పంజాబ్ తిరుగుబాటు
From Wikipedia, the free encyclopedia
భారత రాష్ట్రమైన పంజాబ్లో తిరుగుబాట్లు 1970ల్లో ఖలిస్తాన్ సమర్థకులు సహా కొందరు సిక్కులు తీవ్రవాదంలో చేరడంతో ప్రారంభమయ్యాయి. ఈ తిరుగుబాటుకు మూలాలు చాలా సంక్లిష్టమైనవి, ఐతే ప్రధాన కారణాలుగా సిక్కు మతానికి, పంజాబీ భాష సరైన గుర్తింపు రాకపోవడం, 1947లో ఏర్పడిననాటి నుంచీ భారత కాంగ్రెస్ ప్రభుత్వం సిక్కలతో సరిగా వ్యవహరించకపోవడం వంటివి ఉన్నాయి. పంజాబ్ లోని అన్ని పాఠశాలల్లో పంజాబీ విద్యార్థులకు హిందీ బోధిస్తూండడంతో తల్లితండ్రులు, భాషా సమాజపు నాయకుల్లో ఈ వైపుగా ఆందోళన ప్రారంభమైంది.[1]
పంజాబ్ కు పంజాబీని అధికారిక భాషగా పున:స్థాపించడం, భాషా సమస్యపై దృష్టిసారించడం వంటి అంశాలపై పంజాబీ సుబా పౌర ఉద్యమం ప్రారంభమైంది. ప్రభుత్వం పంజాబీ సుబా ఉద్యమాన్ని ఏప్రిల్ 14, 1955లో నిషేధించింది.[2] ఈ సమయంలో సిక్కులు అనేక అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శాంతియుతంగా ఆందోళనలు చేసేవారూ, సాధారణ యాత్రికులు కూడా లాఠీ దెబ్బలు, ఇటుక దెబ్బలు, అరెస్టులు చవిచూశారు. ఆలయాలపై ప్రభుత్వ యంత్రాంగం దాడులు చేసేది.[3] 1965లో భారత-పాకిస్తాన్ యుద్ధం ముగిశాక తుదకు 1966లో పంజాబ్ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలుగా విడిపోయాక, ప్రస్తుత పంజాబ్ రాష్ట్రంలో పంజాబీని అధికారిక భాషగా గుర్తించారు.[4]
ఐతే ఇది అన్ని సమస్యలకూ పరిష్కారం కాలేదు, సిక్కు సమాజంలోని ముఖ్యులు భారతీయ రాష్ట్రంగా తమకున్న సమస్యలు, కోరికలు తీర్చమని కోరారు. 1973లో సిక్కులు ఆనంద్ పూర్ సాహెబ్ తీర్మానం తీసుకువచ్చారు.[5] రాజకీయ, మతపరమైన పలు అంశాలను ఈ తీర్మానంలో పొందుపరిచారు. సిక్కు మతాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ రాష్ట్రస్థాయి పాలసీలు రూపొందించుకునేందుకు, ప్రతిసారీ కేంద్రం వరకూ రావలసిన అవసరం తప్పేట్టూ గుర్తించే సులువైన డిమాండ్ నుంచి పలు తీవ్రమైన అంశాలు కూడా అందులో ఉన్నాయి. ఆనంద్ పూర్ తీర్మానాన్ని ప్రభుత్వం తిరస్కరించింది, క్రమంగా జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే అకాలీ దళ్ లో చేరి 1982లో శాంతియుతమైన పాదయాత్రగా ఆనంద్ పూర్ తీర్మానం అమలు కోసం ధరమ్ యుద్ద్ మోర్చాను ప్రారంభించారు. నదీ జలాల్లో సింహభాగం పంజాబ్ కు కేటాయించడం, ఛండీగఢ్ ను పంజాబ్ కు మాత్రమే రాజధానిగా చేయడం వంటి డిమాండ్లు నెరవేరతాయన్న ఆలోచనతో వేలాదిమంది దీనివైపుకు ఆకర్షితులయ్యారు.[6] అప్పటికే తీవ్రవాద ధోరణులు పొడసూపుతుండడంతో, ఈ ఆందోళనను అణచివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆనాటికే సిక్కు ఉగ్రవాదుల చేతిలో హిందువులు, ప్రభుత్వాధికారులు మరణించడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కాల్పుల్లో దాదాపు వందమంది ఆందోళనకారులు మరణించారు.[7] మరోవైపు ఉగ్రవాద ధోరణులు పెరుగుతూండడంతో ప్రభుత్వం వేలాదిమంది సిక్కులను అరెస్టు చేసింది.[8] భింద్రన్ వాలే పూర్తి సాయుధ ఉగ్రవాద పద్ధతులు ప్రారంభించి పలువురు అమాయకులను, అధికారులను హత్యలు చేయడం, రైళ్ళపై హత్యాకాండలు సల్పడం ప్రారంభించారు.
భింద్రన్ వాలే సిక్కుల పవిత్ర స్థలమైన అమృత్ సర్ స్వర్ణ దేవాలయాన్ని తన నియంత్రణలోకి తీసుకుని, సిక్కు మతగురువులు మధ్యయుగాల నాటి పోరాట యోధులకు దీవెనలు అందించిన అకాలీతఖ్త్ పై ఆసీనుడై వాస్తవికంగానూ, సంకేతాత్మకంగానూ భారత ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో సవాలు చేశారు. అక్కడి నుంచి ఇచ్చిన ఆదేశాలతో పలువురు ఉగ్రవాదులు పంజాబ్ లోని జనజీవితాన్ని అల్లకల్లోలపరిచారు. జూన్ 6, 1984లో భింద్రన్ వాలే, అతని అనుచరులు ఆపరేషన్ బ్లూస్టార్ లో మరణించారు. ఇందుకోసం ట్యాంకర్లతో స్వర్ణదేవాలయంపై దాడిచేయాల్సి రావడంతో సిక్కు సమాజం ఆగ్రహించింది. ప్రతిగా ఇందిరాగాంధీని ఆమె సిక్కు అంగరక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ హత్య చేశారు. ఈ రెండు సంఘటనల అనంతరం సిక్కు వ్యతిరేక అల్లర్లు కొన్నాళ్ళు సాగి, 1990 దశకం తొలినాళ్ళ వరకూ పంజాబ్ లో సిక్కులు చేపట్టిన హింస సాగింది.[9]