నరేంద్ర మోదీ

భారతదేశ ప్రధాన మంత్రి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి From Wikipedia, the free encyclopedia

నరేంద్ర మోదీ

నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ, 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.[2] (ఆంగ్లం: Narendra Dāmodardās Modī) (గుజరాతి: નરેંદ્ર દામોદરદાસ મોદી) అతను భారతదేశపు ప్రధానమంత్రి. అంతకు పూర్వం 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో కేశూభాయి పటేల్, ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోదీకి తిరుగులేదు. 2012 శాసనసభ ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా నాల్గవసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. Narendra modi is reincarnation and reborn of chatrapathi shivaji and nakuludu the mahabharatas epic character that why god made him prime minister

త్వరిత వాస్తవాలు నరేంద్ర మోదీ, 14వ భారత ప్రధాన మంత్రి ...
నరేంద్ర మోదీ
Thumb
14వ భారత ప్రధాన మంత్రి
Incumbent
Assumed office
2014 మే 26
అధ్యక్షుడుప్రణబ్ ముఖర్జీ(2014–2017)
రామ్‌నాథ్‌ కోవింద్‌(2017–2022)
ద్రౌపది ముర్ము(2022–ప్రస్తుతం)
ఉప రాష్ట్రపతిముహమ్మద్ హమీద్ అన్సారి(2014–2017)
వెంకయ్య నాయుడు(2017–2022)
జగదీప్ ధన్కర్(2022–ప్రస్తుతం)
అంతకు ముందు వారుమన్మోహన్ సింగ్
మంత్రిత్వ శాఖలు, విభాగాలువ్యక్తిగత పెన్షన్లు, అంతరిక్ష శాఖ, అణుశక్తి మంత్రిత్వ శాఖ
లోక్ సభలో పాలకపక్ష నేత
Incumbent
Assumed office
2014 మే 26
అంతకు ముందు వారుసుశీల్‌కుమార్ షిండే
లోక్ సభ సభ్యుడు
Incumbent
Assumed office
2014 జూన్ 5
అంతకు ముందు వారుమురళీ మనోహర్ జోషి
నియోజకవర్గంవారణాసి నియోజకవర్గం
గుజరాత్ 14వ ముఖ్యమంత్రి
In office
2001 అక్టోబర్ 7  2014 మే 22
గవర్నర్
  • సుందర్ సింగ్ భండారి
  • కైలాశపతి మిశ్రా
  • బలరాం జక్కర్
  • నావల్ కిషోర్ శర్మ
  • ఎస్. సి. జమీర్
  • కమల బేణివాల్
అంతకు ముందు వారుకేశూభాయ్ పటేల్
తరువాత వారుఆనంది బెన్ పటేల్
గుజరాత్ శాసన సభ్యుడు
In office
2002 డిసెంబర్ 15  2014 మే 16
అంతకు ముందు వారుకమలేష్ పటేల్
తరువాత వారుసురేష్ పటేల్
నియోజకవర్గంమణినగర్
In office
2002 ఫిబ్రవరి 24  2002 జులై 19
అంతకు ముందు వారువాజూభాయ్ వాలా
తరువాత వారువాజూభాయ్ వాలా
నియోజకవర్గంరాజ్‌కోట్ పశ్చిమం
వ్యక్తిగత వివరాలు
జననం
నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ

(1950-09-17) 17 సెప్టెంబరు 1950 (age 74)
వాద్‌నగర్, బాంబే రాష్ట్రం, భారత్ (ఇప్పుడు గుజరాత్)
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిజశోదా బెన్ మోదీ (m. 1968; estranged)[1]
తల్లిహీరాబెన్ మోదీ
తండ్రిదామోదర్ దాస్ మూల్‌చంద్ మోదీ
నివాసం7, లోక్ కల్యాణ్ మార్గ్, న్యూ ఢిల్లీ
కళాశాలఢిల్లీ విశ్వవిద్యాలయం (బిఎ)
గుజరాత్ విశ్వవిద్యాయలం (ఎం. ఎ)
పురస్కారాలుList of state honours
సంతకంThumb
వెబ్‌సైట్
మూసివేయి

బాల్యం

1950, సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఇయన తల్లిదండ్రులు దామోదర్ దాస్ మోదీ, హీరా బెన్ దంపతులకు 3 వ సంతానంగా జన్మించారు. నరేంద్ర మోదీ పాఠశాల విద్యను వాద్ నగర్ లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి దూర విద్య ద్వారా రాజనీతి శాస్త్రంలో డిగ్రీ, గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే ఆర్. ఎస్.ఎస్ లో చేరి వాద్ నగర్ లో స్వయం సేవక్ గా శాఖలకు వెళ్ళేవారు . 1970లో అహ్మదాబాద్ చేరుకొని ఆర్.ఎస్.ఎస్ లో చేరి అతి కొద్ది కాలంలోనే కీలకమైన బాధ్యతలు చేపట్టారు. ఒక మారుమూల గ్రామంలో తేనీరు అమ్మడం ద్వారా ప్రారంభమైన ఆయన జీవితం కాల క్రమంలో అనేక మలుపులు తిరిగింది.[3] మోదీకి తన తల్లి హీరాబెన్, సోదరి వాసంతితో మంచి అనుబంధం ఉంది. హీరాబెన్ 2022, డిసెంబరు 30 న చనిపోయింది.[4]

రాజకీయ జీవితం

ఆర్.ఎస్.ఎస్ జీవితం:

నరేంద్ర మోదీ బాలుడిగా ఉన్న సమయంలోనే, గుజరాత్ రాష్ట్రంలో అప్పుడే బలపడుతున్న ఆర్.ఎస్.ఎస్ సంస్థను గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణకు వచ్చిన, వకీల్ సాబ్ గా ప్రసిద్ధి గాంచిన, లక్ష్మణ్ రావు ఇనాందార్ ద్వారా ప్రారంభమైన, వాద్ నగర్ శాఖలో స్వయం సేవక్ గా ప్రవేశించాడు. మోదీ ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి 17 ఏళ్ల వయస్సులో దేశ పర్యటన నిమిత్తం ఇల్లు వదిలి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మీదగా పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా, డార్జిలింగ్ వరకు వెళ్ళాడు, కలకత్తాలో రామకృష్ణ మఠంలో సన్యాసం తీసుకోవడానికి ప్రయత్నం చేయగా అక్కడి నిబంధనలు అంగీకరించక పోవడంతో అక్కడి నుండి బీహార్ మీదగా అప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆల్మోరాకు వెళ్లి రామకృష్ణ మఠం యొక్క ఆశ్రమంలో గడిపాడు, అలా 17 నుంచి 20 ఏళ్ళు వయస్సులో ఉత్తరభారతంలో ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకున్నాడు.

మోదీ పర్యటన ముగించుకుని స్వగ్రామమైన వాద్ నగర్ కి చేరి తల్లి దగ్గర దీవెనలు తీసుకొని అహ్మదాబాద్ లో తన మేనమామ నడుపుతున్న ఆర్.టి.సి క్యాంటీన్ లో పనిచేస్తూనే తన గురువు వకీల్ సాబ్ ద్వారా తిరిగి ఆర్.ఎస్.ఎస్ లోకి ప్రవేశించాడు, వకీల్ సాబ్ అనుచరుడిగా అనతి కాలంలోనే అహ్మదాబాద్ నగర సంఘ్ శాఖల్లో అందరికి సూపరిచితులయ్యాడు . 1972లో గుజరాత్ రాష్ట్రంలో విశ్వహిందూ పరిషత్ తలపెట్టిన సాధు పరిషత్ కార్యక్రమ బాధ్యతలు, సభ కార్యక్రమాలు, వకీల్ సాబ్ తరుపున, విజయవంతంగా నిర్వహించి ఆర్.ఎస్.ఎస్ పెద్దల దృష్టిలో పడ్డాడు. ఆనాటి సంఘ్ లో సంస్థ సంఘ్ చాలక్ గురూజీ తరువాత ముఖ్యులు ఏక్ నాథ్ రానాడే, దత్తోపంత్ తేంగ్డే, బాలా సాహెబ్ దేవరాస్ మున్నగువారు. సాధు పరిషత్ కార్యక్రమం విజయవంతం కావడంతో సంఘ్ లో మోదీకి కీలకమైన బాధ్యతలు అప్పగించడం జరిగింది. 1975లో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో దేశంలోని ఆనాటి కీలకమైన జాతీయ నాయకులను సంఘ్ ప్రతినిధిగా కలవడంతో పాటుగా నాయకులకు రహస్యంగా దాచి పెట్టే కార్యక్రమంలో కీలకమైన పాత్ర పోషించాడు. ఆ సమయంలోనే గుజరాత్ రాష్ట్ర సంఘ్ విద్యార్థి విభాగం ఏబీవీపీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టి విద్యార్థులను విజయవంతంగా నడిపించాడు. అత్యయిక స్థితి ముగిసిన తరువాత సంఘ్ లో పెద్ద పెద్ద పదవులు నిర్వహించాడు. ఈ సమయంలోనే ఢిల్లీ వెళ్లి ప్రముఖ కార్మిక నాయకుడు, సంఘ్ పెద్దల్లో ఒకరైన దత్తోపంత్ తేంగ్డేకు పలు పుస్తకాల రచనలో సహాయకుడిగా పనిచేయడమే కాకుండా ఢిల్లీ రాజకీయ పరిస్థితులను ఆకళింపు చేసుకున్నాడు, పుస్తక రచన పూర్తి కాగానే గుజరాత్ కు తిరిగి వచ్చి గుజరాత్ రాష్ట్ర సంఘ్ సహా ప్రముఖ్ గా బాధ్యతలు చేపట్టి 1986 వరకు ఆ బాధ్యతల్లో కోనసాగడు.

Thumb
హైదరాబాద్ పర్యటనలో భాగంగా బేగంపేట్ ఎయిర్​పోర్ట్​లో ప్రధాని నరేంద్ర మోడీ (2023)

రాజకీయ జీవితం :

మోదీ ఆర్.ఎస్.ఎస్ లో పనిచేస్తున్న సమయంలో నే ఆనాటి గుజరాత్ రాష్ట్ర జనసంఘ్ పార్టీ ముఖ్య నాయకులు నాథులాల్ ఝాగ్దా, వసంత్ భాయ్ గజేంద్రద్కర్ లతో ఏర్పడ్డ సన్నిహిత సంబంధాలు మోదీని రాజకీయాల పట్ల ఆకర్షితుడిని చేశాయి. 1986లో ఆర్.ఎస్.ఎస్ నుంచి భాజపా లోకి ప్రవేశించిన మొదటి తరం నాయకుల్లో వీరు ఒకరు. భాజపాలో చేరిన తర్వాత అహ్మదాబాద్ పురపాలక సంఘ ఎన్నికల బాధ్యతలు తీసుకొని పురపాలక ఎన్నికల్లో భాజపాని గెలిపించడంలో కీలకమైన పాత్ర పోషించి భాజపా అగ్రనాయకత్వం దృష్టిలో పడ్డాడు. అప్పటి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎల్.కె.అద్వానీ ప్రోత్సాహం కూడా తోడై కొద్దికాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. 1990లో లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు గుజరాత్ బాధ్యుడిగా, 1992లో మరళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి-కాశ్మీర్ ఏక్తా రథయాత్రకు జాతీయ ఇన్‌చార్జీగా పనిచేశారు.[5]

1993లో బీజేపీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పలు యాత్రలు చేపట్టారు. 1995 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కీలకమైన పాత్ర పోషించారు. ఈ విజయం తరువాత ఆయన సేవలను జాతీయ స్థాయిలో వాడుకునేందుకు అద్వానీ తదితరులు ఉత్తర భారతంలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఇంఛార్జిగా నియమించడం జరిగింది. ఆయా రాష్ట్రాల ఇంఛార్జిగా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. మోదీ సాధించిన విజయాలను గమనించిన ఆర్.ఎస్.ఎస్, బీజేపీ నాయకత్వం బీజేపీ జాతీయ కార్యదర్శి పదవిని కట్టబెట్టింది. 1997లో అద్వానీ చేపట్టిన స్వర్ణజయన్త రథయాత్ర నిర్వహణ బాధ్యతను తీసుకొని విజయవంతంగా నిర్వహించి రథయాత్ర విజయానికి కీలకమైన పాత్ర పోషించాడు. 1998లో బీజేపీ పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన కుష్బూ థాక్రే ప్రోద్బలంతో మోదీ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తర్వాత జరిగిన 1998, 1999లలో లోక్ సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే 1998లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో తన వ్యూహాలతో పార్టీని విజయతీరాలకు చేర్చడంతో పార్టీలో సీనియర్ నాయకుడైన కేశూభాయి పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు. 2000వ సమయంలో గుజరాత్‌లోని కుచ్ ప్రాంతంలో సంభవించిన పెను భూకంపం తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం 2001 అక్టోబరులో నరేంద్ర మోదీని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టించింది. అప్పటి నుంచి 2014 మే 21 నాడు ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు వీలుగా రాజీనామా చేసేవరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీనే కొనసాగారు.

ముఖ్యమంత్రిగా మోదీ

ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన ఏడాదిలోనే ఆయన అద్భుత విజయాలు సాధించారు.[5] భూకంపం వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు చేపట్టినారు. 2002లో గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ దహనం తర్వాత జరిగిన అల్లర్లు ఆయన ప్రభుత్వానికి కష్టం కల్గించాయి. దేశ వ్యాప్తంగా ఆయన రాజీనామా చేయాలని విమర్శలు రావడంతో రాజీనామా సమర్పించి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమయ్యారు.

2002 ఎన్నికలు: 2002 డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలలో మొత్తం 182 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీకి 126 స్థానాలలో విజయం చేకూర్చి వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు. 2002 గుజరాత్ అల్లర్లపై రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికినీ [6] సమర్థంగా తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి,[7][8] ఉత్తమమైన పరిపాలన కార్యశీలిగా పేరు తెచ్చుకున్నారు.

2007 ఎన్నికలు : 2007 డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించాయి. ఆ కాలంలో ఏ ఎన్నికలకూ లేని విశేష ప్రాధాన్యత గుజరాత్ ఎన్నికలకు లభించిందంటే అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు.[9] కేవలం ఒక రాష్ట్ర ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించడానికి కారణం ఇది జరగబోయే లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేయడమే. అంతేకాకుండా 2009 లో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడిన లాల్ కృష్ణ అద్వానీది గుజరాతే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి కూడా గుజరాత్‌కే చెందినవారు. ఇటీవల కాలంలో అధికారంలో ఉంటూ మళ్ళీ పార్టీని గెలిపించిన సందర్భాలు తక్కువే. అటువంటిది వరుసగా మూడో పర్యాయం 182 స్థానాలకుగాను 117 స్థానాలు పొందటం విశేషం. ఆయన స్వయంగా మణినగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మంత్రి అయిన దిన్షా పటేల్ పై 87,161 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడటం అది 4 వ సారి కాగా నరేంద్ర మోదీ సర్కారు ఏర్పడటం 3 వ పర్యాయం.[10] గుజరాత్‌లోని 4 భౌగోళిక ప్రాంతాలైన సౌరాష్ట్ర, మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్‌ అన్నింటిలోనూ భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం, ఇది భారతీయ జనతా పార్టీ జట్టు విజయమని, 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' మాత్రం నరేంద్ర మోదీ అనీ క్రికెట్ భాషలో వ్యాఖ్యానించింది.[11] తాను 2001 నుంచే కాదు ఎప్పటి నుంచో సీఎం అని, ఎప్పటికీ గుజరాత్‌ సీఎం నేనని, సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అని నరేంద్ర మోదీ సరి కొత్త భాష్యం చెప్పారు.

2012 ఎన్నికలు: 2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ సునాయాస విజయాన్ని నమోదు చేసింది. నరేంద్రమోదీ స్వయంగా మణినగర్ నుంచి 86వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినారు. వరసగా 4వ సారి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన నరేంద్రమోదీ దేశప్రజల దృష్టిని ఆకర్షించారు. వేగంగా జరిగిన రాజకీయ పరిణామాలతో ఏకంగా మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే స్థాయికి వెళ్ళింది.

ప్రధానమంత్రి అభ్యర్థిగా: 2013లో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగిన వెంటనే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మోదీని ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అనుకూల పవనాలు బలంగా వీచాయి. మొదట్లో మోదీ రాజకీయ గురువు లాల్ కృష్ణ అద్వాని[12] అడ్డు తగిలినప్పటికీ అనంతరం ఆయన కూడా మోదీ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ మోదీ ప్రభావంతో గణనీయమైన స్థానాలు సాధించింది. మోదీ స్వయంగా వడోడర నుంచి 5 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా వారణాసిలో కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు.

చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు

2002లో ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత మోదీ అనేక అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించడానికి విశేషంగా తోడ్పడ్డారు. నర్మదా ఆనకట్ట ఎత్తును పెంచి లక్షల ఎకరాల భూమిని సాగులోనికి తెచ్చారు. తాగునీటి సరఫరా, జల విద్యుత్‌పై కూడా శ్రద్ధ చూపినారు. అనేక మహిళా పథకాలను చేపట్టారు. పెట్టుబడులను రప్పించడంలో, పారిశ్రామిక అభివృద్ధిలో, ఎగుమతులలో గుజరాత్ రాష్ట్రాన్ని మోదీ అగ్రస్థానంలో కొనసాగిస్తున్నారు. 2011 సెప్టెంబరు 14న నరేంద్రమోదీ పరిపాలన సామర్థ్యాన్ని అమెరికా శ్లాఘించింది. అమెరికా కాంగ్రెస్‌కు చెందిన పరిపాలన విభాగం "భారతదేశపు అత్యుత్తమ పాలన, ఆకర్షణీయమైన అభివృద్ధి గుజరాత్‌లో కనిపిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతిని, అలసత్వాన్ని తొలిగించి ఆర్థికరథ చక్రాలను గాడిలో పెట్టారు" అని అభివర్ణించింది[ఆధారం చూపాలి].

ప్రధానిగా

2014 మే 26న నరేంద్రమోదీ భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పలు నిర్ణయాలు, విధి విధానాలు అమలుచేశాడు. వాటిలో 500, 1000, 2000 రూపాయల నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, అధికరణ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, పారసత్వం సవరణ చట్టం (CAA), జాతీయ పౌర జాబితా (NRC) అమలు వంటివి ఉన్నాయి.

పురస్కారాలు

  • భారత ప్రధాని నరేంద్ర మోదీకి తొలి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో 2019 జనవరి 14లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. విశిష్ట లక్షణాలతో దేశాన్ని నడిపిస్తున్నందుకు గాను మోదీకి పురస్కారం దక్కింది.
  • లెజెండ్రీ సింగర్ లతా మంగేష్కర్ స్మారకార్థం ఏర్పాటు చేసిన తొలి స్మారక అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022 ఏప్రిల్ 24న ముంబైలో స్వీకరించారు. భారతదేశానికి నిస్వార్థ సేవలందించినందుకు గాను ఆయనికి ఈ అవార్డును ప్రదానం చేశారు.[13]
  • నైజీరియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన 'గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజెర్' - 2024[14]

వ్యక్తిగత జీవితం

నరేంద్ర మోదీకి నలుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఝానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వెంట ఎప్పుడు లాప్‌టాప్ను ఉంచుకుంటారు. ఖరీదైన దుస్తులు ధరిస్తారు. అనేక వ్యాసాలతో పాటు 3 పుస్తకాలను కూడా రచించారు. సొంత ఆస్తి కూడబెట్టుకోలేదు. మంచి వక్త, వ్యూహకర్త అయిన మోదీ జీవితంలో చాలా భాగం ఇప్పటికీ రహస్యమే. సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల వంటి పదవులను అధిష్టించినవారి కుటుంబసభ్యులు ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతుంటారు. రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ, మోదీ కుటుంబం ఇందుకు పూర్తి విరుద్ధం. ఆయన సోదరులు, సోదరీమణుల జీవితం ఎవరిది వారిదే. తండ్రి దామోదర్‌దాస్ మరణించగా, తల్లి హీరాబెన్ మోదీ ఇటీవల మరణించారు. మోదీ శాకాహారి.

మోదీ జీవిత ప్రస్థానం

Thumb
2014 ఎన్నికలలో మోదీ ప్రసంగిస్తున్న బహిరంగసభ వేదిక
  • గుజరాత్ లోని మెహసానా జిల్లాలోని వాద్ నగర్ పట్టణంలో 17-09-1950 దామోదర్ దాస్ ముల్ చంద్ మోదీ, హీరబెన్‌లకు మూడో సంతానంగా మోదీ జననం
  • రాజనీతి శాస్త్రంలో పట్టా
  • బాలుడిగా ఉన్నప్పుడే.. 1960ల్లో భారత్ - పాక్ మద్య యుద్ధం సమయంలో రైల్వే స్టేషనులో సైనిక సేవలు
  • గుజరాత్ లో పలు సామాజిక రాజకీయ ఉద్యమాల్లో క్రీయాశీల పాత్ర .
  • చిన్న వయస్సులోనే వివాహం అయిందని స్థానిక మీడియా పేర్కొంటుంది . .
  • చిన్నతనంలో సోదరుడితో కలిసి బస్సు స్టాండ్ లో టీ కొట్టు నడిపారు.
  • ప్రచారక్ గా జీవితాన్ని ప్రారంభించే వరకూ గుజరాత్ రోడ్డు రవాణా సంస్థ క్యాంటిన్ లో విధులు
  • నాగపూర్ లో అర్ ఎస్ ఎస్ లో శిక్షణ
  • గుజరాత్ లో ఏబీవీపి బాధ్యతలు
  • 1987 లో బాజపాలో చేరిక. 1988 నుంచి 1995 మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీస్కునిరావడంలో కీలక పాత్ర
  • 1995 లో జాతీయ కార్యదర్శిగా ఎంపికతో బాటు ఐదు రాష్ట్రాల వ్యవహారాల బాధ్యత అప్పగింత.
  • 1998 లో ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి
  • 07-10-2001 లో కేశుభాయ్ పటేల్ స్థానంలో తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంపిక.
  • 2002 లో రెండో దఫా ముఖ్యమంత్రిగా ఎన్నిక
  • 2007 లో మూడో దఫా మఖ్యమంత్రిగా బాధ్యతలు
  • 2012 లో నాల్గోసారి మఖ్యమంత్రిగా రికార్డు విజయం
  • 2013 లో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డులో సభ్యుడిగా నియామకం. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథ్య బాధ్యతలు .
  • 13-09-2013 లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక.[15]
  • 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకు పూర్తి మెజారిటీ సాధించిపెట్టి ప్రధానమంత్రి పదవి అధిష్టించడానికి సిద్ధంగా ఉన్నారు.
  • 2014 మే 21 ప్రధానమంత్రి పదవి అధిష్టించడానికి వీలుగా గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
  • 2014 మే 26న ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం

బయటి లింకులు

త్వరిత వాస్తవాలు
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
మూసివేయి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.