From Wikipedia, the free encyclopedia
బీదర్ కోట కర్నాటకలోని ఉత్తర భాగంలో ఉన్న బీదర్ నగరంలో ఉంది. ఈ ప్రాంతం పీఠభూమి ప్రాంతం. 1427లో బహమనీ రాజవంశపు సుల్తాసు అయిన సుల్తాన్ అల్లావుద్దీన్ బహమన్ తన రాజధానిని గుల్బర్గా నుండి బీదర్ కు తరలించాడు. ఆ కాలంలోనే ఈ కోటను మరికొన్ని మొహమ్మదీయ నిర్మాణాలను నిర్మించాడు. ఇక్కడ దగ్గర దగ్గర 30 నిర్మాణాలున్నాయి.[1] [2][3]
బీదర్ కోట | |
---|---|
బీదర్ లో భాగం | |
బీదర్, భారతదేశం | |
భౌగోళిక స్థితి | (17.9219°N 77.5236°E) |
రకము | కోట |
స్థల సమాచారం | |
నియంత్రణ | కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం |
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతి | ఉంది |
పరిస్థితి | శిథిలావస్థ |
స్థల చరిత్ర | |
కట్టిన సంవత్సరం | 15వ శతాబ్దం |
కట్టించింది | అల్లావుద్దీన్ బహమన్ |
వాడిన వస్తువులు | నల్లరాయి, సున్నపు ఆతుకు |
ఇక్కడ నగరానికి, జిల్లాకు, కోటకూ ఒకటే పేరు - బీదర్. 22 మైళ్ళ పొడవు అత్యధికంగా 12 మైళ్ళ వెడల్పు కలిగిన పీఠభూమికి ఒక మూలన ఈ నగరం, కోట ఉన్నాయి. మొత్తం విస్తీర్ణం 12 చదరపు మైళ్ళు. ప్రాచీన కళ్యాణి చాళుక్యుల రాజధాని కల్యాణి (బసవ కల్యాణ్) బీదర్ కు పశ్చిమంగా 40 మైళ్ళ దూరంలో ఉంది.
బీదర్ నగరం, జిల్లాలోని నగర పరిసర ప్రాంతాలు కారంజ నది ద్వారా నీళ్ళ అవసరాన్ని తీర్చుకుంటాయి. ఈ కారంజ నది మంజీర నదికి ఉపనది.
ఇక్కడి వాతావరణం సంవత్సరం పొడుగునా ఆహ్లాదకరంగా, అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ మే నెలల్లో కూడా అనుకోని వర్షాలు కురిసి ఈ ప్రదేశం చల్లబడుతుంది. జూన్ మొదట్లో నైఋతి ఋతుపవనాలు ఈ ప్రాంతాన్ని చేరి మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తాయి. చలికాలంలో కూడా ఈ ప్రాంతపు వాతావరణం బాగుంతుంది.[4]
ప్రస్తుత బీదర్ కోటను కట్టించింది బహమనీ సుల్తాను అల్లావుద్దీన్ బహమన్ అనీ, అతడు 1427లో తన రాజధానిని గుల్బర్గా నుండి బీదర్ కు తరలించినప్పుడు కట్టించాడనీ చరిత్ర ద్వారా తెలుస్తున్నది. ఈ ప్రదేశం మెరుగైన వాతావరణం, సారవంతమైన భూమి కలిగి ఉండటమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశంలో దృఢమైన, చిన్నదైన ఒక కోట ఉందనీ 1322 లో జరిగిన మొదటి ముస్లిం దండయాత్రకు సంబంధించిన రాజకుమారుడు ఉలుఘ్ ఖాన్ ద్వారా తుగ్లక్ సామ్రాజ్యం కిందకు వచ్చిందనీ ఆధారాలున్నాయి. బహమనీ సామ్రాజ్యం స్థిరపడ్డాక 1347లో బీదర్ సుల్తాన్ అల్లావుద్దీన్ బహమన్ షా బహమనీ పాలనలోకి వచ్చింది. మొదటి అహ్మద్ షా (1422-1486) పాలనలో బీదర్ బహమనీ సామ్రాజ్యపు రాజధాని అయింది. పాత కోట స్థానంలో కొత్త కోటతో పాటుగా మద్రాసాలు, మసీదులు, మహల్లు, రాజభవనాలు, తోటలు నిర్మించబడ్డాయి. బీదర్ చరిత్రలో చెప్పుకోదగ్గ వ్యక్తి 1466లో ప్రధాన మంత్రిగా పనిచేసిన మహమ్మద్ గవాన్. సా.శ. 1656 లో ముఘల్ చక్రవర్తి ఔరంగుజేబ్ ఆక్రమించుకునేవరకూ ఈ కోట బారిద్ షాహీ సామ్రాజ్యం అధీనంలో ఉంది. 1724లో బీదర్ నిజాము నవాబులైన ఆసఫ్ జాహీల అదుపులోకి వచ్చింది. బీజాపుర్ సామ్రాజ్యంలోకి 1619-20 లలో చేర్చబడి 1657లో ముఘల్ రాజప్రతినిధిత్వం కిందకు వచ్చి, 1686 నాటికి ముఘల్ సామ్రాజ్యంలో భాగమయింది. 1751 నుండి 1762 మధ్య ఆసఫ్ జా మూడవ కుమారుడైన నవాబ్ సఈద్ మొహమ్మద్ ఖాన్ అసఫుద్దౌలా బీదర్ కోట నుండి సామ్రాజ్యాన్ని పాలించాడు. తన తమ్ముడు మూడవ మీర్ నిజాం అలీ ఖాన్ ఆసఫ్ జా ఇతన్ని కోటలో బంధించి 1763 సెప్టెంబరు 16 లో హత్య చేయించే వరకూ అతని పాలన కొనసాగింది. బీదర్ కు పాత పేరైన మొహమ్మదాబాద్ కూడా ఇతని స్మృతిలోనే పెట్టబడింది. ఆ విధంగా బహమనీ రాజులు గుల్బర్గా నుండి 1347-1424 మధ్య కాలంలో 1424 నుండి రాజ్యం సమాప్తి చెందే వరకూ బీదర్ నుండి పరిపాలన సాగించారు. ఆ పైన సామ్రాజ్యం 5 ముక్కలయింది. బీజాపుర్, గోల్కొండ, అహ్మద్ నగర్, బీదర్, బేరార్ ప్రాంతాలుగా సామ్రాజ్యం విడిపోయింది. భారత స్వాతంత్ర్యం తరువాత 1956లో బీదర్ మైసూర్ (ప్రస్తుత కర్నాటక) లో భాగమయింది.
బీదర్ రైలు, రోడ్డు, విమానయానం ద్వారా మంచి అనుసంధానం కలిగి ఉంది. బీదర్ బెంగుళూరుకు ఉత్తరాన 740 కిలోమీటర్లు (460 మై.) దూరంలో, గుల్బర్గాకు ఈశాన్యంగా 116 కిలోమీటర్లు (72 మై.) దూరంలో, హైదరాబాదుకు జాతీయ రహదారి 9 మీద 130 కిలోమీటర్లు (81 మై.) దూరంలో ఉంది.
బీదర్ కోట హైదరాబాదుకు 115 కి.మీ. దూరంలో ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.