From Wikipedia, the free encyclopedia
2008 ముంబై ఉగ్రవాద దాడులకు, [2][3] పాకిస్తాన్, దాని ISI లే కారణమని భారతదేశం విశ్వసించింది. దీనివలన కొంత కాలం పాటు రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారతదేశంలో కూడా పాకిస్తాన్ వ్యతిరేక సెంటిమెంట్ పెరిగింది. దీని వలన అమెరికాతో [4] సహా చాలా దేశాలు దీనిపై విచారణకు పిలుపునిచ్చాయి.
| ||||||||||||||||||||||
భారత పాకిస్తాన్లు రెండూ అణ్వాయుధ దేశాలు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇరుదేశాల మధ్య 4 యుద్ధాలు జరిగాయి. మొదటి నుండి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగానే ఉంటూ వచ్చాయి. ముంబై దాడుల్లో ప్రాణాలతో బయటపడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్, తాము పాకిస్థాన్ నుంచి వచ్చామని, తమకు లష్కరే తోయిబా శిక్షణ ఇచ్చిందనీ ధ్రువీకరించాడు. తమకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కూడా మద్దతిచ్చిందని అతడు 2011లో ఒప్పుకున్నాడు.[3][5]
2008 నవంబరు 26 నుంచి 29 వరకు ముంబై దాడులు జరిగాయి. డిసెంబరు 7న లాహోర్లో జరిగిన అధికారిక విందులో అమెరికా సెనేటర్ జాన్ మెక్కెయిన్, భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సందేశాన్ని పాకిస్తాన్ ప్రధాన మంత్రి యూసఫ్ రజా గిలానీతో సహా అనేక మంది పాకిస్తాన్ ప్రముఖులకు అందించాడు. దాడుల్లో పాల్గొన్నవారిని పాకిస్తాన్ అరెస్టు చెయ్యకపోతే, భారత్ పాకిస్థాన్పై వైమానిక దాడులను ప్రారంభిస్తుందనేది ఆ సందేశం.
డిసెంబరు 19న, ప్రైవేట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, స్ట్రాట్ఫోర్ తన తాజా నివేదికలో, "వాస్తవానికి పాకిస్తాన్లోని లక్ష్యాలపై భారత సైనిక దాడుల ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ముందుకు వెళ్ళేందుకు తగు సంకేతం కోసం వేచి ఉన్నాయి" అని పేర్కొంది. "భారత సైనిక సన్నాహాలు, మునుపటి కేసుల మాదిరిగా కాకుండా, రహస్యంగా జరుగుతాయి" అని కూడా వారు రాశారు. ఉగ్రవాదుల చొరబాట్లను నిరోధించేందుకు భారత సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) పశ్చిమ సెక్టార్తో పాటు తూర్పు సెక్టార్లో హై అలర్ట్ను ప్రకటించింది.[6][7]
డిసెంబరు మధ్యలో భారత యుద్ధ విమానాలు రెండు చోట్ల పాకిస్థాన్ గగనతలంలోకి చొరబడ్డాయని ఆరోపణలు వచ్చాయి.[8] డిసెంబరు 22న, పాకిస్తాన్ వైమానిక దళం, ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండితో సహా పలు నగరాల గగన తలంపై చొరబాట్లను నివారించడానికి యుద్ధకాలపు ఆకాశ గస్తీ (CAP) ప్రారంభించింది.[9][10] పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ మాట్లాడుతూ, "పాకిస్థాన్ రక్షణ దళాలు, సాయుధ బలగాలు ఎటువంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. పాకిస్తాన్కు తనను తాను రక్షించుకునే పూర్తి హక్కు ఉంది". పాకిస్థాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ మాట్లాడుతూ, "పాకిస్తాన్ ఐక్యంగా ఉంది. తనను తాను రక్షించుకోవడానికి ఎవరితోనైనా పోరాడటానికి సిద్ధంగా ఉంది" అన్నాడు.[11] పాక్ రక్షణ మంత్రి అహ్మద్ ముఖ్తార్ చౌదరి, "భారత్, యుద్ధానికి ప్రయత్నించినట్లయితే, పాకిస్తాన్ సాయుధ దళాలకు [పాకిస్తాన్ను] రక్షించే అన్ని శక్తియుక్తులు, హక్కులూ ఉన్నాయి" అని అన్నాడు.[12]
భారతదేశం రాజస్థాన్ సరిహద్దు వెంబడి సైనికులను మోహరించడం ప్రారంభించిందని పాకిస్తాన్ మీడియా ప్రచురించింది. వైమానిక స్థావరాల వద్ద, వాటి చుట్టుపక్కలా భద్రతను కట్టుదిట్టం చేసింది. భారత్-పాకిస్థాన్ సరిహద్దు వెంబడి మరిన్ని రాడార్లను, సత్వర ప్రతిస్పందన బృందాలనూ మోహరించారు. జైసల్మేర్లోని లాఠీ ఫైరింగ్ రేంజ్, బికనీర్లోని మహాసాన్, సూరత్గఢ్, గంగానగర్ వంటి ప్రదేశాలలో భారత బలగాలు క్రమం తప్పకుండా కాల్పుల అభ్యాసాలు జరుపుతున్నాయి అని ఆ కథనాల్లో రాసారు.[13]
డిసెంబరు 23న పాకిస్తాన్లోని అల్ జజీరా కరస్పాండెంట్ కమల్ హైదర్, పాకిస్తాన్ "నేవీ, మెరైన్ ఎయిర్ ఫోర్స్, సైన్యాలు రెడ్ అలర్ట్లో ఉన్నాయి" అని చెప్పాడు. "పాకిస్తాన్ సాయుధ దళాల అధిపతులు, ఛైర్మన్ జాయింట్ చీఫ్లు రావల్పిండిలోని జాయింట్ హెడ్ క్వార్టర్స్లో అత్యవసర సమావేశం జరిపారు" అని కూడా రాశాడు. ఇంకా, "భారత్-పాకిస్తానీ సరిహద్దుకు దగ్గరగా అనేక ప్రదేశాలలో పాకిస్తాన్ వైమానిక దళం ఎగరడం కనిపించింది. ఇది దూకుడు నిఘాగా వర్ణించబడుతోంది. భారతదేశం పాకిస్తాన్లోని ప్రదేశాలపై ముందస్తు దాడులు చేసే ప్రణాళికలు వేస్తోందని నివేదికలు వచ్చిన నేపథ్యంలో ఈ నిఘా నిర్వహిస్తోంది" అని రాసాడు. పాకిస్తాన్ వైమానిక దళ ప్రతినిధి మాట్లాడుతూ "ప్రస్తుత వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని, పాకిస్తాన్ వైమానిక దళం తన నిఘాను పెంచింది" అని చెప్పాడు.[14] పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అష్ఫాక్ పర్వేజ్ కయానీ మాట్లాడుతూ, భారతదేశం ఎలాంటి దాడి చేసినా పాకిస్తాన్ "నిమిషాల్లో" తగు సమాధానం ఇస్తుంది అన్నాడు.[15] అనేక పాకిస్తాన్ నగరాలపై వైమానిక గస్తీని కొనసాగించింది.[16]
భారత వర్గాల సమాచారం ప్రకారం తాలిబాన్లు, దాని అనుబంధ గ్రూపులూ బహిరంగంగా పాకిస్తాన్కు సంఘీభావాన్ని ప్రకటించాయి. నిషేధిత తెహ్రిక్-ఇ-తాలిబాన్, యుద్ధం ప్రారంభమైతే భారతదేశానికి వ్యతిరేకంగా జిహాద్ చేయడానికి "వేలాది మంది సాయుధ మిలిటెంట్లను " పంపుతామని ప్రకటించింది. వందలాది మంది బాంబర్లు ఆత్మాహుతి జాకెట్లు, పేలుడు పదార్థాలతో కూడిన వాహనాలతో సిద్ధంగా ఉన్నారని ప్రకటించింది.[17]
డిసెంబరు 24న, భారత పశ్చిమ ఎయిర్ కమాండ్ అధికారి కమాండింగ్-ఇన్-చీఫ్ PK బార్బోరా మాట్లాడుతూ, "ఐఏఎఫ్, పాకిస్థాన్లో 5,000 లక్ష్యాలను నిర్దేశించుకుంది. అయితే శత్రు లక్ష్యాలను చేధించడానికి మనం నియంత్రణ రేఖను/అంతర్జాతీయ సరిహద్దును దాటాలా లేదా అనేది దేశ రాజకీయ నాయకత్వం నిర్ణయించాలి" అన్నాడు.[18] ఇండియా టుడే ఇలా రాసింది: "భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు రేయింబవళ్ళూ ఎగురుతున్నాయి. గత కొన్ని రోజులుగా సరిహద్దు వెంబడి భారత వైమానిక దళం అసాధారణంగా తీవ్రమైన కార్యకలాపాలు నిర్వహిస్తోంది" [19] అదే రోజు, స్ట్రాట్ఫోర్ "రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం దాని సరిహద్దు గ్రామాల నివాసితులను పునరావాసం కోసం సిద్ధం చేయాలని ఆదేశించింది" అని ధ్రువీకరించింది.[20]
పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ "రక్తపు చివరి చుక్క వరకు దేశాన్ని రక్షిస్తాం", [21] "మా చివరి శ్వాస వరకు దేశాన్ని రక్షిస్తాం" అని అన్నాడు.[22] పాకిస్థాన్, తన సరిహద్దు వద్ద ఉన్న వైమానిక స్థావరాలలో యుద్ధ విమానాలను మోహరించడం ప్రారంభించింది.[23]
అయితే, డిసెంబరు 25న భారతదేశంలో పాలక UPA ప్రభుత్వం, యుద్ధ భయాలను తగ్గించే ప్రయత్నం చేసింది. ‘యుద్ధాన్ని ఎవరూ కోరుకోడం లేదు’ అని భారత ప్రధాని స్పష్టం చేశారు.[24] ఈ సమయంలో పాకిస్తాన్ వైమానిక దళం (PAF) తదుపరి పాత్రను పోషించింది. భారత వైమానిక దళం PAF ఫైటర్ జెట్లు చేస్తున్న సార్టీల ప్రాధాన్యతను తగ్గించి మాట్లాడుతూ, అది వాయు రక్షణ వ్యాయామమే అని పేర్కొంది.[25] అయితే, రాజస్థాన్ సరిహద్దులో సరిహద్దు భద్రతా దళ DIG, ఆర్సి ధ్యాని మాట్లాడుతూ, "గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న పాకిస్తాన్ జిల్లాల్లో చాలా సైనిక కదలికలను గమనించాం, ఇవి సాధారణమైనవి కాదు" అన్నాడు. "పాకిస్తాన్, సరిహద్దు వెంబడి అంతటా మరింత మంది సైనికులను మోహరించింది" అని అన్నాడు.[26] పాకిస్తాన్ సెనేట్ ఛైర్మన్, సెనేటర్ రజా రబ్బానీ, తమ భూభాగంలోకి జరిగే సర్జికల్ స్ట్రైక్ దేన్నైనా యుద్ధ చర్యగా పరిగణించి "పూర్తి శక్తి"తో తిప్పికొడతామనీ,[27] "దేశం లోని ప్రతి అంగుళాన్నీ రక్షించుకుంటాం." అనీ అన్నాడు.[28] "వైమానిక దాడుల ముప్పు నుండి రాజధానిని రక్షించడానికి" భారతదేశం MiG-29లను న్యూఢిల్లీకి సమీపంలో ఉన్న హిండన్ వైమానిక స్థావరానికి తరలించింది. పాకిస్తాన్ నగరమైన మియాన్వాలిలో రాత్రివేళ దీపాలను ఆర్పడం మొదలుపెట్టారు.[29]
పాకిస్తాన్ మోహరింపును కొనసాగించింది. 10వ బ్రిగేడ్ను లాహోర్ శివార్లకూ, 3వ ఆర్మర్డ్ బ్రిగేడ్ను జీలంకూ తరలించింది. 10వ పదాతి దళ విభాగం, 11వ పదాతిదళ విభాగాలను హై అలర్ట్లో ఉంచారు.[30] భారత సైన్యం సరిహద్దు వెంబడి శీఘ్ర ప్రతిచర్య బృందాలను (క్యూఆర్టి) మోహరించింది. ఇది "పంజాబ్లోని కాలువలపై వంతెనలను నిర్మించేందుకు, భారీ తుపాకులను దాటించడానికీ" ఉద్దేశించింది.[31]
డైలీ న్యూస్ అండ్ ఎనాలిసిస్కి చెందిన అమీర్ మీర్, "భారత్తో వివాదం ఏర్పడినప్పుడు అణ్వాయుధాలను ఉపయోగించే మొదటి దేశం తాము కాబోమని, గత నెలలో అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని పాకిస్తాన్ సైనిక నాయకత్వం సూచించింది" అని రాసాడు.[32]
డిసెంబరు 26న, పాకిస్తాన్ సైనికుల సెలవులను రద్దు చేసింది.[33] యాక్టివ్ డ్యూటీకి పిలవడానికి సిద్ధంగా ఉండాలని రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని పాకిస్థాన్ ఆర్మీ అప్రమత్తం చేసింది.[34] డిసెంబరు 28న, పాకిస్తాన్ అన్ని ఆఫీసర్ శిక్షణా కోర్సులను వాయిదా వేసింది.[35] స్నేహపూర్వక దేశాలు, సైనిక భాగస్వాములతో పరిచయాలను సక్రియం చేసింది.[36] "జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి, భారతదేశంతో ఉన్న అంతర్జాతీయ సరిహద్దులో కీలకమైన ప్రాంతాలను రక్షించడానికి" దళాలను మోహరించింది.[37][38] సరిహద్దుకు దగ్గరగా ఉన్న కసూర్, సియాల్కోట్లలో పాకిస్తాన్ 14వ పదాతిదళ విభాగాన్ని మోహరించింది.[39] పాక్ విదేశాంగ మంత్రి ఖురేష్ మాట్లాడుతూ, "యుద్ధం మామీద రుద్దినట్లయితే, మేము ధైర్యంగా, ఆత్మగౌరవం గల దేశంగా దానికి ప్రతిస్పందిస్తాము" అని అన్నారు.[40]
భారత ప్రధాని మన్మోహన్ సింగ్ "భారతదేశానికి అందుబాటులో ఉన్న అన్ని వికల్పాలను చర్చించడానికి" న్యూక్లియర్ కమాండ్ అథారిటీతో రెండవ సమావేశాన్ని నిర్వహించాడు.[41] పాకిస్థాన్కు వెళ్లవద్దని భారత్ తన పౌరులకు సూచించింది.[42] భారత ప్రధాని మన్మోహన్ సింగ్ భారత వైమానిక దళం, సైన్యం, నావికాదళ అధిపతులతో సమావేశమయ్యాడు.[43]
డిసెంబరు 27న, భారతదేశపు అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ, భారతీయ జనతా పార్టీ (BJP), భారత పాకిస్తాన్ల మధ్య అన్ని ప్రయాణాలను నిలిపివేయాలనీ, పాకిస్తాన్ నుండి భారత హైకమిషనర్ను వెనక్కి పిలిపించుకోవాలనీ పిలుపునిచ్చింది.[44]
డిసెంబరు 29న, ప్రమాదవశాత్తూ అణుయుద్ధానికి దారితీసే పరిస్థితులను నివారించేందుకు భారత పాకిస్థాన్ సైన్యాల నాయకులు తమ రెడ్ టెలిఫోన్లో మాట్లాడుకున్నారు.[45] పాకిస్థాన్పై భారత్-అమెరికాల సంయుక్త సైనిక చర్యకు బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చాడు.[46] జాన్ మెక్కెయిన్ మాట్లాడుతూ, "భారతీయులు పాకిస్తాన్పై ఒక రకమైన దాడి చేసే పరిస్థితి దాపుల ఉన్నారు" అన్నాడు.[4]
డిసెంబరు 30న, పాకిస్తాన్ మీడియా ఇలా పేర్కొంది: "భారత సైన్యంలోని అన్ని శాఖల సర్వీస్ చీఫ్లు 'పూర్తి సంసిద్ధతను' సాధించడానికి దేశంలోనే ఉండాలని చెప్పారు. అభ్యాసాలలో ఉన్న అన్ని యూనిట్లు నిరవధికంగా వాటిని కొనసాగించాలనీ, తమకు పరికరాలు లేదా మందుగుండు సామాగ్రి ఏమేం అవసరమో సూచించాలనీ ఆదేశించబడింది" [47] అయితే, భారతీయ లేదా అంతర్జాతీయ మీడియా ఈ విధంగా ఎక్కడా రాయలేదు.
పాకిస్థాన్ సైన్యం సైనికుల సెలవులను రద్దు చేసింది. వాయుసేన దళాలను ఫ్రంట్ లైన్ స్థావరాలలో మోహరించారు.[23] లాహోర్లో 60,000 మంది సైనికుల దళాన్ని మోహరించారు.[48] పాకిస్తాన్ 3వ ఆర్మర్డ్ బ్రిగేడ్ను జీలం లోను, 10వ పదాతిదళ బ్రిగేడ్ను 5,000 మంది సైనికులతో లాహోర్ లోనూ మోహరించారు.[30] 10వ డివిజన్ను ఇచ్చోగుల్లో, 11వ డివిజన్ను తిల్లాలో మోహరించారు. కాశ్మీర్లో, సరిహద్దులోని జమ్మూ సెక్టార్లో పాకిస్థాన్ ఆర్మీ కాంబాట్ బ్రిగేడ్లను మోహరించారు.[37] 20,000 మంది సైనికులు గల 14వ డివిజన్ను కసూర్, సియాల్కోట్లలో మోహరించారు.[49] పాకిస్తాన్ నావికాసేన పంజాబ్ దళం, పాకిస్తాన్ మెరైన్స్ దళాలు భూ బలగాలకు రవాణాపరంగా, సైనికపరంగా మద్దతు నిచ్చాయి.[49] భారత యుద్ధనౌకలు కరాచీ, బలూచిస్తాన్ తీర ప్రాంతాలకు చేరుకోకుండా వాటిపై పాకిస్తాన్ నావికాదళపు ఉపరితల నౌకాదళం, PNS హంజా, PNS ఖలీద్ జలాంతర్గాములతో సహా గణనీయమైన సంఖ్యలో యూనిట్ లను నిఘా ఉంచింది.[49]
భారతదేశం సరిహద్దు గస్తీ ఏజెన్సీ అయిన సరిహద్దు భద్రతా దళాన్ని హై అలర్ట్లో ఉంచింది.[50] న్యూ ఢిల్లీకి రక్షణగా మిగ్-29లను హిండన్ వైమానిక స్థావరానికి పంపారు. ఢిల్లీపై వైమానిక దాడికి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల ఫలితంగా ఈ చర్య తీసుకున్నట్లుగా IAF వర్గాలు తరువాత పేర్కొన్నాయి. భారత నావికాదళం ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ రణ్వీర్తో సహా ఆరు యుద్ధనౌకలను పశ్చిమ తీరానికి తరలించింది.[51]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.