పొదిలి
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా పట్టణం From Wikipedia, the free encyclopedia
పొదిలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ప్రకాశం జిల్లాకు చెందిన పట్టణం, అదేపేరుతోగల మండలానికి కేంద్రం.
పట్టణం | |
![]() | |
Coordinates: 15.604°N 79.608°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | పొదిలి మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 43.88 కి.మీ2 (16.94 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 31,145 |
• జనసాంద్రత | 710/కి.మీ2 (1,800/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 986 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08499 ) |
పిన్(PIN) | 523240 |
Website |
గ్రామ చరిత్ర
"పొదిలి"ని పూర్వం పృదులాపురి అని పిలిచేవారు. సాలువ వంశస్థులు పొదిలిని రాజధానిగా చేసుకొని 15వ శతాబ్దములో పొదిలి ప్రాంతమును పరిపాలించారు. కొన్ని శాసనములు, పొదిలి కైఫియతు వీరి చరిత్రకు మూలములు. పొదిలి సాలువ వంశస్థుల పరిపాలన ఎలుగు రాయుడుతో అంతమైనది. స్వాతంత్ర్యము వచ్చే వరకు పొదిలి వెంకటగిరి సంస్థానములో భాగముగా ఉంది.
భౌగోళికం
జిల్లా కేంద్రమైన ఒంగోలు నుండి వాయవ్య దిశలో 50 కి.మీ. దూరంలో పొదిలి ఉంది.
జనగణన వివరాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 26,665. ఇందులో పురుషుల సంఖ్య 13,610, మహిళల సంఖ్య 13,055, గ్రామంలో నివాస గృహాలు 5,984 ఉన్నాయి.
2011 జనగణన ప్రకారం మొత్తం జనాభా 31,145.
పరిపాలన
పొదిలి నగరపంచాయతీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సౌకర్యాలు
పొదిలి నంద్యాల - ఒంగోలు రాష్ట్ర రహదారిపైనున్నది. సమీప రైల్వే లైన్లు (మరింత విస్తృతమైన సేవ, దొనకొండ (40 km దూరంలో) ఒంగోలు {50 km దూరంలో} వద్ద ఉన్నాయి. సమీప విమానాశ్రయం విజయవాడ విమానాశ్రయం (సుమారు 172 కిలోమీటర్ల దూరంలో), చెన్నై విమానాశ్రయం (సుమారు 353 కిలోమీటర్ల దూరంలో) ఉన్నాయి.
ప్రధాన పంటలు
వరి, అపరాలు, కాయగూరలు
ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
శ్రీ నిర్మమహేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం)
దక్షిణకాశీగా పేరుగాంచిన ఈ ఆలయం ఐదు ఆలయాల సముదాయం. పార్వతీ సమేత శ్రీ నిర్మమహేశ్వరస్వామి, కామాక్షీ సమేత శ్రీ కైలాసనాథస్వామి, త్రిపురసుందరీ సమేత శ్రీ భీమేశ్వరస్వామి, శ్యామలా సమేత శ్రీ నగరేశ్వరస్వామి, నిమ్మవ్వ గుడి ఒకే ప్రాంగణంలో కొలువుతీరి ఉన్నాయి. ప్రతి సంవత్సరం మాఘమాసంలో స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు 10 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. బ్రహ్మోత్య్సవాలు నిర్వహించే పదిరోజులూ స్వామివారు రోజుకొక అలంకరణతో దర్శనమిచ్చెదరు. ఉభయదాతల ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఒక రోజు స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించెదరు.
స్థల పురాణం
శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో, యల్లంరాజు పెదకొండమరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రిక కథనం. స్థల పుత్రాణం ప్రకారం, ప్రస్తుతం నిర్మమహేశ్వరుడు వెలసిన చోట ఒక ఆవులదొడ్డి, పుట్ట ఉండేవట. అక్కడ ఆవులపాలన్నిటినీ వాటి యజమాని గోపాలుడు మందగిరి గోవిందుడు, దూడలకే వదలివేసేవాడట. నందిని అనే పెరుగల ఆవుకు మాత్రం నిత్యం పొదుగులో పాలు లేకుండా ఉండటం గమనించిన గోవిందుడు, ఒకరోజు రాత్రి కర్ర పట్టుకుని ఆవు దగ్గరే కాపలా ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో ఆ ఆవు పుట్టపై నిలబడి, పాలను ధారగా కార్చుచున్నది. ఇది గమనించిన గోవిందుడు కర్రను ఆవుపై బలంగా విసరగా, పుట్టపై ఉన్న పెచ్చు లేచి, క్రింద ఉన్న శివలింగం బయట పడినది. ఇది గమనించిన గోవిందుడు అక్కడ నిర్మమహేశ్వరుని పేరిట, ఒక ఆలయం నిర్మించారు.
విశేషాలు
నిర్మమహేశ్వరుని ఆలయానికి దక్షిణాన, నిమ్మవ్వ గుడి ఉంది. శ్రీకృష్ణదేవరాయల ప్రతినిధి రాయసం కొండమరుసయ్య ఈ మందిరం నిర్మించినారని చెపుతారు. అక్కడ నిమ్మవ్వ విగ్రహంతోపాటు, ఈ శిలలోనే దిగువన దూడల మల్లయ్య బొమ్మ చెక్కి ఉంది. పొదిలో నిమ్మవ్వ అను ఒక బాలిక జన్మించింది. ఆమె పరమ శివభక్తురాలు. ఆమె పేరిటే నిమ్మవ్వ గుడి నిర్మించారు. ఇటీవల నిమ్మవ్వ గుడి, కామాక్షీ సమేత కైలాసనాథస్వామి ఆలయం ముందువైపు ప్రాంగణాన్ని అభివృద్ధిచేసి, కైలాసవనంగా అభివృద్ధిచేసారు. అక్కడ ఏర్పాటుచేసిన పార్వతీపరమేశ్వరుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుచుచున్నవి. పట్టణంలోని దాతలు, భక్తుల సహకారంతో ఈ అభివృద్ధి పనులు చేపట్టినారు.నిర్మమహేశ్వరునికి తూర్పుభాగం ముఖమండపంలో నందీశ్వరుని విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని శనగల బసవన్న అని పిలుచుచున్నారు.
రథోత్సవం
ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగ మరుసాటి రోజున స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. 1916 వసంవత్సరంలో వెంకటగిరి రాజావారి ఆధ్వర్యంలో రూపొందించిన రథం, శిథిలావస్థకు చేరడంతో, నూతన రథాన్ని ఏర్పాటు చేసారు.
శ్రీ గోవిందమాంబా సమేత శ్రీ మద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయం
ఇది విరాట్ నగర్ లో ఉంది.
భగవాన్ శ్రీ వెంకయ్యస్వామివారి ఆలయం
పొదిలి పట్టణంలోని సాయిబాలాజీ నగరులో నెలకొన్నది.
శ్రీ లక్ష్మీ అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం
వెలుగొండ క్షేత్రంలో వెలసిన ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం (మార్చి) లో) వైభవంగా నిర్వహించెదరు.
ఇతర విశేషాలు
శ్రీకృష్ణ గోసంరక్షణ కేంద్రం
ఎస్.వి.కె.పి. డిగ్రీ కళాశాల సమీపంలో, శ్రీ పృధులగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన మూడున్నర ఎకరాల స్థలంలో, 1999లో ప్రారంభమైంది.
ప్రముఖులు
- కాటూరి నారాయణ స్వామి, రైతు కుటుంబీకులు. వీరు 1956లో పొదిలి సర్పంచిగా పనిచేశారు. 1962, 1967, 1972, 1983 లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులుగా ఎన్నికైనాడు. ప్రోటెం స్పీకరుగా ఎన్.టి.రామారావుతో శాసన సభ్యునిగా పదవీ స్వీకారం చేయించాడు. ఆ మంత్రివర్గంలో నీటిపారుదల శాఖా మంత్రిగా పనిచేశాడు. 1984లో నరసరావుపేట లోక్ సభకు జరిగిన ఎన్నికలలో, కాసు బ్రహ్మానందరెడ్డి పై గెలుపొందాడు.
- నాయని సుబ్బారావు
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.