From Wikipedia, the free encyclopedia
మొఘలాయిలు కీ.శ. 1526 నుండి 1707 వరకు భారత ఉపఖండాన్ని (ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్) పరిపాలించిన రాజవంశీయులు. 1526లో తైమూరు వంశానికి చెందిన బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీమ్ లోడీని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ముఘల్ అంటే మంగోల్ అనే పదానికి పర్షియా భాషలో సమానమైన పదం. మంగోల్ అంటే మధ్య ఆసియాలోని చెంఘీజ్ ఖాన్ వంశీయులైన సంచార యుద్ధవీరులు అని అర్థం. మొఘల్ వంశీయులంతా ఇస్లాం మతాన్ని కచ్చితంగా పాటించారు. బాబరు తరువాత పరిపాలనా బాధ్యతల్ని చేపట్టిన హుమాయూన్ను పఠాన్ వీరుడైన షేర్ షా సూరి జయించి సుర్ సామ్రాజ్యం స్థాపించాడు. పదహారేళ్ళ తరువాత పోగట్టుకున్న కోటలన్నింటినీ హుమాయూన్ మళ్ళీ జయించాడు. హుమాయూన్ తరువాత అతని కుమారుడైన అక్బర్ మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించి 1556 నుండి 1605 వరకు పాలించాడు. అక్బర్ తరువాత విశాలమైన మొఘల్ సామ్రాజ్యం అతని కుమారుడైన జహాంగీర్కు సంక్రమించింది. జహాంగీర్ తర్వాత ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన షాజహాన్ కాలంలో మొఘల్ సామ్రాజ్యం ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యంగా కీర్తింపబడింది. ఇతను పరిపాలించిన కాలాన్నే చరిత్రకారులు మొఘల్ సామ్రాజ్య స్వర్ణ యుగంగా వర్ణిస్తారు.
షాజహాను కీ.శ.1630, 1653 మధ్య, తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థంగా, ప్రసిద్ధిగాంచిన తాజ్ మహల్ కట్టించాలని సంకల్పంచాడు. ముంతాజ్ తన 14వ బిడ్డ ప్రసవ సమయంలో మరణించింది. 1700 నాటికి సామ్రాజ్యం 40లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉత్థాన స్థితికి చేరుకొన్నది.[1]
మొఘల్ సామ్రాజ్యంలోని ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు హిందూ మతస్థులైనా పాలకవర్గం మాత్రం ముస్లిం మతస్థులు. సామ్రాజ్యాన్ని బాబర్ స్థాపించినా అక్బర్ కాలము వరకు స్థిరపడలేదు. ఉదార స్వభావుడైన అక్బర్ జన్మతః భారతీయునిగా స్థానిక సంస్కృతి రీతులతో వల్లమాలిన అనుబంధం, అభిమానం కలిగి ఉన్నాడు. అక్బర్ పాలనలో మొఘల్ ప్రభుత్వం జిజియా పన్ను (ముస్లిమేతర మతస్థులపై విధించే పన్ను) ను అంతం చేసింది. ముస్లింల సాంప్రదాయక చాంద్రమాన కాలగణనను విడిచి వ్యవసాయ పనులలో సౌలభ్యము కొరకు సూర్యమాన కాలగణనను అవలంభించారు. మతవిషయాలలో అక్బర్ యొక్క అసాధరణ ఆలోచనా సరళికి రూపకల్పనే ఈయన స్థాపించిన దీన్-ఎ-ఇలాహీ (దేవుని మతం).[2] దీన్-ఎ-ఇలాహీ హిందూ, సూఫీ ఇస్లాం, జొరాస్ట్రియన్ మతము, క్రైస్తవ మతముల సంగ్రహం. అక్బర్ తను జీవించి ఉన్నంతవరకు దీన్-ఎ-ఇలాహీని అధికారిక మతంగా ప్రకటించాడు. అయితే ఈయన చర్యలను సాంప్రదాయక ఇస్లాం ముల్లాలు తీవ్రంగా నిరసించారు. మొఘల్ చక్రవర్తి, అక్బర్ ఆనాటి పరిస్థితులలో సహనశీలిగా చిరస్మరణీయుడు. 1556 నుండి 1605 వరకు సాగిన ఈయన సుదీర్ఘ పాలనలో ఒకే ఒక పెద్ద ఊచకోత నమోదైంది. 1568 ఫిబ్రవరి 24న చిత్తోర్ యుద్ధం తర్వాత కోటలోని వాసులందరినీ మట్టుపెట్టమని ఆదేశాలు జారీచేశాడు. అక్బరు యొక్క పర మత సహనము, ప్రజలు పూజించే విధానల పట్ల సహనాన్ని పాటించటము, మహమ్మదీయేతరులపై జిజియా పన్ను రద్దు, ఇతర మత విశ్వాసాలపట్ల ఆసక్తి ఆతని పరమత గౌరవానికి ప్రతీకలు. ఇవే అతని ఎదుటి వర్గమైన ఛాందస మహమ్మదీయులు మహమ్మదీయ మతాన్ని తృణీకరించడంతో సమానముగా భావించారు. దానికి అసలైన కారణాలు, ఇతర మత సిద్ధాంతాలపట్ల తప్పులు చేయలేననే అశక్తతను ప్రకటించడము, కొత్త మతపరమైన భావనలను ప్రచారం చేయడం, హిందువుల, జోరాస్ట్రియన్ల పండుగలను జరుపుకోవటం.
సాంప్రదాయక మత మౌఢ్యముఔరంగజేబు పాలనలోకి వచ్చిన తర్వాతనే రాజ్యవ్యవహారాలలో పెద్ద పాత్ర పోషించటం ప్రారంభమైంది. ఔరంగజేబు కఠోర ముస్లిం మతావలంబీకుడు, మొఘల్ సేనల అత్యంత దృఢమైన సేనాని. గొప్ప మొఘల్ చక్రవర్తులలో చివరివాడైన ఔరంగజేబు తన పూర్వీకుల హయాములో అమలుజరిగిన కొన్ని ఉదార పాలసీలను రద్దు చేశాడు.
మొఘలులు భూమి శిస్తును సేకరించటానికి మున్సబుదారీ వ్యవస్థను ఉపయోగించారు. యుద్ధసమయములో సైనికుల దండును పంపే హామీపై, చక్రవర్తి మున్సబుదారుకు భూమి శిస్తు హక్కులు మంజూరు చేశేవాడు. హక్కులు ఇచ్చిన భూమి వైశాల్యము పెరిగినకొద్దీ మున్సబుదారు పంపవలసిన సైన్యము సంఖ్య కూడా పెరిగేది. మున్సబుపై హక్కులు వంశానుగతంగా సంక్రమించవు, అధికారాలను చక్రవర్తి తిరిగితీసుకునే అవకాశము కూడా ఉంది. ఈ పద్ధతి కేంద్ర ప్రభుత్వానికి మున్సబుదారులపై దృఢమైన పట్టు కల్పించింది.
గొప్ప మొఘల్ చక్రవర్తులు | ||||||||||||
చక్రవర్తి | పేరు | పాలన ప్రారంభం | పాలన అంతం | years | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బాబర్ | జహీరుద్దీన్ ముహమ్మద్ | 1526 | 1530 | 4 | ||||||||
హుమాయూన్ | నసీరుద్దీన్ మొహమ్మద్ | 1530 | 1540 | 10 | ||||||||
సంధి కాలము * | - | 1540 | 1555 | 15 | ||||||||
హుమాయూన్ | నసీరుద్దీన్ మొహమ్మద్ | 1555 | 1556 | 1 | ||||||||
అక్బర్ | జలాలుద్దీన్ మొహమ్మద్ | 1556 | 1605 | 49 | ||||||||
జహాంగీర్ | నూరుద్దీన్ మొహమ్మద్ | 1605 | 1627 | 22 | ||||||||
షాజహాన్ | షహబుద్దీన్ మొహమ్మద్ | 1627 | 1658 | 31 | ||||||||
ఔరంగజేబ్ | మొహియుద్దిన్ మొహమ్మద్ | 1658 | 1707 | 49 | ||||||||
* ఆఫ్ఘన్ పరిపాలన (షేర్షా సూరీ, అతని వంశీయులు)
మొఘల్ సామ్రాజ్యానికి బీజం వేసింది బాబర్ (పరిపాలన 1526–1530). బాబర్, మధ్య ఆసియా మొత్తాన్ని జయించిన మహాయోధుడు తైమూర్ లాంగ్ యొక్క ముని మనమడు.[2] 16వ శతాబ్దము తొలినాళ్లలో మంగోల్, తురుష్క, పర్షియన్, ఆఫ్ఘనీ యోధులతో కూడిన మొఘల్ సైన్యాలు, తైమూర్ వంశ యువరాజైన, జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ నాయకత్వంలో భారతదేశంపై దండెత్తాయి. తైమూర్ 1398లో భారత్ పై డండయాత్రకు విఫలయత్నం చేసి సమర్ ఖండ్కు వెనుదిరిగాడు. తైమూర్ స్వయంగా తాను మరో మంగోల్ యోధుడు చెంగీజ్ ఖాన్ వారసుణ్ణని ప్రకటించుకొన్నాడు. ఉజ్బెక్ లచే సమర్ఖండ్ నుండి తరిమివేయబడిన బాబర్ మొదటగా 1504లో కాబూల్లో తన పాలనను స్థాపించాడు. ఆ తరువాత ఇబ్రహీం లోఢీ పాలిస్తున్న ఢిల్లీ సుల్తానులలో అంతఃకలహాలను ఆసరాగా తీసుకొని దౌలత్ ఖాన్ లోఢీ (పంజాబ్ గవర్నరు), ఆలం ఖాన్ (ఇబ్రహీం లోఢీ మామ) ల ఆహ్వానంతో బాబరు 1526లో ఢిల్లీపై దండెత్తాడు.[3]
అనుభవమున్న సేనానిగా బాబర్ తన సుశిక్షుతులైన 12వేల సైన్యముతో 1526లో భారతదేశంలో అడుగుపెట్టి లోఢీ యొక్క సమైక్యతలోపించిన లక్ష బలము కల భారీ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్, సుల్తాన్ లోడీని నిర్ణయాత్మకముగా ఓడించాడు. తుపాకీ బళ్ళు, కదిలించగలిగే ఫిరంగీలు, అత్యుత్తమ ఆశ్వికదళ యుక్తులు, ఆ కాలము నాటి ఆంగ్లేయుల పొడవు ధనుస్సు కంటే అత్యంత శక్తివంతమైన మొఘలు విల్లుల సహాయముతో అద్వితీయమైన విజయాన్ని సాధించాడు బాబర్. ఆ యుద్ధములో సుల్తాన్ లోఢీ మరణించాడు. ఒక సంవత్సరము తర్వాత (1527) కణ్వా యుద్ధములో చిత్తోర్ రాజు రాణా ప్రతాప్ సింగ్ నేతృత్వములోని రాజపుత్రుల సంఘటిత సేనను నిర్ణయాత్మకముగా ఓడించాడు. బాబర్ పాలనలో మూడవ పెద్ద యుద్ధము 1529లో జరిగిన గోగ్రా యుద్ధము. ఇందులో బాబర్ ఆఫ్ఘన్, బెంగాల్ నవాబు యొక్క సంయుక్త సేనలను మట్టికరిపించాడు. తన సైనిక విజయాలను పటిష్ఠపరచే మునుపే బాబర్ 1530లో ఆగ్రా వద్ద మరణించాడు. తన ఐదేళ్ళ చిన్న పాలనాకాలములో బాబర్ అనేక కట్టడాలను నిర్మించేందుకు శ్రద్ధ వహించాడు. కానీ అందులో కొన్ని మాత్రమే మనగలిగాయి. బాబర్ తన అత్యంత ముఖ్యమైన వారసత్యముగా భవిష్యత్తులో భారత ఉపఖండముపై సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాలనే తన స్వప్నాన్ని సాకారము చెయ్యగల వారసులను మిగిల్చిపోయాడు.
భోపాల్ లోని ప్రభుత్వ గ్రంథాలయములో దొరికిన పత్రాల ప్రకారం బాబరు హుమాయూన్కు ఈ క్రింది వీలునామా వ్రాసాడు.
"నా ప్రియ కుమారునికి, ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోదగినవి:
నీ మనస్సు లో మతవిద్వేషాలను ఉంచుకోవద్దు. న్యాయము చెప్పేటప్పుడు, ప్రజల సున్నితమైన మత విశ్వాసాలను, హక్కులను పరిగణనలోకి తీసుకోవాలి. గోవధను తప్పిస్తే స్థానికుల మనసులలో స్థానం సంపాదించవచ్చు. ఇవి నిన్ను ప్రజలకు దగ్గరగా తీసుకువెళ్తాయి.
ప్రజల ప్రార్థనాలయాలను ఏ మతానికి చెందినవైనా ధ్వంసం చేయవద్దు. దేశ శాంతి కోసం పూర్తి సమాన న్యాయం అమలు చేయగలవు. ఇస్లామును ప్రచారంచేయటానికి , ఇతర మతాలను అన్యాయముతో, కౄరంగా అణచివేయటము అనే కత్తుల కన్నా ప్రేమా, ఆప్యాయత అనే కత్తుల ఉపయోగము ఎంతో గొప్పది. షియాలకు, సున్నీలకు మధ్య విభేదాలను తొలగించు. ఋతువుల గుణగణాలను చూచినట్లే, నీ ప్రజల గుణగణాలను చూడు."
బాబరు మరణముతో, అతని కుమారుడు హుమాయూన్ (1530–56) రాజ్యానికి వచ్చేనాటికి రాజ్యం క్లిష్టపరిస్థుతులలో ఉంది. ఢిల్లీ గద్దెపై ఆఫ్ఘన్లు దాడిచేయటం, తన రాజ్యసంక్రమణ వివాదాస్పదం కావటంతో అన్నివైపుల నుండి హుమాయున్కు ఒత్తిడి ప్రారంభమయ్యింది. షేర్ షా సూరి సేనలచే సింధ్ వరకూ తరమబడిన హుమాయున్, 1540లో పర్షియాకు పారిపోయి, పదునైదు సంవత్సరాల పాటు సఫవిద్ల అతిధిగా షా తహమస్ప్ సభలో అవమానంతో తలదాచుకున్నాడు. షేర్షా సూరీ పాలనలో సామ్రాజ్యాన్ని సమైక్య పరచటం, పాలనా యంత్రాగాన్ని వ్యవస్థీకరించడం జరిగాయి. ఇవి ఆ తరువాత అక్బర్ పాలనలో మరింత అభివృద్ధి చెందాయి. అంతేకాక షేర్షా సూరీ యొక్క సమాధి శిల్పకళా తార్కాణమై ఇండో-ఇస్లామిక్ సమాధుల శిల్పశైలిని చాలా ప్రభావితం చేసింది. 1545లో సఫవిదుల సహాయముతో హుమాయున్ కాబూల్ పై పట్టుసాధించి, 1545 మేలో షేర్షా సూరీ మరణముతో బలహీనపడిన ఆఫ్ఘన్ల అధికారాన్ని ఆసరాగా తీసుకొని భారత్పై తిరిగి తన హక్కును చాటాడు. హుమాయన్ 1555లో ఢిల్లీని తిరిగి చేజిక్కించుకున్నాడు. కానీ తిరిగివచ్చిన ఆరు నెలలకే తన గ్రంథాలయ మెట్లపై జారిపడి మరణించాడు. ఢిల్లీలోని హుమాయూన్ సమాధి మొఘల్ శిల్పశైలి అభివృద్ధికి, మెరుగుకు అత్యద్భుత ఉదాహరణ. దీన్ని హుమాయున్ మరణించిన ఎనిమిది సంవత్సరాలకు 1564లో ఆయన విధవరాలు హాజీ బేగం రూపకల్పన జేసినది.
హుమాయున్ యొక్క ఆకస్మిక మరణం కారణంగా 1556లో అతని పదమూడేండ్ల కుమారుడు జలాలుద్దీన్ అక్బర్ (1556 - 1605)[4] రాజ్య నిర్వహణను స్వీకరించాడు. 1556న రెండవ పానిపట్టు యుద్ధంలో విజయం సాధించిన తరువాత అక్బరు తరపున బైరంఖాన్ రాజ్య విస్తరణను విస్తృతంగా చేపట్టాడు. అక్బరు యుక్త వయస్సుకు వచ్చిన తరువాత, తనదైన వ్యక్తిత్వాన్ని, రాజకీయ చతురతను అలవర్చుకున్నాడు. పని పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగి కొన్ని సంవత్సరాల మొఘల్ సామ్రాజ్యంలోని పద్ధతులను స్వయంగా పర్యవేక్షించాడు. రాజ్య విస్తరణ చేసి ఉత్తరాన-పశ్చిమాన కాబూల్, ఉత్తరాన కాశ్మీర్, తూరుపున బెంగాల్ నుండి మధ్య-భారతాన నర్మదా నది వరకూ పాలించాడు.
అక్బర్ ఆగ్రా సమీపాన 1571లో ప్రారంభించి పటిష్ఠమైన గోడకల ఫతేపూర్ సిక్రీ (ఫతే = విజయము) అనే రాజధాని నగరాన్ని నిర్మించాడు. అందులో అక్బర్ యొక్క పట్టమహిషులకు రాజసౌధాలు, పెద్ద కృత్రిమ సరస్సు, నీటితో నింపబడిన తటాకాలు కలిగిన పెరళ్ళు కట్టించాడు. అయితే, ఆ నగరాన్ని అనతికాలములోనే విడిచిపెట్టి రాజధానిని 1585లో లాహోర్ కు మార్చాడు. రాజధానిని మార్చటానికి ఫతేపూర్ సిక్రీ నీటి సరఫరా సరిగా లేకపోవటము కారణము అయ్యిండవచ్చు లేదా కొందరు చరిత్రకారులు భావించినట్టు అక్బర్ సామ్రాజ్యము యొక్క వాయువ్య ప్రాంతాలలో దృష్టి పెట్టవలసి రావడంతో రాజధానిని వాయువ్యానికి మార్చాడు. 1599లో అక్బర్ రాజధానిని తిరిగి ఆగ్రాకు మార్చి తను మరణించేవరకు ఇక్కడినుండే పాలించాడు. వివిధ మతాల ప్రజల సేవలను తనలో కలుపుకుని, పెద్ద భూభాగాన్ని ఏలేందుకు అక్బరు రెండు వైవిధ్యమైన, ప్రయోజనకరమైన విధానాలను ప్రవేశ పెట్టినాడు.
నూరుద్దీన్ సలీం జహాంగీర్ (ఆంగ్లం : Nuruddin Salim Jahangir), బిరుదు : అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖాన్ అల్-ముకర్రమ్, ఖుష్రూయే గీతీ పనాహ్, అబుల్-ఫాతెహ్ నూరుద్దీన్ జహాంగీర్ పాద్షాహ్ గాజీ జన్నత్-మక్సానీ (పర్షియన్: نور الدین جهانگیر ), జననం 1569 సెప్టెంబరు 20 - మరణం 1627 నవంబరు 8) (OS 1569 ఆగస్టు 31 – NS 1627 నవంబరు 8, మొఘల్ సామ్రాజ్యపు నాలుగవ చక్రవర్తి. జహాంగీర్ అనే పదం పర్షియన్ భాషా పదం; جهانگير, అర్థం "ప్రపంచాన్ని జయించినవాడు". నూరుద్దీన్ అనగా "విశ్వాస జ్యోతి".[5]
జహాంగీర్ తండ్రి అక్బర్. ఎన్నో నోముల తరువాత పుట్టాడు. జహాంగీర్ భార్య నూర్జహాను. అందగత్తెయేగాక మహా తెలివైనది. రాజ్యభారాన్ని మోయగల స్తోమత గలది. జహాంగీర్ త్రాగుడు అలవాటుకు బానిస. ఈ దురలవాటుతోనే మరణించాడు. మంచి న్యాయ పరిపాలకుడిగా పేరున్ననూ, 'త్రాగుడు చక్రవర్తి' గా చెడ్డపేరు తెచ్చుకొని మరణించాడు.
Seamless Wikipedia browsing. On steroids.