మీజాన్
From Wikipedia, the free encyclopedia
మీజాన్ 1944 నుండి 1948 వరకు హైదరాబాదు నుండి వెలువడిన దినపత్రిక. బొంబాయికి చెందిన వ్యాపారవేత్త గులాం మహమ్మద్ కలకత్తావాలా ఈ పత్రికకు యజమాని. మధ్య మధ్యలో కొన్ని అంతరాయాలతో ఈ 1944 నుండి 1948 వరకు నైజాం ప్రాంతంలో వెలువడినది. ఏకకాలంలో ఆంగ్లం, తెలుగు, ఉర్దూ భాషలలో వెలువడిన ఏకైక పత్రిక మీజాన్[1] మూడు సంచికలకు యాజమాన్యం ఒకటే అయినా మూడూ వేరు వేరు పంథాలలో నడిచేవి. ఆంగ్ల మీజాన్ ఫ్యూడల్ వ్యవస్థకు అనుకూలితమైన పత్రిక. ఇది నిజాం ప్రభుత్వ చర్యలకు మద్దతు పలికింది. ఉర్దూ సంచిక రజాకార్లకు మద్దతునిచ్చింది. తెలుగు సంచిక నిజాం వ్యతిరేక శక్తులకు అనుకూలమైన వార్తలను ప్రచురించేది.[2] మీజాన్ ఆంగ్ల సంచికకు మిర్జా అబీద్ అలీ బేగ్ సంపాదకుడు కాగా ఉర్దూ సంచికకు హబీబుల్లా ఔజ్ సంపాదకుడు. అడవి బాపిరాజు మీజాన్ తెలుగు సంచికకు సంపాదకునిగా పనిచేశాడు.
రకం | దిన పత్రిక |
---|---|
రూపం తీరు | క్రౌను సైజు |
యాజమాన్యం | గులాం మహమ్మద్ కలకత్తావాలా |
ప్రచురణకర్త | గులాం మహమ్మద్ కలకత్తావాలా |
సంపాదకులు | అడవి బాపిరాజు (తెలుగు) మిర్జా అబీద్ అలీ బేగ్ (ఆంగ్లం) హబీబుల్లా ఔజ్ (ఉర్దూ) |
స్థాపించినది | 1944 హైదరాబాదు |
కేంద్రం | హైదరాబాదు |
పత్రికా యాజమాన్యం యొక్క ప్రధానోద్దేశ్యం మీజాన్ ద్వారా నిజాం కీర్తి ప్రతిష్ఠల్ని ఇనుమడిరప జేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం కల్పించడం. అయితే తెలుగు సంచిక సంపాదకుడు అడివి బాపిరాజు ప్రజల పక్షాన నిలబడి కమ్యూనిస్టులు జరిపిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి, కాంగ్రెస్ వారు నిర్వహించిన ఆంధ్రమహాసభలకు, భారతదేశంలో హైదరాబాదు విలీనోద్యమాలకు మద్ధతుగా వార్తలు ప్రకటించేవాడు.[3]