పింగళి నాగేంద్రరావు
సినీ రచయిత / From Wikipedia, the free encyclopedia
పింగళి నాగేంద్రరావు (1901 డిసెంబరు 29 - 1971 మే 6) పేరొందిన రచయిత. సినిమా, నాటకాలు, పత్రికల్లో రచనలు చేశాడు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో జన్మించిన పింగళి ఆంధ్ర జాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. తర్వాత ఖరగ్ పూర్ లోని రైల్వే వర్క్షాపులో సహాయకుడిగా చేరాడు. తర్వాత ఆఫీసు పనిలోకి మారాడు. అక్కడ రైల్వే యూనియన్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 1920లో జాతీయ నాయకుల ఉపన్యాసాలకు ఉత్తేజితుడై ఉత్తరభారతదేశ యాత్ర చేశాడు. అక్కడే ఆయనకు దివ్యజ్ఞాన సమాజం వారితో కూడా పరిచయం కలిగింది. పర్యటనలో భాగంగా ఆయన గాంధీజీ స్థాపించిన సబర్మతీ ఆశ్రమం చేరుకుని వైరాగ్యంవైపు ఆకర్షితుడయ్యాడు కానీ ఆశ్రమంలో ఉండేవారి సలహాతో భారత జాతీయ కాంగ్రెసులో ఉద్యోగిగా చేరాడు. అక్కడ పనిచేస్తున్నపుడే కొన్ని దేశభక్తి గేయాలు రాసి జన్మభూమి అనే పుస్తకంగా ప్రచురించాడు. ఆ పని చేసినందుకు ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి హెచ్చరిక చేసి వదిలిపెట్టింది. తర్వాత కాంగ్రెస్ కు భారంగా ఉండటం కాదని పట్టాభి సీతారామయ్య ఇచ్చిన సలహాతో కాంగ్రెస్ ఆర్గనైజరు పదవికి రాజీనామా చేశాడు. తర్వాత కౌతా శ్రీరామశాస్త్రి ప్రారంభించిన శారద పత్రికలో చేరి ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. కృష్ణా పత్రిక, శారద పత్రికల్లో ఆయన ఉపసంపాదకుడుగా పనిచేసారు. వింధ్య రాణి, నా రాజు, జేబున్నీసా, మేవాడు రాజ్య పతనం, క్షాత్ర హిందు, నా కుటుంబం, గమ్మత్తు చావు తదితర నాటకాలు ఆయన రచనల్లో ముఖ్యమైనవి.