సాహిత్యంలో ఒక ప్రక్రియ From Wikipedia, the free encyclopedia
నవల (ఆంగ్లం: Novel) తెలుగు సాహిత్యంలో ఒక ప్రక్రియ. ఇవి ఆధునిక కాలంలో అత్యంత ఆదరణ పొందుతున్నది.
తెలుగు సాహిత్యం దేశభాషలందు తెలుగు లెస్స | |
---|---|
తెలుగు సాహిత్యం యుగ విభజన | |
నన్నయకు ముందు | సా.శ. 1000 వరకు |
నన్నయ యుగం | 1000 - 1100 |
శివకవి యుగం | 1100 - 1225 |
తిక్కన యుగం | 1225 - 1320 |
ఎఱ్ఱన యుగం | 1320 – 1400 |
శ్రీనాధ యుగం | 1400 - 1500 |
రాయల యుగం | 1500 - 1600 |
దాక్షిణాత్య యుగం | 1600 - 1775 |
క్షీణ యుగం | 1775 - 1875 |
ఆధునిక యుగం | 1875 – 2000 |
21వ శతాబ్ది | 2000 తరువాత |
తెలుగు భాష తెలుగు లిపి ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా తెలుగు సాహితీకారుల జాబితాలు | |
19వ శతాబ్ది అంత్యం నుంచి తెలుగు నవల ప్రారంభం అయింది. వీరేశలింగం కొందరు తొలి తెలుగు నవలగా, మరికొందరు పరిశోధకులు తొలినాళ్ళలోని ఒక తెలుగు నవలగా భావించే శ్రీరంగరాజ చరిత్రము వ్రాశారు. చిన్నయసూరి పంచతంత్రం వ్రాస్తూ వదిలిపెట్టిన విగ్రహతంత్రాన్ని కందుకూరి వీరేశలింగం పూర్తిచేసి ప్రచురించారు. ఆ సమయంలో మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో పనిచేస్తున్న సమర్ధి రంగయ్యచెట్టి వీరేశలింగం ప్రతిభను మెచ్చుకుంటూ అభినందన లేఖ వ్రాస్తూ తెలుగులో స్వకపోలకల్పితమైన వచన ప్రబంధ రచనకు మీరు పూనుకోలేరా? అని మెచ్చుంటూనే ప్రోత్సహించే సూచనలు చేశారు. శ్రీరంగరాజ చరిత్రము ఆలోచనకు అదే మొదలు కావచ్చునని సాహిత్య విమర్శకులు భావించారు.[1] 1892లో న్యాయవాది సుబ్బారావు సంపాదకత్వంలో వెలువడిన "చింతామణి" పత్రిక నవలను బాగా ప్రోత్సహించింది. నవలల పోటీలు నిర్వహించి నవలా సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది, నవలా రచనకు కావలసిన సూత్రాలను నిర్ణయించింది. అయితే ఈ ప్రారంభకాలంలో వెలువడిన నవలలు ఎక్కువగా సంఘ సంస్కరణల ప్రాముఖ్యత కనిపిస్తుంది.
20వ శతాబ్దం తొలిరోజుల్లో వచ్చిన మార్పులు నవలా రచనను ప్రభావితం చేశాయి. జాతీయ భావాలు, ఆంగ్ల విద్యావ్యాప్తి, సంస్కరణోద్యమాలు, పత్రికా వ్యాప్తి, పుస్తక ప్రచురణలు, సంస్థల స్థాపన మొదలైనవన్నీ నవలా వికాసానికి తోడ్పడ్డాయి. కృష్ణాపత్రిక, దేశమాత, సరస్వతి, హిందూ సుందరి, మనోరమ, ఆంధ్రపత్రిక వంటి పత్రికలు సాహిత్య సాంస్కృతిక పునరుజ్జీవనానికి బాటలు వేశాయి. విజ్ఞాన చంద్రికా మండలి, ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల, సరస్వతీ గ్రంథ మండలి, వేగుచుక్క గ్రంథమాల వంటి ప్రచురణ సంస్థలు ఎన్నో విలువైన పుస్తకాలను ప్రచురించాయి.
మొదటగా చారిత్రక, అపరాధ పరిశోధన నవలా అనువాదాలు ఎక్కువగా జరిగాయి. దీనిని "అనువాద యుగం" అని పేర్కొనవచ్చును. బెంగాలీ భాషనుండి అనువాదితమైన నవలల్లో ఆనందమఠం (ఓ.వై.దొరస్వామయ్య), ప్రఫుల్లముఖి (కనకవల్లి భాస్కరరావు), రాధారాణి (చాగంటి శేషయ్య) వంటివి ప్రసిద్ధిపొందాయి. మలయాళం నుండి అనువాదితమైన నవల "కళావతి" (దొడ్ల వెంకటరామరెడ్డి) వచ్చింది. అప్పుడే "ఐవాన్ హో" (కేతవరపు వేంకటశాస్త్రి) వంటి ఆంగ్ల చారిత్రక నవలలు వెలువడ్డాయి.
ఈ శతాబ్దిలో తర్వాత కాలంలో స్వతంత్ర చారిత్రక నవలలు వెలువడ్డాయి. ధరణి ప్రెగ్గడ వేంకట శివరావు రచించిన "కాంచనమాల" (1908), వేంకట పార్వతీశ కవుల "వసుమతీ వసంతము" (1911), ఎ.పి. నరసింహం పంతులు వ్రాసిన "వసంతసేన" (1912), సత్యవోలు అప్పారావు వ్రాసిన "పున్నాబాయి" (1913) వంటివి ప్రసిద్ధిపొందాయి.
1900-1920 మధ్యకాలంలో సాంఘిక సమస్యలు ఇతివృత్తాలుగా వెలువడిన నవలలో వస్తు వైవిధ్యం కనిపిస్తుంది. పాశ్వాత్య ప్రభావంతో హేతువాద దృష్టి పెరిగి సమాజ సంక్లిష్టతను నవలలు చిత్రించాయి. వితంతు వివాహాలు, హరిజనాభ్యుదయం వంటి సంస్కార ప్రతిపాదకాలైన వస్తువులు కనిపిస్తాయి. నేదునూరి గణేశ్వరరావు రచించిన "సుగుణతి పరిణయము" (1903), హద్దునూరి గోపాలరావు "సుందరి" (1912), కొత్తపల్లి సూర్యారావు "కులపాలిక" (1913) వంటివి ఈ రకమైనవి. తల్లాప్రగడ సూర్యనారాయణ రచించిన "హేలావతి" (1913) ఈ కాలంలో వెలువడిన మొదటి హరిజనాభ్యుదయ నవల.
రాబోయే నవలలకు మార్గదర్శకత్వం వహించిన రచనలుగా మాతృమందిరం, గణపతి, మాలపల్లి నవలలను చెప్పుకోవచ్చును. చిలకమర్తి వారి "గణపతి" (1919) ఆ కాలంలోని బ్రాహ్మణ కుటుంబాల్లో వచ్చిన కల్లోలాలకు అద్దంపట్టిన హస్యపూరిత నవల. హరిజన సమస్యను చిత్రిస్తూ ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన నవల "మాలపల్లి"లో వ్యావహారిక భాష వాడడం విశేషం.
1920-47 మధ్య తెలుగు నవల కొత్త పోకడలు పోయింది. నవ్య సాహిత్యోద్యమం, వ్యావహారిక భాషావాదం, కాల్పనిక ఉద్యమం మొదలై నవలను ప్రభావితం చేశాయి. భాషా విప్లవం తీసుకురావాలన్న గాఢమైన తపన ఈ రచయితలలో కనిపిస్తుంది. గుడిపాటి వెంకటాచలం, విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు ఈ కోవలోకి చెందుతారు. స్త్రీ స్వేచ్ఛ, స్వేచ్ఛా ప్రణయాలను చలం ప్రతిపాదిస్తే, సమాజం పటిష్టం కావాలంటే నీతి నియమాలు, కట్టుబాట్లు దృఢతరం కావాలని విశ్వనాథ భావించారు.
ఇదేకాలంలో మొక్కపాటి నరసింహశాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు వికాసానికి తోడ్పడిన గొప్ప రచయితలు. మొక్కపాటి వారి బారిష్టరు పార్వతీశం (1925) ఉత్తమ హాస్య నవల, మునిమాణిక్యం "కాంతం" అనే హాస్య ధోరణిగల తెలుగు ఇల్లాలిని సృష్టించిన ధన్యుడు. తెలుగుతనం పట్ల గాఢమైన అభినివేశంతో రచనలు చేసినవారు శ్రీపాద శాస్త్రి ఆత్మబలి, రక్షాబంధనము అనే ప్రసిద్ధ నవలలు రచించారు.
1947 తర్వాత కాలంలో తెలుగు నవల రాశిలోనూ, వైవిధ్యంలోను ప్రజాదరణలోను ఇది "నవలాయుగం" అనేంత ప్రాచుర్యం పొందినది. భారత స్వాతంత్ర్యానంతరం వచ్చిన నవలలను చారిత్రికాలు, సాంఘికాలు అని స్థూలంగా విభజించవచ్చును. సాంఘిక నవలల్లో ఎంతో వైవిధ్యం, భిన్న దృక్పధాలు, ధోరణులు కనిపిస్తాయి. ఈ కాలంలో నవల మధ్య తరగతి జీవితాన్ని అన్ని కోణాల్లో చూపించడానికి ప్రయత్నించింది.
కొడవటిగంటి కుటుంబరావు మధ్య తరగతి జీవితాలలోని వైరుధ్యాలను విశ్లేషాత్మకంగా చిత్రిస్తూ ఆలోచింపజేసే నవలలు రాశారు. "చదువు", "అనుభవం" మొదలైన నవలల్లో సమాజంలోని అస్తవ్యస్తత పాత్రల స్వభావాల్లో కనిపిస్తుంది. "చివరకు మిగిలేది" నవలా రచయిత బుచ్చిబాబు ది ప్రధానంగా సౌందర్య దృష్టి, అయినా సంఘమనే చట్రంలో ఇమడలేని వ్యక్తి జీవిత చిత్రణ దీనిలో కనిపిస్తుంది. చైతన్య స్రవంతి మార్గంలో మనో విశ్లేషణాత్మకంగా రచించిన గోపీచంద్ నవల "అసమర్ధుని జీవితయాత్ర" రాచకొండ విశ్వనాథశాస్త్రి గారి "అల్పజీవి"లో కూడా ఇదే రీతి కనిపిస్తుంది. నవీన్ "అంపశయ్య"లో విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల జీవితాన్ని రచించారు. ఈ వ్యవస్థలో వర్గతత్వాన్ని చిత్రించిన బీనాదేవి "పుణ్యభూమి కళ్ళుతెరు" చాలా ప్రసిద్ధికెక్కింది.
పూర్వం నవలా రచయిత్రులు తక్కువగా ఉన్నా, ఇప్పుడు విస్తృత సంఖ్యలో స్త్రీలు రచనలు చేస్తున్నారు. వారిలో ఎక్కువమంది వాస్తవికతకు సుదూరమైన పగటి కలలను చిత్రిస్తున్నారు. జనాకర్షణ కల ప్రసిద్ధ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి.
పురుష ప్రపంచంలో స్త్రీల బానిస బ్రతుకును చిత్రిస్తూ వారు తమ వ్యక్తిత్వం కొరకు పోరాడాలని ప్రబోధించే రచయిత్రి రంగనాయకమ్మ. ఆమె రచించిన "బలిపీఠం"లో సాంఘిక చైతన్యం కొరవడిన వారు వర్ణాంతర వివాహం చేసుకుంటే వచ్చే కష్టనష్టాలు చిత్రించారు. సామాజిక సమస్యలను వస్తువుగా తీసుకొని వాసిరెడ్డి సీతాదేవి రచించిన మట్టి మనిషి, అడవి మల్లి, ఇల్లిందల సరస్వతీదేవి రచించిన భవతి భిక్షాందేహి, దరిచేరిన ప్రాణులు ఇలాంటి ప్రయోజనంతో రాసిన నవలలు. స్త్రీ సెక్స్ జీవితానికి సంఘం విధించిన కట్టుబాట్లను ఎదిరిస్తూ రాసిన రచయిత్రి లత.
క్రమ సంఖ్య | నవల | రచయిత పేరు | విశేషణం |
1 | శ్రీరంగరాజ చరిత్ర (1872) | నరహరిగోపాల కృష్ణమూర్తి | దీనికి సోనాబాయి పరిణయం అనిపేరు కలదు (తొలి తెలుగు నవల, తొలి తెలుగు చారిత్రక ప్రయత్నం ) |
2 | రాజశేఖర చరిత్ర (1875) | కందుకూరి వీరేశలింగంపంతులు | (దీనికి వివేకచంద్రిక అని పేరు కలదు) (ఇది తొలి తెలుగు సంపూర్ణ సాంఘిక నవల. దీనికి మూలం ఆంగ్లంలో 'గోల్డ్ స్మిత్ రచించిన వికార్ ఆఫ్ ది వేక్ ఫీల్డ్ అని అంటారు.
ఇది అనుసరణ కావచ్చు. దీన్ని ఇంగ్లీషులోకి a fortunes wheelగా అనువదించబడింది) |
3 | సత్యరాజా పూర్వదేశయాత్రలు | కందుకూరి వీరేశలింగం పంతులు | (ఇది ఆంగ్లంలో జోనాధన్ స్లిప్ట్ రచించిన గలివర్ ట్రావెల్స్ అనేదానికి అనుసరణ) |
4 | మంజువాణి విలాసం | వనప్పాకం అనంతామాచార్యులు | |
5 | ధర్మవతి విలాసం | ఖండవల్లి రామచంద్రుడు | |
6 | లక్ష్మీసుందర విజయం | ఖండవల్లి రామచంద్రుడు | |
7 | రామచంద్ర విజయం | చిలకమర్తి లక్ష్మీనరసింహం | |
8 | దాసీకన్య | చిలకమర్తి లక్ష్మీనరసింహం | |
9 | అహల్యబాయి | చిలకమర్తి లక్ష్మీనరసింహం | |
10 | గణపతి (హాస్య నవల) | చిలకమర్తి లక్ష్మీనరసింహం (ఆంధ్రస్కాట్) | |
11 | రాయ్ చూర్ యుద్ధం | కేతవరపు వేంకటశాస్త్రి | |
12 | రామరాజ్యానికి రహదారి | పాలగుమ్మి పద్మరాజు | |
13 | బతికిన కాలేజి | పాలగుమ్మి పద్మరాజు | |
14 | అల్పజీవి | రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాధశాస్త్రి) | (ఈ నవలలో సుబ్బయ్య, మనోరమ అనేపాత్రలు కలిగిన నవల. ఇది మనోవైజ్ఞానికమైన నవల.
ఆప్ర్ఫెడ్ ఆడ్లార్ (ఇడిప్లస్ కాంప్లేక్స్) అందించిన ఆత్మనూనత బ్రాంచి మొదలైన అంశాలు కలిగిన నవల అల్పజీవి. streemm of consciousness అనే శైలి తెలుగు చైతన్య స్రవంతి శిల్పం కలిగిన నవల అల్పజీవి) |
15 | సొమ్ములుపోనాయండి | రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాధశాస్త్రి) | |
16 | గోవులొస్తున్నయి జాగ్రత్త | రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాధశాస్త్రి) | |
17 | రత్తాలు రాంబాబు | రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాధశాస్త్రి) | |
18 | రాజుమనిషి | రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాధశాస్త్రి) | (ఈయన మధ్య తరగతి సమస్యలు బడుగు వర్గాల సమస్యలను ఇతివృత్తంగా తీసుకున్న రచయిత) |
19 | మనోరమ | వేంకట పార్వతీశ కవులు | |
20 | మాతృమందిరం | వేంకట పార్వతీశ కవులు | (బాలాంత్రపు వెంకట్రావు,ఓలేటి పార్వతీశం అనేవారే వేంకట పార్వతీశ కవులు.అపరాధ పరిశోధక నవలకు ఆధ్యులు వీరు) |
21 | టిప్పుసుల్తాన్ | అక్కిరాజు ఉమాకాంతం | |
22 | రెండు మహానగరాలు(అనువాద నవల) | తెన్నేటి సూరి | (చార్లెస్ డికెన్శ్ రచించిన a tale of two cities అనేదానికి ఈ నవల అనువాదం) |
23 | ఛంఘీజ్ ఖాన్ | తెన్నేటి సూరి | |
24 | కపాల కుండల | దొరస్వామయ్య | (తొలి తెలుగు అనువాద నవల) |
25 | ఆనందమట్ | దొరస్వామయ్య | |
26 | మాలపల్లి | ఉన్నవ లక్ష్మీనారాయణ | (దీనికి సంగవిజయ అని పేరు కలదు)(1920) (ఇది తొలి తెలుగు సాంఘిక నవల) |
27 | ఏకవీర | విశ్వనాధ సత్యన్నారాయణ | (మధుర ప్రణయ ఇతివృత్తం కలిగిన ఒక చారిత్రక నవల) |
28 | బద్దన్నసేనాని | విశ్వనాధ సత్యనారాయణ | |
29 | కడిమి చెట్టు | విశ్వనాధ సత్యనారాయణ | |
30 | దిండు కింద పోక చెక్క | విశ్వనాధ సత్యనారాయణ | |
31 | వేయిపడగలు | విశ్వనాధ సత్యనారాయణ | (పసిరిక పాత్ర కీలకమైనది.తెలుగులో బృహత్ నవల ఇది.
పి.వి.నరసింహరావు వేయిపగడలు నవలనీ సహస్రాఫణ్'అనే పేరుతో హిందీలోకి అనువదించారు.) |
32 | హిమబిందువు | అడవి బాపిరాజు | (శాతవాహనుల లాలం నాటిది ఈ నవల) |
33 | గోనగనరెడ్డి | అడవి బాపిరాజు | |
34 | అడవి శాంతశ్రీ | అడవి బాపిరాజు | |
35 | నారాయణరావు (సాంఘిక నవల) | అడవి బాపిరాజు | |
36 | కోసంగి (చారిత్రక నవల) | అడవి బాపిరాజు | |
37 | బారిస్టరు పార్వతీశం (హస్య నవల) | మొక్కపాటి నరసింహాశాస్త్రి | |
38 | అహోబిలీయం (తొలితెలుగు జాతీయోద్యమ నవల) | వేలూరి శివరామశాస్త్రి | |
39 | చదువు, అనుభవం | కొడవటిగంటి కుటుంబరావు | |
40 | చివరకు మిగిలేది | బుచ్చిబాబు (శివరాజు వెంకట సుబ్బరావు) | (ఇది మనోవైజ్ఞానికమైన నవల. ఇందులో పాత్రలు కోమల, దయానిది) |
41 | అసమర్థుని జీవయాత్ర | త్రిపురనేని గోపిచంద్ | (ఇందులో నాయకుడు సీతారామారావు) ఈయన రచించిన నవలలు అన్నీ మనోవిజ్ఞానానికి సంబంధించినవే.ఈయన ఇంకా పరివర్తన, పిల్లితిమ్మెర, ప్రేమహాపతులు, శిథిలాలయం, గడుయపడని తలుపులు, పండితపరమేశ్వరశాస్త్రి వీలునామా, మెరుపులు-మరకలు (ఉషారాణి పాత్ర కలిగిన నవల) |
42 | కీలుబొమ్మలు | జి.వి.కృష్ణారావు | |
43 | హిమజ్వాల, అనుక్షణికం | వడ్డెర చండీదాస్ | |
44 | పల్లె పిలిచింది | ద్వారకా | ఆంధ్రప్రభ 1989 దీపావళి నవలల పోటీలో ద్వితీయ బహుమతి గెలుచుకుంది. |
45 | ఐ.సి.సి.యు | చిత్తర్వు మధు | వైద్యవృతి-కార్డియాలజీ నేపథ్యంలో రాసిన వైజ్ఞానిక నవల. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.