించాడు.[14] ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించి, వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ కార్యక్రమంలో జేడీఎస్ చీఫ్ కుమారస్వామి, సినీనటుడు ప్రకాశ్ రాజ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ కవిత తదితరులు పాల్గొన్నారు.[15]
గులాబీ రంగులోనే పార్టీ జెండాను రూపొందించబడింది. జెండా మధ్యలో తెలంగాణ స్థానంలో భారత్దేశం మ్యాప్తో బీఆర్ఎస్ జెండాను రూపొందించారు. పార్టీ జెండాపై జై తెలంగాణ బదులు.. జై భారత్గా మార్చారు.[16]
వసంత్ విహార్ పార్టీ కార్యాలయం నిర్మాణ దశలో ఉన్న కారణంగా ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో తాత్కాలిక పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ 2022 డిసెంబరు 13, 14 తేదీల్లో కార్యాలయంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. డిసెంబరు 14న జరిగిన రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు పాల్గొని, పూజలు నిర్వహించారు. యాగం ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12:37 నుంచి 12:47 గంటల మధ్య పార్టీ జాతీయ జెండాను ఆవిష్కరించి, బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించి, పార్టీ అధ్యక్షుని హోదాలో తన గదిలోని కుర్చీలో కేసీఆర్ ఆశీనులయ్యాడు. ఈ ప్రారంభోత్సవానికి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యారు.[17][18]
2019 జనవరి 7న ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి భూమి కేటాయించాలని ప్రధాని మోదీకి బీఆర్ఎస్ ఎంపీల బృందం వినతిపత్రం అందజేసింది. 2020 అక్టోబరు 9న ఢిల్లీలోని వసంతవిహార్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి కేటాయించినట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ల్యాండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ దీన్దయాళ్ కేసీఆర్కు లేఖ రాశాడు. 2020 నవంబరు 4న రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి భూమిపత్రాలు అందజేశారు.[19]
బీఆర్ఎస్ ఆఫీసు నిర్మాణానికి 2021, సెప్టెంబరు 2న ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేశాడు. నాలుగు అంతస్తులతో 11 వేల చదరపు అడుగుల స్థలంలో ఈ భవనం నిర్మించబడింది. 2022 డిసెంబరు 14న కేసీఆర్ నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశాడు.
2023 మే 4న బీఆర్ఎస్ భవన్ను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించాడు. భవన ప్రారంభోత్సవానికి ముందు నిర్వహించిన సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజల్లో పాల్గొన్న కేసీఆర్ భవన శిలాఫలకాన్ని ఆవిష్కరించాడు. మ. 1:05 గంటలకు రిబ్బన్ కట్ చేసి భవన్లోకి ప్రవేశించి, దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, మొదటి అంతస్తులో ఏర్పాటుచేసిన తన ఛాంబర్కు వెళ్ళి కుర్చీలో ఆసీనులయ్యాడు.[20]
హైదరాబాదులోని కోకాపేటలో ‘భారత్ భవన్’ పేరుతో నిర్మించనున్న పార్టీ కేంద్ర కార్యాలయానికి 2023, జూన్ 5న కేసీఆర్ శంకుస్థాపన చేశాడు. 11 ఎకరాల్లో 15 అంతస్తులతో నిర్మించనున్న ఈ భవనంలో రాజకీయ అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతుల నిర్వహణ, కార్యకర్తలు, నాయకులకు అవసరమైన సమస్త, సమగ్రమైన సమాచార కేంద్రంగా ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్’, ‘హ్యుమన్ రిసోర్స్ డెవల్పమెంట్’ పేరిట మరికొన్ని నిర్మాణాలు ఉంటాయి.[21]
2022 డిసెంబరు 22న తెలంగాణ శాసనసభ, తెలంగాణ శాసనమండలిలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ బులెటిన్ జారీ చేయబడింది. టీఆర్ఎస్ఎల్పీ ఇక నుంచి బీఆర్ఎస్ఎల్పీగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది.[22]
2023 జనవరి 18న ఖమ్మం పట్టణం శివారులోని వీ వెంకటాయపాలెంలో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు బీఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభ జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని 13 నియోజకవర్గాల నుంచి జన సమీకరణకు ఆరుగురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు 18 మందితో కమిటీలు ఏర్పాటు చేశారు. సభ నిర్వహణలో భాగంగా 100 ఎకరాలతో సభా ప్రాంగణం, 448 ఎకరాలలో పార్కింగ్ ఏర్పాటు చేశారు.[23]
5 లక్షల మంది జనసమీకరణ అంచనాతో జరిగిన ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రలు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తోపాటు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య అతిథులు హాజరయ్యారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పినరయ్ విజయన్, భగవంత్ సింగ్ మాన్, కేజీవాల్, అఖిలేష్ యాదవ్, డి.రాజా, కేసీఆర్ ప్రసంగించారు.[24][25]
2024 మే 13న 18 వ లోక్ సభకు తెలంగాణలో భారత్ సార్వత్రిక ఎన్నికలు జరగినాయి. భారత్ రాష్ట్ర సమితి రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజక వర్గాలలో పోటీ చేసింది. 2024లో జూన్ 4న ఫలితాలు వెలువడినాయి. కాని ఒక్క సీటునూ కూడా గెలుచుకోలేక పోయింది.[26] రాష్ట్రంలో ఖమ్మం,మహబూబాబాద్లో రెండో స్థానం పొంది.14 సీట్లలో మూడో స్థానం. హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో నాలుగో స్థానానికి పరిమితమైంది. భారత రాష్ట్ర సమితి పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోవడం ఇదే తొలిసారి. భారత రాష్ట్ర సమితి (నాటి తెరాస) పార్టీ ఆవిర్భావం తర్వాత తొలి సారిగా పార్లమెంటులో ప్రాతినిధ్యం కోల్పోయింది.[27]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.