From Wikipedia, the free encyclopedia
విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (జూన్ 25, 1931 - నవంబరు 27, 2008), భారతీయ రాజకీయ నాయకుడు, భారతదేశ ఏడవ ప్రధానమంత్రిగా 1989 నుండి 1990 వరకు పనిచేసాడు. మండల్ కమిషన్ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడిన కులాలకు 27% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించిన ప్రధాని.[2]
విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ | |||
1989 లో వి.పి.సింగ్ | |||
పదవీ కాలం 2 డిసెంబరు 1989 – 10 నవంబరు 1990 | |||
రాష్ట్రపతి | ఆర్.వెంకట్రామన్ | ||
---|---|---|---|
డిప్యూటీ | చౌదరీ దేవీలాల్ | ||
ముందు | రాజీవ్ గాంధీ | ||
తరువాత | చంద్రశేఖర్ | ||
రక్షణ శాఖా మంత్రి | |||
పదవీ కాలం 2 డిసెంబరు 1989 – 10 నవంబరు 1990 | |||
ముందు | కృష్ణ చంద్ర పంత్ | ||
తరువాత | చంద్రశేఖర్ | ||
పదవీ కాలం 24 జనవరి 1987 – 12 ఏప్రిల్ 1987 | |||
ప్రధాన మంత్రి | రాజివ్ గాంధీ | ||
ముందు | రాజీవ్ గాంధీ | ||
తరువాత | కృష్ణ చంద్ర పంత్ | ||
ఆర్థిక శాఖామంత్రి | |||
పదవీ కాలం 31 డిసెంబరు 1984 – 23 జనవరి 1987 | |||
ప్రధాన మంత్రి | రాజీవ్ గాంధీ | ||
ముందు | ప్రణబ్ ముఖర్జీ | ||
తరువాత | రాజీవ్ గాంధీ | ||
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 9 జూన్ 1980 – 19 జూలై 1982 | |||
గవర్నరు | చందేశ్వర ప్రసాద్ నారాయణ సింగ్ | ||
ముందు | బనార్సీ దేవి | ||
తరువాత | శ్రీపతి మిశ్రా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | అలహాబాద్, యునైటెడ్ ప్రొవెన్సెస్,బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్) | 1931 జూన్ 25||
మరణం | 2008 నవంబరు 27 77) న్యూఢిల్లీ, భారతదేశం | (వయసు||
రాజకీయ పార్టీ | జన్ మోర్చా (1987–1988; 2006–2008) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (1987 కు ముందు) జనతాదళ్ (1988–2006) | ||
జీవిత భాగస్వామి | సీతాకుమారి (m. 1955) | ||
పూర్వ విద్యార్థి | అలహాబాదు విశ్వవిద్యాలయం పూణె విశ్వవిద్యాలయం | ||
మతం | హిందూ మతం | ||
సంతకం |
విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ 1931 జూన్ 25 న మండా ఎస్టేట్ ను పరిపాలించిన రాజపుత్ర జమీందారీ కుటుంబంలో జన్మించాడు.[3] అతను డెహ్రాడూన్ లోని కలనల్ బ్రౌన్ కేంబ్రిడ్జ్ స్కూలులో విద్యాభ్యాసం చేసాడు. అలహాబాద్, పూణె విశ్వవిద్యాలయాలలో చదివాడు. [4]
1969లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున సభ్యుడయ్యాడు. అతను 1971 లో లోక్సభకు ఎన్నికయ్యాడు. 1974లో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో వాణిజ్య శాఖ ఉపమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. 1976 నుండి 1977 వరకు వాణిజ్య శాఖామంత్రిగా తన సేవలనందించాడు. [4]
1980లో జనతా పార్టీ తరువాత ఇందిరా గాంధీ మరల ఎన్నుకోబడినప్పుడు, ఇందిరా గాంధీ అతనిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. [4] ముఖ్యమంత్రిగా (1980–82) అతను ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నైఋతి ప్రాంత జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా తీవ్రమైన సమస్య అయిన బందిపోటు దొంగతనాలను తగ్గించే కార్యక్రమాలు చేసాడు. సమస్యను అదుపుచేసే క్రమంలో వ్యక్తిగత వైఫల్యం పొందినందుకు గాను రాజీనామా చేసినపుడు, అతను జాతీయ స్థాయిలో మంచి పేరు పొందాడు. 1983 లో ఈ ప్రాంతంలో అత్యంత భయానకమైన బందిపోటు దొంగలు లొంగిపోవటాన్ని అతను వ్యక్తిగతంగా పర్యవేక్షించినపుడు కూడా జాతీయ ప్రచారాన్ని పొందాడు.
1983లో తిరిగి వాణిజ్య మంత్రిగా పదవిని పొందాడు. [4] 1989 ఎన్నికలలో రాజీవ్ గాంధీని పదవినుంచి తొలగించటానికి, అతనికి వ్యతిరేకంగా వామపక్షాలు, భారతీయ జనతా పార్టీతో కలసి ఒక కూటమి ఏర్పాటు చేయడానికి అతను బాధ్యత వహించాడు. 1989లో అతని పాత్ర భారత రాజకీయాల దిశను మార్చింది. అద్వానీ చేసిన రథయాత్రలో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ద్వారా సింగ్ ధైర్యంగా నిలిచాడు.
1984 సార్వత్రిక ఎన్నికల తరువాత భారతదేశ 10వ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా రాజీవ్ గాంధీచే ఎన్నుకోబడ్డాడు. రాజీవ్ మనస్సులో ఉన్న లైసెన్స్ రాజ్ (ప్రభుత్వ నియంత్రణ) తొలగింపును క్రమేణా అమలు చేసాడు. ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో అతను బంగారంపై పన్నులు తగ్గించడం ద్వారా, జప్తు చేసిన బంగారంలో కొంత భాగాన్ని పోలీసులకు ఇవ్వడం ద్వారా బంగారం అక్రమ రవాణాను నిరోధించాడు. అతను ఆర్థిక శాఖలో ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేట్ కు అసాధారణ అధికారాలనిచ్చాడు. ప్రభుత్వ నియంత్రణను తగ్గించడానికి, పన్ను మోసాలను విచారించడానికి సింగ్ చేసిన ప్రయత్నాలు విస్తృతమైన ప్రశంసలను అందుకున్నాయి.[4] అత్యున్నత స్థానంలో ఉన్న అనుమానిత పన్ను ఎగవేత దారులపై అనేక దాడులు చేయించాడు. వారిలో ధీరుభాయ్ అంబానీ, అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. రాజీవ్ గాంధీ అతనిని ఆర్థిక మంత్రి పదవి నుండి తొలగించాడు. బహుశా గతంలో కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సహాయాన్ని అందించిన పారిశ్రామిక వేత్తలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుపుతున్నందున అతనిని ఆ పదవి నుండి తొలగించి ఉండవచ్చు. [5] ఆర్థిక మంత్రిత్వ శాఖనుండి ప్రక్కకు తప్పించినప్పటికీ, సింగ్ కు దేశ ప్రజలలో ఉన్న జనాదరణ కారణంగా 1987 జనవరిలో రక్షణ మంత్రి బాధ్యతలను అప్పగించారు.[6] అతను సౌత్ బ్లాక్ చాటున దాగిన రక్షణ వ్యవస్థలోని సంచలనాత్మక చీకటి ప్రపంచంపై దర్యాప్తు చేయడం ప్రారంభించాడు. 1986 మార్చి 24న రాజీవ్ ప్రధానిగా ఉన్న సమయంలో బోఫోర్స్ ఒప్పందం కుదరింది. నాలుగు వందల 155ఎంఎం శతఘ్నులను స్వీడిష్ కంపెనీ ఏబీ బోఫోర్స్ కంపెనీ నుంచి 1437 కోట్ల రూపాయల ఖర్చుతో కొనడానికి ఒప్పందం కుదిరింది. భారతదేశం, స్వీడన్ ప్రభుత్వాల్లోని పెద్దల మధ్య జరిగిన అవకతవకలపై దృష్టి సారించాడు. ఈ అంశం రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని కుదిపేసింది. [7] దానిపై దర్యాప్తు చేయించడానికి ముందే అతనిని క్యాబినెట్ నుండి తొలగించారు. దాని ఫలితంగా అతను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసాడు. [8]
కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చిన తరువాత సింగ్ అరుణ్ నెహ్రూ, అరిఫ్ మొహమ్మద్ ఖాన్ లతో కలసి జనమోర్చా పేరుతో ప్రతిపక్ష పార్టీని ప్రారంభించాడు. [9] అతను అలహాబాద్ లోక్సభకు జరిగిన ఉపన్నికలలో సునీల్ శాస్త్రిని ఓడించి తిరిగి ఎన్నుకయ్యాడు.[10][11] 1988 అక్టోబరు 11 న జనతాపార్టీ సంకీర్ణం నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ జన్మదినం సందర్భంగా రాజీవ్ గాంధీని వ్యతిరేకించే పార్టీలైన జనమోర్చా, జనతాపార్టీ, లోక్దళ్, కాంగ్రెస్ (ఎస్) పార్టీలను కలిపి జనతాదళ్ పార్టీని స్థాపించాడు. జనతాదళ్ పార్టీకి అధ్యక్షుడైనాడు. ద్రవిడ మున్నేట్ర ఖగజం, తెలుగుదేశం పార్టీ, అసోం గణపరిషత్ వంటి ప్రాంతీయ పార్టీలతో కలసి జనతాదళ్ పార్టీ నేషనల్ ఫ్రంట్ పేరుతో సంకీర్ణ దళం ఏర్పడినది. దీనికి వి.పి.సింగ్ కన్వీనరుగా, ఎన్.టి.రామారావు అధ్యక్షునిగా, పర్వతనేని ఉపేంద్ర జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు.[12]
1989 సార్వత్రిక ఎన్నికలలో నేషనల్ ఫ్రంటు కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలైన భారతీయ జనతా పార్టీ, వామపక్ష పార్టీల (రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలను)తో కలసి సీట్ల సర్దుబాటు చేసుకొని పోటీ చేసింది. నేషనల్ ఫ్రంటు వారి మిత్ర పక్షాలతో కలసి కనీస మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అద్వానీల నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా వంటి వామపక్షాలు ప్రభుత్వం బయటి నుండి మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్పడింది.
పార్లెమెంటు సెంట్రల్ హాల్ లో 1989 డిసెంబరు 1 జరిగిన సమవేశంలో సింగ్ ప్రధానమంత్రి అభ్యర్థిగా దేవీలాల్ ను ప్రతిపాదించాడు. రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా స్వచ్ఛమైన ప్రత్యామ్నాయంగా సింగ్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండాలని కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలు భావించినప్పటికీ అతను దేవీలాల్ ను ప్రతిపాదించాడు. చౌధురి దేవీలాల్ హర్యానా లోని జాట్ వర్గానికి చెందిన నాయకుడు. అతను ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని త్రోసిపుచ్చాడు. కానీ ప్రభుత్వానికి "ఎల్డర్ అంకుల్" గా ఉండటానికి మొగ్గు చూపాడు. అపుడు వి.పి.సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు.[13][14] మాజీ జనతా పార్టీ మాజీ అధిపతి, జనతా దళ్ పార్టీలో సింగ్ ప్రత్యర్థి అయిన చంద్రశేఖర్ కు ఈ అంశం ఆశ్చర్యాన్ని కలిగించింది. దేవీలాల్ను ప్రధానమంత్రి చేసేందుకు ఏకాభిప్రాయం కుదిరిందని భావించిన చంద్రశేఖర్, ఈ పరిణామంతోసమావేశం నుండి వెళ్ళిపోయాడు. కేబినెట్ లో చేరేందుకు కూడా నిరాకరించాడు.
వి.పి.సింగ్ 1989 డిసెంబరు 2 న భారత దేశ 7వ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. [4]
వి.పి. సింగ్ 1989 డిసెంబరు 2 నుండి 1990 నవంబరు 10 వరకు ఒక సంవత్సరం లోపే ప్రధానమంత్రిగా పనిచేసాడు. మార్చి 1990 లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో సింగ్ సంకీర్ణ పభుత్వం పార్లెమెంటు లోని రెండు సభలలో నియంత్రణ సాధించింది. [4] ఈ కాలంలో జనతాదళ్ పార్టీ ఐదు రాష్ట్రాలలో అధికారం చేజిక్కించుకుంది. హర్యానా రాష్ట్రంలోని ఓం ప్రకాష్ చౌతాలా (బనార్సీ దాస్ గుప్తా, హుకం సింగ్) ప్రభుత్వం, గుజరాత్ లోని చిమన్ భాయ్ పటేల్ ప్రభుత్వం, ఒడిశాలోని బిజూ పట్నాయక్ ప్రభుత్వం, బీహార్ లోని లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ లోని ములాయం సింగ్ యదవ్ ప్రభుత్వాలను జనతాదళ్ పార్టీ ఏర్పరచింది. నేషనల్ ఫ్రంటు లోని మిత్రపక్షాలైన ఎన్.టి రామరావు, ప్రఫుల్ల కుమార్ మహంతా కూడా ప్రభుత్వాలను ఏర్పరచారు. జనతాదళ్ కేరళ రాష్ట్రంలోని ఇ.కె.నాయనార్ తో, రాజస్థాన్ లో భైరాన్ సింగ్ షెకావత్ తో కూడా అధికారాన్ని పంచుకుంది. శ్రీలంకలోని తమిళ వేర్పాటు వాద ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి అంతకు పూర్వం రాజీవ్ గాంధీ భారత సైన్యాన్ని పంపించి చేపట్టిన, విఫలమైన ఆపరేషన్కు ముగింపు పలకాలని నిర్ణయించాడు.[15]
వి.పి.సింగ్ ప్రధానమంత్రిగా భాద్యతలు చేపట్టిన కొద్ది రోజులకే మొదటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. సింగ్ కేబినెట్ లో హోంమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ( జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి) కుమార్తెను తీవ్రవాదులు అపహరించారు. ఆమెను విడుదల చేయడానికి బదులుగా కొంతమంది తీవ్రవాదులను విడిచిపెట్టడానికి విపి సింగ్ ప్రభుత్వం అంగీకరించింది. పాక్షికంగా ఆ వివాదం ముగిసినా విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే భారతీయ జనతా పార్టీ సూచన మేరకు జమ్మూ కాశ్మీర్ గవర్నరుగా మాజీ ఉద్యోగి జగ్మోహన్ను నియమించాడు. [16]
సింగ్ పంజాబ్ గవర్నరుగా ఉన్న సిద్దార్థ శంకర్ రే స్థానంలో వేరొక ఉద్యోగి నిర్మలా కుమార్ ముఖర్జీని నియమించాడు. ఆపరేషన్ బ్లూ స్టార్ క్షమాపణ అడగడానికి గోల్డెన్ టెంపుల్ ను సందర్శించాడు. ఈ కారణంగాను, ఇతర సంఘటన వలనా కొద్ది నెలల్లోనే పంజాబులో అల్లర్లు గణనీయంగా తగ్గాయి.[17]
భారత సరిహద్దులో యుద్ధాన్ని ప్రారంభించేందుకు బెనజీర్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను ఆయన అడ్డుకున్నాడు.[18][19][20]
మండల్ కమిషన్ భారతదేశంలోని సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పరిస్థితులని అధ్యయనం చేసే కమీషన్. దీనిని 1979 జనవరి 1 న అప్పటి జనతాపార్టీ కి చెందిన భారత ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ చే ప్రారంభించబడినది. ఆ కాలంలో ఏర్పాటు చేసిన కమిషన్ ఛైర్మన్ గా బి.పి.మండల్ వ్యవహరించాడు. అతను రూపొందించిన మండల్ కమిషన్ నివేదిక భారత దేశంలో వెనుక బడిన తరగతులు, యితర వెనుక బడిన తరగతులు గా సూచించబడిన కులాలకు సామాన్య జన స్రవంతిలో అనుసంధానం చేసే మార్గాలను అధ్యయనం చేసి క్రమ బద్ధము, న్యాయ బద్ధమూ అయిన విధాన నిర్మాణాన్ని ప్రభుత్వానికి సమర్పించింది. కానీ ఆ సమయానికి మురార్జీ దేశాయి ప్రధాని పదవినుండి వైదొలగ వలసి వచ్చింది. తరువాత కాంగ్రెస్ పాలనలో సుమారు 10 సంవత్సరాలు మండల్ కమీషన్ నివేదిక బుట్ట దాఖలు అయిపోయింది. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం పతనమై వి.పి. సింగ్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మండల్ కమీషన్ నివేదికకు తన ప్రభుత్వ ఆమోద ముద్ర వేసాడు.[21] ఈ నిర్ణయం ఉత్తర భారతదేశంలోని పట్టణ ప్రాంతాలలోని ఉన్నత కులాలకు చెందిన యువత నుండి విస్తృతమైన నిరసనలకు దారితీసింది. దాని ఫలితంగా దేశంలో రేగిన కల్లోలం మూలంగా, స్వయాన వి.పి. సింగ్ తన రాజకీయ జీవతాన్నే మూల్యంగా చెల్లించవలసి వచ్చింది.
ఓబిసి రిజర్వేషన్లను (క్రిమీలేయర్ కంటే దిగువన) 2008 లో సుప్రీం కోర్టు సమర్థించింది.[22][23]
1990 లో, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ వంటి ప్రభుత్వ-యాజమాన్య ఆర్ధిక సంస్థలు లార్సెన్ & టుబ్రోపై రిలయన్స్ గ్రూపు నిర్వాహక నియంత్రణను పొందటానికి ప్రయత్నించాయి. ఓటమిని గ్రహించిన అంబానీలు సంస్థ బోర్డు నుండి రాజీనామా చేశారు. 1989 లో ధీరూబాయి అంబానీ లార్సెన్ & టుబ్రో కు చైర్మన్ గా వ్యవహరించాడు. అతను పదవిని విడిచిపెట్టి భారతీయ స్టేట్ బ్యాంకు మాజీ చైర్మన్ డి.ఎన్.హోష్ ఆ పదవిలో చేరడానికి మార్గం సుగమం చేసాడు.
ఇంతలో, భారతీయ జనతా పార్టీ తన అజెండా ముందుకు తెచ్చింది. వాస్తవానికి బాబ్రీ మసీదు ఉన్న స్థానం శ్రీరామజన్మస్థానం అంటూ 1982లోనే విశ్వహిందూ పరిషత్ రామజన్మభూమి ఉద్యమాన్ని చేపట్టింది. 1989లో జరిగిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో దీనిపై ఒక తీర్మానం చేసి ఆమోదించారు. 1989లో ఈ ఉద్యమం మరింత ఊపందుకుంది. 1990లో ఉత్తరాది రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అద్యక్షుడు లాల్ కృష్ణ అద్వానీ ప్రమోద్ మహాజన్ తో కలసి రథయాత్ర చేయాలని నిర్ణయించాడు.[24] 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి అక్టోబర్ 30న అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్న రథయాత్ర అయోధ్యకు చేరక ముందే సమస్తిపూర్ వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు అధ్వానీ అరెస్టుకు సింగ్ ఆదేశించాడు. అధ్వానీ రథయాత్ర ఆగిపోయింది. కరసేవను అధ్వానీ వాయిదా వేసుకున్నాడు. [25][26][27] దీని ఫలితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో [28] లోక్సభలో సింగ్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నాడు. అతను ఉన్నతమైన నైతిక విలువలతో దేశ లౌకికవాదంకోసం నిలబడ్డాననీ, తన బలంతో బాబ్రీ మసీదును కాపాడగలిగానని, ఇది ప్రాథమిక సూత్రాలను సమర్థిస్తుందని తెలిపాడు. అతను 142–346 ఓట్లతో అవిశ్వాసంలో ఓడిపోయే ముందు "మీరు ఎటువండి భారతదేశాన్ని కోరుకుటున్నారు?" అని విపక్షాలను పార్లమెంటులో ప్రశ్నించాడు.;[29][30][31] నేషనల్ ఫ్రంటులోని కొన్ని పార్టీలు, వామపక్షాలు మాత్రమే అతనిని సమర్థించాయి. సింగ్ 1990 నవంబరు 7 న తన పదవికి రాజీనామా చేసాడు.[4]
ఈ పరిస్థితిని చంద్రశేఖర్ తనకనుకూలంగా మలచుకొని తన మద్దతుదారులైన దేవీలాల్, జ్ఞానేశ్వర్ మిశ్రా, హెచ్.డి.దేవెగౌడ, మేనకా గాంధీ, అశోక్ కుమార్ సేన్, సుబోధ్ కాంత్ సహాయ్, ఓం ప్రకాష్ చౌతాలా, హుకుమ్సింగ్, నిమన్భాయ్ పటేల్, ములాయం సింగ్ యాదవ్, యశ్వంత్ సిన్హా, వి.సి.శుక్లా, సంజయ్ సింగ్ లతో పాటుగా జనతాదళ్ పార్టీని విడిచి వెలుపలికి వచ్చాడు. వారితో కలసి సమాజ్వాదీ జనతా పార్టీ/జనతాదళ్ (సోషలిస్టు) పార్టీని ఏర్పరచాడు. [32] చంద్రశేఖర్ కు సుమారు 64 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నందున ప్రతిపక్ష నాయకుడు రాజీవ్ గాంధీతో మద్దతు తీసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతను లోక్సభ విశ్వాస పరీక్షలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నెగ్గి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించాడు.[33] స్పీకర్ రబీరే ఎనిమిది మంది జనతాదళ్ పార్లమెంటు సభ్యులు విశ్వాస పరీక్షలో ఓటు వేసేందుకు అనర్హులుగా ప్రకటించాడు. రాజీవ్ గాంధీ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో కొన్ని నెలల్లోనే చంద్రశేఖర్ పదవిని కోల్పోయాడు. అతను చివరి నిమిషం వరకూ మద్దతు పొందడానికి ప్రయత్నించాడు కానీ విఫలమయ్యాడు. ఏ పక్షానికీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగిన సంఖ్యాబలం లేనందున మరలా ఎన్నికలు జరిగాయి.
విపి సింగ్ కొత్త ఎన్నికలలో పోటీ చేశాడు కానీ అతని పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజీవ్ గాంధీ (మే 1991) హత్య కారణంగా, పార్లమెంటులో ప్రతిపక్షంగా కూడా ఉండలేకపోయింది. తరువాత క్రియాశీల రాజకీయాల నుండి వి.పి.సింగ్ తప్పుకున్నాడు.[34][35]
తరువాత కొన్ని సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి సామాజిక న్యాయం, కళాత్మక కార్యకలాపాలు(ముఖ్యంగా చిత్రలేఖనం) వంటి అంశాలపై వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నాడు.
1992లో మొదటి సారిగా ఉపరాష్ట్రపతిగా ఉన్న కె.ఆర్. నారాయణన్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించాడు. అదే సంవత్సరం డిసెంబరులో తన అనుచరులతో కలసి ఎల్.కె.అద్వానీ ప్రతిపాదించిన కరసేవకు వ్యతిరేకంగా అయోద్యకు వెళ్లాడు. అయోధ్యకు చేరక ముందే అతనిని అరెస్టు చేసారు. కొన్ని రోజుల తరువాత మస్జిద్ ను కరసేవకులు విధ్వంసం చేసారు.
1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. గెలిచిన యునైటెడ్ ఫ్రంటు సంకీర్ణంలో ప్రధానమంత్రి పదవికి సహజమైన అభ్యర్థిగా నిలిచాడు. కానీ కమ్యూనిస్టు నాయకుడు జ్యోతిబసు, బీహార్ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్, జనతా పార్టీలోని ఇతర నాయకుల అభ్యర్థనను అతడు తోసిపుచ్చాడు.[4]
1998లో అతనికి కేన్సర్ అని నిర్థారణ అయిన తరువాత బహిరంగ ప్రదర్శనలను ఆపివేసాడు. 2003 లో అతనికి క్యాన్సర్ నుండి ఉపశమనం కలిగినప్పుడు, అతను జనతాదళ్ నుండి వారసత్వంగా వచ్చిన అనేక సమూహాలలో కనిపించాడు. అతను 2006లో జన్మోర్చా పార్టీని స్థాపించాడు. దానికి సినిమాల నుండి వచ్చిన రాజకీయనాయకుడు రాజ్ బబ్బర్ను అధ్యక్షునిగా చేసాడు.[36] 2007 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో జనమోర్చాకు ఎటువంటి సీట్లు లభించలేదు. రాజ్ బబ్బర్ కాంగ్రెస్ లో చేరాడు. వి.పి.సింగ్ పెద్ద కుమారుడు అజేయ సింగ్ (అజేయ ప్రతాప్ సింగ్) 2009 జనరల్ ఎన్నికలను ఎదురుచూస్తూ పార్టీ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. [37] అజేయ సింగ్ జనమోర్చా అభ్యర్థిగా ఫతేపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి రాకేష్ సచన్ చేతిలో ఓడిపోయాడు. జనమోర్చా పేరును "నేషనల్ జన మోర్చా" గా 2009 జూన్ లో మార్చారు.[38] ఒక నెల తరువాత జన మోర్చా భారత జాతీయ కాంగ్రెస్ లో విలీనం అయినది. [39]
అనిల్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా దాద్రి వద్ద భూమిని స్వాధీనం చేసుకుని, రైతులకు తగిన పరిహారాన్ని డిమాండ్ చేస్తూ జరిగిన రైతుల ఉద్యమంలో పాల్గొనేందుకు తన అనుచరులతో వెళ్లాడు. అక్కడ సెక్షన్ 144 అమలులోఉన్నందున అతనిని ఘజియా బాద్ వద్ద అరెస్టు చేసారు.[40] దాద్రి రైతుల ఉద్యమాన్ని కొసాగించినందుకు ఉత్తర ప్రదేశ్ సరిహద్దులో వి.పి.సింగ్ , సి.పి.ఐ జనరల్ సెక్రటరీ ఎ.బి.బర్థన్ [41] లను మరలా అరెస్టు చేసారు. అయినప్పటికీ సింగ్, బబ్బర్లు తరువాత పోలీసుల నుండి తప్పించుకొని, 2006 ఆగస్టు 18 న దాత్రి చేరి, రిలయన్స్ స్వాధీనం చేసుకున్న భూమిలో రైతులతో పాటు దున్నారు.[42][43]
సింగ్ రాజస్థాన్ లోని డియోగర్-మడారియా రాజు కుమార్తె అయిన సితా కుమారిని 1955 జూన్ 25 న వివాహం చేసుకున్నాడు. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళి. ఈ వివాహం జరిగినపుడు అతనికి 24 సంవత్సరాలు, ఆమెకు 18 సంవత్సరాలు. కుమారి ఉదయపూర్ రాణాప్రతాప్ వంశమైన సిసోడియా రాజపుత్రి. వారికి ఇద్దరు కుమారులు. మొదటి కూమరుడు అజేయ సింగ్ (జ.1957) న్యూయార్క్ లో ఛార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేసాడు. రెండవ కుమారుడు అభి సింగ్ ( జ. 1958) న్యూఢిల్లీ లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో వైద్యుడు.[44]
వి.పి.సింగ్ ఎముకల మజ్జ క్యాన్సర్, మూత్రపిండాల వైఫల్యంతో బాధపడి 2008 నవంబరు 27 న న్యూఢిల్లీ లోని అపోలో ఆసుపత్రిలో మరణించాడు.[45][46] 2008 నవంబరు 29 న అలహాబాదు లోని గంగా నదీ తీరంలో దహనం చేసారు. అతని కుమారుడు అజేయ సింగ్ అంత్యక్రియలను నిర్వహించాడు. [47]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.