విటమిన్ సి
From Wikipedia, the free encyclopedia
విటమిన్ C (రసాయనిక నామం ఏస్కార్బిక్ ఆమ్లం) నిమ్మ, నారింజ జాతి ఫలాలు, ఉసిరి, ఆకుకూరలు, తాజా బంగాళాదుంప, టమాటో మొదలైన వాటిలో ఎక్కువగా లభించే విటమిన్.[1] ఇది సప్లిమెంట్ల రూపంలో కూడా లభ్యమవుతుంది. ఇది స్కర్వి వ్యాధిని నివారించడానికి, చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది.
విటమిన్ C మృదులాస్థి, ఎముక, డెంటీన్ ల మాత్రికను, రక్తనాళాల ఎండోథీలియమ్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రక్తంలో కొలెస్టరాల్ ను కరిగిస్తుంది. గాయాలు త్వరగా మానడానికి, ఇనుము శోషణాన్ని అధికం చేయడానికి కూడా ఇది తోడ్పడుతుంది. విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంపొందించి, జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. రక్తపోటును తగ్గిచటం, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచటంలో విటమిన్ సి పాత్ర ఎక్కువ కాబట్టి.. దీని మోతాదులు తగ్గటమనేది మెదడులో రక్తనాళాలు చిట్లటానికి దోహదం చేస్తుండొచ్చని వివరిస్తున్నారు. అయితే మాత్రలను వేసుకోవటం కన్నా ఆహారం ద్వారానే విటమిన్ సి లభించేలా చూసుకోవటం మేలని సూచిస్తున్నారు. నారింజ, బత్తాయి, బొప్పాయి, స్ట్రాబెర్రీ, జామ, క్యాప్సికం, మిరపకాయలు, గోబీపువ్వు, ఆకుకూరల వంటి పండ్లు, కూరగాయల్లో విటమిన్ సి దండిగా ఉంటుంది. దీని ప్రధాన లక్షణం చిగుళ్ల నుంచి రక్తస్రావం కావటం. అందువల్ల విటమిన్ సి లోపంతో మెదడులో రక్తస్రావమయ్యే అవకాశమూ ఉండొచ్చని క్లీవ్లాండ్ క్లినిక్కు చెందిన డాక్టర్ కెన్ యుచినో అభిప్రాయపడుతున్నారు. విటమిన్ సి లోపమనేది ఒకరకంగా అనారోగ్యకర జీవనశైలికి నిదర్శనమని, ఇది పక్షవాతం ముప్పును పెంచుతుందనీ గుర్తుచేస్తున్నారు. మద్యపానం, అధిక బరువు, అధిక రక్తపోటు వంటివన్నీ పక్షవాతం ముప్పును పెంచుతాయి. మన జీవనశైలిని మార్చుకోవటం ద్వారా వీటిని దూరంగా ఉంచుకోవచ్చు. అందువల్ల ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరమని ఈ అధ్యయనం మరోసారి నొక్కిచెప్పిందని నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి విటమిన్ సి మెదడు ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. ఆలోచనలు, భావనలు, ఆదేశాల వంటి వాటిని మన మెదడులోని వివిధ భాగాలకు చేరవేసే న్యూరోట్రాన్స్మిటర్ల తయారీకి.. ముఖ్యంగా సెరటోనిన్ ఉత్పత్తికి ఇది అత్యవసరం. కాబట్టి రోజూ ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవటం అన్నివిధాలా మేలు.