సోమనాథ్
From Wikipedia, the free encyclopedia
సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రాలోని వెరావల్ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్న హిందూ పుణ్య క్షేత్రం. సోమనాధ్ దేవాలయం పాలి మార్కెట్ లో ఉంది. ఇది అతి ప్రాచీనమైంది, పురాణప్రాశస్త్యం కలది. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని "ప్రభాస తీర్థం" అని కూడా పిలుస్తారు[1][2][3].
సోమనాథ్ దేవాలయం સોમનાથ મંદિર | |
---|---|
భౌగోళికాంశాలు: | 20°53′16.9″N 70°24′5.0″E |
పేరు | |
స్థానిక పేరు: | సోమనాథ్ మందిరం |
దేవనాగరి: | सोमनाथ मन्दिर |
స్థానం | |
దేశం: | భారత దేశము |
రాష్ట్రం: | గుజరాత్ |
జిల్లా: | గిర్ సోమనాథ్ |
ప్రదేశం: | వెరవల్ |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | సోమనాథుడు (శివుడు) |
ప్రధాన పండుగలు: | మహాశివరాత్రి |
నిర్మాణ శైలి: | Mandir,చాళుక్యులు |
చరిత్ర | |
కట్టిన తేదీ: (ప్రస్తుత నిర్మాణం) | 1951 (ప్రస్తుత కట్టడము) |
నిర్మాత: | సర్దార్ వల్లభాయి పటేల్ (ప్రస్తుతమున్న కట్టడం) |
దేవాలయ బోర్డు: | శ్రీ సోమనాథ ట్రష్టు, గుజరాత్ |
వెబ్సైటు: | somnath.org somnath.org] |
అరేబియా సముద్రతీరాన వెలసిన పుణ్యక్షేత్రం. సముద్రపు అలల తాకిడిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున్న బండరాళ్ళతో నిర్మించిన మట్టం మీద రూపుదిద్దుకుంది ఈ ఆలయం. ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తుండి, ఓం కారంతో అమర్చివుంటుంది. ఈ ఆలయానికున్న చరిత్ర చెప్పనలవికాదు. చారిత్రక ఆధారాలద్వారా ఇక్కడ నిర్మించిన మొదటి ఆలయం 1వ శతాబ్ధానికి చెందినది. ఇది ఒకనాడు శిథిలమైపోగా తిరిగి క్రీస్తు.శ. 649లో అదే శిథిలాల మీద రెండవ ఆలయ నిర్మాణం జరిగింది. ఆ తరువాత క్రీస్తు. శ. 722లో అరబ్బులు సింధు ప్రాంతంలో బలపడి, భారతదేశం మీద దృష్టి సారించారు. అప్పటి గవర్నరుగా ఉన్న జునాయద్ ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలైన మార్వార్, బ్రోచ్, ఉజ్జయినీ, గుజరాత్ మొదలైన వాటిమీద యుద్ధానికి బయలుదేరారు. ఈ విధంగా జరిగిన దాడుల్లో రెండవ సారి నిర్మించిన సోమనాథ దేవాలయం ధ్వంసమయ్యింది.
ఆ తరువాత చాళుక్యుల కాలంలో దీనిని పునర్నిమించారు. వారి ఏలుబడిలో ప్రభాస నగరం మంచి ఓడరేవు కేంద్రంగా భాసిల్లడంతో, కనౌజ్ పాలకులైన ప్రతీహారుల కాలంలో ఈ క్షేత్రం కాశీతో సమానంగా విలసిల్లింది. ఆ కాలంలో ఇక్కడ వున్న అపార ధనరాసులే దండయాత్రలకి కారణాలని చెప్పవచ్చు. ఇదే కోవలో మాండలీకుల పాలనలో ఉండగా 6-1-1026న మహమ్మద్ ఘజనీ దండెత్తడం జరిగింది. ఈ పోరులో 50 వేలమంది నేలకూలారు. యుద్ధం మొదలైన ఏడు రోజులకి మాండలీకులు ఇక ఘజనీతో నిలబడలేక రాజ్యాన్ని విడిచి పారిపోయారు. ఈ యుద్ధంలో హమీర్గోపాల్ అనే రాజకుమారుడు శత్రుసేనలతో తలబడి ఎందరినో మట్టికరిపించాడు. ఈ రాజ్యాన్ని రక్షించడంలో తన ప్రాణాలు కోల్పోయాడు. అందుకు చిహ్నంగా ఇక్కడొక వీరశిలని నిర్మించారు. ఈ యుద్ధంలో విజయం సాధించిన ఘజనీ పోమనాథ్ ఆలయ గర్భగుడిలో ప్రవేశించి శివలింగాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం సాధ్యపడక ఆలయ అర్చకుల్ని హింసించి, ఆలయాన్ని ధ్వంసం చేసి పోయాడు. అ సమయంలో పటాన్ ప్రభువైన పరమదేవ్, ఈ మూకలపై విరుచుకు పడ్డాడు. ఆతని దాటికి తట్టుకోలేక ఘజనీ సేనలు పారిపోయాయి. ఆ తరువాత 12-13 శతాబ్దంలో తిరిగి ఆలయ నిర్మాణం చేసాడు. ఇది నాల్గవ సారి జరిగిన ఆలయ నిర్మాణం. కాలగమనంలో ఇదికూడా శిథిలావస్థకు చేరుకోగా 1114 సంవత్సరంలో కుమారపాలుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని తన ఏలుబడిలోకి తీసుకుని, ఈ ఆలయాన్నీ, పట్టణాన్నీ పూర్తిగా పునరుద్ధరించాడు. ఆ కాలంలోనే అర్చకులకి వసతి గృహాలు, దేవాలయానికి బంగారు కలశాలు, ముఖమండపంతో శోభిల్లజేసాడు.
ఇక 1296లో అల్లావుద్దీన్ ఖిల్జీ, తన మామని చంపి, రాజ్యవిస్తీర్ణ చేసుకునే నేపథ్యంలో దండయాత్రలు సాగించాడు. దారిపొడవునా ఎంతో బీభత్సాన్ని సృష్టించుకుంటూ సాగాడు. అలా బయలుదేరినవాడు 1299లో సామనాథ్ మీద పడి, ఉలుంఖాన్ అనే సేనాని శివలింగాన్ని ముక్కలు ముక్కలుగా బద్దలుకొట్టి, ఆ శకలాల్ని ఖిల్జీకి కానుకగా సమర్పించాడు. ఆ తరువాత 1325-1331 ప్రాంతంలో జునాఘడ్ రాజకుమారుడు తిరిగి ఇక్కడ లింగప్రతిష్ఠ చేసాడు. ఆ తరువాతి కాలంలో 1459లో మహమ్మద్ బేగ్దా ఇక్కడున్న శివలింగాన్ని తీసివేసి, ఈ మందిరాన్ని మసీదుగా మార్చివేసాడు. ఆ తరువాత అక్భర్ పరమతసహనం కలిగివుండటం వల్ల ఇక్కడ ఏ విధమైన గొడవలూ లేకుండా కొంతకాలం ప్రశాంతత నెలకొంది. ఔరంగజేబు కాలంలో 1783లో ఇండోర్ మహారాణి అహల్యాభాయి సోమనాథ్ మందిరాన్ని పునర్నిర్మించడం జరిగింది. అయితే లింగప్రతిష్ఠ భూగర్భంలో చేసి శత్రువుల బారిన పడకుండా ఉండే ఏర్పాట్లు గావించింది. నాటినుండి తిరిగి కాల ప్రవాహంలో శిథిలావస్థకు చేరుకున్న ఈ పురాతన క్షేత్రాన్ని స్వాతంత్య్రం వచ్చిన తరువాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు 11-5-1951న లింగప్రతిష్ఠ గావించి పునర్నిర్మాణ కార్యక్రమాలు సాగించారు. ఈ దేవాలయానికి ముందు భాగంలో నవనగర్ మహారాణి భర్త దిగ్విజయసింగ్ జ్ఞాపకార్థం నిర్మించింది. దీనిని 19-5-1970 సంవత్సరంలో శ్రీ సత్యసాయిబాబా ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు అన్ని వసతులతోటీ, అన్ని దేశాలవారినీ ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక భావతరంగాలను వెదజల్లుతోంది.