సినీ నటి From Wikipedia, the free encyclopedia
కాంచనమాల (మార్చి 5, 1917 - జనవరి 24, 1981) తొలితరం నటీమణులలో ఒకరు. ఆంధ్రా ప్యారిస్గా పేరుపొందిన తెనాలి పట్టణం ఆవిడ స్వస్థలం. ఆ కాలంలో బాగా పేరు తెచ్చుకున్న నటీమణులలో ఈవిడా ఒకరు.[1]
కాంచనమాల | |
---|---|
జననం | కాంచనమాల మార్చి 5, 1917 కూచిపూడి (అమృతలూరు), గుంటూరు జిల్లా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం |
మరణం | జనవరి 24,1981 మద్రాసు, తమిళనాడు |
మరణ కారణం | సహజమరణం |
నివాస ప్రాంతం | మద్రాసు, తెనాలి |
వృత్తి | నటి |
ఉద్యోగం | జెమిని స్టూడియోస్ |
మతం | హిందూ మతం |
భార్య / భర్త | గాలి వెంకయ్య |
కాంచనమాల మార్చి 5, 1917లో గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కూచిపూడి (అమృతలూరు)లో జన్మించారు.
కాంచనమాల తెనాలికి చెందిన గాలి వెంకయ్య అనే యువకుణ్ణి ప్రేమించి పెళ్ళాడారు.
చిన్నాన్న దగ్గర సంగీతం నేర్చుకున్న కాంచనమాల ఓ చిన్న పాత్ర ద్వారా సినిమాలో ప్రవేశించారు. కాంచనమాల రూపలావణ్యం, విశాలనేత్రాలు, అందమైన ముఖం చూసి సి. పుల్లయ్య ఆమె చేత వై.వి.రావు నిర్మించిన కృష్ణ తులాభారం (1935) లో మిత్రవింద వేషం వేయించారు.[2] ఆ సినిమాలో తన అందంతో అందరి చూపులని తన వైపుకి తిప్పుకున్నారు ఈమె. ఆ తర్వాత చిత్రం వీరాభిమన్యు (1936) లోనే ఆమె కథానయిక స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుసగా విప్రనారాయణ (1937), మాలపిల్ల (1938), వందేమాతరం (1939),మళ్ళీ పెళ్ళి (1939), ఇల్లాలు (1940), మైరావణ (1940), బాలనాగమ్మ (1942) వంటి సినిమాలలో కథానాయిక పాత్ర పోషించారు. గృహలక్ష్మి (1938) లో మాత్రం వాంప్ పాత్ర పోషించారు. విప్రనారాయణలో దేవదేవిగా ఆమె అందం, అభినయం అప్పటి ప్రేక్షకులకు సూదంటు రాయిలా గ్రుచ్చుకుంది.
ఆ తర్వాత మాలపిల్లలో టైటిల్ రోల్ పోషించి, మాల పిల్ల ఇంత అందంగా ఉంటే ఎవరు పెళ్ళి చేసుకోరు అని ఎందరి చేతో అనిపించుకున్నారు కాంచనమాల. కులాంతర వివాహాల ఉద్యమాలు జరుగుతున్న ఆ కాలంలో ఆ సినిమా రావడం నిజంగా అభినందనీయం. ఆ సినిమా రెండవభాగంలో ఆమె విద్యావంతురాలిగా కన్పిస్తారు. ఒక సీన్లో ఆమె స్లీవ్ లెస్ జాకెట్ ధరించి చిరునవ్వుతో కాఫీ తాగే స్టిల్ ఎన్నో కాలెండర్ల మీద అచ్చయింది. అలా తొలితరం గ్లామర్ క్వీన్ గా వెలుగొందారు ఆమె. అప్పట్లోనే కాంచన మాల చీరలు, జాకెట్లు, గాజులు బాగా అమ్ముడయ్యేవి. ఆ సమయంలోనే గృహలక్ష్మిలో వ్యభిచారిణి పాత్ర ధరించిన ఈమె విమర్శకుల మన్ననలు కూడా అందుకుంది. ఆ తర్వాత వచ్చిన వందేమాతరం సినిమాలో ఈమె చిత్తూరు నాగయ్య గారి సరసన నటించారు. అది నాగయ్యగారి రెండవ సినిమా. ఈ చిత్రం ద్వారా నాగయ్యగారు, కాంచనమాల గారు ఇద్దరూ పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే వచ్చిన మళ్ళీపెళ్ళి వితంతు వివాహాన్ని ప్రబోధించే చిత్రం.
ఆమె నటించిన ఇల్లాలు సినిమా విడుదల అయి మునుపటి సినిమాలంత విజయం సాధించలేకపోయినా ఆంధ్రపత్రిక ఫిలింబ్యాలెట్ లో ఉత్తమ నటిగా ఇల్లాలు చిత్రం ద్వారా కాంచనమాల ఎంపిక అయ్యారు. ఆ సమయంలో విడుదల ఐన మైరావణ కూడా అన్ని తరగతుల ప్రజాదరణను అందుకోలేకపోయింది. ఆ తర్వాత జెమినీ వాసన్ గారి నిర్మాణ సారథ్యంలో బాలనాగమ్మ రూపుదిద్దుకుంది. ఆ సమయంలో వారి చిత్రాలలోనే నటిస్తానని కాంచన మాల అగ్రిమెంట్ వ్రాసి ఇచ్చారు. అదే ఆమె చేసిన పెద్ద తప్పయింది. ఆ సమయానికే ఊంఫ్ గరల్, ఆంధ్రా గ్రేటా గార్భో అని పేరు పొందిన కాంచనమాల దగ్గరకు ఎన్నో మంచి ప్రాజెక్టులు రాసాగాయి. కానీ అగ్రిమెంట్ వలన ఆమె ఆ చిత్రాలలో నటించడానికి వీలు లేక పోయింది. ఆ సమయంలో వాసన్ గారు కూడా కొత్త ప్రాజెక్టులు ఏమీ నిర్మించకపోవడంతో కాంచనమాల వాసన్ గారితో అగ్రిమెంట్ రద్దు చేయమని కోరగా ఆయన వీల్లేదు అని చెప్పడంతో మాట మాట పెరిగి "నీ దిక్కున్న చోట చెప్పుకో నీవు కోటీశ్వరుడవి ఐతే నా కేంటి? "అని అన్నారు కాంచనమాల. ఈ మాటలన్నీ జెమినీ వాసన్ ఆమెకు తెలియకుండా గదిలో టేప్ రికార్డర్ లో రికార్డ్ చేసి ఆమెకే వినిపించాడు. ఈ టేపుతో కోర్టుకెక్కి నీ అంతు చూస్తానన్నారు వాసన్. అది ఆమెకు ఊహించని షాక్. ఈ సమయం లోనే బాల నాగమ్మ విడుదల అయి అఖండ విజయం సాధించింది. దాని వలన వచ్చిన లాభాలతో ముందు నుండి వాసన్ కు వున్న అప్పులన్నీ తీరిపోయాయి. కాంచన మాల నటనకు ఈ సినిమా గీటురాయి. కానీ ఆ సినిమానే హీరోయిన్ గా ఆమెకు ఆఖరి చిత్రం అయినది. ఆంధ్రుల కళ్ళన్నీ తన వైపుకి తిప్పుకున్న ఆమె కళ్లు ఆ షాక్ తో శూన్యం లోనికి చూడటం మొదలుపెట్టాయి. హిందీ చిత్ర సీమలో అవకాశాలు వచ్చిన తెలుగు మీద మమకారంతో తిరస్కరించిన ఆమెకు ఇలా జరిగింది. ఆమె బ్రతికి ఉండగానే తెలుగు చలన చిత్ర జగతి ఓ మహానటిని కోల్పోయింది. ఆ స్థితిలో ఆమె ఉండగానే ఆమె భర్త గాలి వెంకయ్య గారు క్షయ వ్యాధి తో మరణించారు. దాంతో ఆమె మరి కోలుకునే ప్రయత్నం కూడా చేయలేదు.
కాంచనమాల స్నెహితురాలు , నటి ఐన లక్ష్మీరాజ్యం 1963 లో నర్తనశాల చిత్రం నిర్మించారు. లక్ష్మీరాజ్యం బలవంతంతో ఓ చిన్న పాత్రను పోషించారు కాంచనమాల. ఆ చిత్రంలో ఆమె నటిస్తున్నారనే వార్తలు రాగానే ఎంతో మంది కాంచనమాల గారిని చూడటానికి వస్తే ఆమె ఎవ్వరినీ గుర్తు పట్టకపోగా మీరెవరూ నాకు తెలియదు అని చెప్పడంతో వారందరూ నిరాశతో వెనుదిరిగారు. దాదాపు 20 ఏళ్ళ తర్వాత మేకప్ వేసుకున్నా కాంచనమాల గారి లో ఏ మాత్రం ఆనందం కాన రాలేదు.
1940 లో ఆంధ్రా పారిస్ గా పేరు గాంచిన ఆమె స్వంత ఊరు తెనాలిలో "శాంతి భవనం" అనె ఓ భవంతిని ఎంతో ఇష్టంతో నిర్మించుకున్నరు కాంచనమాల. ఆమె ఆ ఇంట్లో నివసించినప్పుడు ఆ పక్కింటి వారికి కూడా ఆమె ఎవరో తెలియకుండా గడిపారు. నటనలో ఆమె నుండి స్ఫూర్తి పొందిన వారిలో జి.వరలక్ష్మి ఒకరు. తొలితరం నటీమణుల్లో ఒకరైన కృష్ణవేణి గారు తీసిన దాంపత్యం సినిమా సమయంలో కాంచనమాల గారిపై ఉన్న అభిమానంతో ఆమె ఛాయా చిత్రాన్ని సెట్ లో ఉంచారు. వడ్ల బస్తా కేవలం 3 రూపాయలు ఉన్న రోజుల్లోనే ఆమె 10000/- పారితోషికంగా తీసుకునేవారు. 1975 లో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఘన సత్కారం పొందినా ఈమె కళ్ళు శూన్యాన్ని తప్ప మరోవైపు చూడలేదుట. విప్లవ కవిగా పేరు పొందిన శ్రీశ్రీ కూడా అభిమానంతో అందమైన కాంచనమాల గారిపై 2 సార్లు కవితలల్లారు.
కాంచన మాల 1981 జనవరి 24 న మద్రాసులో ఈ లోకాన్ని వదిలి పరలోకాన్ని చేరారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.