భారతీయ కార్యకర్త, గాంధేయవాది, ఉద్యమకారుడు, పర్యావరణవేత్త. అతను చిప్కో ఉద్యమానికి నాయకత్వం వహి From Wikipedia, the free encyclopedia
సుందర్లాల్ బహుగుణ (1927 జనవరి 9 - 2021 మే 21) [2] గాంధేయవాది, ఉద్యమకారుడు, పర్యావరణవేత్త. అతను చిప్కో ఉద్యమానికి నాయకత్వం వహించాడు. చెట్టు, పర్యావరణం, మానవ సమాజం అంటూ అందరికీ అర్థమయ్యే రీతిలో చిప్కో ఉద్యమాన్ని చేపట్టాడు. ఈ ఉద్యమ ఆలోచన అతని భార్యకు వచ్చింది. దీనిని అతను కార్యరూపంలో చేపట్టాడు. హిమాలయాలలో అడవుల సంరక్షణ కోసం పోరాడాడు. మొదట 1970 లలో చిప్కో ఉద్యమంలో సభ్యుడిగా, తరువాత 1980 ల నుండి 2004 ప్రారంభం వరకు తెహ్రీ ఆనకట్ట వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించాడు.[3] అతను భారతదేశ ప్రారంభ పర్యావరణవేత్తలలో ఒకడు. [4] తరువాత అతను చిప్కో ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రజలతో కలసి పెద్ద ఆనకట్టలకు వ్యతిరేకంగా పర్యావరణ సమస్యలపై ఉద్యమాలను చేపట్టడం ప్రారంభించాడు. వృక్షాల కోసమే కాకుండా, అంతరించిపోతున్న జంతు, పక్షి జాతుల పరిరక్షణ కోసం కూడా పరితపించాడాయన.[5]
సుందర్లాల్ బహుగుణ | |
---|---|
జననం | మరోడా గ్రామం, టెహ్రి గర్వాల్, ఉత్తరాఖండ్ [1] | 1927 జనవరి 9
మరణం | 2021 మే 21 94) | (వయసు
వృత్తి | ఉద్యమకారుడు, గాంధేయవాది, పర్యావరణ పరిరక్షకుడు |
జీవిత భాగస్వామి | విమలా బహుగుణ |
పిల్లలు | 3 |
సుందర్లాల్ బహుగుణ 1927 జనవరి 9 న ఉత్తరాఖండ్ లోని తెహ్రీ సమీపంలో ఉన్న మరోడా గ్రామంలో జన్మించాడు. కోల్కతాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో అతను మాట్లాడుతూ, తన పూర్వీకులు బంధ్యోపాధ్యాయ అనే ఇంటిపేరును కలిగి ఉన్నారనీ, సుమారు 800 సంవత్సరాల క్రితం బెంగాల్ నుండి తెహ్రీకి వలస వచ్చారనీ తెలిపాడు.[6] ప్రారంభంలో, అతను అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాడు. తరువాత 1965 నుండి 1970 వరకు తన మద్యపాన వ్యతిరేక ఉద్యమాన్ని గిరిజన మహిళలతో కలసి చేపట్టాడు. అతను తన పదమూడేళ్ళ వయసులో, అహింసా సందేశాన్ని వ్యాప్తి చేసే జాతీయవాది అయిన శ్రీ దేవ్ సుమన్ మార్గదర్శకత్వంలో సామాజిక కార్యకలాపాలను ప్రారంభించాడు. [7] అతను భారత స్వాతంత్ర్య సమయంలో ఉత్తర ప్రదేశ్ (భారతదేశం) కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు.[8] బహుగుణ 1947 కి ముందు వలసరాజ్యాల పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించాడు.[9] అతను తన జీవితంలో గాంధేయ సూత్రాలను అవలంబించాడు. అతను వివాహానంతరం గ్రామీణ ప్రజల మధ్య నివసించాలనీ, గ్రామంలో ఆశ్రమం ఏర్పాటు చేయాలనే షరతుతో విమ్లాను వివాహం చేసుకున్నాడు. గాంధీ స్ఫూర్తితో, హిమాలయ అడవులు, కొండల గుండా 4,700 కిలోమీటర్లకు పైగా కాలినడకన ప్రయాణించి, హిమాలయాల దుర్భలమైన పర్యావరణ వ్యవస్థపై మెగా అభివృద్ధి ప్రాజెక్టులు చేసిన నష్టాన్ని, తరువాత గ్రామాల్లో సామాజిక జీవితం క్షీణించడాన్ని గమనించాడు.
చెట్లు, అటవీ ప్రాంతాలను అటవీ కాంట్రాక్టర్లు కొట్టివేయకుండా కాపాడే ప్రయత్నంలో చిప్కో ఉద్యమం 1974 మార్చి 26 న ఉత్తరప్రదేశ్లో ఆకస్మికంగా ప్రారంభమైంది. హిందీలో, " చిప్కో " అంటే కౌగలింత లేదా ఆలింగనం అని అర్ధం. చెట్లను కొట్టివేస్తున్నప్పుడు ప్రజలు చెట్లకు అంటుకోవడం ప్రారంభించారు. ఈ ఉద్యమం మనుషుల్ని కౌగలించుకోవడానికి కాదు. చెట్లని కౌగలించుకోవడానికి. చెట్లని నరకనివ్వకుండా కాపాడుకోవడానికి, శాంతియుతంగా చేపట్టిన మహత్తర ఉద్యమమే చిప్కో ఉద్యమం.
కర్ణ ప్రయాగ దగ్గర అడవుల్లో చెట్లను కొట్టివేసి 'పైన్' చెట్లను పెంచుదామని ప్రభుత్వ అధికారులు ప్రయత్నించినపుడు అక్కడి ప్రజలతో కలిపి విజయవంతంగా నిరోధించాడు. ఇలా బహుగుణ నేతృత్వంలో చిప్కో ఉద్యమం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అంతటా వ్యాపించింది. గాంధేయ సత్యాగ్రహ విధానాల్లోనే నడిపినందున ఈ ఉద్యమాన్ని 'అడవి సత్యాగ్రహం' అని పిలిచేవారు. గిరిజనులు అడవులను రక్షించుకోవాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం మొదలైంది. మొదట చెట్లను రక్షించే ఉద్యమంగా, తర్వాత ఆర్థిక ఉద్యమంగా మారి చివరకు పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది.
చిప్కో ఉద్యమం తరువాత కర్ణాటకలోని అప్పీకో ఉద్యమానికి ప్రేరణనిచ్చింది. చిప్కో ఉద్యమం, పర్యావరణ పరిరక్షణకు అతడు చేసిన కృషిలో ఒకటిగా నిలిచింది. ఈ ఉద్యమ సమయంలో అతను "పర్యావరణ శాస్త్రం శాశ్వత ఆర్థిక వ్యవస్థ" అనే నినాదాన్ని సృష్టించాడు. 1981 నుండి 1983 వరకు హిమాలయాల గుండా అతడు చేపట్టిన 5,000 కిలోమీటర్ల దూరపు పాదయాత్ర [9] ద్వారా సుందర్లాల్ బహుగుణ ఈ ఉద్యమానికి ప్రాముఖ్యత కల్పించాడు. గ్రామం నుండి గ్రామానికి ప్రయాణించి, ఉద్యమానికి ప్రజల మద్దతు కూడగట్టాడు. అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ తనను కలిసేందుకు అతడికి సమయం ఇచ్చింది. 1983లో జరిగిన ఈ సమావేశంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆ తరువాత 15 సంవత్సరాల పాటు పచ్చని చెట్లను నరికివేయడంపై ఇందిరాగాంధీ నిషేధం విధించింది. [3] ఉద్యమానికి మార్గదర్శకులలో ఒకరైన గౌర దేవితో ఆయనకు సన్నిహిత సంబంధం ఉంది.
అతను దశాబ్దాలుగా తెహ్రీ ఆనకట్ట వ్యతిరేక నిరసనలకు నాయకత్వం వహించాడు. ఈ ఉద్యమంలో అతను సత్యాగ్రహ పద్ధతులను ఉపయోగించాడు. తన నిరసనకు గుర్తుగా పదేపదే భాగీరథి నది ఒడ్డున నిరాహార దీక్షలు చేశాడు.[10] ఆనకట్ట పర్యావరణ ప్రభావాలపై సమీక్ష కమిటీని నియమిస్తామని అప్పటి ప్రధాని పివి నరసింహారావు ఇచ్చిన హామీ మేరకు 1995 లో అతను చేపట్టిన 45 రోజుల పాటు ఉపవాస కార్యక్రమాన్ని నిలిపివేశాడు. ఆ తరువాత అతను మరొక సుదీర్ఘ ఉపవాస దీక్ష చేపట్టాడు. ప్రధాన మంత్రి హెచ్.డి.దేవేగౌడ పదవీకాలంలో రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధి వద్ద 84 రోజులు ఉపవాస దీక్ష కొనసాగింది. ఈ ప్రాజెక్టు సమీక్షకు వ్యక్తిగత బాధ్యత అతనికి ఇచ్చారు. అయితే, సుప్రీంకోర్టులో ఒక దశాబ్దం పాటు కోర్టులో కేసు కొనసాగినప్పటికీ, తెహ్రీ ఆనకట్ట పనులు 2001 లో తిరిగి ప్రారంభమయ్యాయి. తరువాత 2001 ఏప్రిల్ 20న అతన్ని అరెస్టు చేశారు.
చివరికి, ఆనకట్ట జలాశయం 2004 లో నింపడం ప్రారంభమైంది. 2004 జూలై 31 న కోటి వద్ద కొత్త నివాసానికి తరలి వెళ్లాడు. తరువాత అతను డెహ్రాడూన్ రాజధాని ఉత్తరాఖండ్కు మారి ప్రస్తుతం తన భార్యతో కలిసి అక్కడ నివసిస్తున్నాడు.[3]
సుందర్లాల్ బహుగుణ హిమాలయ ప్రాంత ప్రజల రక్షణకు ఉద్యమించాడు. కొండ ప్రజల దుస్థితిపై (ముఖ్యంగా శ్రామిక మహిళల దుస్థితిపై) పోరాడాడు. భారతదేశ నదుల రక్షణ కోసం కూడా అతను చాలా కష్టపడ్డాడు.
సుందర్లాల్ బహుగుణకు కోవిడ్ వ్యాధి సంక్రమించడంతో 2021 మే 8 న ఆసుపత్రిలో చేర్చారు. 94 ఏళ్ళ వయసులో 2021 మే 21న అతను మరణించాడు.[16][17]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.