ఆంధ్రప్రదేశ్ జిల్లా. From Wikipedia, the free encyclopedia
ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా 2022లో కొత్తగా ఏర్పడిన జిల్లా. ఇది పూర్వపు కృష్ణా జిల్లాలోని కొన్ని మండలాలను విడగొట్టుట ద్వారా ఆవిర్బంచింది. జిల్లా పరిపాలనా కేంద్రం విజయవాడ. విజయవాడ రాష్ట్రానికి సాంస్కృతిక నగరంగా పేరొందింది. ఇక్కడి కనకదుర్గ దేవాలయం ప్రముఖ పుణ్యక్షేత్రం.
ఉమ్మడి కృష్ణా జిల్లాను మూడుగా విభజించి, విజయవాడతో కూడి ఉత్తరాన ఉన్న ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పరచారు. కొంత భాగాన్ని ఏలూరు జిల్లాలో కలిపారు.[1] ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు జ్ఞాపకార్ధం ఈ జిల్లాకు ఎన్.టి.ఆర్ జిల్లా అని పేరు పెట్టారు. జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లులో విజయవాడ రెవెన్యూ డివిజను గతంలో ఏర్పడిందికాగా, నందిగామ రెవెన్యూ డివిజను, తిరువూరు రెవెన్యూ డివిజను పునర్వ్యవస్థీకరణ భాగంగా కొత్తగా ఏర్పడ్డాయి.
జిల్లాకు తూర్పున ఏలూరు జిల్లా,పశ్చిమాన గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, నల్గొండ జిల్లాలు, ఉత్తరాన ఖమ్మం జిల్లా, దక్షిణాన కృష్ణా జిల్లా ఉన్నాయి. ఈ జిల్లాలో కృష్ణానది ప్రవహిస్తోంది. మెట్టప్రాంత మండలాలతో పాటు డెల్టా మండలాల్లో సాగునీటి అవసరాల కోసం కృష్ణా నది నీటిని వినియోగించుకునే సౌకర్యం ఉంది . విజయవాడ నుండి రాష్ట్ర రాజధాని అమరావతి జాతీయ రహదారి 65 ద్వారా 21.9 కి.మీ. దూరంలో ఉంది.
జిల్లాలో ప్రధాన కొండ నందిగామ, విజయవాడ పట్టణముల మధ్య 24 కిలోమీటర్ల పరిధిలో ఉంది. దానిని కొండపల్లి అని పిలుస్తారు. జమ్మలవాయిదుర్గం, మొగల్రాజపురం, ఇంద్రకీలాద్రి జిల్లాలోని ఇతర ప్రముఖ కొండలు. కనకదుర్గ దేవాలయం ఇంద్రకీలాద్రి కొండ మీదనే ఉంది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో కృష్ణా నది ముఖ్యమయిన నది. బుడమేరు, మున్నేరు, తమ్మిలేరు ఇతర నదులు. కృష్ణా నది బంగాళా ఖాతంలోకి హంసలదీవి, నాచుగుంట వద్ద కలుస్తుంది. ఇవి కాక జిల్లాలో చిన్న కొండవాగులు కూడా ప్రవహిస్తాయి. ఇవి జయంతి, కట్టలేరు, ఇప్పలవాగు, ఉప్పుటేరు, తెల్లేరు, బళ్ళలేరు, ఇంకా నడిమేరు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సులో కొంత భాగం కృష్ణా జిల్లాలో ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు, కృష్ణా డెల్టా, చింతలపూడి ఎత్తిపోతల పథకం, తమ్మిలేరు, పోలవరం ముఖ్యమైన పెద్ద, మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులు.
2011 జనాభా లెక్కల ప్రకారం, జిల్లా జనాభా 22,18,591. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 4,06,350 (18.32%), షెడ్యూల్డ్ తెగలు 82,101 (3.70%) ఉన్నారు. జిల్లా జనాభాలో 90.12% తెలుగు, 6.90% ఉర్దూ, 1.43% లంబాడీ భాష వాడుకలోవుంది.
జిల్లాలో 321 గ్రామాలకు ఆర్.టీ.సీ ద్వారా రవాణా సేవలున్నాయి.[ఆధారం చూపాలి]
2011 జనాభా లెక్కల ప్రకారం 74.43 అక్షరాస్యత ఉంది.
జిల్లాలో వ్యవసాయం చాలా ముఖ్యమైన వృత్తి. ఉత్పత్తి చేసే ప్రధానంగా వరి ఆహార పంట ఉత్పత్తి చేస్తారు. ఈ జిల్లాలో ముఖ్యంగా మూడు రకాల నేలలు ఉంటాయి 57.6% శాతం ఉన్న నల్ల నేలలు,22.3% శాతం ఇసుక బంకమట్టి,19.4% శాతం ఎర్రమట్టి నేలలు ఉన్నాయి, సముద్ర తీరంలో 0.7% అంచులు చిన్న ఇసుక నేలలు ఉన్నాయి.
జిల్లాలో తిరువూరు, నందిగామ, విజయవాడ రెవెన్యూ డివిజన్లున్నాయి. ఈ రెవెన్యూ డివిజన్లను 20 మండలాలుగా విభజించారు.
తిరువూరు డివిజన్లో 5 మండలాలు, నందిగామలో 7 మండలాలు, విజయవాడ డివిజన్లో 8 మండలాలు ఉన్నాయి. కొత్త జిల్లా ఏర్పాటులో భాగంగా విజయవాడ పట్టణ మండలం, విజయవాడ ఉత్తర, విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ మధ్య అనే నాలుగు మండలాలుగా విభజించారు.
విజయవాడ నగరంతో కలిపి ఐదు పట్టణాలున్నాయి.[2]
జిల్లాలో 288 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[2]
విజయవాడ వద్ద సిరీస్ (SIRIS) ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. ఇబ్రహీంపట్నం సమీపంలో, విజయవాడ థర్మల్ పవర్ స్టేషను (VTPS) దాని పనితీరునకు భారతదేశంలో నం .1 అధిక పవర్ ఉత్పత్తి యూనిట్గా స్థానం పొందింది. కొండపల్లిలో చెక్కబొమ్మలు, జగ్గయ్యపేటలో సంగీత సాధనముల తయారీ పరికరాలు వంటి పలు చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.