సహజ యోగం
From Wikipedia, the free encyclopedia
సహజ యోగము అనేది ఒక ఆధునిక ఆధ్యాత్మిక, సాధన ప్రక్రియ. మాతాజీ నిర్మలా దేవి గా ప్రసిద్ధురాలైన నిర్మల శ్రీవాత్సవ ఈ విధానాన్ని ప్రారంభించి, తన అనుచరులకు ఉపదేశించింది. శ్రీ మాతాజీ నిర్మలా దేవి 1923 వ సంవత్సరం మార్చి నెలలో 21 తేది నాడు చింద్వార అను గ్రామములో(ఒకప్పుడు మహారాష్ట్రకు చెందినది ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో ఉన్నది) జన్మించింది.
సహజ యోగము మానవుల శరీరంలో అంతర్గతంగా ఉన్న కుండలిని శక్తిని ఉత్తిష్టం చేసి ఆత్మ జ్ఞానానికి, నిర్విచార సమాధికి మార్గం సుగమం చేసే సాధన ప్రక్రియగా సహజయోగాన్ని విశ్వసించేవారు చెబుతారు.[1] ఈ యోగాన్ని మొట్టమొదటిసారి ప్రయత్నించేవారు తమ అరచేతులనుండి తల వరకు చల్లని గాలి వీచినట్లుగాను, కన్నులు చెమర్చినట్లుగాను, గాఢమైన శాంతి భావన కలిగినట్లుగాను చెప్పారు. [2]
సహజ యోగాన్ని విశ్వసించే ఒక వ్యక్తి ఈ వికీపీడియాలో వ్రాసిన క్రింది విషయం ఈ ప్రక్రియ పట్ల సాధకులకు ఉన్న విశ్వాసాన్ని క్లుప్తంగా వివరిస్తుంది - "సహజ యోగం ద్వారా ప్రతీ యొక్క వ్యక్తి ఆత్మ సాక్షాత్కారం అత్యంత సులువుగా పొంద వచ్చు. సహజ యోగమే నేటి మహయోగం అందులో ఏ మాత్రం సందేహం లేదు. మనమెవరం ? మన ఉనికి ఏమిటి? మనలో ఆత్మ ఉన్నదా? ఆత్మ యొక్క ఉనికిని మనం అనుభూతి పూర్వకంగా తెలుసుకోగలమా ? ఇత్యాది ప్రశ్నలకు మనకు దొరికే సమాధానమే సహజయోగం. 'సహ' అంటే మనతోపాటు'జ' అంటే జన్మించిన కుండలిని శక్తి 'యోగం' అంటే భగవంతునితో కలయిక అని అర్థం. ఇది కుండలినీ జాగృతి ద్వారా జరుగుతుంది . కుండలినీ జాగృతి శ్రీ మాతాజీ యొక్క ఆశీర్వాదము వలన లభిస్తుంది. ఇది నమ్మశక్యం కాని విషయం. కాని ఒక్కసారి ఈ అనుభూతి కొరకై ప్రయత్నించండి. ఇందు కొరకు మనము చేయవలసినది ఏమంటే శ్రీ మాతాజీ చిత్ర పటం ముందు రెండు చేతులు చాచి హృదయ పూర్వకంగా ఆత్మ సాక్షాత్కారం ఇవ్వమని వేడు కోవాలి.ఆ తర్వాత మన రెండు అర చేతులలోను మాడుపైన చల్లని చైతన్య తరంగాలు ప్రవహిస్తాయి. దీనినే శంకరాచార్యులు 'సలీలం, సలీలం' అని చెప్పారు. ఈ అనుభూతి పొందిన తర్వాత మనము చేయవలసిన కార్యం మనకు బోధ పడుతుంది. ఆధ్యాత్మికతకు అంకురార్పణ జరుగుతుంది. సహజ యోగం వలన శారీరక, మానసిక, ఉద్రేకజనిత, ఆధ్యాత్మిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. సత్ చిత్ ఆనందం లభిస్తుంది. . "