లడ్డులు భారతదేశమంతా విరివిగా లభించే మిఠాయి. శనగ పిండిని చిన్నగా బూందీగా చేసి దానికి బెల్లపు పాకము గాని లేదా చక్కెర పాకము గాని చేర్చి గుండ్రటి ఆకారములో చేయబడు వాటిని లడ్డుగా పిలుస్తారు.[1][2] బూందీని లడ్డూగా మార్చే ముందు వాటికి ఇంకా రుచి వచ్చేందుకు యాలక్కాయలు, కిస్మిస్[ఎండుద్రాక్షలు], జీడిపప్పు లాంటివి చేరుస్తారు.
శనగ పిండి ఒక కళాయి గిన్నెలో గరిటె జారుగా నీళ్ళు పోసి ఉండలు లేకుండా బాగా కలిసేటట్టుగా కలపాలి.
చక్కెరలో ఒక లీటరు నీళ్ళుపోసి ఆ గిన్నెను పొయ్యిమీద పెట్టి గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఈ పాకాన్ని వేళ్ళతో పట్టుకొని చేస్తే కొంచెం తీగరావాలి. దీనిని లేతపాకం అంటారు.
ఒక స్పూనులో పాలుపోసి, చిటికెడు మిఠాయిరంగు కలిపి, ఆ పాలు పాకంలో పోసి ఒక్కసారి తిప్పితే పాకానికి మిఠాయిరంగు వస్తుంది. తరువాత పాకం గిన్నెను దించి పక్కగా ఉంచుకోవాలి.
నెయ్యి బూరెలమూకుడులో పోసి మరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్ పండ్లు వేసి, వేయించి తీసి ఒక పక్కగా పెట్టుకోవాలి.
శనగ పిండి ముద్దని ఒక కప్పుతోగాని, గరిటెతో గాని తీసుకొని సన్నని రంధ్రాలు గలిగి లోతుగా ఉన్న చట్రంలో పొయ్యాలి. దానినుండి చిన్న చిన్న బిందువులుగా పెనంలో పడతాయి. అలా పెనం నిండా పడిన తరువాత చట్రం ముద్దలో ఉంచాలి.
బూందీ ఎరుపురంగుగా వేగకమునుపే, అనగా పసుపు పచ్చరంగులో ఉన్నప్పుడే మెరకగా ఉన్న రెండో చట్రంతో దేవి, పక్కనున్న పాకం గిన్నెలో వేయాలి; గరిటెతో కిందనుండి పైకి, పైనుండి కిందకి కలియబెట్టాలి.
శనగపిండి ముద్ద ఎక్కువగా ఉంటే ఇదే పద్ధతిని మళ్ళీ మళ్ళీ చెయ్యాలి.