హిందూధర్మం
హిందూధర్మం భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. / From Wikipedia, the free encyclopedia
హిందూధర్మం భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. హిందూ ధర్మం అతి పురాతన సంస్కృతి. [note 1] దీనినే 'సనాతన ధర్మం' అని కూడా తరచు వ్యవహరించడం జరుగుతుంది.[6] ధర్మం అనగా ఆచరణీయ కార్యం. మతమనగా అభిప్రాయం . హిందూ అనే పదమును పార్శీలు మొదట వాడేవారు, హిందు అనే పదానికి పార్శీ భాషలో సింధు అని అర్థం. సింధూనది ఒడ్డున నివసించే వారిని అలా పిలిచేవారు కాని ఇప్పుడు వేదాలు, వాటికి సంబంధించిన మతాలను ఆచరించే వారినే హిందువు అని పిలుస్తున్నారు.[7] హిందూమతం, దాని మూలాలు వేదకాలపు నాగరికతకు సంబంధించినవి.[8] హిందూమతం ప్రపంచంలోనే అన్నింటికన్నా ప్రాచీనమైంది.[9][10] ఈ జీవన విధానాన్ని అనగా హిందూధర్మాన్ని ఏ ఒక్కరో కనుగొన్నట్టు ఆధారాలు లేవు.[11][12] జనసంఖ్య ఆధారంగా ఈ జీవనవిధానాన్ని పాటించే వారు ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉన్నారు. సుమారు ఒక బిలియన్ హిందూ జనాభాలో 905 మిలియన్లు భారతదేశం, నేపాల్ లోనే నివసిస్తున్నారు.[13] హిందువులు ప్రధానంగా ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, మారిషస్, ఫిజి, సురినాం, గయానా,ట్రినిడాడ్, టుబాగో, అమెరికా, రష్యా, చైనా ముఖ్యమైనవి.
హిందువుల వేద సంపద అమూల్యమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న వేదాలను చెప్పబడిన వాటిగా, గుర్తుంచుకోబడిన వాటిగా విభజించవచ్చు. ఈ వేదాలు వేదాంత శాస్త్రం, తత్వ శాస్త్రం, పురాణాలు, ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన లోతైన జ్ఞానాన్ని విశదీకరిస్తాయి. సాంప్రదాయం ప్రకారం వేదాలు, ఉపనిషత్తులు అతి పురాతనమైనవి, ముఖ్యమైనవి, ప్రామాణికమైనవి. ఇంకా తంత్రాలు, ఆగమాలు, పురాణాలు, మహా కావ్యాలైనటువంటి రామాయణం, మహాభారతం కూడా ముఖ్యమైనవే. భగవద్గీత అన్ని వేదాల సారాంశముగా భావించబడుతోంది.[14]