From Wikipedia, the free encyclopedia
వందన శివ (జననం 1952 నవంబరు 5) భారతీయ పండితురాలు, పర్యావరణ కార్యకర్త, ఆహార సార్వభౌమత్వ సమర్థకురాలు, ప్రపంచీకరణ వ్యతిరేకి, రచయిత్రి.[2] ఆమె ఇరవైకి పైగా పుస్తకాలను రచించింది.[3] ప్రపంచీకరణపై అంతర్జాతీయ సభలో (జెర్రీ మాండర్, రాల్ఫ్ నాడర్, జెరెమీ రిఫ్కిన్లు సహసభ్యులుగా గల ఇంటర్నేషనల్ ఫోరం ఆన్ గ్లోబలైజేషన్) ఒక నాయకురాలిగా ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి.[4] రాంచర్ ప్రైమ్ రాసిన వేద ఎకాలజీ పుస్తకం కొరకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక సాంప్రదాయ పద్ధతులకు అనుకూలంగా వాదించింది. 1993 లో సరియైన జీవనోపాధి (రైట్ లైవ్లీహుడ్) పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డు స్వీడిష్-జర్మన్ పరోపకారి జాకోబ్ వాన్ యుక్స్కుల్ స్థాపించాడు. దీనిని "ప్రత్యామ్నాయ నోబెల్ బహుమతి"గా పరిగణిస్తారు.[5][6]
వందన శివ డెహ్రాడూన్లో జన్మించింది. ఆమె తండ్రి అటవీ సంరక్షణకారుడు, తల్లి ప్రకృతి ప్రేమికురాలైన రైతు. ఆమె నైనిటాల్ లోని సెయింట్ మేరీస్ కాన్వెంట్ హై స్కూల్ లో, డెహ్రాడూన్ లోని "కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ"లో చదువుకుంది.[7]
శివ, చండీగఢ్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రం అభ్యసించింది. 1972లో బి.యస్సీ పట్టభద్రురాలైంది.[8]
భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో కొంతకాలం పనిచేసిన తరువాత, ఆమె 1977 లో గ్వెల్ఫ్ విశ్వవిద్యాలయంలో విజ్ఞానశాస్త్రంలో ఉన్నత విద్యకై కెనడా వెళ్లి అక్కడ "కాంతి ఆవర్తన భావనలో మార్పులు" అనే పేరుతో ఒక పరిశోధనా పత్రాన్ని రాసింది.[8][9] 1978 లో, వెస్ట్రన్ అంటారియో విశ్వవిద్యాలయంలో ఆమె భౌతిక తత్వశాస్త్రంపై దృష్టి సారించి, పి.హెచ్.డి పూర్తి చేసింది.[10] క్వాంటమ్ శాస్త్రంలో బెల్ సిద్ధాంతం యొక్క పరిధికి వెలుపల గణిత, తాత్విక అంతర్భావాలను ఆమె తన సిద్ధాంత వ్యాసంలో చర్చించింది.[11] తరువాత ఆమె బెంగళూరులోనిఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లోను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లోనూ శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ విధానాలపై వివిధ శాఖలతో కూడిన పరిశోధనలను కొనసాగించింది.[7]
వందన శివ వ్యవసాయం, ఆహార రంగాలలో పురోగతి గురించి విస్తృతంగా రచనలు చేసింది, ఉపన్యాసాలిచ్చింది. మేధో సంపత్తి హక్కులు, జీవ వైవిధ్యం, జీవ సాంకేతికం, జీవ నీతి, జన్యు ఇంజనీరింగ్ వంటి రంగాలలో ఆమె పోరాటాలు చేసింది. జన్యు ఇంజనీరింగ్ ద్వారా వ్యవసాయ అభివృద్ధికి వ్యతిరేకంగా వివిధ దేశాలలోని హరిత ఉద్యమ సంస్థలకు ఆమె సహాయం చేసింది.
1982 లో, ఆమె రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఎకాలజీను జీవన వనరుల వైవిధ్యం, సమగ్రత కోసం, స్థానిక విత్తనం, సేంద్రీయ వ్యవసాయం, నిజాయితీ గల వాణిజ్యాన్ని ప్రోత్సహించటం కొరకు స్థాపించింది. ఈ సంస్థద్వారా పని 1991 లో నవధాన్య సంస్థను సృష్టించడానికి దారితీసింది.[12][13] వ్యవసాయానికి అవసరమైన విత్తనాలను అందించడానికి భారతదేశం అంతటా 40 కి పైగా ప్రాంతీయ విత్తన బ్యాంకులను స్థాపించింది. 2004 లో శివ యునైటెడ్ కింగ్డం లోని షూమేకర్ కాలేజీ సహకారంతో డూన్ వ్యాలీలో సుస్థిర జీవనం కోసం "బీజా విద్యాపీఠ్" అనబడే అంతర్జాతీయ కళాశాలను ప్రారంభించింది.[14]
మేధో సంపత్తి హక్కులు, జీవవైవిధ్య రంగంలో వేప, బాస్మతి, గోధుమల జీవ దొంగలింపుని సవాలు చేసింది. ఈ విషయమై ప్రభుత్వం నియమించిన నిపుణుల సమూహాలలో కలసి పనిచేసింది.
ఆమె మొదటి పుస్తకం, స్టేయింగ్ అలైవ్ (1988), మూడవ ప్రపంచ మహిళల అవగాహనలను మార్చడానికి సహాయపడింది. 1990 లో, "భారతదేశంలో ఎక్కువ మంది రైతులు మహిళలు(Most farmers in India are women)" అనే పేరుతో మహిళలు, వ్యవసాయంపై ఐక్యరాజ్య సమితి ఆహార,వ్యవసాయ సంస్థ (FAO) కోసం ఒక నివేదిక రాసింది. ఆమె ఖాట్మండులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మౌంటైన్ డెవలప్మెంట్ (ICIMOD) లో లింగ విభాగాన్ని (జెండర్ యూనిట్) స్థాపించింది. ఆమె మహిళా పర్యావరణ & అభివృద్ధి సంస్థ (WEDO) వ్యవస్థాపక బోర్డు సభ్యురాలు.[15][16]
భారతీయ సామాజిక-పర్యావరణ ఆందోళనలు, అంతరదృష్టికి సంబంధించి 2010 లో సిడ్నీ శాంతి బహుమతి పొందిన సందర్భంగా ఆమె చేసిన ఉపన్యాసం ఆధారంగా "మేకింగ్ పీస్ విత్ ది ఎర్త్" అనే పుస్తకాన్ని శివ ప్రచురించింది. ఈ పుస్తకం జీవవైవిధ్యం, సమాజాలు, ప్రకృతి మధ్య సంబంధాన్ని చర్చిస్తుంది.[17] ఈ పుస్తక సమీక్షలో డేవిడ్ రైట్ " సహజ జీవవైవిధ్యత నాశనాన్ని సాంప్రదాయ సముదాయాలను విచ్ఛిన్నంచేయడమని, అన్ని దేశాలలో 'స్థానికతకు' ఒక చిహ్నంగా, గ్రామం మారుతుంది". అని రాసాడు.[17][18]
ప్రపంచీకరణపై అంతర్జాతీయ సభ (ఇంటర్నేషనల్ ఫోరం ఆన్ గ్లోబలైజేషన్), మహిళల పర్యావరణం, అభివృద్ధి సంస్థ (ఉమెన్స్ ఎన్విరాన్మెంట్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్), మూడవ ప్రపంచ నెట్వర్క్ లాంటి సంస్థలతోపాటు ప్రపంచవ్యాప్తంగా, ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వేతర సంస్థలలో కూడా శివ సలహాదారుగా పనిచేసింది. ఇటలీలోని టుస్కానీ రీజియన్ ఏర్పాటు చేసిన ఆహార భవిష్యత్తుపై కమిషన్కు శివ అధ్యక్షత వహించింది. ఆమె స్పెయిన్ మాజీ ప్రధాని జపాటెరోకు సలహాలనిచ్చే విజ్ఞానమండలిలో సభ్యురాలుగా పనిచేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థకి వ్యతిరేకంగా భారత ప్రజల ఉద్యమ సారథ్య మండలిలో ఆమె సభ్యురాలు. ఆమె వరల్డ్ ఫ్యూచర్ కౌన్సిల్ కౌన్సిలర్ గా కూడా తన సేవలనందించింది. సేంద్రియ వ్యవసాయంపై భారత ప్రభుత్వ కమిటీలలో ఆమె పనిచేస్తుంది. ఆమె 2007 లో స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ విజన్స్ ప్రాజెక్టులో పాల్గొంది.[19]
2021లో, ఆమె శ్రీలంక ప్రభుత్వానికి అకర్బన ఎరువులు, పురుగుమందులను నిషేధించాలని సూచిస్తూ,[20][21] ఆమె ఇలా చెప్పింది: "ఈ నిర్ణయం ఖచ్చితంగా రైతులు మరింత సంపన్నులు కావడానికి సహాయపడుతుంది. సేంద్రీయ ఎరువుల వాడకం వలన భూమి సంతానోత్పత్తిని నిలుపుకుంటూ పోషకాలతో కూడిన వ్యవసాయ ఉత్పత్తులను అందించగలుగుతుంది."[22] దిగుమతి చేసుకున్న ఎరువులపై విదేశీ మారక ద్రవ్య బిల్లులను ఆదా చేయడమే ప్రధాన ఉద్దేశంగా[23] రాత్రికి రాత్రే ఆ విధానాన్ని అమలు చేయడంంతో, అనేక రంగాలలో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా తగ్గి సంక్షోభం ఏర్పడింది. ముఖ్యంగా తేయాకు పరిశ్రమ బాగా దెబ్బతింది.[24][25][26] వరి దిగుబడులు మూడో వంతు తగ్గాయి.[22] ఏడు నెలల తర్వాత ప్రభుత్వం ఈ నిషేధాన్ని రద్దు చేసింది.[21]
ఉత్పాదకత, పోషణ, రైతు ఆదాయాలు పెంచడానికి వ్యవసాయంలో జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి ఆమె కృషి చేసింది. ఈ కృషికి గాను ఆమెను 2003 లో టైమ్ పత్రిక పర్యావరణ వీరవనిత ('ఎన్విరాన్మెంటల్ హీరో') గా గుర్తించింది.[27] 1984 లో పంజాబ్లో హింస, యూనియన్ కార్బైడ్ పురుగుమందుల తయారీ కర్మాగారం నుండి గ్యాస్ లీక్ కావడం వల్ల జరిగిన భోపాల్ విపత్తు లపై ఆమె ఉద్యమించింది. తరువాత ఆమె ఉద్యమం వ్యవసాయ రంగంలో ప్రారంభమైంది. యుఎన్ విశ్వవిద్యాలయం కోసం ఆమె చేసిన అధ్యయనాలు ది వయొలెన్స్ ఆఫ్ ది గ్రీన్ రివల్యూషన్ పుస్తకాన్ని ప్రచురించడానికి దారితీశాయి.[28][29]
హరిత విప్లవం కొరకు విత్తనాలు, రసాయనల బంధం సారవంతమైన మట్టిని క్షీణింపజేసి, జీవన పర్యావరణ వ్యవస్థలను నాశనం చేసిందని, 1400 కి పైగా పురుగుమందులు ఆహార వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశం ఏర్పడిందని డేవిడ్ బార్సామియన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వాదించింది.[30][31]
విత్తన స్వేచ్ఛ లేదా విత్తనాలపై వ్యాపారసంస్థల మేధోసంపత్తి హక్కులను (పేటెంట్లు) తిరస్కరించడం అనే ఆలోచనకు ఆమె మద్దతునిచ్చింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) 1994 వ్యాపార సంబంధిత మేధో సంపత్తి హక్కుల (TRIPS) ఒప్పందం అమలుకు వ్యతిరేకంగా ఆమె ప్రచారం చేసింది. ఈ ఒప్పందం కొత్త జీవ రూపాలపై పేటెంట్ల పరిధిని విస్తృతం చేస్తుంది. ఈ ఒప్పందం వ్యాపార సంస్థలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని, కొత్త జీవ రూపాలపై మరింత పేటెంట్లకు తలుపులు తెరిచిందని ఆమె విమర్శించింది.[32] ఆమె జీవ పేటెంట్ను జీవ దొంగలింపు ('బయోపైరసీ') అని పిలిచింది. బాస్మతి వంటి అనేక దేశీయ మొక్కల పేటెంట్లకు వ్యతిరేకంగా పోరాడింది.[33] ఆమె అమెరికా వ్యవసాయ శాఖ, డబ్ల్యూ.ఆర్.గ్రేస్ సంస్థ చేత వేప బయో పైరసీకి వ్యతిరేకంగా యూరోపియన్ పేటెంట్ కార్యాలయంలో 10 సంవత్సరాల పోరాటంలో గెలిచింది.[34] 1998 లో, ఆమె సంస్థ నవధాన్య, అమెరికాకు చెందిన రైస్టెక్ సంస్థ చే బాస్మతి బియ్యం బయోపైరసీకి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించింది. 2001 లో, తీవ్ర ప్రచారం తరువాత, పేటెంట్పై తన దావాలను రైస్టెక్ కోల్పోయింది.
విటమిన్ ఎ పూర్వగామి అయిన బీటా కెరోటిన్ను తయారుచేసే జన్యుపరంగా రూపొందించిన బియ్యం జాతి గోల్డెన్ రైస్ను ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలో చేరే వయస్సు కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో మూడవ వంతు పిల్లలు అనుభవిస్తున్న విటమిన్ ఎ లోపాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.[35] విటమిన్ ఎ లోపం అంధత్వానికి గొప్ప కారణమని, ప్రపంచ పాఠశాలలో చేరేవయస్సుకంటె తక్కువ వయస్సుగల పిల్లలమరణాలలో 28% మరణాలకు కారణమని, గోల్డెన్ రైస్ ఇతర బియ్యం వలె చౌకగా ఉంటుందని, దీనివలన పిల్లలలో అంధత్వాన్ని నిర్మూలించవచ్చని అడ్రియన్ డుబాక్ చెప్పాడు.[36] దీనికి బదులుగా అదే ఫలితాల కోసం బెంగాల్ లో మహిళలు 150 ఆకుకూరలు పెంచి తింటారని శివ పేర్కొంది.[37] అయితే పర్యావరణ సలహాదారు పాట్రిక్ మూర్ ఈ 250 మిలియన్ల మంది పిల్లలలో ఎక్కువ మంది రోజుకు ఒక గిన్నె బియ్యం మాత్రమే తింటారని అన్నాడు[38]
ఆమె "గోల్డెన్ రైస్ బూటకము" అని పిలుపునిచ్చింది. ఆ వివరణలో ఆమె గోల్డెన్ రైస్ ప్రయోజనకరమైన దానికంటే ఎక్కువ హానికరం అని పేర్కొంది: "దురదృష్టవశాత్తు, విటమిన్ ఎ బియ్యం ఒక బూటకపుది, జన్యు ఇంజనీరింగ్కు మరింత వివాదం తెస్తుంది. పరీక్షించని, నిరూపించబడని, అనవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడంలో విజ్ఞానానికి బదులు ప్రజాసంబంధాల కార్యాచరణ ఉంది. దీనివలన ఆకలి, పోషకాహార లోపం నిర్మూలించడానికి కాక పెంచడానికిఈ పద్ధతి ఉపయోగపడుతుంది. " [39] వెస్లెర్, మ్యూనిచ్ విశ్వవిద్యాలయం, జిల్బెర్మాన్ బర్కిలీ విశ్వవిద్యాలయం అనే ఇద్దరు ఆర్థికవేత్తలు భారతదేశంలో గోల్డెన్ రైస్ లేకపోవడం వలన గత 10 సంవత్సరాలలో 14 లక్షల మానవ సంవత్సరాలకు పైగా నష్టం జరిగిందని 2013 నివేదికలో లెక్కించారు.[40]
"భారతదేశంలో జన్యుమార్పిడి విత్తనాలు(Genetically modified or GM) ధరలు పెరగడం వల్ల చాలా మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు" అని శివ అన్నది. విత్తన గుత్తాధిపత్యాల సృష్టి, ప్రత్యామ్నాయాల నాశనం, హక్కులకు అధిక కప్పం (Royalty), ఏకవర్ణ సంస్కృతుల వలన పెరుగుతున్న దుర్బలత్వాలు రైతుల అప్పులు, ఆత్మహత్యలు, వ్యవసాయ బాధలకు కారణాలవుతున్నాయి. భారత ప్రభుత్వం నుండి వచ్చిన సమాచారం ప్రకారం, ఉత్పాదకాల కొనుగోలు కారణంగా దాదాపు 75 శాతం గ్రామీణ ప్రాంతాలలో అప్పులకు కారణమవుతున్నారు. జన్యు మార్పిడి సంస్థల లాభాలు పెరిగేకొద్దీ రైతుల అప్పు పెరుగుతుందని శివ పేర్కొంది. అలా జన్యుమార్పిడి విత్తనాలు రైతుల ఆత్మహత్యకు కారణభూతమవుతాయి.
అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (IFPRI)) రెండుసార్లు పరిశోధనలను, ప్రభుత్వ డేటాను విశ్లేషించి రైతు ఆత్మహత్యలు పెరగడానకి ఎటువంటి ఆధారాలు లేవని తేల్చింది.[41][42] దీనికి బదులుగా, విశ్లేషణ జన్యుమార్పిడి ప్రత్తికి మాత్రమే పరిమితమై, విత్తన గుత్తాధిపత్యాల సమస్యను విస్మరించారని, ఆత్మహత్య గణాంకాలు నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డుల ప్రభుత్వ గణాంకాల నుండి తీసుకున్నందున, నిజమైన గణాంకాలు వాడలేదని తెలిపింది.[43]
భారతీయ వ్యవసాయం నవీన సరళీకరణను సవాలు చేయడం ద్వారా, శివ మోన్సాంటో, కార్గిల్ వంటి బహుళజాతి సంస్థలను వ్యతిరేకించింది. ఆమె రాసిన పుస్తకం "కార్గిల్ అండ్ ద కార్పొరేట్ హైజాక్ అఫ్ ఇండియాస్ ఫుడ్ అగ్రికల్చర్"లో ఆమె అమెరికా, భారత ప్రభుత్వాల చర్యలను పరిశీలించారు. విధాన మార్పుల ఫలితంగా రెండవ అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారు స్థితిగలిగి, భారతదేశ ఆహార అవసరాలను తీర్చగల భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద గోధుమ దిగుమతిదారుగా మార్చడానికి దారితీసిందని తెలిపారు.
ప్రభుత్వ, పరిశ్రమలలో ఆహార-విధాన వికేంద్రీకరణ పద్ధతులను కూడా ఆమె వివరించింది. భారతీయ రైతులు భారీగా బయో టెక్నాలజీలను అవలంబించిన చోట ఆహార భద్రత, పోషక అవసరాలను సాధించకుండా ఆహార విధాన కేంద్రీకరణ పెద్ద బహుళజాతి సంస్థలకు అసమానంగా ప్రయోజనం చేకూర్చిందని చెప్పారు. ప్రపంచీకరణతో, వ్యవసాయ యోగ్యమైన భూమి ఆహారేతర పంటలకు వాడబడుతున్నది; అలా లాభాలుండే మార్కెట్లకు ఎగుమతి జరిగి, ఆహారం దిగుమతి చేసుకోవలసివస్తున్నది.[44]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.