మొదటి రాజేంద్ర చోళుడు
From Wikipedia, the free encyclopedia
రాజేంద్ర చోళుడు లేదా మొదటి రాజేంద్ర చోళుడు (1014−1044) ప్రాచీన భారతదేశాన్ని పరిపాలించిన 11వ శతాబ్దానికి చెందిన చోళ చక్రవర్తి (ప్రస్తుత తమిళనాడు, ఆంధ్రప్రదేశు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఒరిస్సా, పశ్చిమ బెంగాలు) . ఈయనకు గంగైకొండ, కడారంకొండ, పండిత చోళ అనే బిరుదులు కూడా ఉన్నాయి. భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప పాలకులలో ఒకడిగా ఆయనను చరిత్రకారులు పరిగణిస్తారు. ఆయన తన తండ్రి రాజరాజ చోళుడి తర్వాత సా. శ 1014 లో సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతని పరిపాలనలో చోళ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో గంగానది తీరం వరకు, హిందూ మహాసముద్రం దాటి పశ్చిమానికి, ఆగ్నేయ ఆసియా వైపుకి విస్తరించింది. అందుకనే ఇది ప్రాచీన భారతీయ రాజ్యాలలో బలమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతోంది.[7][8] ఈయన జైత్రయాత్రలో భాగంగా శ్రీలంక, మాల్దీవులు జయించాడు. అంతేకాక మలేషియాలోని శ్రీవిజయ, ఆగ్నేయ ఆసియాలోని దక్షిణ థాయి ల్యాండు, ఇండోనేషియా మీద కూడా దాడులు చేశాడు.[7][9] థాయి ల్యాండు, కాంబోడియా రాజ్యానికి చెందిన ఖ్మేరు ప్రాంతాల నుంచి కప్పం వసూలు చేశాడు. ప్రస్తుతం బెంగాలు, బీహారు రాష్ట్రాలలో విస్తరించిన గౌడ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న పాలవంశ రాజు మహిపాలుడిని ఓడించాడు. తన విజయాలకు గుర్తుగా గంగైకొండ చోళుడు (గంగానది ప్రాంతాన్ని జయించిన వాడు) అనే బిరుదు పొందాడు.[10] గంగైకొండ చోళపురం అనే కొత్త రాజధాని కూడా నిర్మించాడు.[11][12] ఈయన తన కుమార్తె అమ్మాంగ దేవిని తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుడికిచ్చి వివాహం చేశాడు. అమ్మాంగ దేవి కుమారుడే కులుత్తోంగ చోళుడు(చాలుక్యుడు). తిరువాలంగాడు, తిరుమలై శాసనాలు ఇతని విజయాలను గూర్చి వర్ణిస్తాయి. ఈయన తర్వాత ఇతని కుమారుడు రాజాధిరాజు విజయ రాజేంద్ర అనే పేరుతో రాజ్యాన్ని పరిపాలించాడు.
మొదటి రాజేంద్ర చోళుడు | |
---|---|
పరకేసరి, యుద్ధమల్లుడు, ముమ్ముడి, గంగై కొండన్, కదరం కొండన్[3] | |
పరిపాలన | సుమారు 1014 – 1044 CE[6] |
పూర్వాధికారి | మొదటి రాజరాజ చోళుడు |
ఉత్తరాధికారి | మొదటి రాజాధిరాజ చోళుడు |
మరణం | 1044 CE |
రాణి/రాణులు | త్రిభువన మహాదేవియార్ పంచవన్ మాదేవియార్ విరమాదేవి |
వంశము | మొదటి రాజాధిరాజ చోళుడు, రెండవ రాజేంద్రచోళుడు, వీరరాజేంద్ర చోళుడు, అరుల్మొళునంగయార్, అమ్మంగదేవి |
రాజవంశం | చోళ సామ్రాజ్యం |
తండ్రి | రాజరాజ చోళుడు |
తల్లి | తిరిపువన మడివియార్ |
మతం | శైవమతం |