మహాప్రస్థానం
From Wikipedia, the free encyclopedia
శ్రీశ్రీ రచించిన సంచలన కవితా సంకలనం మహా ప్రస్థానం, ఇది వెలుబడిన తరువాత తెలుగు సాహిత్యపు ప్రస్థానానికే ఓ దిక్సూచిలా వెలుగొందినది, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని 'మహా ప్రస్థానానికి ముందు, మహా ప్రస్థానానికి తరువాత' అని విభజించవచ్చు అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఇది ఒక అభ్యుదయ కవితా సంపుటి. దీనిలో మొత్తం నలబై కవితలు ఉన్నాయి. ఇందులో శ్రీశ్రీ కార్మిక కర్షిక శ్రామిక వర్గాలను ఉత్తేజితులను చేస్తూ, నూతనోత్సాహం కలిగిస్తూ, ఉర్రూతలూగిస్తూ గీతాలు వ్రాసినాడు. ఇది తెలుగు కవితకే ఓ మార్గదర్శి అయినది. మహా ప్రస్థానం కవితా సంపుటికి యోగ్యతాపత్రం శీర్షికన ఉన్న ముందుమాట ప్రముఖ తెలుగు రచయిత గుడిపాటి వెంకట చలం వ్రాసినారు.
మహాప్రస్థానం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం మహాప్రస్థానం (అయోమయ నివృత్తి) చూడండి. |
మహాప్రస్థాన కవితల రచన మొత్తంగా 1930 దశకంలో జరిగింది. మరీ ముఖ్యంగా 1934కూ 1940కీ నడుమ వ్రాసినవాటిలో గొప్ప కవితలను ఎంచుకుని 1950లో ప్రచురించారు శ్రీశ్రీ. ఈ కవితలు తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత్వమనే కవితావిప్లవాన్ని సృష్టించడానికి ఒకానొక కారణంగా భావించారు.[1] శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని విశ్లేషిస్తూ వెలువడిన అనేక వ్యాసాల పరంపరలో అద్దేపల్లి రామమోహనరావు వ్రాసిన శ్రీశ్రీ కవితాప్రస్థానం పేర్కొనదగింది.