From Wikipedia, the free encyclopedia
చెయ్యేరు, పెన్నా నదికి ఉపనది. దీనినే బాహుదా నది అని కూడా అంటారు. అన్నమయ్య జిల్లా లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అత్తిరాల ఈ నదీతీరాన్నే వెలసింది. ఈ నది కర్ణాటకలోని కోలార్ జిల్లా రాయపాడు కొండల్లో పుట్టి చిత్తూరు జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో మదనపల్లె ప్రాంతం మీదుగా ప్రహహించి సరిపల్లి సమీపంలో వైఎస్ఆర్ జిల్లాను తాకుతుంది. ఈ నది మీద బాదనగడ్డ వద్ద అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించబడింది. జిల్లాలో సుమారో 150 కి.మీ. మేర ఈ నది విస్తరించింది. టి.సుండుపల్లె మండలంలోని రాయవరం వద్ద బహుదా, పింఛ నదులు అనుసంధానం చేసుకుని బాలరాచపల్లి మీదుగా, అన్నమయ్య ప్రాజెక్టు ముందుభాగాన మాండవ్య, గంగనేరులను కలుపుకుని సిద్దవటం మీదుగాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోకి ప్రవేశిస్తుంది.
ఈ నదికి చెయ్యేరు లేక బాహుద అనే పేర్లు రావడానికి వెనుకనున్న కథ ఇది: శంఖ - లిఖితులనే అన్నదమ్ములిద్దరు ఏటికి ఈ ఒడ్డున ఒకరు, ఆ ఒడ్డున ఒకరు కాపురముండేవారని,తమ్ముడు ప్రతిరోజూ అన్న వద్దకు వచ్చి వేదం, శాస్త్రం నేర్చుకుని వెళ్ళేవాడు. ఏటి ఒడ్డునే ఒక మామిడి తోట ఉంది. ఒకనాడు లిఖితుడు ఆ దారి వెంట నడుస్తుండగా అతనికి ఆకలి వేసింది. తోట యజమాని కోసం చూస్తే అతను ఎక్కడా కనిపించలేదు. లిఖితుడు ఆకలికి తాళలేక రెండు పళ్ళు కోసుకుని తిన్నాడు. తర్వాత ఈ విషయం అన్నకు చెప్పాడు. చేసింది నేరమని, రాజు రవివర్మ వద్దకు వెళ్ళి శిక్షను కోరుకొమ్మన్నాడు అన్న శంఖుడు. పొత్తపి రాజు లిఖితుడి చేతులు ఖండించాడు. లిఖితుడు తెగిన చేతులతో అన్న దగ్గరకు వచ్చాడు. శంఖుడు దైవాన్ని ప్రార్థించి చేతులు ఏట్లో ముంచమన్నాడు. లిఖితుడు అలాగే చేయగా అతనికి చేతులు వచ్చాయి. చేతులను రప్పించిన ఆ నదికి 'చెయ్యేరు' అని పేరు వచ్చింది. సంస్కృతంలో 'బాహు' అంటే చెయ్యి. 'ద' అంటే ఇచ్చునది. అందుకే చేతిని ఇచ్చిన ఈ నది పేరు బాహుద అయింది. ఈ నదిని గురించి తొలితెలుగు యాత్రాచరిత్ర ఐన కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావనలున్నాయి. 1830లో ఈ ప్రాంతమీదుగా కాశీయాత్ర చేసిన గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య ఈ నదిని గురించి, చుట్టుపక్కల ప్రాంతాల గురించి వ్రాసుకున్నారు.అతను తన గ్రంథంలో నది గడియ దూరము వెడల్పు ఉందని వ్రాశారు. దాన్ని బట్టి ఆ నదిని దాటేందుకు గడియ సేపు పట్టేదని, అంత వెడల్పు అని అర్థంచేసుకోవచ్చు.నదికి ఇరుపక్కల గుళ్ళున్నాయని, పుణ్యక్షేత్రం నెలకొందని పేర్కొన్నారు.[1]
చెయ్యేరు యొక్క ఉపనదులు
చెయ్యేరు నది మీద వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట మండలంలోని బాదనగడ్డ వద్ద అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు వలన వైఎస్ఆర్ జిల్లాలోని 22,500 ఎకరాల భూమికి సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు 2.17469 టి.ఎం.సిల నీటిని ఉపయోగించుకొంటుంది. జలాశయం యొక్క నీటి నిల్వసామర్ధ్యం 2.33948 టి.ఎం.సి (గ్రోస్), 2.23948 టి.ఎం.సి (నెట్).
తొలి అంచనా ప్రకారం ఈ ప్రాజెక్టు యొక్క వ్యయం 60.44 కోట్ల రూపాయలుగా 1996-97 లో నిర్ణయించడమైనది కానీ 2001-02 లో తిరిగివేసిన అంచనాలో అభివృద్ధి, ఆధునీకరణ ఖర్చులతో మొత్తం వ్యయం 68.92 కోట్ల రూపాయలుగా వెలకట్టబడింది. 2004 జనవరి వరకు 57.347 కోట్ల రూపాయల మొత్తం ప్రాజెక్టు ఆధునీకరణ, పునరావాసం, వైఎస్ఆర్ జిల్లా లోని రాజంపేట, పుల్లంపేట మండలాలలో 22,500 ఎకరాల ఆయకట్టు స్థిరపరచడానికి ఖర్చు చేయబడింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.