లక్షద్వీప్
భారతదేశ కేంద్రపాలిత ప్రాంతం. / From Wikipedia, the free encyclopedia
లక్షద్వీప్ (ലക്ഷദ്വീപ്), భారతదేశంలో అతిస్వల్ప జనసంఖ్య కలిగిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం.[1] ఈ దీవుల భూ విస్తీర్ణం మొత్తం 32 చదరపు కి.మీ, అరేబియా సముద్రములో, కేరళ తీరంనుండి 200 నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.ఈ దీవులలో పది దీవులు మాత్రమే జనావాసం ఉన్న దీవులు. మిగిలిన 17 నిర్జీవ దీవులు. ఇవేకాక ఇంకా లెక్కలోకి తీసుకోని ఎన్నో చిన్న దీపఖండాలున్నాయి.లక్షద్వీప్ రాజధాని నగరం కవరట్టి నగరం.లక్షద్వీప్లో లక్షద్వీప్ జిల్లా అనే పేరుతో ఒకే ఒక జిల్లా ఉంది.
కవరట్టి, ఆగట్టి, మినీకాయ్, అమిని ప్రధానమైన దీవులు. 2001 నాటి జనాభా లెక్కల ప్రకారం ఈ కేంద్రపాలిత ప్రాంతం మొత్తం జనాభా 60,595. ఆగట్టిలో ఒక విమానాశ్రయం ఉంది. ఇక్కడికి కొచ్చిన్ నుండి నేరుగా విమాన సౌకర్యం ఉంది.[2]1973 వరకు, ఈ దీవుల సమూహం ఆంగ్లీకరించిన లక్కదీవ్స్ అనే పేరుతో పిలవబడేది. (సంస్కృతములో మాలద్వీపం అని పేరున్న మాల్దీవులుతో పోల్చండి). ఈ దీవుల ప్రజలు మళయాళ మాండలికమును మాట్లాడతారు. దాదాపు మొత్తం జనాభా ముస్లిం మతస్తులు. తమ పూర్వీకులు ఒక పెద్ద తుఫాను వలన సముద్రములో ఈ దీవులకు కొట్టుకువచ్చిన కొందరు వర్తకులని ఇక్కడి వాసుల నమ్మకం.