హోలోకాస్ట్
యూదులపై నాజీ జర్మనీ జరిపిన మారణహోమం / From Wikipedia, the free encyclopedia
రెండవ ప్రపంచ యుద్ధంలో ఐరోపాలో యూదులపై జరిపిన మారణహోమాన్ని హోలోకాస్ట్ అంటారు. 1941, 1945 మధ్య నాజీ జర్మనీ, దానికి సహకరించిన వివిధ దేశాల ప్రభుత్వాలు కలిసి జర్మనీ-ఆక్రమిత ఐరోపా అంతటా దాదాపు 60 లక్షల మంది యూదులను ఒక క్రమపద్ధతిలో హత్య చేశారు. ఇది ఐరోపాలో అప్పుడున్న యూదు జనాభాలో మూడింట రెండు వంతులు. హత్యలు ప్రధానంగా ఆక్రమిత పోలాండ్లోని ఆష్విట్జ్-బిర్కెనౌ, ట్రెబ్లింకా, బెల్జెక్, సోబిబోర్, చెల్మ్నో వంటి నిర్మూలన శిబిరాల్లో, సామూహిక కాల్పులు జరపడం, విషవాయువు ప్రయోగించడం ద్వారా జరిగాయి.
హోలోకాస్ట్ | |
---|---|
Part of రెండవ ప్రపంచ యుద్ధం | |
ప్రదేశం | ఐరోపా. ముఖ్యంగా జర్మనీ ఆక్రమిత పోలండు,సోవియట్ యూనియన్ |
తేదీ | 1941–1945[1] |
దాడి రకం | మారణహోమం, సామూహిక కాల్చివేత, విష వాయువు |
మరణాలు | దాదాపు 60 లక్షల యూదులు |
నేరస్తులు | నాజీ జర్మనీ, దాని సహకుట్రదారులు, మిత్ర పక్షాలు |
నాజీలు జాత్యహంకార రాజకీయాలను, తూర్పు ఐరోపాలో జర్మన్ వలసరాజ్యాలనూ ఆధారంగా చేసుకుని తమ భావజాలాన్ని అభివృద్ధి చేశారు. 1933 ప్రారంభంలో వారు జర్మనీలో అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జర్మన్ యూదులందరినీ బలవంతంగా వలస పంపించే ప్రయత్నంలో భాగంగా నాజీ పాలనా వ్యవస్థ, యూదు వ్యతిరేక చట్టాలు చేసి 1938 నవంబరులో దేశవ్యాప్తంగా హింస జరిపింది. 1939 సెప్టెంబరులో జర్మనీ పోలండ్ను ఆక్రమించుకున్నాక, అక్కడి అధికారులు యూదులను వేరు చేయడానికి ఘెట్టోలను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. 1941 జూన్ లో సోవియట్ యూనియన్ను ఆక్రమించుకున్నాక, ఆ దేశంలో దాదాపు 15 నుండి 20 లక్షల మంది యూదులను జర్మనీ దళాలు, వారి స్థానిక సహకారులూ కాల్చి చంపారు.
తర్వాత 1941 లో లేదా 1942 ప్రారంభంలో జర్మనీ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారులు ఐరోపాలోని యూదులందరినీ హత్య చేయాలని నిర్ణయించారు. బాధితులను రైళ్ళ ద్వారా నిర్మూలన శిబిరాలకు పంపారు. ప్రయాణంలోనే చనిపోకుండా బయటపడినవారిని విషవాయువుతో చంపారు. ఇతర యూదులను బలవంతపు కార్మిక శిబిరాల్లో పని చేయించడం కొనసాగించారు. అక్కడ చాలామంది ఆకలితోనో నీరసం, బలహీనలతల తోనో మరణించారు. చాలా మంది యూదులు తప్పించుకున్నప్పటికీ, తగినంత డబ్బు లేకపోవడం, దొరికిపోయే అవకాశం వంటి కారణాల వల్ల అజ్ఞాతంలో జీవించడం చాలా కష్టమయ్యేది. హత్యకు గురైన యూదుల ఆస్తి, గృహాలు, ఉద్యోగాలను జర్మన్ ఆక్రమణదారులకు, ఇతర యూదేతరులకూ పంపిణీ చేసారు. హోలోకాస్ట్ బాధితుల్లో ఎక్కువ మంది 1942 లో మరణించినప్పటికీ, 1945 మేలో యుద్ధం ముగిసే వరకు హత్యలు, తక్కువ స్థాయిలో నైనా, కొనసాగుతూనే ఉన్నాయి.
కొన్ని ఐరోపా దేశాలలో యుద్ధ సంబంధ పౌర మరణాలలో యూదులే మెజారిటీగా ఉన్నప్పటికీ, నాజీ ప్రభుత్వం, దాని మిత్రదేశాలు లక్షలాది మంది యూదేతరులను కూడా చంపాయి. చావు నుండి తప్పించుకున్న యూదులు చాలా మంది యుద్ధం తర్వాత ఐరోపా నుండి వలస వెళ్ళారు. కొంతమంది హోలోకాస్ట్ నేరస్థులు నేర విచారణలను ఎదుర్కొన్నారు. బిలియన్ల డాలర్లు నష్టపరిహారంగా చెల్లించబడ్డాయి. ఎంతైనా, యూదులకు జరిగిన నష్టాల కంటే ఇవి తక్కువే. మ్యూజియంలు, స్మారక చిహ్నాలు, సంస్కృతిలో హోలోకాస్ట్ జ్ఞాపకాలు భద్రమయ్యాయి. మానవ క్రూరత్వానికి పరాకాష్ఠగా ఇది, పాశ్చాత్య చారిత్రక స్పృహకు కేంద్రంగా మారింది.
ఈ మారణహోమాన్ని ఒకప్పుడు "జెవిష్ హోలోకాస్ట్" అని అనేవారు. ఆ తరువాత జెవిష్ అనే విశేషణాన్ని తీసివేసి హోలోకాస్ట్ అని మాత్రమే పిలుస్తున్నారు. హీబ్రూ భాషలో దీన్ని షోవా అంటారు.