![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/67/S._P._Balasubrahmanyam_at_the_%2527Gurkha%2527_Audio_Launch.jpg/640px-S._P._Balasubrahmanyam_at_the_%2527Gurkha%2527_Audio_Launch.jpg&w=640&q=50)
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
సుప్రసిద్ధ గాయకుడు బాలు / From Wikipedia, the free encyclopedia
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం (1946 జూన్ 4 - 2020 సెప్టెంబరు 25) నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన్ను ఎస్పీబీ అని కూడా పిలవడం కద్దు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. అనతి కాలంలోనే మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు.
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | |
---|---|
![]() ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | |
జననం | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (1946-06-04)1946 జూన్ 4 కోనేటమ్మపేట, నెల్లూరు జిల్లా, మద్రాస్ ప్రెసిడెన్సీ |
మరణం | 2020 సెప్టెంబరు 25(2020-09-25) (వయసు 74) ఎంజిఎం హాస్పిటల్, చెన్నై |
మరణ కారణం | కోవిడ్ 19 |
ఇతర పేర్లు | బాలు, గాన గంధర్వుడు |
వృత్తి | నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత, నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1965 - 2020 |
జీవిత భాగస్వామి | సావిత్రి |
పిల్లలు | చరణ్ & పల్లవి |
తల్లిదండ్రులు |
|
వెబ్సైటు | http://www.spbindia.com |
1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశాడు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి గాత్రదానం చేసాడు.
సినిమాల్లోనే కాక టి.వి రంగంలో ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశాడు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించాడు.
అతను కేంద్ర ప్రభుత్వం నుండి 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. 2021లో మరణానంతరం కేంద్ర ప్రభుత్వం బాలుకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.