శ్రీకృష్ణుడి ఎనిమిదిభార్యలైన అష్టమహిషులలో ఆరవ భార్య, శ్రీకృష్ణుని మేనత్త రాధాదేవి కూతురు. From Wikipedia, the free encyclopedia
మిత్రవింద శ్రీకృష్ణుడి ఎనిమిదిభార్యలైన అష్టమహిషులలో ఆరవ భార్య,[1] శ్రీకృష్ణుని మేనత్త రాధాదేవి కూతురు. ఈమె స్వయంవరంలో శ్రీకృష్ణునికి వరమాల వేసి వరించింది. వీరికి వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు.[2][3] ద్వాపర యుగంలో ద్వారక రాజైన శ్రీకృష్ణుడు, విష్ణు దేవుడి అవతారం.
మిత్రవింద | |
---|---|
సమాచారం | |
దాంపత్యభాగస్వామి | శ్రీకృష్ణుడు |
భాగవత పురాణంలో మిత్రవింద అవంతి రాజ్యానికి చెందిన జయసేన రాజు కుమార్తెగా చెప్పబడింది. విష్ణు పురాణంలో షైబ్య లేదా శైవ్య (షిబి/శివి రాజు కుమార్తె, వారసురాలు) అని పిలుస్తారు. విష్ణు పురాణం వ్యాఖ్యాత అయిన రత్నగర్భ, కృష్ణుడి మరో భార్య కాళిందితో మిత్రవిందను పోల్చుతాడు. హరివంశంలో ఈమెను షిబి కుమార్తె (పితృస్వామ్య వారసురాలు) సుదత్తా అని పిలుస్తారు.[4] ఈమె గొప్ప ధర్మవంతురాలు, అందమైన అమ్మాయి.[5] మిత్రవిందకు ఇద్దరు సోదరులు వింద (విన్య), అనువింద (అనువింద్య) ఉన్నారని, ఆమె పెళ్లి సమయంలో సహ రాజప్రతినిధులుగా అవంతిని పరిపాలించారని భాగవత పురాణంలో ఉంది. వారు కౌరవుల నాయకుడు దుర్యోధనుడి సహచరులు. కుంతి కుమారులు, కౌరవుల ప్రత్యర్థులైన పాండవులతో శ్రీకృష్ణుడు పొత్తు పెట్టుకున్నందున మిత్రవిందను కృష్ణుడికిచ్చి వివాహం చేయడానికి నిరాకరించారు.[6][7][8]
భాగవత పురాణం కృష్ణుడి, మిత్రవింద వివాహం గురించి వివరణను ఇస్తుంది. స్వయంవర వేడుకలో మిత్రవింద కృష్ణుడిని తన భర్తగా ఎన్నుకుంటుంది. మిత్రవింద సోదరులు అడ్డుపడగా కృష్ణుడు ఆ యువరాజులను ఓడించి మిత్రవిందను బలవంతంగా తీసుకెళ్తాడు.[5][7][9] భాగవత పురాణంపై వల్లభాచార్య వ్యాఖ్యానం ప్రకారం మిత్రవింద, శ్రీకృష్ణుని ప్రేమించినపుడు ఆమె సోదరులు, తండ్రి వ్యతిరేకించి దుర్యోధనుడికిచ్చి పెళ్ళి చేయాలనుకొని, భర్తను ఎన్నుకోవటానికి ఆమె తండ్రి స్వయంవరం ఏర్పాటు చేశారు. ఈ పోటీకి దుర్యోధనుని సహా యువరాజులందరూ హాజరయ్యారు. కృష్ణుడు ఈ విషయం తెలుసుకొని, స్వయంవర వేదికకు వచ్చాడు. అక్కడి పరిస్థితిని అంచనా వేసిన మిత్రవింద తనని అపహరించమని, శ్రీకృష్ణుడిని కోరింది. ఆమె కోరినవిధంగా కృష్ణుడు స్వయంవర వేదిక నుండి మిత్రవిందను అపహరించాడు. మిత్రవింద సోదరులు, దుర్యోధనుడు, మిత్రవిందను వివాహం చేసుకోవాలనుకున్న ఇతర యువరాజులకు శ్రీకృష్ణుడు సవాలు విసిరాడు. శ్రీకృష్ణుడు వారందరినీ ఓడించి మిత్రవిందను ద్వారకకు తీసుకెళ్ళి, అక్కడ అతను ఆమెను అధికారికంగా వివాహం చేసుకున్నాడు.[8]
మరొక కథలో, కృష్ణుడిని, అతని అన్నయ్య బలరాముడుని ఉద్దేశపూర్వకంగానే స్వయంవరానికి ఆహ్వానించలేదని వివరించబడింది. తమ బంధువు మిత్రవింద వివాహం కోసం తమని ఆహ్వానించలేదని బలరాముడు కలత చెందాడు. వింద, అనువింద తమ సోదరిని కురు సామ్రాజ్యానికి చెందిన దుర్యోధనుడితో వివాహం చేయాలని కోరుకుంటున్నారని బలరాముడు కృష్ణుడికి తెలియజేశాడు. అదే జరిగితే, కురు, అవంతి రాజ్యాల మధ్య పొత్తును ఏర్పడుంది. తద్వారా విదర్భ,మగధ రాజ్యాల మద్దతును పొంది కౌరవులను శక్తివంతం చేస్తుందని భావించి, మిత్రావిందను అపహరించమని చెప్పాడు. మిత్రవింద ప్రేమ గురించి కృష్ణుడికి తెలియకపోవడంతో, ఆమె కోరికను తెలుసుకోవడానికి తన చెల్లెలు సుభద్రను తనతో పాటు తీసుకువెళ్ళాడు. కృష్ణుడిపై మిత్రవిందకు ఉన్న ప్రేమను సుభద్ర ద్వారా తెలుసుకున్న తరువాత కృష్ణుడు, బలరాముడు స్వయంవర వేదికకి వచ్చి మిత్రవిందను అపహరించి, మిత్రవింద సోదరులు, దుర్యోధనుడు, మిత్రవిందను వివాహం చేసుకోవాలనుకున్న ఇతర యువరాజులకు ఓడించారు.[10]
కుంతి, పాండవులు, ద్రౌపదిని కలవడానికి శ్రీకృష్ణుడు, అతని రాణులు ఒకసారి హస్తినాపూరాన్ని సందర్శించారు. కుంతి చెప్పినట్లుగా మిత్రవింద, ఇతర రాణులను ద్రౌపది పూజించి, గౌరవిస్తుంది. కృష్ణుడు తనని ఎలా వివాహం చేసుకున్నాడో మిత్రవింద, ద్రౌపదికి కూడా వివరిస్తుంది.[6][11][12] మిత్రవిందకు చాలామంది కుమారులు ఉన్నారని విష్ణుపురాణం చెబుతోంది. కృష్ణుని అంత్యక్రియలలో రాణుల ఏడుపులును భాగవత పురాణం వివరిస్తోంది.[13] కృష్ణుడి అంత్యక్రియల తరువాత ద్వారక నుండి బయలుదేరినప్పుడు దొంగలు దాడిచేయడంతో మిత్రవింద తనను తాను సజీవ దహనం చేసుకొన్నదని హిందూ మత ఇతిహాసం మహాభారతంలో చెప్పబడింది.[14]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.