విలియం షేక్స్పియర్
From Wikipedia, the free encyclopedia
విలియం షేక్స్పియర్ (ఆంగ్లము : William Shakespeare) ( 1564 ఏప్రిల్ 26 న బాప్తిస్మం పొందినాడు - 23 ఏప్రిల్ 1616న మరణించాడు)[a], ఒక ఆంగ్ల కవి, నాటక రచయిత, నటుడు. ప్రస్తుతము చాలామంది ఇతన్ని గొప్ప ఆంగ్ల రచయితగానూ, ప్రపంచ నాటక రచయితలలో మిన్నైన వానిగానూ గుర్తిస్తున్నారు.[1] ఇతన్ని తరచూ ఇంగ్లాండు జాతీయ కవిగానూ, బార్డ్ ఆఫ్ అవాన్ (కవీశ్వరుడు) గానూ పిలుస్తారు. ఇతని రచనల్లో ప్రస్తుతం 37 నాటకాలు, 154 చతుర్పాద కవితలు (సొన్నెట్ - పద్యాలు), రెండు పెద్ద వ్యాఖ్యాన కవితలు (narrative poems), ఇంకా చాలా ఇతర కవితలు లభిస్తున్నాయి. ఇతని నాటకాలు ప్రపంచంలోని అన్ని ముఖ్య భాషల్లోకీ తర్జుమా చెయ్యబడినాయి, అంతే కాకుండా ఏ ఇతర నాటకాలూ ప్రదర్శించనన్నిసార్లు ప్రదర్శించబడినాయి.[2]
విలియం షేక్స్పియర్ | |
జననం: | ఏప్రియల్ 1564 (ఖచ్చితమైన తారీఖు తెలీదు ) స్ట్రాట్ఫోర్డ్-అపాన్-అవాన్, వార్విక్షైర్, ఇంగ్లాండు |
---|---|
మరణం: | 1616 ఏప్రిల్ 23 స్ట్రాట్ఫోర్డ్-అపాన్-అవాన్, వార్విక్షైర్, ఇంగ్లాండు |
వృత్తి: | నాటక రచయిత, కవి, నటుడు |
సంతకం: |
షేక్స్పియర్ స్ట్రాట్ఫోర్డ్-అపాన్-అవాన్ లో జన్మించాడు. ఇక్కడనే పెరిగి పెద్దవాడయినాడు. పద్దెనిమిది సంవత్సరాల వయసులో అన్నే హాథవేను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం, మొదటి కానుపులో సుసాన్నా హాల్ అనే అమ్మాయి, తరువాత కానుపులో హామ్నెట్, జూడిత్ క్వినే అను కవలలు జన్మించారు. రమారమి 1585 - 1592 ల మధ్య కాలంలో స్వంత ఊరినుండి లండన్ వెళ్ళి నటుడు, రచయిత,, చాంబర్లేన్ ప్రభువు మనుషులు) (తరువాతి కాలంలో ఇదే కంపెనీ రాజు గారి మనుషులు కింగ్స్ మెన్ అను నాటకాల కంపెనీలో భాగస్వామిగా విజయవంతమైన జీవితం కొనసాగించాడు. 1613లో తిరిగి స్వంత ఊరికి విశ్రాంత జీవితానికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆ తరువాత మూడు సంవత్సరాలకు అక్కడే మరణించాడు. షేక్స్పియర్ వ్యక్తిగత జీవితం గురించిన ఆధారాలు కేవలం కొన్ని మాత్రమే లభిస్తున్నాయి. మిగిలిన శూన్యాన్ని భర్తీ చెయ్యడానికి ఎన్నో కల్పనలు కల్పించబడినాయి.[3] ఈ కల్పనల్లో అతని శృంగార జీవితం, ధార్మిక జీవితం, అతని రచనలు నిజంగా అతనే వ్రాశాడా అన్నటువంటి అనుమానాలు ఉన్నాయి.[4]
ప్రస్తుతం లభిస్తున్న రచనల్లో చాలావరకూ 1590, 1613ల మధ్య వ్రాసినవి. తొలినాళ్ళలోని షేక్స్పియర్ నాటకాలు, హాస్యరస ప్రధానమైనవీ, చారిత్రక నేపథ్యం కలవి ఉన్నాయి. పదహారవ శతాబ్దంలోనికి ఇతని రచనల్లోని కళాత్మకత, నాణ్యత గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఆ తరువాత ఇతను 1608 వరకు ఎక్కువగా హామ్లెట్, లియర్ రాజు, మాక్ బెత్ వంటి విషాద నాటకాలు వ్రాసినాడు. ఈ నాటకాలు ఆంగ్ల భాషలోనే గొప్పవిగా కొనియాడబడుతున్నాయి. జీవితపు చివరి అంకంలో ఇతను షేక్స్పియర్ విషాదాస్య నాటకాలు రస ప్రధాన (tragicomedies) నాటకాలు వ్రాసినాడు. ఇంకా ఇతర నాటక రచయితలతో కలిసి కొన్ని రచనలు చేసాడు. ఇతని నాటకాలలో చాలావరకూ తన జీవిత కాలంలోనే ప్రచరించబడినాయి, కాకపోతే ఒక ముద్రణ నుండి మరొక ముద్రణకు మధ్య చాలా తేడాలు ఉన్నాయి. 1623 వ సంవత్సరంలో ఇతని నాటక కంపెనీలో సహచరులు ఇతని మొదటి పూర్ణ రచనా సంపుటిని ప్రచురించారు. ప్రస్తుతం షేక్స్పియర్విగా గుర్తించబడిన నాటకాల్లో రెండు తప్ప అన్నీ ఇందులో ఉన్నాయి.
షేక్స్పియర్ తన జీవిత కాలంలోనే మంచి కవిగా, నాటక రచయితగా పేరుపొందినాడు. కానీ అతని కీర్తి ప్రస్తుతము ఉన్న స్థితికి మాత్రం 19వశతాబ్దం నాటికి చేరుకున్నది. రొమాంటిక్ కవులు (Romantics), ప్రధానంగా షేక్స్పియర్లోని మేధాతత్వాన్ని గుర్తించి గౌరవించారు. ఆ తరువాత విక్టోరియన్ కాలంలోని కవులు షేక్స్పియర్ని మరింత ఎక్కువగా గౌరవించి పూజించారు. (జార్జ్ బెర్నార్డ్ షా) ఈ వ్యక్తి పూజను బార్డోలాట్రీ ("bardolatry").[5] అని పిల్చాడు. ఇహ 20వ శతాబ్దంలో ఇతని రచనలు విద్వత్తులోనూ, అభినయనంలోనూ వచ్చిన కొత్త విప్లవాలు దత్తతు తీసుకున్నాయి. ఇతని నాటకాలు 20వ శతాబ్దంలో, ప్రపంచంలోని విభిన్న సంస్కృతులు, విభిన్న రాజకీయ నేపథ్యంలలో తరచూ ప్రదర్శించబడుతూ, వివిధ రకాలయిన భాష్యాలు చెప్పబడుతూ వచ్చినాయి.