భారతదేశం దిగువ సభ From Wikipedia, the free encyclopedia
భారత పార్లమెంటులో దిగువ సభను లోక్సభ అంటారు. లోక్సభ సభ్యులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ప్రజల ప్రత్యక్ష ప్రాతినిధ్యం ఉండే సభ కనుక ఇది ప్రజల సభ అయింది. పార్లమెంటులోని రాజ్యసభను ఎగువ సభ అని అంటారు. రాజ్యాంగం ప్రకారం లోక్సభలో గరిష్ఠంగా 550 (1950 లో ఇది 500) మంది సభ్యులు ఉండవచ్చు. ప్రస్తుతం లోక్సభలో 543 మంది ప్రజలచేత ఎన్నుకోబడిన సభ్యులు ఉన్నారు.[4][5] వీరిలో 530 మంది రాష్ట్రాల నుండి, 13 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికైనవారు.[6][7][8] లోక్సభ సభ్యులను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలు (General Elections) అంటారు. వోటర్ల సంఖ్య రీత్యా, ఎన్నికల పరిమాణం రీత్యా భారత సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత భారీ ఎన్నికలు.
లోక్సభ[1] | |
---|---|
17వ లోక్సభ | |
రకం | |
రకం | భారత పార్లమెంటు దిగువ సభ |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
నాయకత్వం | |
స్పీకర్ | |
డిప్యూటీ స్పీకర్ | ఖాళీ 2019 భారత సార్వత్రిక ఎన్నికలు నుండి |
సభాధ్యక్షుడు | |
ప్రతిపక్ష నాయకుడు | |
నిర్మాణం | |
సీట్లు | 545 (543 ఎన్నిక + 2 రాష్ట్రపతిచే నామినేట్ చేయబడిన ఆంగ్లో ఇండియన్లు)[3] |
రాజకీయ వర్గాలు | పాలకపక్షం (336)
ఎన్ డి ఏ (336)
ప్రతి పక్షం (207)
ఇతరులు(97)
|
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | First past the post |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 11 ఏప్రిల్ – 23 మే 2019 |
తదుపరి ఎన్నికలు | ఏప్రిల్ – మే 2024 |
నినాదం | |
धर्मचक्रपरिवर्तनाय | |
సమావేశ స్థలం | |
Lok Sabha chamber, Sansad Bhavan, Sansad Marg, New Delhi, India - 110 001 |
లోక్సభ కాలపరిమితి ఐదేళ్ళు. ఎన్నికలు జరిగిన వెంటనే జరిగే మొదటి సమావేశం తేదీ నుండి 5 సంవత్సరాలకు ఆ లోక్సభ గడువు తీరిపోతుంది. అయితే అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ఈ పరిమితిని ఒక్కో సంవత్సరం చొప్పున పొడిగించుకుంటూ పోవచ్చు. అయితే, అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన తరువాత 6 నెలలకు మించి పొడిగించేందుకు వీలులేదు. అయితే, సభను ఐదేళ్ళ కంటే ముందే రద్దు చేయ్యవచ్చు. సంవత్సరానికి 3 సార్లు లోక్సభ సమావేశాలు జరుగుతాయి. అందులో మొదటిగా బడ్జెట్ సమావేశం, (మొదటి) 4 నెలలు కాగా సాధారణంగా ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం జరుగుతుంది. (రెండవ) జూలై, ఆగస్టు, సెప్టెంబరులలో (మూడు) నవంబరు లేదా డిసెంబరు నెలలలో ప్రవేశ పెట్టడం జరగుతుంది.
చరణ్దాస్ మహంత్ నేతృత్వంలోని ఎంపీల వేతనాలు, భత్యాల పార్లమెంటరీ సంయుక్త కమిటీ చేసిన సిఫార్సులు:
పార్లమెంటులో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ప్రజలసభయైన లోక్సభకు విశేష అధికారాలున్నాయి. ఆర్థికాధికారాల్లో, మంత్రిమండలిని తొలగించే విషయంలో లోక్సభకు ప్రత్యేక అధికారాలున్నాయి. ఇంకా శాసన నిర్మాణాధికారాలు, ఆర్థిక, న్యాయ సంబంధ, రాజ్యాంగ సవరణ, ఎన్నిక పరమైన, కార్యనిర్వాహక శాఖపై నియంత్రనాధికారాలు లోక్సభకు ఉంటాయి.
ఆర్థిక బిల్లులతోబాటు సాధారణ బిల్లులను కూడా లోక్సభలో ప్రవేశపెట్టవచ్చు.సాధారణ బిల్లులు కేంద్ర ప్రభుత్వ ఆర్థికేతర, పాలనా పరమైన వ్యవహారాలకు సంబంధించినవి. ఆర్థిక బిల్లులు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు సంబంధించినవి. సాధారణ బిల్లులను ఏ సభలోనైనా మొదట ప్రవేశపెట్టవచ్చును.
రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ లో పేర్కొన్న అధికారాల జాబితాలో కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట అధికారాలపై లోక్సభ శాసనాలు చేస్తుంది. రాష్ట్ర జాబితాపై కూడా ఇది శాసనాలు చేస్తుంది.
ఆర్థికాధికారాల విషయంలో రాజ్యసభ అధికారాలు నామమాత్రం. లోక్సభకు ఆర్థిక విషయాల్లో ఎక్కువ అధికారాలున్నాయి. ఉదాహణకు
ఒక బిల్లు సాధారణ బిల్లు అవుతుందా, ఆర్థిక బిల్లు అవుతుందా అనే విషయాన్ని లోక్సభ స్పీకర్ నిర్ణయిస్తాడు. లోక్సభ స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయడానికి లేదు.స్పీకర్ ఒక బిల్లును ఆర్థిక బిల్లు అని ధ్రువీకరించిన తర్వాత రాష్ట్రపతి అనుమతితోనే మొదట దాన్ని లోక్సభలో ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత దాన్ని రాజ్యసభకు పంపుతారు. రాజ్యసభ దాన్ని 14 రోజుల్లోగా అనుమతించి తిరిగి లోక్సభకు పంపాలి. ఏ కారణంతోనైనా రాజ్యసభ ఆర్థిక బిల్లును ఆమోదించక చేర్పులు, మార్పులను సూచించి పంపితే, లోక్సభ ఆ ప్రతిపాదనలను ఆమోదించవచ్చు.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్, యు.పి.ఎస్.సి ఛైర్మన్ మొదలైనవారి తొలగింపు విషయంలో లోక్సభకు అధికారం ఉంటుంది. రాష్ట్రపతిని తొలగించేందుకు ఏ సభలోనైనా మొదట మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే మొదట రాజ్యసభలోనే అభియోగ తీర్మానం ప్రవేశపెట్టాలి.
368 నిబంధన ప్రకారం రాజ్యాంగ సవరణను ప్రతిపాదించే అధికారం లోక్సభకు ఉంది. రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లును కూడా ఉభయ సభలు ఆరు నెలల్లోగా ఆమోదించాలి. ఒకవేళ అలా ఆమోదించకపోతే ఆ బిల్లు విరిగిపోతుంది. రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే అవకాశం లేదు.
రాష్ట్రపతి ఎన్నిక నిమిత్తం నియోజక గణంలో లోక్సభ భాగంగా ఉంటుంది. అదే విధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా భాగంగా ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులు పాల్గొనే అవకాశం లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులు పాల్గొంటారు. లోక్సభ స్పీకర్ ను, ఉప స్పీకర్ ను లోక్సభ సభ్యులే ఎన్నుకుంటారు. రాజ్యసభ ఛైర్మన్ ను మాత్రం రాజ్యసభ సభ్యులు ఎన్నుకోరు. ఉపరాష్ట్రపతే రాజ్యసభకు ఛైర్మన్ గా వ్యవహరిస్తాడు. రాజ్యసభ సభ్యులు డిప్యూటీ ఛైర్మన్ ని ఎన్నుకుంటారు. లోక్సభ వివిధ పార్లమెంటరీ కమిటీలకు సభ్యులను ఎన్నుకుంటుంది. పార్లమెంటు చేపట్టాల్సిన విధులు, బాధ్యతలు పెరగడం, పార్లమెంటు సమావేశాల కాలవ్యవధి తక్కువగా ఉండటం వలన పార్లమెంటు తన విధులు, బాధ్యతలు నెరవేర్చేందుకు పార్లమెంటరీ కమిటీలు సహాయం చేస్తాయి. ఉదాహరణకు అంచనాల సంఘం, ప్రణాళికా సంఘం మొదలైనవి.
లోక్సభ అధికారాల్లో కార్యనిర్వాహక వర్గం కూడా ఒకటి. అంటే మంత్రిమండలిని నియంత్రించడం. భారత పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రిమండలి లోక్సభకు బాధ్యత వహిస్తుంది. మంత్రిమండలిలో ఎక్కువ లోక్సభ సభ్యులే కావడంతో లోక్సభకు బాధ్యత వహిస్తారు. లోక్సభ విశ్వాసం పొందినంత కాలం మాత్రమే మంత్రిమండలి అధికారంలో ఉండి, విశ్వాసం కోల్పోయిన తర్వాత వైదొలగాల్సి ఉంటుంది. కార్యనిర్వాహక వర్గంపై నియంత్రణను లోక్సభ రెండు రకాలుగా చేపడుతుంది.
వీటికోసం వివిధ పార్లమెంటరీ ప్రక్రియలను అనుసరిస్తుంది. ఈ ప్రక్రియల్లో ప్రశ్నోత్తరాలు, తీర్మానాలు ఉంటాయి.
అర్టికల్ 84 (పార్టు V)[9] భారత రాజ్యంగం ప్రకారం లోక్సభ సభ్యునికి ఈక్రింది అర్ఘతలు ఉండాలి.
ఒక వ్యక్తి లోక్సభ సభ్యుడిగా కొనసాగడానికి అర్హత కోల్పోయాడా లేదా అనేది రాష్ట్రపతి నిర్ణయించడం జరుగుతుంది. దీనికోసం మొదట ఎన్నికల సంఘం అభిప్రాయం తీసుకుంటారు.
1950 జనవరి 26 న రాజ్యాంగం అమలు లోకి వచ్చిన తరువాత, మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951-52 లో జరిగాయి. మొదటి ఎన్నికైన లోక్సభ ఏప్రిల్, 1952 న అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి వివిధ లోక్సభల వివరాలు ఇలా ఉన్నాయి:
లోక్సభ | ప్రారంభించిన తేదీ | ప్రధాని | ఉప ప్రధానమంత్రి |
---|---|---|---|
మొదటి | 13 మే 1952 | జవహర్లాల్ నెహ్రూ | ఖాళీ |
రెండవ | ఏప్రిల్ 1957 | ||
మూడవ | ఏప్రిల్ 1962 | జవహర్లాల్ నెహ్రూ, | |
నాల్గవ | మార్చి 1967 | ఇందిరా గాంధీ | మొరాజీ దేశాయ్ (1969 వరకు) |
ఐదవ | మార్చి 1971 | ఖాళీ | |
ఆరవ | మార్చి 1977 | మొరార్జీ దేశాయ్ | చరణ్ సింగ్, జగ్జీవన్ రామ్ |
ఏడవ | జనవరి 1980 | ఇందిరా గాంధీ | ఖాళీ |
ఎనిమిదవ | డిసెంబర్ 1984 | రాజీవ్ గాంధీ | |
తొమ్మిదవ | డిసెంబర్ 1989 | విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ | దేవీలాల్ |
పదో | జూన్ 1991 | పి. వి. నరసింహారావు | ఖాళీ |
పదకొండవ | మే 1996 | అటల్ బిహారీ వాజ్పేయి
హెచ్.డి.దేవెగౌడ ఐ. కె. గుజ్రాల్ | |
పన్నెండవ | మార్చి 1998 | అటల్ బిహారీ వాజ్పేయి | |
పదమూడవ | అక్టోబర్ 1999 | లాల్ కృష్ణ అద్వానీ | |
పద్నాలుగో | మే 2004 | మన్మోహన్ సింగ్ | ఖాళీ |
పదిహేనవ | మే 2009 | ||
పదహారవ | మే 2014 | నరేంద్ర మోడీ | |
పదిహేడవ | మే 2019 | ||
పద్దెనిమిదవ | జూన్ 2024 |
లోక్సభ | ఏర్పాటు | సభాపతి (స్పీకరు) |
---|---|---|
మొదటి లోక్సభ | 1952 ఏప్రిల్ | జి.వి.మౌలంకర్, మాడభూషి అనంతశయనం అయ్యంగార్ |
రెండవ లోక్సభ | 1957 ఏప్రిల్ | మాడభూషి అనంతశయనం అయ్యంగార్ |
మూడవ లోక్సభ | 1962 ఏప్రిల్ | సర్దార్ హుకం సింగ్ |
నాలుగవ లోక్సభ | 1967 మార్చి | నీలం సంజీవరెడ్డి, జి.ఎస్.ధిల్లాన్ |
ఐదవ లోక్సభ | 1971 మార్చి | జి.ఎస్.ధిల్లాన్, బలిరాం భగత్ |
ఆరవ లోక్సభ | 1977 మార్చి | కె.ఎస్.హెగ్డే |
ఏడవ లోక్సభ | 1980 జనవరి | బలరామ్ జాఖర్ |
ఎనిమిదవ లోక్సభ | 1984 డిసెంబరు | బలరామ్ జాఖర్ |
తొమ్మిదవ లోక్సభ | 1989 డిసెంబరు | రబీ రాయ్ |
పదవ లోక్సభ | 1991 జూన్ | శివరాజ్ పాటిల్ |
పదకొండవ లోక్సభ | 1996 మే | పి.ఎ.సంగ్మా |
పన్నెండవ లోక్సభ | 1998 మార్చి | గంటి మోహనచంద్ర బాలయోగి |
పదమూడవ లోక్సభ | 1999 అక్టోబరు | గంటి మోహనచంద్ర బాలయోగి, మనోహర్ జోషి |
పదునాల్గవ లోక్సభ | 2004 మే | సోమనాథ్ చటర్జీ |
పదహేనో లోక్సభ | 2009 మే | మీరా కుమార్ |
పదహారవ లోక్సభ | 2014 మే | సుమిత్ర మహాజన్ |
పదహేడవ లోక్సభ | 2019 మే | ఓం బిర్లా |
నోట్:17 వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. జూన్ 2019 నుండి.
లోక్సభా నిర్వహణ బాధ్యతను స్పీకర్ నిర్వహిస్తారు. సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గా ఎన్నుకుంటారు. స్పీకర్కు సహాయంగా ఒక డిప్యూటీ స్పీకర్ను కూడా ఎనుకుంటారు. సార్వత్రిక ఎన్నికల తరువాత సభ్యుల ప్రమాణ స్వీకారంతో లోక్సభ ఏర్పాటు అవుతుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహణకు ఒక తాత్కాలిక స్పీకరును సభులలో ఒకరిని ఎంచుకుంటారు. సాధారణంగా అనుభవజ్ఞుడైన సభ్యుని ఎంచుకోవడం రివాజు. తరువాత స్పీకరు ఎన్నిక జరుగుతుంది. ఆపై, సభా నిర్వహణ బాధ్యత పూర్తిగా స్పీకరుదే. సభానిర్వహణ కొరకు వివిధ నిబంధనలు ఏర్పాటయ్యాయి. సభ్యుల ప్రవర్తనను నిర్దేశిస్తూ ప్రవర్తనా నియమావళి ఉంది. వివిధ అంశాలకు సమయం కేటాయింపు కొరకు బిజినెస్ ఎడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది.
జీరో అవర్ అనేది భారత పార్లమెంటు సొంతంగా రూపొందించుకున్న పద్ధతి. 1962లో పార్లమెంటులో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత జీరో అవర్ ఉంటుంది. ప్రశ్నోత్తరాల కార్యక్రమం 11 గంటలకు, జీరో అవర్ 12గంటలకు ప్రారంభమౌతాయి. ఇందులో ఎలాంటి నోటీసు లేకుండా ప్రశ్నలడగవచ్చు.
లోక్సభ సమావేశాలు సాధారణంగా ఉ.11 గంటల నుండి మ.1 వరకు, మళ్ళీ మ.2 నుండి 6 వరకు జరుగుతాయి. విషయ ప్రాముఖ్యతను బట్టి ఈ సమయాలు పొడిగించబడటం జరుగుతూ ఉంటుంది. కనీస సంఖ్యలో సభ్యులు ఉంటేనే సమావేశం మొదలవుతుంది. ఈ సంఖ్యను కోరం అంటారు. లోక్సభకు కోరం - స్పీకరుతో కలిపి 55. కొత్తగా ఎన్నికై, ఇంకా ప్రమాణస్వీకారం చెయ్యని సభ్యులు ఉంటే, వారి చేత ముందు ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఇటీవలి కాలంలో గతించిన ప్రస్తుత లేదా పూర్వపు సభ్యుల పట్ల సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు.
లోక్సభలో కింది ముఖ్యమైన వ్యాపకాలు చేపడతారు.
పై వ్యాపకాలు కాక, అరగంట చర్చలు, అత్యవసర ప్రజా ప్రాముఖ్య విషయాలు కూడా సభాకార్యక్రమాల్లో భాగం.
తీర్మానాల్లో అవిశ్వాస తీర్మానం, విశ్వాస తీర్మానం, వాయిదా తీర్మానం మొదలైనవి ఉన్నాయి
ప్రభుత్వాన్ని నియంత్రించే శక్తివంతమైన రాజ్యాంగ పద్ధతుల్లో అవిశ్వాస తీర్మానం ఒకటి. దీన్ని లోక్సభలో మాత్రమే ప్రవేశ పెట్టాలి. అవిశ్వాస తీర్మానం ఫలానా అంశంపై అని చెప్పనవసరం లేదు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాయి. ఈ తీర్మానాన్ని మొత్తం మంత్రిమండలిపై ప్రవేశపెట్టాలి. అవిశ్వాస తీర్మానాన్ని సభ స్వీకరించడానికి కనీసం 50 మంది సభ్యుల మద్ధతు అవసరం. అవిశ్వాస తీర్మానానికి మద్ధతు ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయాధికారం స్పీకర్ కు ఉంటుంది.
దీన్ని కూడా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. అధికార పక్షం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. విశ్వాస తీర్మానంపై చర్చ, ఆ తరువాత ఓటింగ్ జరుగుతాయి. ఓటింగ్ లో ప్రభుత్వం ఓడిపోతే వెంటనే రాజీనామా చేయాలి. భారతదేశం పార్లమెంటు చరిత్రలో మొదటిసారిగా విశ్వాస తీర్మానాన్ని 1979, ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. అప్పటి చరణ్సింగ్ ప్రభుత్వాన్ని సభావిశ్వాసాన్ని పొందవలసిందిగా అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆదేశించారు. దాంతో భారతదేశ పార్లమెంటరీ సంప్రదాయాల్లో విశ్వాస తీర్మానం ఆచరణలోకి వచ్చింది.
ప్రజాప్రాముఖ్యం ఉన్న ఆకస్మిక లేదా హఠాత్ సంఘటనలను చర్చించడానికి స్పీకర్ అనుమతితో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దీన్ని ప్రవేశపెట్టేందుకు 50 మంది సభ్యుల మద్ధతు అవసరం. వాయిదా తీర్మానం అనుమతి పొందితే సభలో మిగిలిన వ్యవహారాలన్నీ వాయిదా వేస్తారు. ఈ తీర్మానం యొక్క ముఖ్యోద్దేశం ముఖ్యమైన విషయం మీదకు సభ దృష్టిని మళ్ళించడం. ఈ తీర్మానంపై ఓటింగ్ జరగదు.
ప్రజాప్రాముఖ్యం ఉన్న సమస్యను అత్యవసరంగా చర్చించేందుకు, ఆ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళేందుకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఈ తీర్మానం ముఖ్యోద్దేశం సమస్యపై సంబంధిత మంత్రి నుంచి అధికారిక వ్యాఖ్యను కోరడం. సభ నియమాల ప్రకారం కనీసం ఇద్దరు సభ్యులు స్పీకర్ కు ఒక గంట ముందు నోటీసు ఇవ్వాలి.స్పీకర్ అనుమతి లభిస్తే 2.30 గంటలపాటు చర్చ జరుగుతుంది. ఒక విధంగా ఇది ప్రభుత్వ మందకొడితనానికి చికిత్స లాంటిది.